రఘురామ్ రాజన్: ఆర్థికవ్యవస్థ గాడిన పడాలంటే లాక్‌డౌన్‌ త్వరగా ముగించాలి

రాహుల్ గాంధీ, రఘురామ్ రాజన్

ఫొటో సోర్స్, Twitter/congress

దేశ ఆర్ధిక భవిష్యత్తు కోసం వీలయినంత త్వరగా లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలని రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌, ఆర్ధిక నిపుణుడు రఘురామ్‌ రాజన్‌ అన్నారు.

భారత ఆర్థికవ్యవస్థపై లాక్‌డౌన్ ప్రభావాలు , కోవిడ్‌ -19 విసిరిన సవాళ్లపై రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌, ఆర్ధిక నిపుణుడు రఘురామ్‌ రాజన్‌తో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లైవ్ చాట్‌లో సంభాషించారు.

దాదాపు 30 నిమిషాల పాటు సాగిన వీరి సంభాషణ వీడియోను రాహుల్ గాంధీ తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు.

రాహుల్ ప్రశ్నలకు బదులిస్తూ... దేశ ఆర్ధిక భవిష్యత్తు కోసం వీలైనంత త్వరగా లాక్‌డౌన్‌ను ఎత్తేయాల్సిన అవసరం ఉందని రఘురామ్ రాజన్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.

లాక్‌డౌన్‌ తర్వాత పని చేసే ప్రాంతాలలో ఉద్యోగుల రక్షణ కోసం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.

రఘురామ్ రాజన్

ఫొటో సోర్స్, Getty Images

దేశం రెండో, మూడో లాక్‌డౌన్‌ ఎదుర్కొనే పరిస్థితిలో లేదని, మరోసారి ఆ పరిస్థితి వస్తే మనం సరైన జాగ్రత్తలు తీసుకోకుండానే లాక్‌డౌన్‌ ఎత్తేసినట్లవుతుందని అన్నారు.

పేదలు, కార్మికులకు సాయపడే విధానాల గురించి మాట్లాడుతూ... రూ.65 వేల కోట్లతో పేదలకు తోడ్పాటును అందించవచ్చని రఘురామ్ చెప్పారు.

ప్రజల్లో భరోసా నింపేందుకు లాక్‌డౌన్‌ను ఎత్తివేయడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

మే 3తో రెండో లాక్‌డౌన్ గడువు తీరిపోనుంది. అంతటితో లాక్‌డౌన్ ఎత్తివేస్తే ఎదురయ్యే సవాళ్ల గురించి రాజన్‌ను రాహుల్ గాంధీ ప్రశ్నించారు.

ఆర్థిక వ్యవస్థలో ఏయే విభాగాలు తెరుచుకోవడం ముఖ్యమని, వాటిని ఏ పద్ధతిలో తెరిస్తే బాగుంటుందని అడిగారు.

ఇప్పుడు చేస్తున్న ప్రయత్నాలన్నీ ఆరోగ్య వ్యవస్థపై భారం తగ్గించాడనికేనని రఘురామ్ రాజన్ అన్నారు. ఇదే సమయంలో ప్రజల ఉపాధిపైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

''కార్యాలయాలను సురక్షితంగా మార్చాలి. అన్ని చోట్లా సామాజిక దూరం అమలయ్యేలా చూడాలి. రవాణా వ్యవస్థల్లోనూ సామాజిక దూరం పాటించాలి. ప్రజా వాహనాల్లో ఇది అమలయ్యేలా చూడాలంటే చాలా చర్యలు తీసుకోవాలి'' అని అన్నారు.

‘పది కోట్ల మంది ఉపాధి కోల్పోతారు’

మిగతా దేశాల్లాగా భారత్‌లో మంచి వ్యవస్థ లేదని, అందుకే వీలైనంత త్వరగా ఆర్థిక వ్యవస్థను తెరవాలని రాజన్ అభిప్రాయపడ్డారు. నిరుద్యోగం గురించి కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో పది కోట్ల మంది ఉపాధి కోల్పోతారని సీఎంఐఈ లెక్కగట్టిందని అన్నారు.''అంకెల్లో తేడాలుండొచ్చు. కానీ, ఈ విషయమై చర్యలైతే తీసుకోవాలి'' అని వ్యాఖ్యానించారు.అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఏదో లోపం ఉందని తాను భావిస్తున్నట్లు రాజన్ చెప్పారు.''ప్రజలకు ఉద్యోగాలు లేవు. ఉన్నవాళ్లకు భవిష్యతు గురించి చింత. ఆదాయ పంపిణీలో తీవ్ర అసమానతలు ఉంటున్నాయి. అందరికీ అవకాశాలను సమంగా పంచాల్సిన అవసరం ఉంది'' అని అన్నారు.

కార్మికులు, వ్యవసాయం గురించి రాహుల్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ... ప్రజలకు నేరుగా ప్రయోజనాలను బదిలీ చేయడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని రాజన్ అన్నారు.''పేదలను ఆదుకోవడానికి రూ.65 వేల కోట్లు అవసరం. భారత జీడీపీ విలువ 200 లక్షల కోట్లు. దీనితో పోలిస్తే అది చాలా చిన్న మొత్తం. పేదల జీవితాలను కాపాడేందుకు ఆ పని చేయొచ్చు'' అని రాజన్ చెప్పారు.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

అమెరికా, యూరప్ దేశాలతో పోల్చితే పరీక్షల నిర్వహణ సామర్థ్యంలో భారత్ ఎదుర్కొంటున్న పరిమితుల గురించి రాజన్‌ను రాహుల్ గాంధీ ప్రశ్నించారు.

దీనికి లాక్‌డౌన్ ఎత్తివేయడంలో పరీక్షల సామర్థ్యం కూడా కీలకమని రాజన్ జవాబిచ్చారు.

అమెరికా రోజూ 1.5 లక్షల పరీక్షలు చేస్తోందని, లాక్‌డౌన్ ఎత్తేస్తే అంతకు మూడింతలు పరీక్షలు చేయాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారని చెప్పారు.

''భారత్ విషయంలో ఈ సంఖ్య చాలా పెద్దది అవుతుంది. అన్ని పరీక్షలు చేయడం చాలా కష్టం. అందుకే, లాక్‌డౌన్ ఎత్తివేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి'' అని అన్నారు.

మొత్తం దేశమంతటికీ ఒకే తరహా వ్యవస్థ పని చేయదని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.''అమెరికా సమాజానికి భారతీయ సమాజానికి చాలా తేడాలున్నాయి. భారత్‌లో ఒక్కో రాష్ట్రం ఒక్కోలా ఉంటుంది. తమిళనాడును, ఉత్తర్‌ప్రదేశ్‌ను ఒకేలా చూడలేం. దీనికి తోడు చాలా కాలంగా కేంద్రం నుంచి నియంత్రించే ప్రయత్నాలను చూస్తున్నాం. కింది స్థాయి నుంచి అధికారం కేంద్రం వద్దే పోగై ఉంది. ప్రజల జీవితాలను మెరుగుపరిచే విధానాలు మన వద్ద ఉన్నాయి. ఆహారం, ఆరోగ్యం, విద్య విషయంలో చాలా రాష్ట్రాలు బాగా పనిచేశాయి. అయితే, మనం ఉద్యోగాలు ఇస్తే చాలదు. మంచి ఉద్యోగాలు ఇవ్వాలి. అందుకోసం అవకాశాలను సృష్టించాల్సిన అవసరం ఉంది'' అని అన్నారు.మౌలిక వసతులు జనాలను కలుపుతాయని, కానీ ప్రజల మధ్య విద్వేషం ఉన్నప్పుడు అదెలా జరుగుతుందని రాహుల్ గాంధీ అన్నారు. దీని వల్ల పెద్ద సమస్య ఏర్పడొచ్చని అభిప్రాయపడ్డారు.దీనికి స్పందిస్తూ... సామాజిక సామరస్యం నెలకొనాలంటే ప్రజలందరూ సమానమే అన్న భావన కలిగించడం అవసరమని రాజన్ అన్నారు. సంక్షోభ సమయంలో దేశాన్ని విడదీయడం సరికాదని చెప్పారు.

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, FACEBOOK/RAHUL GANDHI

భారత్ ప్రపంచ రాజకీయాల్లో లాభపడుతుందా?

''కోవిడ్-19 సంక్షోభం కారణంగా రాబోయే రోజుల్లో భారత్‌కు ఏదైనా ప్రయోజనం ఉంటుందా? ప్రపంచంలో వస్తున్న రాజకీయ మార్పుల వల్ల భారత్‌కు లాభం జరుగుతుందా?'' అని రాహుల్ ప్రశ్న వేశారు.

కోవిడ్-19 లాంటి వాటి వల్ల ఏ దేశానికీ పెద్దగా సానుకూలమైన విషయాలు ఉండవని రఘురామ్ బదులిచ్చారు. కానీ, కొన్ని విధానాలు పాటిస్తే, భారత్ ప్రయోజనం పొందవచ్చని అభిప్రాయపడ్డారు.

''అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థలో ఇప్పుడు ప్రతి అంశంపైనా పునరాలోచన జరుగుతుంది. దీని రూపకల్పనకు నేతృత్వం వహించే అవకాశం భారత్‌కు ఉంటుంది. ఈ క్రమంలో భారత్ తన పరిశ్రమలు, సప్లయ్ చైన్‌కు కొన్ని అవకాశాలను రాబట్టుకోవచ్చు'' అని రాజన్ అన్నారు.

BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)