శుభ్‌మన్ గిల్: మ్యాచ్ మ్యాచ్‌కు దూకుడు పెంచుతున్న యువ క్రికెటర్

టీమిండియా

ఫొటో సోర్స్, ANI

    • రచయిత, విధాన్షు కుమార్
    • హోదా, స్పోర్ట్స్ రిపోర్టర్, బీబీసీ హిందీ

ఇండోర్‌లో జరిగిన చివరి వన్డే మ్యాచ్‌లో 90 పరుగుల తేడాతో భారత్ న్యూజీలాండ్‌పై అద్భుతమైన విజయాన్ని సాధించింది.

సిరీస్‌ను 3-0తో చేజిక్కించుకుంది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్థానాన్ని భారత్ దక్కించుకుంది.

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత్ 114 పాయింట్లతో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఇంగ్లాండ్ 113 పాయింట్లతో రెండో స్థానంలో, ఆస్ట్రేలియా 112 పాయింట్లతో మూడో స్థానంలో, న్యూజీలాండ్ 111 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాయి.

ఈ విజయం భారత్ క్రికెట్ జట్టుకు ఎంతో ప్రత్యేకమైనదిగా నిలిచింది. చివరిదైన మూడో వన్డేలో న్యూజీలాండ్‌ను మట్టికరిపించి, సిరీస్‌ను 3-0తో చేజిక్కించుకోవడం అంత తేలికైన విషయం కాదు. కానీ, అన్ని వన్డే మ్యాచులలో భారీ స్కోరుతో భారత్ విజయాన్ని కైవసం చేసుకుంది.

2019 ప్రపంచ కప్‌లో భారత్‌ను ఓడించిన ఇదే న్యూజీలాండ్ టీమ్, ఫైనల్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఓటమి పాలైంది.

భారత్‌కు ముందు పాకిస్తాన్‌లో ఆడిన న్యూజిలాండ్ టీమ్ 3 మ్యాచ్‌లలో 2-1తో బాబర్ ఆజమ్ జట్టును ఓడించింది.

పాకిస్తాన్‌తో విజయాన్ని పొందామన్న ఆనందంలో, భారత్‌ మీద కూడా గెలిచి తీరుతామన్న విశ్వాసంతో భారత్ పర్యటనకు కివీస్ వచ్చింది. కానీ వన్డే సిరీస్‌లో 3-0తో ఓడిపోవడంతో వారి ఆశలన్నీ నీరుకారిపోయాయి.

సొంత గడ్డపై వరుసగా ఆరు మ్యాచ్‌లను గెలవడమన్నది టీమిండియాకు గొప్ప మైలురాయి.

ఇలాంటి విజయంతో ఈ ఏడాది భారత్‌లో జరిగే ప్రపంచ కప్‌లో గెలిచి తీరతామనే విశ్వాసం టీమిండియాలో పెరిగింది.

ప్రపంచ కప్ లాంటి టోర్నమెంట్‌ని గెలవాలంటే 8లో ఏడు మ్యాచ్‌లు గెలవాల్సి ఉందని భారత కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు.

టీమిండియా

ఫొటో సోర్స్, ANI

దుమ్ములేపిన శుభ్‌మన్ గిల్

శుభ్‌మన్ గిల్ రూపంలో ఈ సిరీస్‌లో భారత్‌కు మంచి ఆటగాడు దొరికాడు. గత 4 మ్యాచ్‌లలో మూడు శతకాలతో గిల్ అద్భుతమైన ఆటతీరును కనబర్చాడు. ఈ సిరీస్‌లో అతను మూడు మ్యాచ్‌ల్లో 360 పరుగులు చేసి భారత్‌ తరఫున సరికొత్త రికార్డును సాధించాడు.

ఈ మూడు మ్యాచ్‌లలో గిల్ 180 సగటును నమోదు చేశాడు. తొలి మ్యాచ్‌లో చేసిన 208 పరుగులు గిల్ మెరుగైన సగటుకు దోహదపడ్డాయి. గిల్ కేవలం బలాన్ని ఉపయోగించడమే కాకుండా అద్భుతమైన టైమింగ్‌తో బ్యాటింగ్ చేస్తాడని న్యూజీలాండ్ మాజీ కోచ్ మైక్ హెస్సెన్ అన్నారు.

మ్యాచ్ మ్యాచ్‌కు గిల్ స్ట్రయిక్ రేట్ మెరుగవుతూ రావడం భారత్ జట్టుకు సంతోషాన్ని కలిగించే అంశం.

ఈ సిరీస్‌లో గిల్ స్ట్రయిక్ రేటు 129గా ఉంది. వన్డే క్రికెట్‌లో ఈ స్ట్రయిక్ రేటును కొద్ది మంది ఆటగాళ్లు మాత్రమే ఉంటుంది.

టీమిండియా

ఫొటో సోర్స్, ANI

సెంచరీతో హిట్ కొట్టిన రోహిత్

గత మ్యాచ్‌లో అర్థ సెంచరీనే చేసిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ, ఈ మ్యాచ్‌లో శతకంతో అదరగొట్టాడు.

ఇండోర్ మ్యాచ్‌లో 85 బాల్స్‌కి రోహిత్ శర్మ 101 పరుగులు చేశాడు. దీనిలో ఆరు సిక్స్‌లు, 9 ఫోర్లు ఉన్నాయి.

వన్డేలో రోహిత్‌కు ఇది 30వ సెంచరీ. దీంతో రికీ పాంటింగ్ 30 శతకాలకు సమానంగా రోహిత్ చేరుకున్నాడు.

ఈ సెంచరీ తనకెంతో ముఖ్యమని ఈ మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మ అన్నాడు. చాలాకాలంగా రోహిత్ శర్మ పరుగులు తీయడంలో ఇబ్బందులు పడుతున్నాడు.

ఈసారి రోహిత్ శర్మ సహజసిద్ధంగా బ్యాటింగ్ చేశాడని, ఇది మంచి సంకేతమని మ్యాచ్ సందర్భంగా కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నారు.

టీమిండియా

ఫొటో సోర్స్, ANI

అంచనాలను అందుకోని ఇతర బ్యాట్య్‌మెన్

ఈ సిరీస్‌లో గిల్, రోహిత్ శర్మలను మినహాయిస్తే, మిగతా బ్యాట్స్‌మెట్ పెద్దగా రాణించలేదు.

ఈ సిరీస్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో 82 పరుగులు చేసిన హార్డిక్ పాండ్యా భారత్ తరఫున అత్యధిక స్కోరు చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు.

విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌ వంటి ఇతర బ్యాట్స్‌మెన్ ఈ సిరీస్‌లో సగటున 22 లేదా అంతకంటే తక్కువనే చేశారు. ఇది నిరుత్సాహపరిచే విషయమే. భారత జట్టు స్కోరు నుంచి శుభ్‌మన్ గిల్ పరుగులు తీసేస్తే, భారత్ అన్ని మ్యాచ్‌లలో ఓడిపోయేది.

గత రెండు సిరీస్‌లో రెండు సెంచరీలు చేసిన విరాట్ కోహ్లి, కివీస్‌పై 3 ఇన్నింగ్స్‌లో కేవలం 55 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

సూర్యకుమార్ యాదవ్ అత్యధిక స్కోరు కేవలం 31 మాత్రమే. ఇషాన్ కిషన్ 3 ఇన్నింగ్స్‌లో మొత్తంగా 30 పరుగులే చేశాడు.

ఈ సిరీస్‌కి ముందు ఈ ముగ్గురు బ్యాట్స్‌మెన్ అద్భుతంగా ఆడారు. ప్రస్తుత సిరీస్‌లో చతికిలపడ్డా రాబోయే ఆటల్లో పెద్ద స్కోర్‌లతో మళ్లీ పుంజుకుంటారని టీమిండియా ఆశిస్తోంది.

టీమిండియా

ఫొటో సోర్స్, ANI

ప్రధాన ఆయుధం సిరాజ్‌

ఈ సిరీస్‌లో శుభ్‌మన్ గిల్‌తో పాటు అద్బుతంగా రాణించిన మరో క్రికెటర్ సిరాజ్. హైదరాబాద్‌కు చెందిన ఈ బౌలర్ రెండు మ్యాచ్‌ల్లో 5 వికెట్లను తీశాడు. ముఖ్యంగా టీమ్‌కి వికెట్లు అవసరమైన సమయంలో సిరాజ్ ఆదుకున్నాడు.

టెస్ట్ అయినా, టీ20 లేదా వన్డే అయినా ఏ మ్యాచ్‌ అయినా వికెట్లు తీయడంలో సిరాజ్ ముందుంటున్నాడు. తన ఆటను సిరాజ్ ఎంతో మెరుగుపరుచుకున్నాడు. జస్‌ప్రీత్ బుమ్రా లేని లోటును తీరుస్తూ, టీమ్ బౌలింగ్ కమాండ్‌ను తన చేతిలోకి తీసుకున్నాడు.

భారత పిచ్ పరిస్థితులకు తగ్గట్టు సిరాజ్ అద్భుతమైన బౌలింగ్ చేశాడు. సిరాజ్ ఆకట్టుకునే బౌలింగ్ ప్రపంచ కప్‌లో దాదాపు అతని స్థానాన్ని పదిలం చేసింది.

టీమిండియా

ఫొటో సోర్స్, ANI

ఈ సిరీస్‌లో కుల్‌దీప్ యాదవ్ 5.46 ఎకానమీతో 6 వికెట్లు తీశాడు. కుల్‌దీప్ ఆటతీరుపై కెప్టెన్ రోహిత్ శర్మ ఎంతో సంతోషం వ్యక్తం చేశాడు.

ఒకవైపు మంచి ఆట ఆడుతున్నప్పటికీ, టీమ్ నుంచి తొలగించే ఆటగాళ్లలో తొలి స్థానంలో మాత్రం కుల్‌దీప్‌నే ఉన్నాడు.

కుల్‌దీప్ యాదవ్ మాత్రమే కాక, చహల్ కూడా ఈ సిరీస్‌లో మంచి ఆటతీరు కనబర్చాడు. చివరి మ్యాచ్‌లో మాత్రమే ఇతనికి ఆడే అవకాశం దక్కింది. ఆ సమయంలో 43 పరుగులకు రెండు వికెట్లు తీశాడు.

టీమిండియా

ఫొటో సోర్స్, ANI

బ్యాకప్ ఆల్‌రౌండర్ కోసం చూస్తున్న సెలక్టర్లు

ఈ సిరీస్‌లో వాషింగ్టన్ సుందర్ ఆల్‌రౌండర్‌గా నిలిచేందుకు ప్రయత్నించాడు. గత ఏడాది రవీంద్ర జడేజా గాయాలు పాలు కావడంతో, అక్షర్ పటేల్ 11వ ఆటగాడిగా మ్యాచ్‌లు ఆడాడు. బ్యాట్స్‌మన్‌గా, బౌలర్‌గా తాను గ్రౌండ్‌లో మంచి ప్రదర్శన కనబర్చాడు.

భారతీయ సెలక్టర్లు ప్రస్తుతం బ్యాకప్ ఆల్‌రౌండర్‌ కోసం చూస్తున్నారు. ఈ సిరీస్‌లో సుందర్‌కి పుష్కలమైన అవకాశాలు దక్కాయి.

వన్డేలలో 2 ఇన్నింగ్స్‌లో 21 పరుగులు చేశాడు సుందర్. దీనిలో 12 అతని అత్యధిక స్కోరు. బౌలింగ్‌లో 3 ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీశాడు.

టీమిండియా

ఫొటో సోర్స్, ANI

శార్దూల్ ఠాకూర్

శార్దూల్ ఠాకూర్ ప్రస్తుతం ఆల్‌రౌండర్‌గా కనిపిస్తున్నాడు. ఈయనకు కొన్ని అవకాశాలే దక్కినప్పటికీ, వాటి నుంచి మంచి ప్రయోజనాలను పొందగలిగాడు.

ఇండో‌ర్‌లో జరిగిన చివరి మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యాతో మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

17 బాల్స్‌లో 25 పరుగులు చేశాడు. బ్యాట్‌తో తన ఆటతీరును కనబర్చాడు.

3 వికెట్లు తీసిన శార్దూల్, భారతీయ జట్టును విజయం వైపుకి నడిపించాడు.

శార్దూల్ ప్రతిసారి వికెట్లు తీసేందుకు బాగా ప్రయత్నించాడు.

ఈ సిరీస్‌లో 3 ఇన్నింగ్స్‌లో 6 వికెట్లను తీసి, కుల్దీప్ యాదవ్‌కి సమానమని నిరూపించుకున్నాడు.

కెప్టెన్ రోహిత్ శర్మ, శార్దూల్ ఠాకూర్‌ని కూడా అభినందించాడు. శార్దూల్‌ని టీమిండియా అంతా మాంత్రికుడిగా పిలుస్తుంది.

బ్యాట్స్‌మాన్‌గా, బౌలర్‌గా టీమ్ ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా ఉన్నాడు. గాయాలు పాలై తిరిగి వచ్చిన తర్వాత బౌలింగ్‌ బాధ్యతను తాను మెల్లమెల్లగా పెంచుకుంటున్నాడు.

మొత్తంగా భారత్‌కు ఇది మంచి సిరీస్‌గా నిలిచింది. ఇది టీమ్‌కి మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది.

ప్రస్తుతం భారతీయ టీమ్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీ20లో, వన్డేలలో నెంబర్ 1 టీమ్‌గా నిలుస్తోంది.

వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌లో కూడా ఇలాంటి విజయాన్ని సాధిస్తే, టెస్ట్ ర్యాంకింగ్స్‌లో కూడా టాప్‌లోకి వస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)