‘నేను రెజ్లింగ్ వదిలేస్తున్నా' - కన్నీరు పెట్టుకున్న సాక్షి మలిక్.. డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడిగా బ్రిజ్ భూషణ్ సింగ్ సన్నిహితుడు ఎన్నికయ్యాక ప్రకటన

సాక్షి మలిక్

ఫొటో సోర్స్, Debalin

ఫొటో క్యాప్షన్, సంజయ్ సింగ్ ఎన్నిక అనంతరం సాక్షి మలిక్ మీడియాతో మాట్లాడారు.

రెజ్లింగ్ వదిలేస్తున్నట్లు భారత రెజ్లర్ సాక్షి మలిక్ గురువారం మీడియా సమావేశంలో ప్రకటించారు.

భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ దిల్లీ వేదికగా నిరసనలు తెలిపిన వారిలో సాక్షి మలిక్ కూడా ఒకరు.

కుస్తీ యోధురాలి ఈ ప్రకటనపై భారత క్రీడా అభిమానులు షాక్‌ అయ్యారు.

సాక్షి మలిక్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, సాక్షి మలిక్

'40 రోజుల పాటు వీధుల్లో నిద్రపోయాం'

భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎన్నికయ్యారు. ఆయన బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌కు సన్నిహితుడు.

సంజయ్ సింగ్ ఎన్నిక అనంతరం మీడియాతో మాట్లాడారు రెజ్లర్ సాక్షి మాలిక్.

‘‘యుద్ధం చేశాం, మనస్ఫూర్తిగా పోరాడాం. 40 రోజుల పాటు వీధుల్లో నిద్రపోయాం, దేశంలోని అనేక ప్రాంతాల నుంచి చాలా మంది వచ్చి మాకు మద్దతుగా నిలిచారు. ఇప్పటివరకు నన్ను ఆదరించిన దేశప్రజలందరికీ ధన్యవాదాలు" అని అన్నారు.

‘మేం మహిళా అధ్యక్షురాలు కావాలని డిమాండ్‌ చేశాం. అధ్యక్షురాలు మహిళ అయితే వేధింపులు జరిగేవి కావు. ఇంతకుముందు మహిళల భాగస్వామ్యం ఉండేది కాదు, వారి జాబితాను చూడండి, ఒక్క మహిళకు కూడా స్థానం ఇవ్వలేదు. మేం పూర్తి శక్తితో పోరాడాం, ఇది కొనసాగుతుంది. కొత్త తరం కుస్తీ యోధులు పోరాడాలి" అని అన్నారు.

ఒకవేళ బ్రిజ్ భూషణ్ వ్యాపార భాగస్వామి డబ్ల్యూఎఫ్ఐ‌లో ఉంటే రెజ్లింగ్ వదిలేస్తానని ఆమె తెలిపారు.

మద్దతు తెలిపిన వారందరికీ సాక్షి ధన్యవాదాలు అని చెప్పి, అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్లిపోయారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

రాజకీయాలు చేయాలనుకుంటే చేయండి: సంజయ్ సింగ్

సంజయ్ ప్యానల్ మొత్తం గెలిచిందని, మెజారిటీ కూడా వచ్చిందని బ్రిజ్‌భూషణ్ అల్లుడు విశాల్ సింగ్ గురువారం తెలిపారు.

గెలిచిన అనంతరం పీటీఐ వార్తాసంస్థతో మాట్లాడిన సంజయ్ సింగ్.. అబద్దంపై నిజం ఎప్పుడూ గెలుస్తుందని చెప్పారు.

''క్యాంపులు (రెజ్లింగ్ కోసం) నిర్వహిస్తాం, రెజ్లింగ్ చేయాలనుకునే వారు రెజ్లింగ్ చేస్తున్నారు, రాజకీయాలు చేయాలనుకునే వారు రాజకీయాలు చేయండి" అని సంజయ్ సింగ్ అన్నారు.

సంజయ్ సింగ్ విజయంపై బ్రిజ్ భూషణ్ మాట్లాడుతూ.. ఈ ఘనత దేశంలోని రెజ్లర్లు, భారత రెజ్లింగ్ సమాఖ్య కార్యదర్శికే దక్కుతుందని చెప్పారు.

''కొత్త ఫెడరేషన్ ఏర్పాటుతో రెజ్లింగ్ పోటీలు ప్రారంభమవుతాయని ఆశిస్తున్నాను" అని అన్నారు.

రెజ్లింగ్ వదిలేస్తానని సాక్షి మలిక్ ప్రకటించడంపై బ్రిజ్ భూషణ్ స్పందిస్తూ.. ‘‘నాకు సంబంధం లేదు’’ అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

యుద్దమే చేశాం: అనితా షెరాన్

‘‘మేం కష్టమైన యుద్ధమే చేశాం, ఆడపిల్లల కోసమే పోరాడుతున్నాం'' అని సమాఖ్య ఎన్నికల్లో ఓడిపోయిన అనితా షెరాన్ అన్నారు.

“మేం మధ్యతరగతి నుంచి వచ్చాం, వారి మూలాలు బలంగా ఉన్నాయి, ఫెడరేషన్ మార్పును అంగీకరించలేదు, రెజ్లర్లు పోరాడుతూనే ఉన్నారు, ఇక వారి ఫిర్యాదుపై ఏమీ చేయరు, మేం మౌనంగా ఉండలేం. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడతాం" అని తెలిపారు.

కొత్త ప్యానెల్ ప్రాధాన్యం గురించి విశాల్ సింగ్‌ను అడిగినప్పుడు- "గత కొన్ని రోజులుగా రెజ్లింగ్‌కు ఎలాంటి కష్టాలు వచ్చినా, ఆట సజావుగా జరిగిందని కచ్చితంగా చెప్పొచ్చు. కొన్ని విషయాల కారణంగా ఆటగాళ్లు ఆశించినంతగా రాణించలేకపోయారు. క్రీడాకారులను మెరిట్ ఆధారంగా కాకుండా ఇతర కారణాలతో తీసుకుంటే, ఉత్తమ ఆటగాళ్లు నష్టపోతారు" అని అన్నారు.

సాక్షి మలిక్‌

ఫొటో సోర్స్, @SAKSHIMALIK

ఫొటో క్యాప్షన్, 2023 మే 28న సాక్షి మలిక్‌ను దిల్లీ పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు.

రెజ్లర్ల ఆందోళన ఏమిటి?

దిల్లీలోని జంతర్‌మంతర్ వేదికగా 2023 జనవరి 18న కొందరు భారత రెజ్లర్లు నిరసనకు కూర్చున్నారు. డబ్లూఎఫ్‌ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్‌పై వీరు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు.

నిరసనకు దిగిన ప్రముఖ రెజ్లర్లలో రెండు ప్రపంచ చాంపియన్‌షిప్ పతకాల విజేత వినేశ్ ఫోగాట్, రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత బజరంగ్ పునియా తదితరులు ఉన్నారు.

అనేక ఏళ్ల నుంచి బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని రెజ్లర్లు ఆరోపించారు.

బ్రిజ్ భూషణ్‌కు సన్నిహితులైన కొందరు అధికారులు తనను చంపేస్తానని కూడా బెదిరించినట్లు వినేశ్ ఫోగాట్ చెప్పారు. తాము నిత్యం ‘‘భయం, ఆందోళన’’తోకూడిన వాతావరణంలో గడుపుతున్నామన్నారు. కొందరు జాతీయ కోచ్‌లు కూడా బ్రిజ్ భూషణ్‌వైపే ఉన్నట్లు తెలిపారు.

తన పదవికి బ్రిజ్ భూషణ్ రాజీనామా చేయాలని, డబ్ల్యూఎఫ్ఐను రద్దు చేయాలని రెజ్లర్లు డిమాండ్ చేశారు.

ఈ విషయంలో స్పందించాలని డబ్ల్యూఎఫ్ఐకి క్రీడల శాఖ నోటీసులు పంపించింది. ఆరోపణలు రుజువైతే జాతీయ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ కోడ్ కింద చర్యలు తీసుకుంటామని తెలిపింది.

నిరసన చేపడుతున్నవారిని మాజీ రెజ్లర్, బీజేపీ నాయకురాలు బబితా ఫోగాట్ కలిశారు. ప్రభుత్వంతో తాను మాట్లాడతానని ఆమె చెప్పారు. అయితే, అదే రోజు టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత రవీ దహియా, వరల్డ్ చాంపియన్‌షిప్ పతక విజేత దీపక్ పునియా కూడా నిరసన చేపడుతున్న వారితో కలిశారు.

అదే రోజు రెజ్లర్లు కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకుర్‌ను ఆయన నివాసంలో కలిశారు. ఈ సమావేశం దాదాపు ఐదు గంటలు సాగింది. కానీ, ఎలాంటి పరిష్కారమూ లభించలేదు.

కమిటీ ఏర్పాటు

ఈ ఆరోపణలపై విచారణకు ఒలిపింక్ పతక విజేత ఎంసీ మేరీ కోమ్‌ నేతృత్వంలో ఒక కమిటీని ఐవోఏ ఏర్పాటు చేసింది.అలాగే, ఫెడరేషన్ రోజువారీ కార్యకలాపాలను నిర్వహించే బాధ్యతను కూడా ఈ కమిటీకి అప్పజెప్పారు.

పర్యవేక్షణ కమిటీ విచారణ పూర్తయిన తర్వాత కూడా ఈ కమిటీ ఏం చెప్పిందో ప్రజల ముందుకు రాలేదు.

కానీ, ఫెడరేషన్‌ను నిర్వహించే బాధ్యతను ఇద్దరు సభ్యుల ‘అడ్ హాక్ కమిటీ’కి అప్పజెప్పారు.

లైంగిక వేధింపు ఆరోపణలు చేస్తోన్న సాక్షి మలిక్‌తో సహా మిగిలిన మహిళా రెజ్లర్లందరూ కూడా ‘పర్యవేక్షణ కమిటీ’ నిర్వహించిన విచారణ తీరుపై పలు అనుమానాలను, సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయం సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్లింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దిల్లీ పోలీసులు దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

మే 28న కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవంలో బ్రిజ్ భూషణ్ కూడా పాల్గొనడంతో కొత్త భవనం ముందు మహా పంచాయత్ నిర్వహించాలని రెజ్లర్లు భావించారు.

వారిని పార్లమెంటు భవనం వైపు వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. రెజ్లర్లను బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించారు. అప్పుడు తీసిన దృశ్యాలు వైరల్ అయ్యాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)