మొరాకో భూకంపం: 2000 దాటిన మృతుల సంఖ్య...ఎటు చూసినా కుప్పకూలిన భవనాలు, శిథిలాల కింద శవాలు

మొరాకో భూకంపం

ఫొటో సోర్స్, Getty Images

మొరాకోలో భూకంపం కారణంగా 2000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు అదే సంఖ్యలో గాయపడ్డారు.

1400 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది.

మూడు రోజులపాటు జాతీయ సంతాప దినాలుగా పాటించాలని మొరాకో రాజు కింగ్ మొహమ్మద్ 6 ఆదేశించారు.

6.8 తీవ్రతతో స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 11:11 గంటల సమయంలో ఈ భూకంపం సంభవించింది.

మరకేశ్‌ నగరానికి 71 కి.మీ దూరంలోని హై అట్లాస్ పర్వతాల్లో 18.5 కి.మీ. లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొంది.

భూకంప బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. దేశంలో మూడో వంతు ప్రాంతం భూకంపానికి ప్రభావితమైంది.

భూకంప తీవ్రత కారణంగా అట్లాస్ పర్వతాల్లోని మారుమూల ప్రభావిత ప్రాంతాలకు చేరుకోవడానికి కష్టతరమవుతున్నట్లు కథనాలు వస్తున్నాయి.

మరకేశ్‌లో కుప్పకూలిన భవంతి

ఫొటో సోర్స్, EVN SCREENSHOT

ఫొటో క్యాప్షన్, మరకేశ్‌లో కుప్పకూలిన భవంతి

పర్యాటకులు ఎక్కువగా ఇష్టపడే చారిత్రాత్మక నగర మరకేశ్ తీవ్రంగా దెబ్బతింది.

అల్ హఉజ్, మరకేశ్, ఉరాజాజాతె, అజీలాల్, చీచావువా, టారౌడంట్ మున్సిపాలటీలలోని ప్రజలు భూకంపం వల్ల ప్రాణాలు కోల్పోయారని, 329మందికి పైగా గాయపడ్డారని హోం మంత్రిత్య శాఖ తెలిపింది.

భూకంపం వల్ల మరకేశ్‌ నగరంలో కుప్పకూలిన భవంతులు

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, భూకంపం వల్ల మరకేశ్‌ నగరంలో కుప్పకూలిన భవంతులు

భవనాలు కంపించడం, కూలిపోవడం, వీధుల్లో ప్రజలు అరుస్తూ పరుగులు పెట్టడం, దట్టమైన దుమ్ము నుంచి కొందరు బయటకు వస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద సంఖ్యలో ఉన్నాయి.

మరకేశ్‌లోని మెదినాలో పెద్ద సంఖ్యలో భవనాలు కూలిపోవడంతో శిథిలాల కింద చాలా కుటుంబాలు చిక్కుకుపోయాయి.

నగరంలోని ఆసుపత్రులు క్షతగాత్రులతో నిండిపోవడంతో, రక్తదానం చేయాలని స్థానికులను అధికారులు కోరారు.

భూకంపం తర్వాత ధ్వంసమైన కారు దృశ్యాలు

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, భూకంపం తర్వాత ధ్వంసమైన కారు దృశ్యాలు

పాత నగరంలోని కొన్ని భవనాలు కూలిపోయాయని స్థానికులు రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీకి తెలిపారు.

భవనాలు కూలిపోతున్న వీడియోలను అనేక మంది ట్విటర్‌లో షేర్ చేశారు.

ఆ వీడియోలు ఏ ప్రాంతానికి చెందనవనేది బీబీసీ స్వయంగా నిర్ధరించలేదు. ఘటన తర్వాత నగరంలోని ప్రజలు భయంతో ఇళ్లలోకి వెళ్లకుండా బయటే ఉండిపోయారు.

వీధుల్లోనే మొరాకో ప్రజలు

ఫొటో సోర్స్, EPA

“అంతా భయాందోళనలో ఉండి పోయారు. పిల్లలు ఏడుస్తుంటే తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు” అని స్థానికులు అబ్దెల్హక్ ఎల్ అమ్రానీ ఏఎఫ్పీ న్యూస్ ఏజెన్సీతో ఆ క్షణాలను గుర్తుచేసుకున్నారు.

పది నిముషాల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతోపాటు ఫోన్ లైన్స్ కూడా పనిచేయలేదని తెలిపారు.

భవనాలు కదులుతున్న దృశ్యాలు చూసి భయంకరమైన అనుభూతికి లోనయ్యానని మరొక వ్యక్తి తెలిపారు.

జీ20

ఫొటో సోర్స్, G20

జీ20 సమావేశాల్లో మోదీ సంతాపం

ఢిల్లీలో జరుగుతున్న జీ20 శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొన్న భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాదంపై స్పందించారు. మొరాకో దేశానికి బాసటగా దేశాలన్ని ఉన్నాయని అన్నారు.

‘‘జీ20 సదస్సు ప్రారంభించడానికి ముందు, మొరాకో భూకంపంలో చనిపోయిన ప్రజలకు సంతాపం తెలియజేస్తున్నా. ఈ ప్రకృతి విపత్తులో గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఈ కష్ట సమయంలో మొరాకోకు అవసరమైన సాయమంతా చేసేందుకు భారత్ సిద్ధంగా ఉంది. ’’ అని మోదీ తెలిపారు.

జర్మనీ కౌన్సిలర్ ఒలాఫ్ స్కోల్జ్ స్పందిస్తూ, ఇది విధ్వంసకర ఘటన అని అన్నారు.

మొరాకో భూకంపం సంభవించిన ప్రాంతం

ఫొటో సోర్స్, USGS

రాజధానికి 350 కిలోమీటర్ల దూరంలో..

భూకంప కేంద్రం పర్యతాల్లో ఉంది. మొరాకో రాజధానికి 350 కి.మీ దూరంలోనే భూప్రకంపనాలు వచ్చాయి.

దీంతో కాసాబ్లాంకా, ఐజోరియా వంటి నగరాలు షేకయ్యాయి. మరకేశ్ నగరం భూకంపానికి తీవ్రంగా ప్రభావితమైంది.

మొరాకోలో మరకేశ్ నగరం పర్యాటక కేంద్రం.

పెద్ద సంఖ్యలో సందర్శకులు ఈ నగరానికి వస్తుంటారు. పర్యాటకులు కూడా ఈ భూకంపానికి ప్రభావితలైనట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)