ఇండియా సెమీస్ ప్రత్యర్థి ఆ జట్టేనా? నాకౌట్ మ్యాచ్‌పై అభిమానుల ఆందోళన ఏమిటి?

టీమిండియా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, టీమిండియా కదనోత్సాహం

దక్షిణాఫ్రికాతో శుక్రవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఓడిపోవడంతో అఫ్గానిస్తాన్ వన్డే ప్రపంచ కప్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్ తర్వాత నాలుగో సెమీస్ బెర్తుపై మరింత స్పష్టత వచ్చింది.

ఇప్పటికే ఇండియా(16 పాయింట్లు), దక్షిణాఫ్రికా(14 పాయింట్లు), ఆస్ట్రేలియా(12 పాయింట్లు) సెమీస్ బెర్తులు ఖాయం చేసుకోగా, అఫ్గానిస్తాన్ తాజా ఓటమితో నాలుగో స్థానం కోసం పోటీలో న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్లు మాత్రమే మిగిలాయి.

మొత్తం తొమ్మిది మ్యాచులు ఆడేసి, 10 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది న్యూజిలాండ్. ఎనిమిది మ్యాచులు ఆడి ఎనిమిది పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది పాకిస్తాన్.

సాంకేతికంగా చూస్తే రెండింటి మధ్య సెమీస్ బెర్తు కోసం పోటీ ఉన్నట్టు కనిపిస్తుంది. ప్రాక్టికల్‌గా చూస్తే మాత్రం న్యూజిలాండ్ స్పష్టమైన ముందంజలో ఉంది.

శనివారం కోల్‌కతాలో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌తో జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో ఊహకందని అద్భుత విజయాన్ని సాధిస్తే తప్ప పాకిస్తాన్‌కు సెమీస్ అవకాశాలు లేవు.

ఈ మ్యాచ్ ఫలితాన్ని బట్టి మొదటి సెమీఫైనల్లో భారత్‌తో తలపడే జట్టు ఏదనేది తేలిపోతుంది.

న్యూజీలాండ్

ఫొటో సోర్స్, Getty Images

మెరుగ్గా న్యూజిలాండ్ నెట్ రన్‌రేట్

ప్రపంచ కప్-2023 టోర్నీ నిబంధనల ప్రకారం మొదటి స్థానం సాధించిన జట్టు నాలుగో స్థానంలో నిలిచిన జట్టుతో, రెండో స్థానంలోని టీం మూడో స్థానం సాధించిన టీంతో సెమీ ఫైనల్స్‌లో పోటీపడతాయి.

ఇలా నవంబరు 16న కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగే రెండో సెమీ ఫైనల్లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనున్నాయి.

నవంబరు 15న ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగే మొదటి సెమీఫైనల్లో టీమిండియా ప్రత్యర్థి ఎవరో తేలాల్సి ఉంది. నాలుగో స్థానంలో నిలిచిన జట్టుతో భారత్ తలపడనుంది.

ఇప్పటికే నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ నెట్ రన్‌రేట్(0.743) పరంగా చాలా మెరుగైన స్థితిలో ఉండటం పాక్ సెమీస్ అవకాశాలను ఇంకా కష్టతరం చేసింది. ఇంతకూ పాక్ సెమీస్ చేరే అవకాశాలు ఎంత మేర ఉన్నాయి?

పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

పాకిస్తాన్ సెమీస్ చేరాలంటే ఏం జరగాలి?

పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే డిఫెండింగ్ చాంపియన్‌పై భారీ విజయాన్ని అందుకోవాలి.

ఇంగ్లండ్‌తో శనివారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్ ముందుగా బ్యాటింగ్ చేస్తే కనీసం 288 పరుగుల భారీ తేడాతో గెలుపొందాలి.

ఉదాహరణకు పాకిస్థాన్ 400 పరుగుల భారీ స్కోర్ చేస్తే ఇంగ్లండ్‌ను 112 పరుగులకు కట్టడి చేయాలి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

ఒకవేళ ఇంగ్లండ్ ముందుగా బ్యాటింగ్ చేసి 150 పరుగులే చేయగలిగితే, కివీస్ నెట్ రన్ రేట్‌ను దాటాలంటే పాకిస్తాన్ ఆ లక్ష్యాన్ని 3.4 ఓవర్లలోనే ఛేదించాల్సి ఉంటుంది. ప్రతి బంతికి ఓ సిక్స్ కొట్టినా అది అసాధ్యం. అందుకే మొదట బ్యాటింగ్ చేస్తేనే పాకిస్తాన్ జట్టుకు విజయావకాశాలు కొంతైనా ఉంటాయి.

తమ జట్టు సెమీస్ చేరుతుందని పాకిస్తాన్ అభిమానులు కొందరు సోషల్ మీడియాలో ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.

ఇంతటి భారీ తేడాతో గెలవడం ప్రపంచ క్రికెట్‌లో అరుదుగా జరిగిందని, కివీస్, పాక్ రెండూ బలమైన జట్లే కాబట్టి ఇది కష్టసాధ్యమని విశ్లేషకులు చెబుతున్నారు.

టీమిండియా ఫ్యాన్స్

ఫొటో సోర్స్, Getty Images

భారత్ ఐసీసీ టోర్నీ గెలిచి దశాబ్దం

భారత్ మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో 2011 వన్డే వరల్డ్ కప్, ఆ తర్వాత 2013లో చాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. అప్పటి నుంచి టీమిండియా ఐసీసీ టోర్నీ ఏదీ గెలవలేదు.

చాలా ఏళ్లుగా ప్రపంచ క్రికెట్‌లో బలమైన జట్టుగా ఉన్నా, ఐసీసీ టోర్నీలకు వచ్చేసరికి భారత్ చతికిలపడుతోంది.

లీగ్ దశను దాటుతున్నా సెమీస్, ఫైనల్స్‌లో బోల్తా పడుతోంది.

2015 వరల్డ్‌ కప్ నుంచి టీమిండియాను సెమీస్, ఫైనల్ భంగపాటు వెంటాడుతోంది. 2015 వరల్డ్‌కప్‌ సెమీ ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓటమి పాలైంది భారత్.

ఆ తర్వాత 2016 టీ20 ప్రపంచ కప్‌ సెమీస్‌లో టీమిండియాను వెస్టిండీస్ ఓడించింది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో ఓడింది భారత్.

ఐసీసీ టెస్టు ఛాంపియన్ షిప్‌ (2021-23)లో ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓడింది టీమిండియా. 2022 టీ20 ప్రపంచకప్ సెమీస్‌లోనూ భారత్‌పై ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో గెలిచింది.

ఓవైపు ఐసీసీ టోర్నీల్లో భారత జట్టు తడబాటు, మరోవైపు ప్రత్యర్థిగా న్యూజిలాండ్ వస్తోందని తెలిసి టీమిండియా అభిమానులు ఒకింత ఆందోళన పడుతున్నారు.

ఈ ప్రపంచ కప్‌లో ఆడుతున్న మిగతా జట్లతో పోలిస్తే టీమిండియా దుర్భేద్యంగా కనిపిస్తోంది. మైదానంలోనూ జట్టు అంతే బాగా ఆడుతోంది.

టోర్నీలో ఆడిన 8 మ్యాచ్‌లలోనూ గెలిచిన ఏకైక జట్టు టీమిండియానే. ప్రస్తుత ఫామ్ చూస్తే భారత్‌ను ఓడించడం ఏ జట్టుకైనా కష్టమే.

అయితే సెమీస్ ప్రత్యర్థి న్యూజిలాండ్ అనే సరికి టీమిండియా అభిమానులు ఒకింత ఆందోళన చెందుతున్నారు.

ఎందుకంటే న్యూజిలాండ్‌పై ఐసీసీ టోర్నీల్లో భారత్‌కు రికార్డులు అంత బాగా లేవు. ఇంగ్లండ్ వేదికగా జరిగిన 2019 వన్డే ప్రపంచకప్ టోర్నీ సెమీఫైనల్లో కివీస్ చేతిలో భారత్ ఓడిపోయింది.

అంతేకాదు ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్ (2019-21)లో ఫైనల్లో కూడా టీమిండియాను కివీస్ ఓడిచింది. దీంతో భారత అభిమానులు టెన్షన్ పడుతున్నారు.

ఇదే సమయంలో టీమిండియాతో సెమీస్ మ్యాచ్‌పై న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్‌ బౌల్ట్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

కివీస్ సెమీస్ చేరితే ఉత్కంఠగా ఉంటుందన్నాడు. కోట్ల మంది అభిమానుల మద్దతుతో మ్యాచ్‌ ఆడబోతున్న భారత్‌ను ఎదుర్కోవడం అతిపెద్ద సవాల్‌ అని వ్యాఖ్యానించాడు.

''టీమిండియా ప్రస్తుతం చాలా సానుకూలంగా ఆడుతోంది. ప్రపంచ కప్‌ సెమీస్‌లో ఎలా టీమిండియాను ఎలా ఎదుర్కోవాలో మాకు స్పష్టమైన వ్యూహం ఉంది'' అని వ్యాఖ్యానించాడు బౌల్ట్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)