తుర్కియే అధ్యక్షుడిగా మళ్లీ ఎర్దోవాన్: అటు రష్యాతో, ఇటు పశ్చిమ దేశాలతో ఆయనకు మైత్రి ఎలా సాధ్యం?

తుర్కియే ఎన్నికలు

ఫొటో సోర్స్, AFP

    • రచయిత, కాట్యా ఆడ్లర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తుర్కియే ఎన్నికల్లో రెసెప్ తయ్యిప్ ఎర్దోవాన్ విజయం సాధించారు. దీంతో ఆదివారం రాత్రి అభినందనలు తెలిపేందుకు ప్రపంచ నాయకులు పోటీపడ్డారు.

యుక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో దీనిపై ప్రాముఖ్యత సంతరించుకుంది.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధికారికంగా తుర్కియే ఎన్నికల ఫలితాలు వెల్లడికాకముందే ప్రకటన చేశారు.

యుక్రెయిన్‌పై యుద్ధం కారణంగా నాటోలోని తుర్కియే మిత్రదేశాలు ఆంక్షలు విధించి, రష్యాపై ఆధారపడటాన్ని తగ్గించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో రష్యాను బహిష్కరించడానికి ఎర్దోవాన్ నిరాకరించారు. ఈ తుర్కియే విదేశాంగ విధానాన్ని క్రెమ్లిన్ ప్రత్యేకంగా ఇష్టపడుతోంది.

యుక్రెయిన్‌లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి తుర్కియే, రష్యా మధ్య వాణిజ్యం కూడా గణనీయంగా పెరిగింది.

అయితే ఆదివారం నాడు ఎర్దోవాన్ ను అభినందించిన వారిలో పుతిన్‌తో పాటు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ఆయన ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ కూడా ఉన్నారు.

తుర్కియే

ఫొటో సోర్స్, PPO/REUTERS

నాటోకు తుర్కియే కీలకం

ఎర్దోవాన్ క్రెమ్లిన్‌తో సన్నిహితంగా ఉండటం, దేశంలో మాట్లాడే స్వేచ్ఛ, ప్రజాస్వామ్య నిబంధనలను తగ్గించడం పట్ల ఇరుదేశాలకు ఇష్టం లేనప్పటికీ, వారికి తుర్కియే కీలకమైనది. పశ్చిమ దేశాలకు అది మిత్రదేశం.

నాటో సైనిక కూటమిలో తుర్కియే కీలక సభ్యదేశం, కూటమి అన్ని కార్యకలాపాల్లో అది పాల్గొంటుంది.

ఎర్దోవాన్ రష్యాతో సన్నిహిత సంబంధాలను కొనసాగించవచ్చు. అదే సమయంలో యుక్రెయిన్‌కు సైనిక సహాయాన్ని కూడా అందిస్తారు.

యుక్రెయిన్ ధాన్యం సరఫరాలపై రష్యా దిగ్బంధనానికి ఎర్దోవాన్ చెక్ పెట్టారు.

ధాన్యంపై ఆధారపడిన ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో సరఫరాకు ఒప్పందం చేసుకోవడానికి ఎర్దోవాన్ మధ్యవర్తిత్వం చేశారు.

అయితే చాలారోజులు నాన్చుడు తర్వాత రష్యా పొరుగున ఉన్న ఫిన్లాండ్ నాటోలో చేరడానికి అధికారిక ఆమోదం తెలిపింది తుర్కియే.

ఒకప్పుడు తుర్కియే ఈయూలో చేరాలని ప్రయత్నించిన ఎర్దోవాన్ ఇపుడు "తుర్కియేని మళ్లీ గొప్పగా మార్చడం" గురించి మాట్లాడుతున్నారు.

తుర్కియే స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కలిగి ఉంది. ఆయన గత కొన్నేళ్లుగా తన మిత్రదేశాలతో సంబంధాలను పెంచుకున్నారు.

స్వీడన్‌కు కూడా నాటో సభ్యత్వాన్ని ఆమోదించేలా ఎర్దోవాన్‌ను ఒప్పించేందుకు వైట్ హౌస్ ప్రయత్నించింది. ఆ సమయంలో తన అసహనాన్ని కూడా అమెరికా ప్రదర్శించింది.

రష్యా వ్యతిరేక కూటమి కోసం స్వీడన్ ముఖ్యమైన బాల్టిక్ సముద్ర ప్రాంతాన్ని అందిస్తుంది.

తుర్కియే ఆర్థిక వ్యవస్థ భయంకరమైన స్థితిలో ఉన్న నేపథ్యంలో ఆర్థిక స్థితిని స్థిరీకరించడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంపై ఎర్దోవాన్‌ దృష్టి సారించే అవకాశం ఉందని పశ్చిమ దేశాలు భావిస్తున్నాయి.

స్వీడన్ నాటో ప్రవేశాన్ని క్విడ్ ప్రోకోగా నిరూపించడానికి దాన్ని ఉపయోగించుకోవచ్చు.

స్వీడన్ సభ్యత్వాన్ని ఇప్పటికీ నిరోధించే నాటో దేశాలు తుర్కియే, హంగేరీ మాత్రమే.

తుర్కియే

ఫొటో సోర్స్, NECATI SAVAS/EPA-EFE/REX/SHUTTERSTOCK

ఈయూకి వలసలను ఎర్దోవాన్ నియంత్రిస్తారా?

ఫ్రెంచ్ అధ్యక్షుడు అధ్యక్షుడు మాక్రాన్ ఈయూకీ వలసల గురించి ఆందోళన చెందుతున్నారు.

వీలైనంత త్వరగా అధ్యక్షుడు ఎర్దోవాన్‌ నుంచి హామీని పొందాలని భావిస్తున్నారు.

2015 వలస సంక్షోభం సమయంలో పది లక్షల కంటే ఎక్కువ మంది శరణార్థులు ప్రధానంగా సిరియా నుంచి స్మగ్లర్ల పడవలలో మధ్యధరా మీదుగా ఈయూ వరకు ప్రమాదకరమైన ప్రయాణం చేశారు.

తదనంతరం తుర్కియేతో బ్రస్సెల్స్ ఒప్పందం చేసుకుంది.

ఈయూ‌లోకి తుర్కియేలను వీసా రహిత ప్రయాణం, డబ్బులపై ఒప్పందం చేసుకోవాలనుకున్నాయి. అయితే విమర్శకులు, రాజకీయ ప్రత్యర్థులను ఎర్దోవాన్‌ జైలులో పెట్టడంపై ఈయూ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో మొదటిది పూర్తిగా రాలేదు.

టర్కిష్ జలాల నుంచి పత్రాలు లేకుండా వెళ్లే వలసదారులను తుర్కియే అధ్యక్షుడు నిరోధించగలరు.

లక్షలాది మంది వలసదారులు ఈయూ వైపు వెళ్లవచ్చని తుర్కియే సూచించింది. కానీ ఇక్కడి సిరియన్ శరణార్థుల సంఖ్య టర్కిష్ ఓటర్లలో ప్రజాదరణకు నోచుకోలేదు.

ఈ నెల తుర్కియే పార్లమెంటరీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ పార్టీలన్నీ వలస సమస్య పరిష్కరించడానికి చర్య తీసుకుంటామని హామీ ఇచ్చాయి.

వీడియో క్యాప్షన్, తుర్కియే అధ్యక్షుడిగా మూడోసారి గెలిచిన ఎర్దొవాన్
ఎర్దోవాన్

ఎర్దోవాన్ వ్యూహాలను ఆ దేశాలు పసిగట్టాయా?

తుర్కియే శరణార్థుల భద్రతను పట్టించుకోకుండా సిరియాకు పంపించేస్తుందని, అంతేకాకుండా మధ్యధరా మీదుగా శరణార్థులు, ఇతర వలసదారుల పడవలను పంపడానికి స్మగ్లర్లకు అనుమతిస్తుందని ఈయూ కోపంతో ఉంది.

ఏజియన్ సముద్రం కేంద్రీకృతమైన అనేక వివాదాల్లో ఈయూ సభ్య దేశమైన గ్రీస్ కూడా చిక్కుకున్నందున బ్రస్సెల్స్ కూడా రక్షణాత్మకంగా ఉంది.

అయితే దశాబ్దాలుగా రెండు-దేశాల (గ్రీకు, టర్కిష్) మధ్యగల సమస్యల పరిష్కారానికి ఎర్దోవాన్ పిలుపునిచ్చిన తర్వాత కూడా ఈయూ సభ్య దేశం సైప్రస్ ఉలిక్కిపడుతోంది.

దాదాపు 50 సంవత్సరాల క్రితం టర్కిష్ దండయాత్ర తరువాత అక్కడ సుదీర్ఘ విభజనలు జరిగాయి. తుర్కియే వ్యూహాత్మక ప్రాముఖ్యతను యూరప్, మధ్యప్రాచ్య దేశాల మధ్య వారధిగా పశ్చిమ దేశాలు వర్ణించాయి.

కానీ, యుక్రెయిన్‌పై రష్యా దాడి తుర్కియే స్టాండ్ మార్చింది.

ఎర్దోవాన్ తన మూడో దశాబ్ధపు అధికారంలో ప్రవేశించినందున ఆయన నుంచి అతిపెద్ద విదేశాంగ విధానాలను కొందరు ఆశించారు.

అయితే, తుర్కియే వ్యూహాత్మక మిత్రులు చాలా నిశితంగా అడుగులేస్తున్నారు. తుర్కియే ఏం చేస్తుందో ఇప్పుడు చాలా ముఖ్యం.

వీడియో క్యాప్షన్, భూకంప ప్రభావిత ప్రాంతంలో అధ్యక్షుడు ఎర్దోవాన్‌పై పెరుగుతున్న ఆగ్రహం

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)