దసరా, దీపావళి సేల్స్: ఈఎంఐల్లో వస్తువులు కొంటున్నారా? అయితే తెలుసుకోవాల్సిన విషయాలివే

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కొటేరు శ్రావణి
- హోదా, బీబీసీ ప్రతినిధి
మరికొన్ని రోజుల్లో పండగ సీజన్ ప్రారంభం కాబోతుంది. ఒక పండగ తర్వాత మరో పండగ ఇలా జనవరి వరకు ఏదో ఒక ఫెస్టివల్ వస్తూనే ఉంటుంది.
ఈ సీజన్ సందర్భంగా ఈకామర్స్ దిగ్గజాలు, ఆఫ్లైన్ కంపెనీలు ఊరించే ఆఫర్లతో వినియోగదారుల ముందుకు వస్తున్నాయి.
ప్రముఖ ఈకామర్స్ కంపెనీలు అయిన అమెజాన్, ఫ్లిప్కార్ట్లు తమ అమ్మకాలను ఈ నెల 8 నుంచి ప్రారంభిస్తున్నాయి.
ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు లేదా కొత్త స్మార్ట్ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటోన్న వారు కూడా పండగ సీజన్ ఆఫర్ల కోసం ఎదురు చూస్తున్నారు.
ఆ సమయంలో చాలా వరకు ఆన్లైన్ కంపెనీలు రేట్లను తగ్గిస్తాయి. రేట్ల తగ్గింపుతో పాటు నో కాస్ట్ ఈఎంఐ అని, బై నౌ పే లేటర్ అంటూ వివిధ రకాల స్కీమ్లను ప్రవేశపెడుతూ ఉంటాయి.
ఈ ఆఫర్లను చూసి కొందరు అవసరం లేకపోయినా, రేటు తగ్గింది కదా అని వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇలా అనవసర ఖర్చులు కూడా చేస్తుంటారు.
కానీ, ఈ సమయంలోనే కాస్త జాగ్రత్త వహించాలి. కంపెనీలు ఊరించే ఆఫర్లకు టెంప్ట్ అయి అవసరం లేని వస్తువులు కొనుగోలు చేస్తే.. తర్వాత డబ్బులు కట్టలేక ఇబ్బందులు పడే అవకాశం ఉంది.
ఈ సమయంలో ఫెస్టివ్ బడ్జెట్ను ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఈఎంఐలు పెట్టుకునేటప్పుడు ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి? వంటి పలు విషయాలను మనం ఇక్కడ తెలుసుకుందాం..

ఫొటో సోర్స్, Getty Images
సేల్ ప్రారంభానికి ముందే షాపింగ్ బడ్జెట్ను సిద్ధం చేసుకోవాలి
భారత్లో ప్రస్తుతం ఈ నెల నుంచి వచ్చే నెల వరకు సాగే పండగ సీజన్లో గ్రాస్ మర్కండైజ్ వాల్యూ సుమారు రూ.90 వేల కోట్ల మార్కును తాకే అవకాశముందని కన్సల్టింగ్ సంస్థ రెడ్సీర్ తన నివేదికలో వెల్లడించింది.
గత ఏడాది పండగ నెల అమ్మకాల కంటే 18 నుంచి 20 శాతం అత్యధిక వృద్ధిని నమోదు చేస్తాయని అంచనా వేస్తోంది. కనీసం 140 మిలియన్ మంది ఈ పండగ నెలల్లో షాపింగ్ చేస్తారని కూడా చెబుతోంది.
ఇంత భారీ ఎత్తున జరిగే ఆన్లైన్ షాపింగ్లో వినియోగదారులు కొనుగోలు చేసేటప్పుడు చాలా విషయాలను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.
మీకు మీరుగా తొలుత ఏయే వస్తువులు కొనాలనుకుంటున్నారో ఆన్లైన్ , ఆఫ్లైన్ సేల్స్ ప్రారంభం కావడాని కంటే ముందే ఒక అంచనా వేసుకోవాలి.
వీటి కోసం ముందస్తుగానే ఒక బడ్జెట్ను పెట్టుకోవాలి. ఒకవేళ ఇలా బడ్జెట్ పెట్టుకోలేకపోతే, మీరు అనుకున్న దాని కంటే మించి ఖర్చు చేసే ప్రమాదం ఉంటుంది. దీంతో పాటు మీ రోజువారీ అవసరాలకు, ఎమర్జెన్సీ అవసరాలకు డబ్బులను పక్కకు పెట్టుకోవాలి.
మీరు కొనాలనుకున్న వస్తువుల ధరలు వివిధ వెబ్సైట్లలో ఏ విధంగా ఉన్నాయో చూసుకోవాలి. డీల్స్ను ఒకదానితో ఒకటి పోల్చి చూసుకోవాలి.
ఏ ఆన్లైన్ వేదికపై ఎంత ఆఫర్ ప్రకటించారు? బ్రాండ్ ఏమిటి? ఇలా అన్నింటిపై ఒక అంచనాకు రావాలి.
మీరు ఏది కొనుగోలు చేయాలనుకుంటున్నారో, ముందుగా మీకు తెలియనప్పుడు చివరికి అనవసరమైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
పేమెంట్ ఆప్షన్లు ఏంటి?
ప్రస్తుతం ఆన్లైన్ షాపింగ్ను చూస్తే చాలా పేమెంట్ ఆప్షన్లు అందుబాటులో ఉంటున్నాయి.
కొందరు క్యాష్ ద్వారా, కొందరు క్రెడిట్ కార్డు ద్వారా, కొందరు ఈఎంఐల్లో, మరికొందరు నో కాస్ట్ ఈఎంఐ, బై నౌ పే లేటర్ స్కీమ్లలో కొనుగోళ్లను చేపడుతూ ఉన్నారు.
అయితే, ఆర్డరు పెట్టుకునే ముందే, క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లకు ఎంత ఛార్జ్ చేస్తున్నారు, క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల ద్వారా కొంటున్నప్పుడు ఏమైనా డిస్కౌంట్లు ఇస్తున్నారా? బ్యాంకు ఆఫర్లు ఏ విధంగా ఉన్నాయి? వంటివి చూసుకోవాలి.
పండగ సేల్స్ సమయంలో ఆన్లైన్ కంపెనీలతో పాటు చాలా బ్యాంకులు కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం పలు రకాల ఆఫర్లను ఇస్తూ ఉంటాయి. ఆ సమయంలో వాటి కస్టమర్ బేస్ను కూడా పెంచుకుంటూ ఉంటాయి.
అంతేకాక, నో కాస్ట్ ఈఎంఐ, బై నౌ పే లేటర్ అంటూ పలు ఆప్షన్లు కూడా అందుబాటులో ఉంటాయి.
చాలా వరకు పెద్ద పెద్ద వస్తువుల కొనుగోళ్లను ఈఎంఐల్లోనే చేపడుతూ ఉంటారు. క్రెడిట్ కార్డులపై ఈఎంఐలను రెండు రకాలుగా కన్వర్ట్ చేసుకోవచ్చు.
కొనుగోలు చేసేటప్పుడే ఈకామర్స్ వెబ్సైట్లో ఇన్స్టాంట్గా ఈఎంఐ కన్వర్షన్ పెట్టుకోవచ్చు. లేదంటే లావాదేవీ చేసుకున్న తర్వాత క్రెడిట్ కార్డు జారీ కంపెనీకి ఫోన్ చేసి బిల్లు జనరేట్ కావడాని కంటే ముందు ఈఎంఐ కన్వర్షన్ పెట్టుకోవచ్చు.
మీ క్రెడిట్ కార్డు హిస్టరీ ప్రకారం క్రెడిట్ కార్డు జారీ కంపెనీ వడ్డీ రేట్లను విధిస్తూ ఉంటుంది.
ఈ రెండు ప్రాసెస్లలో కూడా వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు, ముందస్తు క్లోజ్ చేసుకున్నప్పుడు పడే ఛార్జీలు, ఆలస్యపు చెల్లింపు ఫీజులు ఉంటాయి.
అయితే డెబిట్ కార్డులు కేవలం డైరెక్ట్ ఈఎంఐ కన్వర్షన్కు అనుమతిస్తుండగా.. క్రెడిట్ కార్డులు పైన పేర్కొన్న రెండు రకాల ప్రాసెస్లకు అనుమతిస్తున్నాయి.
డైరెక్ట్ ఈఎంఐ కన్వర్షన్లో అన్ని లావాదేవీలు ఈఎంఐల్లోకి మార్చుకోలేం. కేవలం ఏ లావాదేవీలు అయితే ఈఎంఐకి మార్చుకునేందుకు అర్హత ఉంటాయో వాటిని మాత్రమే మార్చుకోగలం.

ఫొటో సోర్స్, Getty Images
నో కాస్ట్ ఈఎంఐలో మీరు చెల్లించేది ఎంత?
యూజర్లకు ఈ ఆఫర్లలో అందుబాటులో ఉండే మరో వెసులుబాటు.. నో కాస్ట్ ఈఎంఐ. అంటే యూజర్లు కేవలం ప్రొడక్ట్ ధరను మాత్రమే ఈఎంఐల్లో చెల్లించాల్సి ఉంటుంది.
ఈఎంఐల్లోకి మార్చుకున్నప్పుడు పడే ఏ వడ్డీని కూడా కస్టమర్లు ఈ విధానంలో చెల్లించాల్సినవసరం లేదు. అంటే సాధారణంగా ఈఎంఐల్లోకి మార్చుకున్నప్పుడు పడే పైన పేర్కొన్న ఎలాంటి ఛార్జీలు వర్తించవు.
వినడానికి ఇది ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, వడ్డీ రేటు ప్రొడక్ట్ ధరలోనే కలిసి ఉంటుందని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా 2013లో విడుదల చేసిన సర్క్యూలర్లో వెల్లడించినట్లు మైమనీమింత్రా డాట్ కామ్ ఎండీ, ఫౌండర్ రాజ్ ఖోస్లా ఒక న్యూస్వెబ్సైట్కి చెప్పారు.
నో కాస్ట్ ఈఎంఐలను ఎంపిక చేసుకున్నప్పుడు కొన్నిసార్లు వినియోగదారులు డిస్కౌంట్లను వదులు కోవాల్సి ఉంటుంది.
ఒకే ప్రొడక్ట్పై వివిధ రకాల డిస్కౌంట్లను ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్లు ఆఫర్ చేస్తూ ఉంటాయి.
ఉదాహరణకు.. రూ.16 వేల మొబైల్ఫోన్ను మీరు కొనుగోలు చేద్దామనుకుంటే, డిస్కౌంట్ తర్వాత అది రూ.14 వేలకు అందుబాటులోకి వస్తుందటే.. మీకు నో కాస్ట్ ఈఎంఐ అందుబాటులో ఉండదు. కానీ, మీరు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ను ఎంపిక చేసుకుంటే.. రూ.4 వేలను డౌన్ పేమెంట్గా కట్టి, ఈఎంఐలలో రూ. 3 వేలను కట్టాల్సి ఉంటుంది. ఇలా కనిపించకుండానే ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది.
అంతేకాక, నో కాస్ట్ ఈఎంఐలలో ప్రాసెసింగ్ ఫీజును కస్టమర్లపై బ్యాంకు ఛార్జ్ చేస్తుంది. దీన్ని ఆఫర్లలో చెప్పరు. ఈ విషయం కస్టమర్లకు తెలిసే అవకాశం ఉండదు.
అంతేకాక, 700 తక్కువ క్రెడిట్ స్కోరు ఉన్న వినియోగదారులు నో కాస్ట్ ఈఎంఐను ఎంపిక చేసుకోలేరు.
నో కాస్ట్ ఈఎంఐ స్కీమ్స్ వల్ల సేల్స్ పెరుగుతున్నాయని, దీని వల్ల కృత్రిమంగా ద్రవ్యోల్బణం పెరుగుతుందని, ఇది ఆర్థిక వ్యవస్థకు, కస్టమర్లకు అంత మంచిది కాదని గత కొన్నేళ్ల కిందటే ఆర్బీఐ చెప్పింది.
‘‘ పండగ సీజన్లో ఎక్స్చేంజ్ ఆఫర్లు, డిస్కౌంట్లు మిగతా సమయాల్లో కంటే ఎక్కువగా ఉంటాయి. ఎక్స్చేంజ్ ఆఫర్లో ఏదైనా వస్తువును కొనాలనుకునే వారికి ఇది మంచి సమయం. నో కాస్ట్ ఈఎంఐ అనేది కంపెనీ కంపెనీకి, బ్యాంకు బ్యాంకుకు మారుతూ ఉంటుంది. వీటి కండీషన్లను కస్టమర్లు పూర్తిగా అర్థం చేసుకుని ప్రొడక్ట్ను కొనుగోలు చేయాలి. నో కాస్ట్ ఈఎంఐలో కొన్ని కంపెనీలు వడ్డీ రేటును తీసేస్తే, కొన్ని కంపెనీలు ప్రాసెసింగ్ ఫీజును మాఫీ చేస్తాయి. కానీ, ఈ మొత్తాలను ఎక్కడో ఒక దగ్గర సర్దుబాటు చేస్తాయి.
ఉదాహరణకు..నో కాస్ట్ ఈఎంఐలో వాషింగ్ మిషన్ లేదా ఫ్రిడ్జ్ లాంటి ఏదైనా వస్తువును కొనుగోలు చేసినప్పుడు, దాని ఛార్జీలను ట్రాన్స్పోర్టేషన్ వంటి వాటిల్లో కలుపుతూ ఉంటారు. నో కాస్ట్ ఈఎంఐలకు ఒక్కో కంపెనీకి అర్థం ఒక్కోలా ఉంటుంది. దాన్ని కస్టమర్లే అర్థం చేసుకోవాలి. కస్టమర్ల ఇంపుల్స్ బయ్యింగ్(ప్రణాళిక లేకుండా హఠాత్తు కొనుగోళ్లు)ను కంపెనీలు వాడుకుంటూ ఉంటాయి ’’ అని ఆర్థిక నిపుణుడు ఐవీబీ కార్తికేయ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ఛార్జీలపై అవగాహన తప్పనిసరి
ఒకవేళ మీ మొత్తం ఆదాయం కంటే ఈఎంఐ మొత్తం 50 శాతం అధికంగా ఉంటే, ఒకసారి ఆగి, ఆలోచించడం మంచిది.
ఈఎంఐ చెల్లింపులను సరైన సమయంలో చెల్లించాలి. లేదంటే మీ క్రెడిట్ స్కోర్లపై ప్రభావం పడుతుంది. నో కాస్ట్ ఈఎంఐలో చెల్లింపులను సరైన సమయంలో చేయకపోతే, ఆలస్యపు ఫీజులు, సర్ఛార్జీలు వంటి వాటిని కట్టాలి.
అవసరం లేని వస్తువులను నో కాస్ట్ ఈఎంఐలలో కొనుగోలు చేయడం మిమ్మల్ని రుణ ఊబిలో కూరుకుపోయేటట్టు చేస్తుంది. దీని నుంచి బయటపడటం కాస్త కష్టమే.
నో కాస్ట్ ఈఎంఐలలో వర్తించే ఛార్జీల గురించి తప్పనిసరిగా అవగాహన అవసరం. ప్రాసెసింగ్ ఫీజులు, ఆలస్యపు చెల్లింపు ఫీజులు, త్వరగా రీపేమెంట్ చేసినప్పుడు వర్తించే పెనాల్టీలను తెలుసుకోవాలి. ఏదైనా కొనేటప్పుడు నియమ, నిబంధనలను తెలుసుకోవాలి.
ఈ సమయాల్లో డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోళ్లు చేపట్టేటప్పుడు కస్టమర్లు కాస్త జాగ్రత్త వహించాలని కార్తికేయ అన్నారు. పెద్ద పెద్ద కంపెనీలు, బ్యాంకులు అయితే కస్టమర్లను మోసం చేసే అవకాశాలు ఉండవు. ఏదైనా వస్తువను కొన్నప్పుడు టూ లెవల్స్లో కస్టమర్ల కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే లావాదేవీ పూర్తి చేస్తాయని చెప్పారు.
కానీ, కొన్నిసార్లు కూపన్ ఉంది, ఆఫర్ ఉంది యూపీఐ స్కాన్ చేస్తే మీకు డిస్కౌంట్ లభిస్తుందని కొందరు మోసం చేసే అవకాశాలున్నాయన్నారు. పండగ సీజన్లో ఈ విషయాలపై కస్టమర్లు కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
మొత్తంగా కస్టమర్లు తమ అవసరాలకు అనుగుణంగా కొనుగోళ్లు చేపట్టాలని, డిస్కౌంట్ కొనుగోళ్లు చేయకూడదని కార్తికేయ సూచించారు. ఎకానమీ పరంగా ఫెస్టివ్ సేల్స్ ఉపయోగపడతాయని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- సిక్కిం ఆకస్మిక వరదల్లో 22 మంది జవాన్లు సహా 102 మంది గల్లంతు, క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి?
- ఏషియన్ గేమ్స్: ఈ ఫోటోను చైనా ఎందుకు సెన్సార్ చేసింది?
- పారిస్పై నల్లుల దండయాత్ర, భయపడిపోతున్న జనం, ఎక్కడ చూసినా నల్లులే..
- వరల్డ్ కప్ 2023: ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు? లైవ్ ఎక్కడ వస్తుంది?
- శ్రీదేవి ఉప్పు తినకపోవడం వల్లే చనిపోయారా? బోనీ కపూర్ ఏమన్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)














