న్యూజీలాండ్ ఎలుకల మీద ఎందుకు యుద్ధం ప్రకటించింది?

- రచయిత, హెన్రి ఆస్టీర్
- హోదా, బీబీసీ న్యూస్, న్యూజీలాండ్
ఒక ఆదివారం పొద్దునే వన్యప్రాణుల ప్రేమికులందరూ సుందరమైన ద్వీపకల్పం పెనిన్సులాలోని మిరామార్లో సమావేశమయ్యారు.
వారందరూ ఇప్పుడు ఒక జంతు జాతి నిర్మూలన మిషన్పై పనిచేస్తున్నారు.
న్యూజీలాండ్ రాజధాని వెల్లింగ్టన్ ప్రాంతంలో పక్షులను రక్షించేందుకు ఎలుకలపై యుద్ధం ప్రకటించారు.
ప్రిడేటర్ ఫ్రీ మిరామార్గా మార్చాలని వారు లక్ష్యంగా పెట్టుకున్నారు.
హై-విస్ జాకెట్లు ధరించిన వాలంటీర్లకు ఎలుకలకు ఎర వేసేందుకు విషంతో కూడిన వేరుశెనగలకు వెన్న పూసి ఇస్తారు.
ఎలుకలను చంపేందుకు బయలు దేరిన వారికి ‘గుడ్ లక్ ఫెలోస్’ అంటూ.. ఈ గ్రూప్కి నేతృత్వం వహిస్తోన్న డాన్ కూప్ తెలిపారు.
అడవి గుండా తన మార్గంలోని డివైజ్ల వద్దకు వెళ్లేందుకు కూప్కు, ఆయన బృందానికి జీపీఎస్ యాప్ మార్గనిర్దేశం చేస్తుంది.
ప్రతి డివైజ్ దగ్గర ఆయన ఎలుకలకు ఎర వేసే పదార్థాన్ని ఉంచారు. ఆ సమాచారాన్ని యాప్లో అప్డేట్ చేశారు.

అయితే, ఏ డివైజ్ కూడా ఎలుకలు వచ్చి వాటిని తిన్న సంకేతాలను తెలియజేయలేదు.
కానీ, పక్షుల రెట్టలు, ఇతర ఆనవాళ్ల కోసం ఆయన వెతుకుతున్నప్పుడు, కూప్ ఫోన్ వైబ్రేట్ అయింది.
వీరి గ్రూప్లోని ఒక వ్యక్తి తమ వాట్సాప్ గ్రూప్లో ఒక ఫోటో పోస్ట్ చేశారు. వారి వలలో చిక్కుకుపోయి చచ్చిపోయిన ఎలుకకు సంబంధించిన ఫోటో అది.
కానీ, ఇది స్వాగతించదగ్గ విషయం కాదు.
‘‘దాన్ని పట్టుకున్నందుకు డేవ్ చాలా సంతోషంగా భావిస్తున్నారు. కానీ, ఇంకా ఎలుకలు ఉన్నందుకు మేం చాలా బాధపడుతున్నాం’’ అని కూప్ నిట్టూర్చారు.
ఎలుకలను, ఇతర వేటాడే జంతువులను నిర్మూలించడం కేవలం మిరామార్ లక్ష్యం మాత్రమే కాదు, మొత్తం న్యూజీలాండ్ లక్ష్యం.

ఫొటో సోర్స్, Getty Images
2050 నాటికి ఎలుకలన్ని ఏరివేయాలనే లక్ష్యం
2050 నాటికి ఈ పనిని పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇది చాలా పెద్ద పని. కానీ, సౌత్ అట్లాంటికాలోని 170 కి.మీల పొడవైన దక్షిణ జార్జియాలో ఇప్పటికే ఎలుకలన్నింటిని తొలగించిన ప్రక్రియ పూర్తయింది.
బ్రిటన్ కంటే అతిపెద్ద ప్రాంతమైన దీనిలో కూడా నిర్దేశించుకున్న సమయం కల్లా సాధిస్తామని న్యూజీలాండ్ పరిరక్షకులు భావిస్తున్నారు.
కానీ, కొందరు మాత్రం నైతిక, ఆచరణాత్మక సమస్యలను లేవనెత్తుతున్నారు.
ఈ ప్రాజెక్ట్ మూలాధారం ఆ ప్రాంతంలో ఉండే ప్రత్యేకమైన జీవావరణ వ్యవస్థనే.
తన పురాతన ఉపఖండం నుంచి 85 మిలియన్ ఏళ్ల క్రితమే న్యూజిలాండ్ విడిపోయింది.
అంతేకాక, మనుషులు చివరిగా స్థిరపడిన ప్రాంతం న్యూజిలాండ్. 13వ శతాబ్దంలో పాలినేషియన్లకు ఇక్కడకు ఎలుకలను, పసిఫిక్ ఎలుకలను తీసుకొచ్చారు.
6 శతాబ్దాల తర్వాత, పక్షులకు రక్షణ లేకుండా వాటిని చంపి తినే పెద్ద వన్య ప్రాణులను యూరోపియన్లు ఇక్కడ ప్రవేశపెట్టారు.
న్యూజీలాండ్లో మనుషులు స్థిరపడిన తర్వాత అక్కడ జీవావరణంలోని మూడోవంతు స్థానిక జాతులు కనిపించకుండా పోయాయి.
ఒక దాన్ని రక్షించడం కోసం మరోదాన్ని నిర్మూలించడం ఇప్పుడు కొత్తగా జరుగుతున్న ప్రక్రియ కాదు.
1960ల్లోనే, పర్యావరణ పరిరక్షకులు చిన్న ఆఫ్షోర్ దీవుల నుంచి ఎలుకలను పూర్తిగా తొలగించారు.
కానీ, 2010 వరకు వేటాడే జంతువులను పట్టుకోవడం అనేది ఒక సామాజిక అంశంగా పరిగణించలేదు.
కానీ, ఆ తర్వాత ఇది బాగా పెరిగి, జాతీయ ఉద్యమంగా మారిందని ఆక్లాండ్ యూనివర్సిటీ బయోలజిస్ట్, 2050 ప్రాజెక్ట్ చాంపియన్ జేమ్స్ రస్సెల్ చెప్పారు.

న్యూజీలాండ్ ఎలుకల ఏరివేత ప్రణాళిక
ఇన్ఫ్రేరెడ్ కెమెరాల వచ్చిన తర్వాత చాలా విషయాలు తెలిశాయని ఆక్లాండ్ యూనివర్సిటీ బయోలజిస్ట్, 2050 ప్రాజెక్ట్ చాంపియన్ జేమ్స్ రస్సెల్ అన్నారు.
పక్షుల గుడ్లను, వాటి పుట్టిన పిల్లల్ని తింటున్న ఎలుకల ఫోటోలు బాగా షేర్ అయ్యాయి.
ఆ ఫుటేజీ చాలా షాకింగ్కు గురి చేసిందని రస్సెల్ చెప్పారు.
వేటాడే జంతువుల బారిన పడిన న్యూజీలాండ్ ప్రతి సంవత్సరం 26 మిలియన్ల పక్షులను కోల్పోతుందని ఆ సమయంలో ఈ పర్యావరణ వేత్త గుర్తుకు చేసుకున్నారు.
వేటాడే జంతువుల నుంచి దేశానికి పూర్తిగా విముక్తి కల్పించాలని 2011లో ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త సర్ పాల్ కలాఘాన్ చెప్పారు.
అయితే, తగినంత పెట్టుబడి, మొబెలైజేషన్ ద్వారానే ఇది సాధ్యమవుతుందని రస్సెల్, ఇతర యువ పర్యావరణ పరిరక్షణ పరిశోధకులన్నారు.
ఆ తర్వాత వీటి ఏరివేతకు రాజకీయ నాయకులు కూడా కంకణం కట్టుకున్నారు.
2016లో ఒక చట్టం రూపొందించారు. దీనిలో మూడు రకాల ఎలుకలు పసిఫిక్ ఎలుక, షిప్ ఎలుక, నార్వే ఎలుకతో పాటు మరికొన్ని వేటాడే జంతువులను ఏరివేయాలని నిర్ణయించారు.
వీటిని జీవావరణం నుంచి తీసేందుకు 2050ను లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
ఏరివేత వ్యూహాలను పరీక్షించి స్థానిక ప్రాజెక్ట్లకు ప్రభుత్వం, ప్రైవేట్ డబ్బును అందజేసేందుకు ఒక ప్రభుత్వ సంస్థ ప్రిడేటర్ ఫ్రీ 2050 లిమిటెడ్ కూడా ఏర్పాటైంది.
ప్రిడేటర్ ఫ్రీ వెల్లింగ్టన్ అనేది వీరి ప్రతిష్టాత్మకమైన లక్ష్యం.

ఫొటో సోర్స్, Getty Images
ఎలుకలకూ శవ పరీక్ష
2 లక్షల మంది జనాభా ఉన్న ఈ నగరం, పట్టణ వాతావరణాల్లో పెరిగే ఎలుకలు, ఇతర కీటకాలను చంపాలన్నది లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ ప్రాజెక్ట్కు చెందిన 36 స్ట్రాంగ్ టీమ్ అనేది ఎలుకలు పట్టుకోవాలనుకున్న ఔత్సాహికులను, అసలైన వినాశకదారులుగా మార్చింది.
ఎలుకలను చంపేందుకు ఉచ్చుల కంటే అత్యంత సమర్థవంతంగా పనిచేసే విషాన్ని వారికి అందించింది.
అంతేకాక రియల్ టైమ్లో ప్రతి పరికరానికి సంబంధించిన సమాచారాన్ని భద్రపరిచేందుకు జీపీఎస్ యాప్ను కల్పించారు.
హాట్స్పాట్లలో కెమెరాలను ఏర్పాటు చేశారు.
‘‘ఒకవేళ ఏదైనా ఎలుక కనిపించినట్లయితే, వాటిని పట్టుకునేందుకు అవసరమైన పరికరాలను ఎక్కడ పెట్టాలో మా ప్లానింగ్ టీమ్కి తెలుసు ’’ అని ప్రిడేటర్ ఫ్రీ వెల్లింగ్టన్ డైరెక్టర్ జేమ్స్ విల్కాక్స్ తెలిపారు.
చనిపోయిన ప్రతి ఎలుకను కూడా శవపరీక్ష కోసం ల్యాబ్కి పంపిస్తారు.
ఇది చాలా ముఖ్యమైంది, ఎందుకంటే మళ్లీ పుట్టకుండా వాటిని నిర్మూలించేందుకు దీన్ని ఉపయోగించనున్నారు.
ఎలుకలు చాలా తెలివైన జంతువులు. ఎందుకంటే, వాటికి హానీ కలిగించే వాటి నుంచి తప్పించుకోవడం ఎలానో అవి ముందే నేర్చుకుంటాయి.
ఎర పెట్టేలోని విషం తిని ఎలుకలు చనిపోవడంతో, వాటిని జాగ్రత్తగా పర్యవేక్షించేందుకు ప్రిడేటర్ ఫ్రీ వెల్లింగ్టన్ శవపరీక్షలు నిర్వహించాల్సి ఉంది.
‘‘విషపూరితం వల్లనే ఇది చనిపోయిందా లేదా తెలుసుకునేందుకు మేం వాటిని కోసి చూస్తాం. ఇది మగదా? లేదా ఆడదా? ఇటీవల పునరుత్పత్తి చేసింది? మేం ఒక ఎలుకను లేదా ఎలుకల కుటుంబాన్ని చేజ్ చేస్తున్నామా? తెలుసుకునేందుకు వీటికి శవపరీక్ష చేయడం అత్యంత అవసరం’’ అని విల్కాక్స్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
సొంత గూటికి చేరుకుంటున్న పక్షులు
వేటాడే జంతువులను చంపడంలో మిరామార్ ముందంజలో ఉంది.
పెనిన్సులాలో ప్రస్తుతం ఎలుకలు అరుదుగా మారాయి. చాలా స్థానిక పక్షులు తిరిగి వాటి సొంత గూటికి చేరుకుంటున్నాయి.
1990ల్లో కేవలం కొన్ని జంటలు మాత్రమే ఉన్న టుయ్ పక్షి, ఇప్పుడు మళ్లీ దాని గూటికి వచ్చేస్తోంది.
‘‘మా ఇంటి వెనుకాలనున్న గార్డెన్లో ఇప్పుడు రోజంతా టుయ్ పక్షులు ఎగురుతున్నాయి.’’ అని మిరామార్ వాసి పౌల్ హే చెప్పారు.
పక్షి జీవితం మళ్లీ ఎగరడం ప్రారంభించింది, ముఖ్యంగా గత ఐదేళ్లలో పక్షులు మా ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పారు.
వెల్లింగ్టన్లో అంతకుముందు చేపట్టిన పర్యావరణ పరిరక్షణ విధానం: ప్రిడేటర్ ప్రూఫ్ ఫెన్సింగ్ ద్వారా కూడా ఈ నగరం ప్రయోజనాలను పొందింది.
టుయ్ పక్షి ఎగిరేందుకు అనువుగా నగర కేంద్రానికి మైలు దూరంలో 1999లో పట్టణంలో తొలి పర్యావరణ అభయారణ్యాన్ని ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం దీన్ని జీలాండియాగా పిలుస్తున్నారు. ఇది 8 కి.మీల కంచె సంరక్షణలో ఉంది. దీన్ని సందర్శించడానికి వచ్చే వారి బ్యాగులను సునిశితంగా పరిశీలించిన తర్వాతనే అనుమతిస్తారు. ఎయిర్లాక్ను పోలి ఉండే రెండు డోర్ల బారియర్ గుండానే వారిని లోపలికి అనుమతిస్తారు.
ఇలాంటి కఠినమైన బయోసెక్యూరిటీ చర్యలతో, ఒకప్పుడు అరుదుగా మనుగడ సాధించిన ఈ పక్షులు ప్రస్తుతం నిలదొక్కుకోవడమే కాకుండా, ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నాయి.
న్యూజీలాండ్లో ఇలా పెన్సింగ్ వేసిన అభయారణ్యాలు డజన్ల కొద్ది ఉన్నాయి. దీనిలో అతి పెద్దది బ్రూక్. ఇది 700 హెక్టార్లలో ఉంది. దక్షిణ ద్వీపకల్పం నెల్సన్లో ఉన్న జీలాండియా కంటే ఇది మూడు రెట్లు పెద్దది.
2016లో వేటాడే జంతువుల నుంచి రక్షణ కల్పించేలా ఈ కంచెను ఏర్పాటు చేసిన ఏడాది తర్వాత, ఈ ప్రాంతమంతా కీటకాల బారి నుంచి విముక్తి పొందింది.
ప్రస్తుతం దీనిలోకి ఎవరూ ప్రవేశించకుండా చూసుకోవడమే అతిపెద్ద సవాలు.
నిరంతర పర్యవేక్షణ అవసరం. పక్షిని వేటాడుతూ ఎలుకలు ఒక్కోసారి ప్రమాదవశాత్తు దీనిలో పడిపోవచ్చు. కంచెపై చెట్లు పడొచ్చు, ఇలా జరిగినప్పుడు ఏదైనా లోపలికి వెళ్లేందుకు ప్రవేశం ఉంటుంది.
కంచెకు ఏదైనా నష్టం జరిగితే, వార్నింగ్ సిస్టమ్ ఉంటుంది. ‘‘ఒకవేళ రాత్రి పూట అలారం మోగితే, మాలో ఎవరో ఒకరు లేచి వెళ్లి, దాన్ని చూసొస్తాం’’ అని బ్రూక్ ఆపరేషన్స్ మేనేజర్ నిక్ రాబ్సన్ తెలిపారు.
కెమెరాలు, ఇంక్ప్యాడ్లు ఏదీ లోపలికి చొరబడకుండా అలర్ట్ చేస్తుంటాయి. కానీ, వేటాడే జంతువుల బద్ద శత్రువే మనుషుల మంచి స్నేహితుడు.
‘‘కొన్ని కీటకాలను గుర్తించేందుకు కుక్కలకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తుంటాం’’ అని రాబ్సన్ చెప్పారు. తమ డివైజ్లు కనుగొనలేని ప్రాంతాల్లో ఉన్న ఎలుకలను కుక్కలు గుర్తించగలవని అన్నారు.

ప్రస్తుతం ఆఫ్షోర్ ద్వీపాలకు ఈ వేటాడే జంతువులను తిరిగి రానీయకుండా చేయడం ఆందోళనకరమైన విషయం.
రకియురా లేదా స్టీవార్ట్ ఐల్యాండ్ దీనిలో అతిపెద్దది. ప్రధాన భూభాగం నుంచి 25కి.మీల నీటితో ఈ ద్వీపకల్పం విడిపోయింది. దీనిలో ఎలుకలున్నాయి. కానీ వేటాడే జంతువులు చాలా తక్కువ.
దీంతో అరుదైన పక్షలు అక్కడ గూళ్లు ఏర్పాటు చేసుకునేందుకు అనుగువుగా ఉంటుంది. ఈ పక్షులను కాపాడుకునేందుకు పర్యావరణవేత్తలు చాలా కృషి చేస్తున్నారు.
గత 20 ఏళ్లుగా స్టీవార్ట్ ఐల్యాండ్/రకియురా కమ్యూనిటీ అడ్ ఎన్విరాన్మెంటల్ ట్రస్ట్(సర్సెట్) అనే ఒక వాలంటరీ గ్రూప్ మట్టన్ బర్డ్స్(ఒక రకమైన పక్షులు) కాలనీని నాశనం చేయకుండా ఎలుకలను, ఇతర వేటాడే జంతువులను నిర్మూలిస్తుంది.
ఈ పక్షులు ప్రస్తుతం ప్రధాన భూభాగంలో కనిపించడం లేదు.

ఎలుకలు పట్టిస్తే బహుమతులు
ఇప్పటికే వేటాడే జంతువుల నుంచి విముక్తి పొందిన దగ్గర్లోని చిన్న ద్వీపకల్పాలను రక్షించడం అత్యంత అవసరం. ఎలుకలు 800 మీటర్ల వరకు ఈదగలవు.
వీటిని ఈ అభయారణ్యాల నుంచి దూరంగా ఉంచాలి. అంతరించిపోతున్న పక్షులకు ఆశ్రయం కల్పించడం నిరంతరం పోరాటంగా మారింది.
ప్రభుత్వ డబ్బులు సాయం చేశారు. 2050 స్కీమ్ కింద ఏర్పాటు చేసిన ప్రిడేటర్ ఫ్రీ రకియురా ప్రాజెక్ట్ నిపుణులైన సిబ్బందిని అందించడమే కాకుండా, సెల్ఫ్ రీలోండింగ్ ట్రాప్ వంటి సాధనాలను అందిస్తుంది.
ఇవి ఏమైనా ఎలుకలు ఆ దీవి వైపుకి వచ్చినట్లు కనిపిస్తే, వెంటనే వాటిని క్రష్ చేస్తాయి. వీటికి అంతగా నిర్వహణ కూడా అవసరం లేదు.
ప్రిడేటర్ ఫ్రీ వెల్లింగ్టన్ బడ్జెట్కు చాలా దూరంలో ప్రిడేటర్ ఫ్రీ రకియురా ఉంది. కానీ, దేశంలోని ఇతర ప్రాంతాలు స్థాయిలో ఈ ప్రాజెక్ట్ ప్రజాదరణ పొందుతుందని స్థానిక పరిరక్షకులు చెప్పారు.
2020-21లో దీని కోసం 261 మంది తమ సమయాన్ని కేటాయించారని సర్సెట్ చెప్పింది.
440 నివాసితులున్న ఈ ద్వీపకల్పానికి మొబైలేషన్ రేటు కూడా బాగా పెరిగిందన్నారు.
గత ఏడాది ఈ ప్రాంతంలోని స్కూల్ పిల్లలకు ఎలుకలను పట్టే వాటిని పంపిణీ చేశారు. ఎవరైతే ఎక్కువ ఎలుకలు, పెద్ద ఎలుక, పెద్ద దంతం ఉన్న ఎలుకను పట్టుకుంటారో వారికి బహుమతులు కూడా ఇచ్చారు.
ఈ ద్వీపకల్పంలో బాధ్యతాయుతమైన పెంపుడు జంతువుల యాజమాన్యాన్ని కూడా సర్సెట్ ప్రోత్సహిస్తుంది.
పక్షులను చంపే పిల్లులు ప్రస్తుతం ఆ ద్వీపకల్పంలో ఏరివేత ప్రక్రియ నుంచి బయటపడ్డాయి. ఎందుకంటే, గత దశాబ్దం నుంచి పరిరక్షణ, పిల్లుల సంక్షేమ సమూహాలు అన్ని కూడా పిల్లుల సంఖ్యపై బహిరంగ చర్చ చేపట్టాయి.
వారంతా పెంపుడు పిల్లులకు మైక్రోచిప్ అమర్చడం, కుటుంబ నియంత్రణ చికిత్స అవసరమయ్యే నేషనల్ క్యాట్ యాక్ట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టాలని కోరాయి.

2050 ప్రాజెక్ట్ సాధ్యాసాధ్యాలపై చర్చ
మొత్తం 2050 ప్రాజెక్ట్ సాధ్యాసాధ్యాలు పర్యావరణ పరిరక్షకుల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
ఆచరణాత్మకత, ఖర్చు వ్యవహారాలపై ఇది ఆధారపడి ఉంటుందని జీలాండియా వ్యవస్థాపకులు జేమ్స్ లించ్ చెప్పారు.
వేటాడే జంతువులును చంపేయడమే తమ తుది లక్ష్యమని చెప్పారు. కానీ ఈ సమయంలో తమ వద్ద ఎలాంటి సాధనాలు లేవని, అదే తమ అతిపెద్ద సమస్య అని లించ్ అన్నారు.
చాలా స్థానిక పక్షులకు అవి బతికేందుకు జీరో ప్రిడేటర్ పర్యావరణమే అవసరం లేదని, కొన్నింటికి మాత్రమే అలా కావాలని అన్నారు. ఆఫ్షోర్ లేదా అర్బన్ అభయారణ్యాలలో ఇవి బతకగలని పేర్కొన్నారు.
దేశమంతా కీటకాలను తొలగించడానికి బదులు, పక్షులను కాపాడేందుకు వాటి మనుగడను పెంచేందుకు కంచె చుట్టూ ఉన్న ప్రాంతంలో బాగా చెట్లను పెంచే వనరులపై దృష్టిపెట్టాలని లింక్ ప్రతిపాదించారు.
ఈ విధానం వెల్లింగ్టన్లో పనిచేసిందని అన్నారు.
ప్రిడేటర్ ఫ్రీ న్యూజీలాండ్ కోసం తీసుకునే ప్రతి ఆలోచన విచిత్రమైనదిగా కొందరు జీవ పరిరక్షకులు బావిస్తున్నారు.
అయితే, గత 150 ఏళ్లలో కుందేళ్లు, జింకలు, ఇతర కీటకాలపై జరిపిన ప్రతి యుద్ధంలో న్యూజీలాండ్ ఓడిపోయిందని పరిరక్షణా పరిశోధకుడు వేన్ లింక్లేటర్ తెలిపారు.
తెలివైన జంతువుల కోసం తీసుకొచ్చే కార్యక్రమాలు కేవలం పనికి రాకపోవడమే కాక, నైతికంగా తప్పుదోవ పట్టించే రీతిలో ఉంటాయని లింక్లేటర్ చెప్పారు.
ప్రిడేటర్ ఫ్రీ మూవ్మెంట్, కీటకాలను మనం చిత్రీకరించే విధానంపై, దానికి శత్రువులను ఏర్పాటు చేసే విధానంపై ఆధారపడి ఉంటుంది. అప్పుడే మనం వాటిని చంపగలమని అన్నారు.
అంతేకాకుండా, వేటాడే జంతువులపై అత్యంత ఎక్కువగా దాడి చేసే, వాటి నివాసాలను క్రమంగా నాశనం చేసే హోమో సేపియన్స్ ఎవరు?

అసాధ్యమైన లక్ష్యాలను నిర్దేశించుకోవడం కంటే, తమ సొంత జీవవైవిధ్యాలను గుర్తించేందుకు కమ్యూనిటీలకు సాయపడాలని లింక్లేటర్ ప్రతిపాదించారు.
ఆక్లాండ్ నివాసితులు కొన్ని ఎలుకలు, కొన్ని రకాల జీవులతో కలిసి బతకొచ్చు. అయితే స్టీవార్ట్ ద్వీపవాసులు తమ కివీస్, మటన్బర్డ్లను రక్షించడానికి ప్రాధాన్యత ఇవ్వొచ్చు.
స్థానీకరించిన విధానాలు తప్పుడవిగా 2050 ప్రాజెక్ట్కి శాస్త్రీయ పరంగా ఎక్కువ మద్దతు ఇస్తోన్న బయోలజిస్ట్ జేమ్స్ రస్సెల్ అన్నారు.
కొన్ని ప్రాంతాల్లో పక్షులను సంరక్షించడం తప్పుడు ఆర్థికవ్యవస్థగా పేర్కొంటున్నారు.
వేటాడే జంతువులు తిరిగి రాకుండా చేసేందుకు శాశ్వత పెట్టుబడి అవసరమంటున్నారు. ఏరివేత ప్రక్రియ చాలా ఖర్చుతో కూడుకున్నది, కానీ ఒకసారి చెల్లిస్తే, అది పూర్తవుతుందన్నారు.
ఆ పనిని ఎలా పూర్తి చేయాలో ఇంకా ఎవరికీ తెలియదని రస్సెల్ ఒప్పుకున్నారు. అయితే, కీటకాల నియంత్రణ సాంకేతికత 1960ల నుంచి మంచి పురోగతి సాధించింది.
నిరంతర పెట్టుబడి తదుపరి 27 సంవత్సరాలలో ఏం సాధించగలదో ఎవరికి తెలుసు? అన్నారు.
నైతిక అభ్యంతరాల విషయంలో ప్రస్తుతం ఎలాంటి వేగవంతమైన సమాధానాలు లేవు. ఇదంతా వ్యక్తులు, సమాజాల వాదనలకు అనుగుణంగానే ఉంటుంది.
కొన్నింటిన్ని రక్షించుకోవడం కోసం కొన్ని కీటకాలను, క్షీరదాలను త్యాగం చేయాల్సి వస్తుందని న్యూజీలాండ్ వాసులు నిర్ణయించుకున్నారని రస్సెల్ చెప్పారు.
మిరామార్ పెనిన్సులా విషయానికి వస్తే, డాన్ కూప్, ఆయన బృందంలోని ఇతర వ్యక్తులకు ఎలుకలను పట్టుకుని చంపే వరకు రోజు గడవదు.
ఇవి కూడా చదవండి
- గృహలక్ష్మి పథకం: రూ. 3 లక్షలతో ఇంటి నిర్మాణం సాధ్యమేనా? బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం చెప్పింది,
- టైటానిక్ మునిగిపోయిన చోట సముద్రం ఎందుకంత ప్రమాదకరంగా ఉంటుంది?
- ‘ఆక్సిజన్ అయిపోతుంటే కార్బన్ డయాక్సైడ్ రక్తంలో చేరి హైపర్కాప్నియాతో స్పృహ కోల్పోతారు’
- టైటానిక్: 111 ఏళ్ల కిందట మునిగిపోయిన ఈ ఓడలోని 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
- జలాంతర్గామిలో వెళ్లి టైటానిక్ చూసొచ్చిన ఈ యూట్యూబర్ 'టైటాన్ అదృశ్యం'పై ఏమంటున్నారంటే..
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)














