న్యూజీలాండ్‌కు తలనొప్పిగా మారిన 'పిల్లి', ఇంతకూ ఏం చేసింది?

పిల్లి

ఫొటో సోర్స్, Hanh Pham/EyeEm/Getty Images

    • రచయిత, స్టీఫెన్ డౌలింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

న్యూజీలాండ్‌లో పక్షిజాతుల వైవిధ్యం అపారంగా కనిపిస్తుంది. ఒక ప్రాణిని మరొక ప్రాణి చంపి తినే ఆహారపు నిచ్చెనలో పైన ఉండే జంతువులు లేకపోవడమే ఈ వైవిధ్యానికి కారణం.

అయితే, పిల్లుల రాకతో పరిస్థితి మారిపోయింది. ఇక్కడ పక్షి జాతులు అంతరించడంలో పిల్లులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.

కాబట్టి, ఇప్పుడు పిల్లులను ఆదరించే విధానంలో న్యూజీలాండర్లను తమ వైఖరిని మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

లియాల్స్ రెన్ అనే జాతి పక్షులు చాలా తరాలుగా న్యూజీలాండ్ మారుమూల ప్రాంతంలో దక్షిణ పసిఫిక్ సముద్రం దిగువన ఉండేవి. అదంతా వేటగాళ్లయిన క్షీరదాలు లేని ప్రాంతం.

మావోరీ తెగ పూర్వీకులు 13 శతాబ్దంలో ఈ నేల మీదకు అడుగుపెట్టడంతో ఇక్కడ జన జీవనం మొదలైంది. ఆ సమయంలో ఇక్కడ ఎగరలేని చిన్న పక్షులు ఉండేవి. తమను ఆహారంగా వేటాడే ప్రాణుల నుంచి రక్షించుకునే శక్తి కూడా వాటికి ఉండేది కాదు.

ఇక, యూరప్ వలసదారులు ఇక్కడికి వచ్చేనాటికి, అంటే 19వ శతాబ్దం ప్రారంభంలోనే ఆ పక్షి రెండు ప్రధాన దీవుల్లో అంతరించిపోయింది.

స్టీఫెన్స్ అనే ఒక చిన్న దీవిలో మాత్రమే కొన్ని పక్షులు మిగిలాయి. న్యూజీలాండ్ కుక్ స్ట్రెయిట్ దక్షిణ ప్రాంతంలో ఉండే చిన్న దీవి అది.

1894వ ఏడాది స్టీఫెన్స్ ద్వీపంలో లైట్‌హౌస్‌ ఏర్పాటు తర్వాత లియాల్స్ రెన్ గురించిన సమాచారం యూరోపియన్ సైన్స్‌ విభాగాలకు తెలిసింది.

అయితే, లైట్‌హౌస్ కీపర్లు కొందరు అక్కడికి పిల్లులను తీసుకువచ్చారు. వాటిలో ఒకదాన్ని "టిబుల్స్" అని పిలిచేవారు. ఇది త్వరగా సంతానం ఉత్పత్తి చేసింది.

ఏడాదిలోనే ఆ పిల్లులు లియాల్స్ రెన్‌ జాతి పక్షులను తుడిచిపెట్టాయి.

న్యూజీలాండ్ విలక్షణమైన స్థానిక పక్షి జాతులు మిలియన్ల సంవత్సరాల తర్వాత మహాఖండం గోండ్వానా వేరైనప్పటి నుంచి బాగానే బతికాయి.

దేశానికి చిహ్నంగా మారిన కివి పక్షులు చాలా వరకు ఎగరడం మర్చిపోయాయి.

తమను వేటాడే జంతువులు వచ్చేనాటికి న్యూజీలాండ్ స్థానిక పక్షి జాతులు ఆ పరిణామాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా లేవు. ఈ సమస్యను అధిగమించడానికి న్యూజీలాండ్ దీనిపై దృష్టిపెట్టింది.

పిల్లి

ఫొటో సోర్స్, JordiStock/Getty Images

జాతీయ పిల్లి చట్టం కోసం ఎందుకు ఒత్తిడి చేస్తున్నారు?

శతాబ్దానికి పైగా ఈ పక్షిని సంరక్షించే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దానిలో ప్రిడేటర్ ఫ్రీ 2050 అనే కార్యక్రమం ఒకటి. ఈ ప్రణాళికలో ఎలుకలు, స్టోట్స్, ఫెర్రెట్‌లు, వీసెల్స్, పాసమ్స్ లాంటి జాతులను నిర్మూలించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

అయితే ఒక జంతువును మాత్రం ఈ జాబితాలోకి చేర్చలేదు. అవే ఫెరల్ (అడవి) పిల్లులు. అది పొరపాటేనని, దానిని కూడా జాబితాలో చేర్చాలని ఈ ఉద్యమ ప్రచారకులు డిమాండ్ చేస్తున్నారు.

కొన్ని గ్రూపులు నేషనల్ క్యాట్ మేనేజ్‌మెంట్ యాక్ట్ కోసం ఒత్తిడి చేస్తున్నాయి.

ఇక ఇప్పుడు పిల్లులను పెంచుకోవడంలో న్యూజీలాండ్ కుటుంబాలకు అనేక సందేహాలు మొదలయ్యాయి.

ఇంట్లో పెంచుకునే పిల్లులను బయటకు రాకుండా కట్టడి చేయాలా అన్నది ప్రధానమైన ప్రశ్న.

పిల్లలను పెంచుకునే వారిలో ప్రపంచంలోనే అత్యధిక సగటు న్యూజీలాండ్‌ది. ఆ దేశంలో దాదాపు సగం ఇళ్లల్లో కనీసం ఒక పిల్లి ఉంటుంది.

ఉదాహరణకు నా సిస్టర్ ఒకరు న్యూజీలాండ్ రాజధానికి దగ్గర్లోని కల్-డి-సాక్‌లో నివసిస్తున్నారు.

పిల్లలు, పిల్లులు ఆడుకోవడానికి కావలసిన మంచి రోడ్లున్న ప్రాంతం అది. ఆమె కుటుంబంలో జో అనే పిల్లి ఉంది. ఇరుగు పొరుగువారి దగ్గర కూడా పిల్లులు ఉన్నాయి.

సమీపంలోని కొండలపై చాలా ఎకరాల్లో పొదలు, స్థానిక బుష్‌లతో పాటు పెద్ద తోటలు ఉన్నాయి. ఇవి పిల్లులు విహరించడానికి చాలా అనువైన ప్రాంతాలు. దీంతో అవి తరుచుగా బయటికి వస్తుంటాయి.

పిల్లులపై న్యూజీలాండ్ వాసులకు ఎంత ప్రేమంటే, అవి పగటి పూట స్వేచ్ఛగా తిరగడానికి ఆరుబయట చాలా స్థలాన్ని వదిలిపెడతారు.

నా సోదరి వీధిలోని పిల్లులు దేశంలోని 88 శాతం పిల్లుల మాదిరిగా సంతానం కనకుండా చికిత్స చేసినవే.

అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఈ రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ ఇవి పూర్తిగా సంతానం కనలేనివి మాత్రం కాదు.

కొన్ని ప్రాంతాల్లో పిల్లులు కుటుంబ నియంత్రణ చేయడానికి ముందు పిల్లలను కనొచ్చు.

పిల్లులలో కేవలం 12 శాతం మాత్రమే సంతానోత్పత్తి చేస్తున్నప్పటికీ, వాటి సంఖ్య పెరుగుతూనే ఉంది.

పక్షులు

ఫొటో సోర్స్, Jason Hosking/Getty Images

ఏ జాతుల అంతానికి పిల్లులు కారణమయ్యాయి?

న్యూజీలాండ్‌లో ఎన్ని అడవి పిల్లులు ఉన్నాయో ఎవరికీ తెలియదు, కానీ వాటి సంఖ్య 25 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. దేశంలోని ప్రతి ఇద్దరు వ్యక్తులలో ఒకరు పిల్లిని పెంచుకుంటారు.

అడవి పిల్లులు పర్వతాల నుంచి తీర ప్రాంతాల వరకు వలస వచ్చేశాయని రాయల్ ఫారెస్ట్, బర్డ్ ప్రొటెక్షన్ సొసైటీకి చెందిన అమేలియా గేరీ అన్నారు.

పల్లెల్లో ఆకలితో ఉన్న జంతువులు చాలా ఉన్నాయి. పిల్లులు సహజంగా ఓపికగా వేటాడతాయి. ఇవి న్యూజీలాండ్‌లో ఎగరలేని పక్షుల సంతతిపై అధిక ప్రభావాన్ని చూపాయి.

"అవి 11 పక్షి జాతులను అంతం చేశాయి. మరో 10 జాతుల నాశనమయ్యే పరిస్థితికి కారణమయ్యాయి" అని అమేలియా గేరీ చెప్పారు.

"ఇప్పుడు మిగిలిన వాటిని తినడానికి సిద్ధమయ్యాయి. వాటిలో బల్లులు, సకశేరుకాలు, అంతరించిపోతున్న స్థానిక గబ్బిలాలు ఉన్నాయి.

పెంగ్విన్ లను తింటున్నట్లు ఆధారాలు కూడా ఉన్నాయని అమేలియా అంటున్నారు. కొండపైన ఉన్న బల్లులను కూడా తింటున్నాయి.

ఈ దేశంలో అమెరికా మాదిరి యురేషియన్ క్రేన్ పక్షిలా ఒక జాతి అంతరించినప్పుడు, కొత్త సంతతి ప్రారంభించడానికి జర్మనీకి వలసపోయే విధానం దానికి లేదు.

ప్రతి సంవత్సరం 1.1 మిలియన్ల స్థానిక పక్షులు, వలసవచ్చిన పది మిలియన్ల పక్షుల మరణానికి అడవి పిల్లులు కారణమని రాయల్ ఫారెస్ట్, బర్డ్ ప్రొటెక్షన్ సొసైటీ అంచనా వేసింది.

చిలుక, కాకాపో వంటి పక్షులు మాత్రం మనుగడ సాగించాయి. ఎందుకంటే అవి సంతానోత్పత్తి సంఖ్య తగ్గిపోకముందే ఇతర ద్వీపాలకు తరలిపోయాయి.

సముద్రపు జంతువులూ అంతరిస్తున్నాయా?

ఇప్పుడు ప్రమాదంలో ఉన్నవి చిన్న పక్షులు లేదా నెమ్మదిగా కదిలే పక్షులు మాత్రమే కాదు.

న్యూజీలాండ్‌లోని మంచుతో కూడిన ఎత్తైన ప్రదేశంలో కొన్నిసార్లు గొర్రెలను వేటాడే బలమైన ఆల్పైన్ చిలుక అయిన 'కీ'ల సంఖ్య భారీగా తగ్గడానికి పిల్లులూ కారణంగా చెబుతున్నారు.

పిల్లుల వేటకు పక్షులు బలవుతాయని జంతు సంరక్షణ సంస్థ ప్రిడేటర్ ఫ్రీ న్యూజీలాండ్ ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జెస్సీ మోర్గాన్ అంటున్నారు.

‘‘చాలా పక్షులు ఎగరలేవు. అవి గూడు కట్టుకుని నేలపై పరిగెడుతాయి. పిల్లులే ఇక్కడ పెద్ద మాంసాహారులు’’ అని ఆమె అన్నారు.

జెస్సీ ఇటీవల న్యూజీలాండ్‌లోని అత్యంత ప్రజాదరణ పొందిన రిమోట్ – హైకింగ్ ట్రాక్‌లలో ఒకటైన మిల్‌ఫోర్డ్ ట్రెక్‌లో ప్రయాణించారు. అక్కడ కూడా తిరుగుతున్న పిల్లులను చూసి ఆశ్చర్యపోయారు.

"మేం పడవలో అక్కడికి చేరుకోవలసి వచ్చింది. పిల్లి అక్కడికి వెళ్లే ఏకైక మార్గం ఈ భారీ పాస్ మీదుగా ఉంది. ఈ వాతావరణంలో వాటిని చూడటం చాలా భయంగా అనిపించింది" అని అన్నారు జెస్సీ.

ఈ పిల్లులు ప్రభావం అక్కడికే పరిమితం కాలేదు. న్యూజీలాండ్ సముద్ర వాతావరణంలో కూడా అడవి పిల్లుల సంతతి ప్రభావం కనిపిస్తోందని రాయల్ ఫారెస్ట్ అండ్ బర్డ్ ప్రొటెక్షన్ సొసైటీకి చెందిన అమీలియా గెరీ అన్నారు.

టాక్సిప్లాస్మా లేదా టాక్సోలు పరాన్నజీవులు. అడవి పిల్లుల నుంచి అవి ఇతర ప్రాంతాలకు విస్తరిస్తాయి. ఇది అక్కడి దేశీయ డాల్ఫిన్ జాతుల మరణాలపై కూడా ప్రభావం చూపించిందని గెరీ చెప్పారు.

ఒక పిల్లి ప్రవాహానికి సమీపంలో మలవిసర్జన చేస్తే, వరదలు వచ్చినప్పుడు ఆ తిత్తులు సముద్రంలోకి కొట్టుకుపోతాయి. తర్వాత అవి ఇతర జంతువుల శరీరంలోకి ప్రవేశిస్తాయి.

అందుకే కేవలం అడవి పిల్లుల సంఖ్య నియంత్రణ మాత్రమే ఆయా పరిరక్షణ గ్రూపులు కోరడం లేదు.

యజమానులు ముఖ్యంగా న్యూజీలాండ్ వాసులు తమ పిల్లులు ఎలా జీవించాలో పునరాలోచించాలని కోరుకుంటున్నారు.

అవి దేశం విస్తృత సహజ పర్యావరణంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలంటున్నారు.

పక్షి

ఫొటో సోర్స్, Liu Yang/Getty Images

పిల్లుల నియంత్రణపై చట్టాలు ఉన్నాయా?

గత దశాబ్దం నుంచి పరిరక్షణ, పిల్లుల సంక్షేమ సమూహాలు అన్ని పిల్లుల సంఖ్యపై బహిరంగ చర్చకు ప్రయత్నించాయి.

వారంతా పెంపుడు పిల్లులకు మైక్రోచిప్ అమర్చడం, కుటుంబ నియంత్రణ చికిత్స అవసరమయ్యే నేషనల్ క్యాట్ యాక్ట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టాలని ప్రచారం చేస్తున్నారు.

న్యూజీలాండ్ ఒకవేళ క్యాట్ యాక్ట్ రూపొందిస్తే అది జాతీయ స్థాయిలో మొదటిది అవుతుంది.

"పెంపుడు పిల్లుల గుర్తింపు, నమోదు, స్టెరిలైజేషన్" అవసరమయ్యే క్యాట్ యాక్ట్ 2011 అనేది ఫెడరల్ స్థాయిలో కాకుండా రాష్ట్రంలో ఉన్న ఒక చట్టం.

టాస్మేనియా రాష్ట్రంతోపాటు, ఆస్ట్రేలియా క్యాపిటల్ టెరిటరీలో కూడా 2009 నుంచి ఉన్న క్యాట్ మేనేజ్‌మెంట్ యాక్ట్‌ను అమలుచేసినప్పటికీ, ప్రస్తుతం పశ్చిమ ఆస్ట్రేలియా మాత్రమే దీనిని అమలుచేస్తోంది.

పిల్లి న్యూజీలాండ్

ఫొటో సోర్స్, Evertzen/500px/Getty Images

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)