జో బైడెన్: ఫోన్లు కూడా లేకుండా 10 గంటల పాటు రైలులో రహస్య ప్రయాణం.. ఇంత సీక్రెట్గా ఎలా ఉంచారు?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, సారా స్మిత్
- హోదా, ఉత్తర అమెరికా ఎడిటర్
ఇది ఒక సంచలన పర్యటన. అమెరికా అధ్యక్షుడు ఒకరు ఇలాంటి పర్యటన చేస్తారని దాదాపు ఎవరూ విని ఉండరు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం అకస్మాత్తుగా యుక్రెయిన్ రాజధాని కీవ్లో ప్రత్యక్షం అయ్యారు. ఈ ఆకస్మిక పర్యటననను ‘‘ఆధునిక కాలంలో అపూర్వమైనది’’గా వైట్ హౌస్ అధికారులు వర్ణించారు.
యుద్ధ క్షేత్రాలైన ఇరాక్, అఫ్గానిస్తాన్లలో గతంలో అమెరికా అధ్యక్ష పర్యటనలు, భారీ మిలిటరీ సమక్షంలో జరిగాయని వారు చెప్పారు.
పోలాండ్ నుంచి బైడెన్, యుక్రెయిన్కు వెళ్లేందుకు ప్లాన్ చేస్తుండొచ్చని మీడియా వర్గాల్లో చాలా ఊహాగానాలు వచ్చాయి. అయినప్పటికీ, ఆయన ఆకస్మిక పర్యటన అందరినీ పూర్తిగా ఆశ్చర్యానికి గురి చేసింది.
కీయెవ్ నడిబొడ్డున, వైమానిక దాడుల సైరన్ల శబ్ధాల నడుమ యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమీర్ జెలియన్స్కీతో కనిపించిన బైడెన్, ప్రపంచానికి తన ఉద్దేశాన్ని చాటి చెప్పాడు.
‘‘అది చాలా సాహసోపేతమైనది. జో బైడెన్ తన నిబద్ధతను చాటుకున్నారు’’ అని వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ కేట్ బెడింగ్ఫీల్డ్ అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
ఫోన్లు కూడా లేకుండా...
రెండు రోజుల పర్యటన కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, సోమవారం సాయంత్రం అమెరికా నుంచి వార్సాకు వెళ్లాల్సి ఉంది.
ఈ మేరకు షెడ్యూల్ సిద్ధం అయింది. అయితే, ఆ పర్యటన షెడ్యూల్లో రెండు సుదీర్ఘ ఖాళీ సమయాలు కనిపించాయి. ఈ ఖాళీ సమయాల్లోనే బైడెన్, యుక్రెయిన్కు వెళ్తారేమో అని అందరూ అనుమానించారు.
రోజూవారీ వైట్ హౌస్ ప్రెస్ బ్రీఫింగ్స్లో కూడా రిపోర్టర్లు పదే పదే ఇదే ప్రశ్నను అక్కడి అధికారులను అడిగారు. జెలియన్స్కీతో బైడెన్ సమావేశం లేదని, ఇప్పటికైతే వార్సా అవతల బైడెన్ ఎక్కడ ఆగబోరని విలేఖరులకు వైట్ హౌస్ వర్గాలు చెప్పాయి.
భద్రత నడుమ యుక్రెయిన్కు వెళ్లాలని కొన్ని నెలలుగా ప్లాన్లు చేసినప్పటికీ, కీయెవ్ పర్యటనపై తుది నిర్ణయం శుక్రవారమే తీసుకున్నారు.
స్థానిక కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 7 గంటలకు అమెరికా అధ్యక్షుడు వార్సా బయలుదేరుతారని వైట్ హౌస్ వర్గాలు ఆదివారం షెడ్యూల్ను విడుదల చేశారు. ఇప్పటికీ అదే షెడ్యూల్ కనిపిస్తుంది. కానీ, ఆయన ప్రయాణించే ఎయిర్ఫోర్స్ వన్ విమానం ఆదివారం ఉదయమే బయల్దేరింది.
వైద్య బృందం, భద్రతా అధికారులు, అత్యంత సన్నిహితులతో కూడిన చిన్నటీమ్ ఆయనతో పాటు వెళ్లింది.
అధ్యక్షునితో ప్రయాణించడానికి కేవలం ఇద్దరు విలేఖరులను మాత్రమే అనుమతించారు. వారి ఫోన్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు పర్యటన గురించి పూర్తిగా గోప్యత పాటించాలని వారిని ఆదేశించారు. బైడెన్, కీయెవ్కు చేరుకునేంతవరకు వారిని ఈ సందర్శన గురించి నివేదించడానికి అనుమతించలేదు.
అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివాన్ ప్రకారం, బైడెన్ నిష్క్రమణకు కొద్ది గంటల ముందు రష్యాకు దీని గురించి సమాచారం అందించారు.
‘‘సమన్వయ లోపం తలెత్తకూడదనే ఉద్దేశంతో మేం వారికి ఈ విషయాన్ని చెప్పాం. ఈ విషయం తెలిశాక వారు ఎలా స్పందించారో, మా సందేశాన్ని ఎలా తీసుకున్నారో నాకు తెలియదు. కానీ, వారికి మేం దీని గురించి సమాచారం ఇచ్చామని నేను ధ్రువీకరిస్తున్నా’’ అని జేక్ అన్నారు.
రైలులో ప్రయాణించిన బైడెన్
కీయెవ్కు చేరుకోవడానికి బైడెన్ పది గంటల పాటు రైలులో ప్రయాణించారు. ఈ సమయంలో యుక్రెయిన్లోని వేరే ప్రాంతాలకు ఆయన సులభంగా చేరి ఉండేవారు. కానీ, కష్టమైనప్పటికీ కీవ్కు వెళ్లాలనే ఆయన నిర్ణయించుకున్నారు. ఈ పర్యటనను ప్రతిష్టాత్మకం చేయాలని అనుకున్నారు.
బైడెన్, ఈ పర్యటన ద్వారా యుక్రెయిన్కు సహాయం చేస్తుంటామనే సంకేతాన్ని రష్యాకు పంపించారు.
యుక్రెయిన్కు అమెరికా మద్దతు తగ్గినట్లు సర్వేలో వెల్లడైన విషయం గురించి గతవారం వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్ పియరీని ప్రశ్నించారు.
దీనికి సమాధానం ఇస్తూ, ‘‘అమెరికా అధ్యక్షుడు ఎల్లప్పుడూ అమెరికా ప్రజలతో పాటు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. అమెరికా ఎంతకాలం యుక్రెయిన్కు మద్దతుగా ఉంటుందని ప్రశ్నించే వారికి సమాధానం సోమవారం నాటి పర్యటనతో లభిస్తుంది’’ అని కరీన్ చెప్పారు.
ఇంతలో అమెరికా అధ్యక్షునితో కలిసి సోమవారం సాయంత్రం పోలాండ్ పర్యటనకు వెళ్తామని భావించిన నాలాంటి రిపోర్టర్లందరికీ ఆయన ఆకస్మిక పర్యటన ఆశ్చర్యాన్ని మిగిల్చింది.
‘‘యుద్ధం జరిగినన్ని రోజులు యుక్రెయిన్కు అండగా ఉంటాం’’
యుద్ధం కొనసాగినంత కాలం యుక్రెయిన్కు అమెరికా అండగా ఉంటుందని కీయెవ్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పునరుద్ఘాటించారు.
‘‘యుక్రెయిన్ విజయం సాధిస్తుందని మాకు పూర్తిగా నమ్మకం ఉంది. యుక్రెయిన్తో పాటు దాని మిత్ర దేశాలపై ఆధిపత్యం చెలాయించగలనని రష్యా అనుకోవడం చాలా తప్పు’’ అని బైడెన్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ 2022: ముగిసిన ఓటింగ్, మార్చి 5న విజేత ప్రకటన
- మాతృభాషా దినోత్సవం: తెలుగు భాషకు ప్రాచీన హోదా వల్ల ఏదైనా మేలు జరిగిందా... ప్రాచీన భాషా అధ్యయన కేంద్రం నిధుల మాటేమిటి?
- అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం: తెలుగు, సంస్కృతం, హిందీ, తమిళం.. ఏది ప్రాచీన భాష? ఏ భాష మూలాలు ఏమిటి?
- E sanjeevani: పైసా ఖర్చు లేకుండా ఆన్లైన్లో టెలిఫోన్ ద్వారా లేదా వీడియో కన్సల్టేషన్ పొందడం ఎలా?
- బీబీసీ ఎలా పని చేస్తుంది, నిధులు ఎక్కడి నుంచి వస్తాయి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)
















