బీబీసీ తెలుగు లైవ్ పేజీ ముగిస్తున్నాం
తాజా వార్తలను ఎప్పటికప్పుడు మీకు అందించే బీబీసీ తెలుగు లైవ్ పేజీని ఈరోజుకు ముగిస్తున్నాం.
మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం.
ధన్యవాదాలు.
‘‘మాంజాలు, పతంగులు, దేవుడి ప్రతిమలు చివరకు జాతీయ జెండాలు కూడా చైనా నుంచే వస్తున్నాయి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్, బీజేపీలే దేశాన్ని పాలించాయి. ఈ రెండు పార్టీలు ఏం సాధించాయి. నాందేడ్లో ఎన్ని చైనా బజార్లు ఉన్నాయో మీరు లెక్కపెట్టారా?’’ అని కేసీఆర్ ప్రశ్నించారు
తాజా వార్తలను ఎప్పటికప్పుడు మీకు అందించే బీబీసీ తెలుగు లైవ్ పేజీని ఈరోజుకు ముగిస్తున్నాం.
మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం.
ధన్యవాదాలు.

ప్రస్తుతం దేశంలోని పరిస్థితులను అర్థం చేసుకున్న తర్వాతే జాతీయ స్థాయిలో పోరాడాలని నిర్ణయించుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి, భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు అన్నారు.
ఈ నేపథ్యంలోనే భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ అవతరించిందని ఆయన తెలిపారు.
ఆదివారం సాయంత్రం నాందేడ్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ అవతల తొలిసారి బీఆర్ఎస్ మీటింగ్ జరగడం ఇదే తొలిసారి.

బీఆర్ఎస్ పార్టీకి దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోందని చెప్పారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా ప్రజలకు సురక్షితమైన తాగునీరు, రైతులకు సాగునీరు అందట్లేదని అన్నారు.
గత్యంతరం లేని పరిస్థితుల్లోనే మహారాష్ట్రలో రైతులు ఆత్మహత్యలు ఎక్కువగా చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
‘‘అబ్కీ బార్, కిసాన్ సర్కార్’’ అనే నినాదంతో బీఆర్ఎస్ వచ్చిందని అన్నారు. నాగలి పట్టే చేతులు శాసనాలు చేయాల్సిన రోజులు వచ్చాయని చెప్పారు.

‘‘భారత్లో ఉన్నంత సాగుభూమి ఇంకెక్కడా లేదు. మహారాష్ట్రలో ఎన్నో నదులు ఉన్నప్పటికీ ఇంకా నీటి కరువు ఎందుకు ఉంది. ప్రధాని మోదీ మేకిన్ ఇండియా పథకాన్ని తెచ్చారు. కానీ, అది జోకిన్ ఇండియాగా మారింది.
మాంజాలు, పతంగులు, దేవుడి ప్రతిమలు చివరకు జాతీయ జెండాలు కూడా చైనా నుంచే వస్తున్నాయి. ఇక మేకిన్ ఇండియా పథకం ద్వారా సాధించింది ఏంటి?
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్, బీజేపీలే దేశాన్ని పాలించాయి. ఈ రెండు పార్టీలు ఏం సాధించాయి. నాందేడ్లో ఎన్ని చైనా బజార్లు ఉన్నాయో మీరు లెక్కపెట్టారా? బీఆర్ఎస్ పార్టీ రాజకీయ పోరాటం కాదు జీవన్మరణ పోరాటం చేస్తోంది’’ అని ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
చైనాతో సంబంధాలున్న 138 బెట్టింగ్ యాప్స్, 94 లోన్ యాప్స్ను బ్యాన్ చేసే ప్రక్రియను మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మొదలుపెట్టింది.
హోం మంత్రిత్వ శాఖ సూచనతో ఈ ప్రక్రియ మొదలైంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Getty Images
మాజీ భారత క్రికెటర్ వినోద్ కాంబ్లీ తాగిన మత్తులో భార్యను వేధించారని, ఆమెపై దాడి చేశారనే ఆరోపణలపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు.
బాంద్రాలోని తమ ఇంట్లో శుక్రవారం మధ్యాహ్నం ఈ సంఘటన జరిగినట్లు వినోద్ కాంబ్లీ భార్య ఆండ్రియా ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఐపీసీ సెక్షన్లు 324 (ప్రమాదకర ఆయుధాలతో ఉద్దేశపూర్వకంగా గాయపరచటం), 504 (శాంతిని చెడగొట్టటానికి ఉద్దేశపూర్వకంగా దూషించటం) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి ఒకర పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు.
ఈ అంశం దర్యాప్తులో ఉందని, ఇంకా ఎవరినీ అరెస్ట్ చేయలేదని ఆ అధికారి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, ani
చిలీ కార్చిచ్చులో చనిపోయినవారి సంఖ్య 22కి పెరిగిందని అక్కడి అధికారులు తెలిపారు.
చిలీ మంత్రి కరోలినా తోహా ‘సీఎన్ఎన్’తో మాట్లాడుతూ 1,429 మంది షెల్టర్స్లో ఉన్నారని, 554 మంది గాయపడ్డారని, వారిలో 16 మంది తీవ్రంగా గాయపడడంతో వారి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. 22 మంది చనిపోయినట్లు ఆమె ధ్రువీకరించారు.
దేశంలో వడగాడ్పుల కారణంగా కార్చిచ్చులు మొదలై 14,000 హెక్టార్లలో అడవులు తగలబడిపోయాయి.
మునుపెన్నడూ లేని స్థాయిలో ఎండల తీవ్రత ఉందని మంత్రి తెలిపారు.
కాగా పొరుగుదేశం అర్జెంటీనా ఫైర్ ఫైటర్లను, అధునాతన అగ్నిమాపక సామగ్రిని పంపిస్తోందని చిలీ అధ్యక్షుడు గాబ్రియెల్ బోరిక్ తెలిపారు.
ఇతర దేశాల నుంచీ ఆయన సహాయం కోరుతున్నారు.
కీలకమైన తమ సైనిక స్థావరాలపై గూఢచర్యం కోసం చైనా ప్రయోగించిందని అమెరికా ఆరోపిస్తున్న భారీ బెలూన్ను ఆ దేశం గాల్లోనే పేల్చేసింది.
తమ దేశానికి చెందిన ఫైటర్ జెట్లతో తమ ప్రాదేశిక జలాలలోనే ఆ భారీ బెలూన్ను కూల్చివేశాయని అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది.
కాగా అమెరికా చర్యపై చైనా విదేశీ వ్యవహారాల శాఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది.
తమ మానవ రహిత బెలూన్ను అమెరికా బలవంతంగా కూల్చడంపై చైనా నిరసన తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
వికీపీడియాలో ‘దైవదూషణ సమాచారం’ ఉందంటూ ఆ వెబ్సైట్ను పాకిస్తాన్ తమ దేశంలో బ్లాక్ చేసింది.
ఉచిత ఆన్లైన్ ఎన్సైక్లోపీడియా అయిన వికీపీడియా నుంచి ఆ సమాచారాన్ని తొలగించటానికి పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్స్ అథారిటీ (పీటీఏ) తొలుత 48 గంటల గడువు ఇచ్చింది.
ఆ గడువు ముగిసిన తర్వాత వెబ్సైట్ను బ్లాక్ చేస్తున్నట్లు శనివారం నాడు ప్రకటించింది.
అయితే.. పాక్ అభ్యంతరం చెప్తున్న మెటీరియల్ వివరాలను వెల్లడించలేదు.
ఈ నిషేధం వల్ల ‘‘అతిపెద్ద ఉచిత విజ్ఞాన భాండాగారం’’ పాకిస్తానీ ప్రజలకు అందుబాటులో లేకుండా నిరోధించినట్లు అవుతుందని వికీపీడియాను నిర్వహించే వికీమీడియా ఫౌండేషన్ పేర్కొంది.
దైవదూషణ అనేది ముస్లిం మెజారిటీ దేశమైన పాకిస్తాన్లో చాలా సున్నితమైన అంశం.
గతంలో టిండర్, ఫేస్బుక్, యూట్యూబ్ వేదికలను కూడా పాకిస్తాన్లో బ్లాక్ చేసిన సందర్భాలున్నాయి.
పాకిస్తాన్ తాజా చర్య పట్ల వాక్స్వాతంత్ర్యం ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేశారు.
‘‘ఇంటర్నెట్లో కంటెంట్ మీద మరింత ఎక్కువ నియంత్రణ తెచ్చుకోవటానికి కఠోర ప్రయత్నం’’ జరుగుతున్నట్లు కనిపిస్తోందని వారు పేర్కొన్నారు.
‘‘ఎలాంటి అసమ్మతినైనా అణచివేయటమే వారి ప్రధాన లక్ష్యం’’ అని డిజిటల్ రైట్స్ యాక్టివిస్ట్ ఉసామా ఖిల్జీ విమర్శించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆస్ట్రేలియాలోని స్వాన్ రివర్లో ఈతకు వెళ్లిన ఓ 16 ఏళ్ల బాలిక షార్క్ దాడిలో చనిపోయింది.
పశ్చిమ ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరం శివారు పట్టణమైన ఫ్రెమాంటిల్లో శనివారం ఈ దుర్ఘటన జరిగింది.
పెర్త్ నగరానికి చెందిన బాలిక తన స్నేహితులతో కలిసి స్వాన్ నదిలో జెట్ స్కీల మీద రైడ్ చేస్తూ షార్క్ బారిన పడింది.
జెట్ స్కీ మీద రైడ్ చేస్తున్న బాలిక.. సమీపంలో డాల్ఫిన్లను చూసి నదిలో ఈతకు దిగి ఉండవచ్చునని పోలీసులు చెప్తున్నారు.
ప్రజలు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని, బీచ్ నిబంధనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.
నదిలోని ఈ ప్రాంతంలో షార్క్లు కనిపించటం అసాధారణమని ఫిషరీస్ నిపుణులు చెప్తున్నారు.
స్వాన్ రివర్లో 1923 జనవరిలో ఓ 13 ఏళ్ల బాలుడు తొలిసారి షార్క్ దాడిలో చనిపోయాడు.
వందేళ్ల తర్వాత మళ్లీ ఈ నదిలో ఇప్పుడే షార్క్ దాడి జరిగింది.
ఆస్ట్రేలియాలో ప్రతి ఏటా దాదాపు 20 వరకూ షార్క్ దాడులు నమోదవుతుంటాయి. వీటిలో ఎక్కువగా న్యూ సౌత్ వేల్స్, పశ్చిమ ఆస్ట్రేలియాల్లోనే జరుగుతుంటాయి.
2021, 2020 సంవత్సరాల్లో కూడా షార్క్ దాడుల్లో మనుషులు చనిపోయారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.