మనిషి మృతదేహాన్ని ఎరువుగా ఎలా మారుస్తారు... కూరగాయలు ఎలా పండిస్తారు

ఫొటో సోర్స్, OLSON KUNDIG
మరణానంతరం అంత్యక్రియలను ఒక్కోచోట ఒక్కోలా నిర్వహిస్తుంటారు.
కొందరు దహనం చేస్తారు, మరికొందరు పూడ్చిపెడతారు. ఇంకొందరు మృతదేహాలను అలా జంతువులు, పక్షులకు ఆహారంగా వదిలేస్తారు.
కానీ, ఓ అమెరికా సంస్థ మాత్రం మృతదేహాల నుంచి ఎరువులు తయారుచేస్తోంది.
వాషింగ్టన్, న్యూయార్క్ సహా అమెరికాలోని ఆరు రాష్ట్రాలు ఈ హ్యూమన్ కాంపోస్టింగ్కు అనుమతులు కూడా జారీచేశాయి.
వ్యర్థాల నుంచి కాంపోస్టింగ్ గురించి మీరు వినే ఉంటారు. మరి హ్యూమన్ కాంపోస్టింగ్ అంటే ఏమిటి? ఎలా దీన్ని తయారుచేస్తారు? దీని వల్ల ప్రకృతికి మేలు జరుగుతుందా?

ఫొటో సోర్స్, RECOMPOSE/MOLT STUDIOS
హ్యూమన్ కాంపోస్టింగ్ ఏమిటి?
అమెరికాలో ఈ హ్యూమన్ కాంపోస్టింగ్కు ఆదరణ పెరుగుతోంది. మొదటగా 2019లో వాషింగ్టన్ స్టేట్ దీనికి ఆమోదం తెలిపింది.
ఇప్పటివరకు ఆరు రాష్ట్రాలు దీనికి అనుమతించాయి. ఈ ప్రక్రియలో భాగంగా మరణానంతరం మృతదేహాన్ని మట్టిలో కలిపేలా ఏర్పాట్లు చేస్తారు.
దీని కోసం పర్యావరణహిత, సురక్షితమైన విధానాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఎక్కువగా ‘‘నేచురల్ ఆర్గానిక్ రిడక్షన్’’ పద్ధతిలో మృతదేహాలను కాంపోస్ట్గా మారుస్తారు.
మొదటగా మట్టి, కర్ర ముక్కలు, పచ్చి గడ్డి, ఎండు గడ్డితో నింపిన డబ్బాలో మృతదేహాన్ని 30 రోజులపాటు ఉంచుతారు. సూక్ష్మజీవుల సాయంతో శరీరం విచ్ఛిన్నం అయ్యేలా జాగ్రత్తలు వహిస్తారు
నెల రోజుల తర్వాత, ఈ మిశ్రమాన్ని అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద వేడిచేస్తారు. ఫలితంగా దీని నుంచి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం తగ్గుతుంది. చివరగా ఈ మట్టిని సదరు కుటుంబాలకు ఇస్తారు. పువ్వుల మొక్కలు, కూరగాయలు పెంచుకునేందుకు ఈ మట్టిని మనం ఉపయోగించుకోవచ్చు.

ఫొటో సోర్స్, BOSTON GLOBE VIA GETTY IMAGES
పర్యావరణానికి మంచిదా?
సంప్రదాయ విధానాల్లో అంత్యక్రియలు నిర్వహించేటప్పుడు విడుదలయ్యే కార్బన్ను హ్యామన్ కాంపోస్టింగ్తో చాలావరకు తగ్గించవచ్చని రీకంపోస్ చెబుతోంది.
ప్రస్తుతం భూమి వేడెక్కడానికి కార్బన్ ఉద్గారాలు ప్రధాన కారణంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
వాతావరణ మార్పులపై ప్రజల్లో అవగాహన పెరుగుతోందని, అందుకే హ్యూమన్ కాంపోస్టింగ్పై చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారని రీకంపోస్ ఫౌండర్ కత్రినా స్పేడ్ బీబీసీతో చెప్పారు. మరోవైపు ప్రభుత్వాలు కూడా ఈ విధానాన్ని ప్రోత్సహిస్తున్నాయి.
సంప్రదాయ విధానాల్లో అంత్యక్రియల కోసం కర్రలు, మట్టి భారీగా అవసరం అవుతాయి. అదే హ్యూమన్ కాంపోస్టింగ్లో వీటి అవసరం కూడా తక్కువగా ఉంటుంది.
ఇది పర్యావరణహిత విధానమని నిపుణులు కూడా చెబుతున్నారు. చాలా ప్రాంతాల్లో భూమి దొరక్క ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, ఇది మంచి పరిష్కారమని మరికొందరు అంటున్నారు.
ఖర్చు ఎంత?
హ్యూమన్ కంపోస్టింగ్ పర్యావరణహిత విధానమని కొందరు చెబుతున్నప్పటికీ, మరికొందరు దీనిపై ప్రశ్నలు, సందేహాలు లేవనెత్తుతున్నారు.
ఈ విధానాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు న్యూయార్క్లోని క్యాథలిక్ ప్రీస్ట్లు చెప్పారు. మానవ మృతదేహాలను వ్యర్థాల తరహాలో ప్రాసెస్ చేయకూడదని వారు అంటున్నారు.
మరికొందరు మాత్రం హ్యూమన్ కాంపోస్టింగ్కు ఎక్కువ ధర అవుతోందని అంటున్నారు. అయితే, పూడ్చడం లేదా దహనం చేయడానికి అయ్యే ఖర్చే ఈ విధానంలోనూ అవుతుందని రీకంపోస్ చెబోతోంది.
స్వీడన్లోనూ ఈ విధానాన్ని అనుమతిస్తున్నారు. బ్రిటన్లో అయితే, శవపేటిక లేకుండా పూడ్చిపెట్టడం లేదా బయోడిగ్రేడబుల్ శవపేటికలతో పూడ్చిపెడ్డటానికి మాత్రమే అనుమతిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- దిల్లీ: కారుతో 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్ళి చంపేసింది ఈ అమ్మాయినే
- గుండెపోటు: 40వేల అడుగుల ఎత్తులో విమానప్రయాణికునికి హార్ట్స్ట్రోక్... 5 గంటల పాటు వైద్యం చేసి బతికించిన డాక్టర్
- స్కూలుకు పంపించడానికి ఒక బిడ్డనే ఎంచుకోవాలి... ఓ అయిదుగురు పిల్లల తల్లి కథ
- ఆంధ్రప్రదేశ్: ఫ్యామిలీ డాక్టర్ విధానం ఎలా అమలవుతోంది, పూర్తిస్థాయిలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?
- మోదీ బీజేపీ మీద పోరాటంలో హిందువులు, ముస్లింల మధ్య నలిగిపోతున్న కాంగ్రెస్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)
















