గ్యాంగ్లో గుర్తింపు రావాలంటే మనుషుల్ని చంపుతూనే ఉండాలి

ఫొటో సోర్స్, Getty Images
మధ్య అమెరికాలోని చిన్న దేశం ఎల్ సాల్వడార్ .. కానీ ప్రపంచ వ్యాప్తంగా ఇక్కడి నేరాల సంఖ్య మాత్రం చాలా చాలా పెద్దది. సుమారు 60 వేల క్రిమినల్ ముఠాలు దేశ ఆర్ధిక స్థితిగతులను కూడా అదుపు చేస్తున్నాయి.
కేవలం గతేడాదిలోనే మొత్తం 3 వేల మంది వీరికి బలయ్యారంటే ఇక్కడ నేర తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. బీబీసీ ప్రతినిధి ఓర్లా గ్వెరిన్ అందిస్తున్న ఈ కథనంలోని కొన్ని దృశ్యాలు మీ మనసుని కలచివేయొచ్చు.
రక్తపు మరకలతో నిండుతున్న ఎల్ సాల్వడార్ దేశాన్ని వదిలి అందమైన తమ భవిష్యత్తు కోసం అక్రమంగా అమెరికా వెళ్లేందుకు కూడా వెనకాడని జీవితాలు ఎన్నో.
ఎందుకంటే.. ఎల్ సాల్వడార్లో జీవితానికీ, మరణానికీ మధ్య రోజూ పోరాటమే.
గ్యాంగ్ ల్యాండ్లో మరో హత్య జరిగింది. ఇవి మామూలైపోయాయి. హత్యల మధ్యే ఐస్ క్రీములు అమ్మేవాళ్లు అమ్ముతూనే ఉంటారు.
ఈ నేరస్థ ముఠాలు వైరస్లా కంటికి కనిపించవు. కానీ జీవితంలో ప్రతి పార్శ్వాన్నీ చిన్నాభిన్నం చేస్తాయి.
పట్టపగలే ఇక్కడ శవాన్ని పడేయడం ద్వారా ఈ నేరస్థ ముఠాలు ప్రభుత్వాన్ని బాహాటంగానే సవాల్ చేస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.
ఈ గుర్తుల్ని బట్టి మనం ఎవరి భూభాగంలో ఉన్నామో తెలుసుకోవచ్చు. బేరియో 18 గ్యాంగ్స్టర్స్కు వ్యతిరేకంగా మాట్లాడటానికి ఎవరూ ధైర్యం చేయరు. చనిపోయింది తన కొడుకేనని అనుమానిస్తున్న తల్లి కూడా మాట్లాడలేరు.
ఈ ఘోరాలు భరించలేకనే వేలాది మంది సాల్వడార్ ప్రజలు ఇక్కడి నుండి అమెరికా వలస వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తున్నారు.
నేరస్థ ముఠాల నుండి తప్పించుకోవాలని కొందరు వెళ్లిపోతుంటే, మంచి ఉద్యోగాలు, మెరుగైన జీవితం కోసం మరి కొందరు వెళ్లిపోతున్నారు. కానీ చాలా మంది మధ్యలోంచే వెనక్కు వచ్చేస్తున్నారు.
వీరిని ప్రమాదాలు నిరంతరం వెంటాడుతుంటాయి. అమెరికా నుంచి వెనక్కి పంపించిన వారి రాక కోసం వారి కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి.
శాన్ సాల్వడార్లోని రిసెప్షన్ సెంటర్ దగ్గరకు వారిని తీసుకొస్తారు. ఒక తండ్రీ కూతుళ్లు సరిగ్గా తాము బయలుదేరిన చోటికే తిరిగి చేరుకున్నారు.
కొన్నేళ్లు అమెరికాలో పని చేసి భవిష్యత్తు అవసరాల కోసం కొంత డబ్బును కూడబెట్టాలని అనుకున్నారు విల్బుర్. కానీ దానికి భిన్నంగా ఆయన తన నాలుగేళ్ల కుమార్తె బ్రియానాతో పట్టుబడి కొన్ని నెలల పాటు వేర్వేరు చోట్ల బందీలుగా ఉండాల్సొచ్చింది.
‘‘నన్ను వదిలివెళ్లకు... ప్లీజ్ నాన్నా’ అంటూ తను అరిస్తూ ఏడ్చింది. నేను తనని తిరిగి కలిసిన క్షణాలు చాలా భాధాకరమైనవి.. తను నన్ను గుర్తుపట్టలేదు కూడా’’ అని విల్బుర్ బాధపడుతూ చెప్పారు.

చీకటి అలుముకోగానే వీధుల్లో సాధారణ ప్రజలెవరూ కనిపించరు.
రాత్రంతా నేరస్థ ముఠాలదే రాజ్యం. వారు డ్రగ్స్ అమ్ముతారు, అక్రమ వసూళ్లకు పాల్పడతారు. కదిలే ప్రతిదాన్నీ అదుపు చేయాలని చూస్తారు.
ఇప్పుడు పోలీస్ ఇన్ఫార్మర్లుగా మారిన ఇద్దరు మాజీ గ్యాంగ్స్టర్లను మేం కలిశాం. మేం వారి పేర్లు వెల్లడి చేయలేం. వారి గొంతును వినిపించలేం.
తానిప్పటికే 56 మంది ప్రజలను చంపానని ఒకతను ఒప్పుకున్నాడు. చంపుతూ ఉండటమే తమ వృత్తని అతను చెబుతున్నాడు.
మాజీ గ్యాంగ్ స్టర్ 1: ‘‘మొదటి హత్య కత్తితో చేశాను. అతడు ప్రత్యర్థి ముఠా సభ్యుడు. అక్కడ చాలా మంది వద్ద తుపాకులుంటాయి. నేను చివరగా చంపిన వ్యక్తినైతే కాళ్లు, చేతులు అన్నింటినీ ముక్కలు ముక్కలుగా నరికాను. శరీరం లోపలి భాగాలన్నీ బయటకు తీశాం’’.
బీబీసీ రిపోర్టర్: ‘అంటే ఓ కసాయి మేకను చంపినట్టుగా... మీరు మనుషుల్ని కోసి పోగులు పెట్టారన్న మాట.’
మాజీ గ్యాంగ్ స్టర్ 1: ‘‘ఆ క్షణంలో వాళ్ళు నా శత్రువులు... అంతే... గ్యాంగ్లో చేరాలంటే నేను ఏడుగురిని చంపాల్సిందే. గ్యాంగ్లో ర్యాంక్ రావాలంటే మనుషుల్ని ఎప్పుడూ చంపుతూనే ఉండాలి.’’

మరో వ్యక్తి పదిహేనేళ్ల వయసు నుండే హత్యలు చేయడం మొదలుపెట్టి తన ప్రాంతంలో ఓ లీడర్ అయ్యాడు. తన పాత గ్యాంగ్కు తను దొరికిపోతే మాత్రం తనకు స్పెషల్ ట్రీట్మెంట్ తప్పదని అంటున్నాడు.
మాజీ గ్యాంగ్ స్టర్ 2: ‘‘నన్ను దారుణంగా హింసించి, సజీవ దహనం చేస్తారు. వాళ్లు నన్ను ఖండఖండాలుగా చేస్తూ మెల్లిగా చంపేస్తారు.’’
బీబీసీ రిపోర్టర్: ‘మీరు చంపేసిన వ్యక్తుల కుటుంబాలకు మీరేం చెప్తారు? వారి గురించి మీరెప్పుడైనా ఆలోచించారా..?’
మాజీ గ్యాంగ్ స్టర్ 2: ‘‘నేనేం చెప్పినా చనిపోయిన వాళ్లను వెనక్కి తీసుకురాలేను. నేను ఇప్పటికే ఎందరో తల్లుల కొడుకులను, ఎంతో మంది సోదరులను, స్నేహితులను శాశ్వతంగా దూరం చేశాను. ఇక నేను వారికేం చెప్పుకున్నా తక్కువే. రోజూ పశ్చాత్తాప పడటం తప్ప ఏమీ చేయలేను.’’
ఇలాంటి నేరస్థ ముఠాలను అంతం చేయడానికి మరో ఆపరేషన్ నిర్వహించే పనిలో ఉన్నాయి భద్రతా దళాలు.
ఈ నెలలోనే భాధ్యతలు చేపట్టిన ఎల్ సాల్వడార్ నూతన అధ్యక్షుడు నయిబ్ బుకెలె ఈ ముఠాలను ఉక్కుపాదంతో అణిచేవేయాలని ప్రయత్నిస్తున్నారు.
రక్తపు మరకలతో నిండిన ఈ దేశంలో చీకట్లను పారదోలే మరో ప్రయత్నం ఇది.
ఇవి కూడా చదవండి:
- ఈ నగరంలో అత్యాచారాలు సర్వ సాధారణం.. రేపిస్టుల్ని కొట్టి చంపటం కూడా
- కొలంబియా: కుక్కను చంపితే రూ. 50 లక్షలు.. తలకు వెల కట్టిన డ్రగ్ మాఫియా.. కుక్కకు భద్రత పెంచిన పోలీసులు
- ఇక్కడ పచ్చళ్లు అంటూ పార్సిల్ చేతిలో పెడతారు.. అక్కడ విమానం దిగగానే జైల్లో పెడతారు!
- 'ఇండియా గెలవాలి... దేవుడా' అని పాకిస్తానీలు ఎందుకు కోరుకుంటున్నారు?
- తాగు నీటి సమస్యను సింగపూర్ ఎలా అధిగమిస్తోంది?
- దేశమంతా ఇంటర్నెట్ ఆపేశారు.. కోర్టుకెళ్తే ఒక్కరికే ఇచ్చారు
- ఆరెంజ్ జెర్సీల్లో కనువిందు చేయనున్న 'మెన్ ఇన్ బ్లూ'
- జీ-20 శిఖరాగ్ర సదస్సు: ఏమిటీ భేటీ? ఇక్కడ ప్రపంచ నాయకులు ఏం చర్చిస్తారు...
- ఆంధ్రప్రదేశ్లో క్రిమినల్ కేసులున్న మంత్రులెందరు.. వారిలో అత్యంత సంపన్నులెవరు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









