ఒక ఫంగస్ మహమ్మారి మనందరినీ జాంబీలుగా మార్చేయగలదా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జేమ్స్ గళ్లాఘర్
- హోదా, ఇన్సైడ్ హెల్త్ ప్రెజెంటర్, బీబీసీ రేడియో 4
ఒక భయం గొలిపే విషయాన్ని మీకు పరిచయం చేస్తున్నా: ఇది ఒక ఫంగస్.. ఈ ఫంగస్ తన బారిన పడిన వారిని జాంబీలుగా మార్చేస్తుంది.
ఈ ఫంగస్ బీజాలు తొలుత శరీరంలోకి ప్రవేశిస్తాయి. అక్కడ అవి పెరుగుతూ పోతాయి. తర్వాత మెదడును హైజాక్ చేస్తాయి. శరీరంపై మనకు నియంత్రణ లేకుండా చేస్తాయి.
ఈ పరాన్నజీవి శిలీంధ్రం.. తను ఆక్రమించిన శరీరాన్ని లోపలి నుంచి తినేస్తుంది. చిట్టచివరి పోషకాన్ని సైతం జుర్రుకుని మన శరీరాన్ని అంతం చేయాలని చూస్తుంది.
అప్పుడు కనిపించే దృశ్యం అత్యంత భయం పుట్టించే హర్రర్ సినిమాలో సీన్ కన్నా భయానకంగా ఉంటుంది.
ఆ శరీరం మన తలను చీల్చుకుంటూ బయటకు చొచ్చుకు వస్తుంది. ఫంగస్కు చెందిన ఈ శరీరం..తన చుట్టూ ఉన్న వాటన్నిటిపైకీ బీజాలను వెదజల్లుతుంది. దాంతో అక్కడ ఉన్న ఇతర జీవాలకు కూడా అదే జాంబీ గతి పడుతుంది.
ఇది వినటానికి ఏదో కల్పిత కథలా అనిపిస్తుంది. కానీ ఫంగై (శిలీంధ్ర) రాజ్యం చాలా పెద్దది. మొక్కలు, జంతువులకు భిన్నమైన ఈ జీవరాశిలో మనం తినే పుట్టగొడుగుల నుంచి.. మనకు పీడకలలుగా మారే పరాన్నజీవుల వరకూ చాలా రకాలు ఉన్నాయి.
ఈ శిలీంధ్రాల్లో కార్డిసెప్స్, ఓఫియోకార్డిసెప్స్ అనే పరాన్నజీవి జాతులు నిజంగా ఉన్నాయి. ఒక చీమ శరీరాన్ని కార్డిసెప్స్ ఫంగస్ స్వాధీనం చేసుకుని ఎలా జాంబీగా మార్చేసిందో బీబీసీ ప్లానెట్ ఎర్త్ సిరీస్లో ప్రసారమైన ఒక వీడియోలో సర్ డేవిడ్ అటెన్బరో స్వయంగా వీక్షిస్తూ వివరించారు.

ఫొటో సోర్స్, HBO/WARNER MEDIA/LIANE HENTSCHER
జాంబీ చీమలకు సంబంధించిన ఈ వీడియో స్ఫూర్తితోనే.. ‘ద లాస్ట్ ఆఫ్ అజ్’ అనే వీడియో గేమ్ను రూపొందించారు. అదే కథాంశంతో ఇప్పుడు ఒక టీవీ సిరీస్ కూడా రూపొందింది.
ఆ వీడియో గేమ్లోనూ, టీవీ సిరీస్లోనూ.. సాధారణంగా చీమలు, ఇతర కీటకాలకు సోకే కార్డిసెప్స్ ఫంగస్.. మనుషులకు సోకటం మొదలవుతుంది. అది మహమ్మారిగా మారిపోయి మానవ సమాజం కుప్పకూలుతుంది.
కానీ వాస్తవ ప్రపంచంలో కార్డిసెప్స్ ఫంగస్ కానీ, మరేదైనా ఫంగస్ కానీ మహమ్మారిగా విజృంభించే అవకాశం ఉందా?
‘‘ఫంగల్ ఇన్ఫెక్షన్లను మనం దారుణంగా తక్కువ అంచనా వేస్తున్నామనేది నా భావన’’ అంటున్నారు డాక్టర్ నీల్ స్టోన్. ఆయన లండన్లోని హాస్పిటల్ ఫర్ ట్రాపికల్ డిసీజెస్లో ప్రధాన ఫంగల్ నిపుణుడు.
‘‘మనం చాలా కాలంగా దీనిని తక్కువగా అంచనా వేస్తున్నాం. ఫంగస్ మహ్మారిని ఎదుర్కోవటానికి ఏమాత్రం సంసిద్ధంగా లేము’’ అని ఆయన నాతో చెప్పారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గత ఏడాది అక్టోబర్ చివర్లో.. ప్రాణాంతక ఫంగై తొలి జాబితాను జారీ చేసింది.
అందులో కొన్ని దుష్ట క్రిములు ఉన్నాయి. అయితే జాంబీలుగా మార్చే కార్డిసెప్స్ ఆ జాబితాలో లేకపోవటం ఊరటనిచ్చే విషయమే.

ఫొటో సోర్స్, Getty Images
ఆ జాబితాలో ఈ ఫంగస్ ఎందుకు లేదు?
యూట్రెక్ట్ యూనివర్సిటీలో మైక్రోబయాలజిస్ట్గా పనిచేస్తున్న డాక్టర్ చరిస్సా డి బెకర్.. చీమలను కార్డిసెప్స్ ఫంగస్ ఎలా జాంబీలుగా మారుస్తుందనేది అధ్యయనం చేశారు.
అలాంటిది మనుషుల్లో జరిగే అవకాశం ఉందని తాను భావించటం లేదని ఆమె చెప్తున్నారు.
‘‘మన శరీరం చాలా వేడిగా ఉంటుంది. చాలా వరకూ శిలీంధ్రాలు ఆ వేడిని తట్టుకుని అందులో స్థిరపడటానికి, పెరగటానికి వీలు ఉండదు. కార్డిసెప్స్ ఫంగస్ కూడా మన శరీరంలోని వేడిని తట్టుకుని బతకలేదు’’ అని ఆమె వివరించారు.
‘‘మన శరీరాలకన్నా ఆ చీమలు, కీటకాల నాడీ వ్యవస్థ చాలా సరళంగా ఉంటుంది. కాబట్టి మన మెదడును హైజాక్ చేయటం కన్నా ఒక కీటకం మెదడును హైజాక్ చేయటం ఆ ఫంగస్కు సులభం. అలాగే ఆ కీటకాల రోగనిరోధక వ్యవస్థ కూడా మన కన్నా చాలా భిన్నంగా ఉంటుంది’’ అని డాక్టర్ చరిస్సా విశదీకరించారు.
పరాన్నజీవులైన కార్డిసెప్స్ జాతులు చాలా వరకూ ఏదో ఒక కీటక జాతికి సోకటానికి వీలుగా లక్షలాది సంవత్సరాల్లో రూపాంతరం చెందాయి. ఒక కీటకానికి సోకే జాతి శిలీంధ్రం.. మరొక కీటకానికి సోకదు.
‘‘కీటకానికి సోకే ఈ ఫంగస్ మనకు సోకాలంటే ఈ ఫంగస్లో చాలా పెద్ద పరిణామం జరగాల్సి ఉంటుంది’’ అని డాక్టర్ చరిస్సా పేర్కొన్నారు.
ఫంగస్ జాతుల నుంచి పొంచివున్న ప్రమాదాలను చాలా కాలంగా తేలికగా కొట్టివేస్తూ వచ్చారు. ‘‘అలా జరగటం సాధ్యం కాదని, అదంత ముఖ్యమైన విషయం కాదని జనం భావిస్తున్నారు’’ అని డాక్టర్ స్టోన్ చెప్పారు.
లక్షలాది రకాల జాతుల ఫంగస్లో కేవలం ఓ పిడికెడు జాతులు మాత్రమే మనుషులకు జబ్బులు కలిగిస్తాయి. వాటిలో.. అథ్లెట్స్ ఫుట్, కాలి గోళ్లకు సోకే ఫంగస్ వంటివి కాస్త చికాకు పుట్టిస్తాయి కానీ అంత ప్రమాదకరమైనవి కావు. కానీ కొన్ని ఫంగస్లు చాలా ప్రమాదకరంగా ఉంటాయి.
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా 17 లక్షల మందిని వివిధ రకాల ఫంగస్లు బలి తీసుకుంటున్నాయి. ఇది మలేరియా మరణాల కన్నా మూడు రెట్లు ఎక్కువ.

ఫొటో సోర్స్, JAMES GALLAGHER
కార్డిసెప్స్ కన్నా పెద్ద ప్రాణాంతక ప్రమాదాలు
మనకు ఆందోళనకలిగించే 19 రకాల ఫంగస్లను డబ్ల్యూహెచ్ఓ గుర్తించింది.
వీటిలో కాండిడా ఆరిస్ అనే ఒక ప్రాణాంతక సూపర్బగ్, మైక్రోమైసిటిస్ అనే ఒక ఫంగస్ ఉన్నాయి. ఈ ఫంగస్ మన శరీరాన్ని చాలా వేగంగా తినేస్తుంది. దీనివల్ల మన ముఖం మీద గాయాల్లాంటి మార్కులు వస్తాయి.
డాక్టర్ నీల్ స్టోన్ నన్ను లండన్లోని హెల్త్ సర్వీసెస్ లాబొరేటరీకి ఆహ్వానించారు. అక్కడ బ్రిటన్ పేషెంట్లు కొందరి నుంచి సేకరించిన శాంపిల్స్ను విశ్లేషించారు. అవి ఫంగస్ వల్ల సోకిన ఇన్ఫెక్షన్లేనా, వాటికి ఎలాంటి చికిత్స పనిచేస్తుంది అనేది అధ్యయనం చేశారు.
ఫంగస్ల నుంచి పొంచివున్న పెద్ద ప్రమాదాలు కొన్నింటి గురించి మేం చర్చించాం.
అందులో మొదటిది కాండిడా ఆరిస్. ఇది ఈస్ట్ తరహా ఫంగస్. దీనికి సమీపంలో ఉన్నపుడు ఒక సారాయి బట్టీ నుంచి వచ్చే తరహా ఘాటు వాసన మీకు వస్తుంది.
ఇది శరీరంలోకి ప్రవేశిస్తే.. రక్తాన్ని, నాడీ వ్యవస్థను, అంతర్గత అవయవాలను ఆక్రమిస్తుంది. కాండిడా ఆరిస్ సోకిన వారిలో సగం మందికి పైగా చనిపోతున్నారని డబ్ల్యూహెచ్ఓ అంచనా.
‘‘ఈ రాకాసి సుమారు 15 ఏళ్ల కిందట తొలిసారి కనిపించింది. ఇప్పుడు ప్రపంచమంతటా దీనికి ఉనికి ఉంది’’ అని డాక్టర్ స్టోన్ చెప్పారు.
2009లో టోక్యో మెట్రోపాలిటన్ జీరియాట్రిక్ హాస్పిటల్లో ఓ రోగి చెవిలో ఈ ఫంగస్ సోకినట్లు మొట్టమొదటి కేసు నమోదైంది.

కాండిడా ఆరిస్ మీద యాంటీ-ఫంగల్ ఔషధాలు పనిచేయవు. ఇందులో కొన్ని రకాల ఫంగస్.. మనదగ్గర ఉన్న మందులన్నిటినీ తట్టుకుంటాయి. అందుకే దీనిని సూపర్బగ్ అని పిలుస్తున్నారు.
ఆస్పత్రుల్లో ఈ ఫంగస్ పడిన ఉపరితలాల నుంచి ప్రధానంగా ఇది సోకుతుంది. రక్తనాళాల్లోకి చొప్పించే పైపులకు, రక్తపోటును పరీక్షించే పరీకరాలకు ఇది అంటుకుంటుంది. దీనిని శుభ్రం చేసి తొలగించటం చాలా కష్టం.
మొత్తం వార్డులన్నిటినీ మూసివేయటం ప్రధాన పరిష్కారం. బ్రిటన్లో సైతం ఇలా జరిగింది.
‘‘ఈ ఫంగస్ను మనం పట్టించుకోవడం లేదు. కానీ, ఇది వినాశనం కలిగించగలదు. ఇది ఒక్కసారి విజృంభిస్తే మొత్తం వైద్య వ్యవస్థలన్నీ మూతబడిపోవచ్చు’’ అని డాక్టర్ స్టోన్ హెచ్చరిస్తున్నారు.
మరో హంతక శిలీంధ్రం– క్రిప్టోకాకస్ నిఫోర్మన్స్. ఇది మనుషుల నాడీ వ్యవస్థలోకి చొచ్చుకుపోయి ప్రాణాంతకమైన మెనింజైటిస్ను కలిగించగలదు.

ఫొటో సోర్స్, SID AND ELLIE
సిడ్, ఎల్లీలు తమ హనీమూన్ కోసం కోస్టారికా వెళ్లిన కొన్ని రోజులకే.. ఎల్లీ జబ్బుపడ్డారు.
ఆమెకు మొదట తలనొప్పి, వికారం లక్షణాలు కనిపించాయి. బాగా ఎండగా ఉండటం వల్ల అలా అయిందని భావించారు. కానీ అంతలో ఆమెలో ఆకస్మిక కుదుపులు కనిపించాయి. అవి పూర్తిస్థాయి మూర్ఛలుగా మారాయి. ఆమెను ఒక గోనె ఉయ్యాలలో చుట్టి, పడవలో చికిత్స కోసం తరలించాల్సి వచ్చింది.
‘‘అంతకన్నా భయంకరమైనదానిని నేను ఎన్నడూ చూడలేదు. అంతకన్నా నిస్సహాయంగా ఎన్నడూ అనిపించలేదు’’ అని సిడ్ నాతో అన్నారు.
ఆమె మెదడులో వాపు ఉన్నట్టు స్కానింగ్ చేసినపుడు కనిపించింది. అది క్రిప్టోకాకస్ ఫంగస్ అని గుర్తించారు. అదృష్టవశాత్తూ ఎల్లీ చికిత్సకు స్పందించారు. ఆమె 12 రోజుల పాటు వెంటిలేటర్ మీద ఉండి.. ఆ తర్వాత కోమా నుంచి బయటపడ్డారు.
‘‘నా అరుపులు మాత్రమే నాకు గుర్తున్నాయి’’ అని చెప్పారామె. ఆమెకు అనేక భ్రమలు కలిగాయి. తనకు ఒకే కాన్పులు ముగ్గురు పిల్లలు పుట్టారని, తమ డబ్బునంతా తన భర్త జూదంలో పోగొట్టుకున్నాడని.. ఇలాంటి భ్రమలు వచ్చాయి.
‘‘ఇక మన బంధం తెగిపోయిందని నేను నా భర్తతో చెప్పాను’’ అని ఆమె తెలిపారు.
ఇప్పుడు ఎల్లీ బాగా కోలుకుంటున్నారు.

ఫొటో సోర్స్, JAMES GALLAGHER
మ్యూకర్మైసిటిస్ అనే శిలీంధ్రాన్ని బ్లాక్ ఫంగస్ అని కూడా పిలుస్తారు. దీనివల్ల మాంసాన్ని తినేసే మ్యూకర్మైకోసిస్ అనే జబ్బు వస్తుంది.
ఇది చాలా త్వరగా విజృంభిస్తుంది. ఒక పెట్రి డిష్లో ఇది కేవలం 24 గంటల్లో పెరిగిపోయి దాని మూతను లేపేస్తుంది. అందుకే దీనిని లిడ్ లిఫ్టర్ అని కూడా అంటారు.
‘‘మీ దగ్గర ఉన్న ఒక పండు మరుసటి రోజుకు పిండిపిండి అయిందంటే అందులో మ్యూకర్ ఫంగస్ ఉందని అర్థం’’ అని హెచ్ఎస్ఎల్లోని క్లినికల్ సైంటిస్ట్ డాక్టర్ రెబెకా గోర్టన్ చెప్పారు.
ఇది మనుషుల్లో చాలా అరుదుగా కనిపిస్తుందనీ, మనుషులకు సోకితే చాలా ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్ అవుతుందనీ అన్నారు.
రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నవారిని ఈ బ్లాక్ ఫంగస్ బలంగా పట్టుకుంటుంది. ముఖం మీద, కళ్ల మీద, మెదడు మీద దాడి చేస్తుంది. ఇది వేగంగా ప్రాణాలు హరించగలదు. లేదంటే అవయవాల రూపరేఖలను మార్చేయగలదు.
కోవిడ్ మహమ్మారి సమయంలో భారతదేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు కూడా ఒక్కసారిగా విజృంభించాయి. దీనిబారిన పడి 4,000 మందికి పైగా రోగులు చనిపోయారు.
కోవిడ్ కోసం తీసుకున్న స్టెరాయిడ్ల వల్ల రోగనిరోధక వ్యవస్థ బలహీన పడటం, డయాబెటిస్ స్థాయి అధికంగా ఉండటం.. ఈ ఫంగస్ విజృంభణకు దోహదపడ్డాయని భావిస్తున్నారు.
ఫంగస్ను మరింత సీరియస్గా పట్టించుకోవాలా?
ఫంగల్ ఇన్ఫెక్షన్లు.. బ్యాక్టీరియా, వైరస్ల కన్నా చాలా భిన్నమైన ఇన్ఫెక్షన్లు. ఏదైనా ఫంగస్ వల్ల మనం జబ్బుపడ్డామంటే.. అది సాధారణంగా పర్యావరణం నుంచి మనకు సోకి ఉంటుంది. ఇతరుల దగ్గులు, తుమ్ముల వల్ల సోకదు.
మనం చాలా తరచుగా ఫంగస్ల బారిన పడుతుంటాం. కానీ అవి మన శీరరంలో విజృంభించాలంటే మన శరీర రోగనిరోధక వ్యవస్థ చాలా బలహీనంగా ఉండాలి.
మనలో చాలా మందిని ఔషధాలు సజీవంగా ఉంచుతుండటం వల్ల (క్యాన్సర్ చికిత్సలు తీసుకోవటం వంటి వాటి ద్వారా)..రోగ నిరోధక వ్యవస్థలు బలహీనంగా ఉన్నాయి.
అది వ్యాపించే తీరు, ఎలాంటి వారికి సోకుతుంది అనే విషయాల్లో.. కోవిడ్ మహమ్మారికి భిన్నమైన రూపాన్ని ఫంగల్ మహమ్మారి తీసుకోవచ్చునని డాక్టర్ స్టోన్ అంటున్నారు.
పర్యావరణంలో ఎన్నో రకాల ఫంగస్లు, ఎంతో అధిక స్థాయిలో ఉండటం వల్ల వీటి నుంచి ముప్పు పొంచి ఉందని ఆయన భావిస్తున్నారు.
వాతావరణ మార్పు, అంతర్జాతీయ ప్రయాణాలు, పెరుగుతున్న కేసుల సంఖ్య, వాటికి చికిత్సల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వంటివన్నీ ఆ ముప్పును మరింత తీవ్రం చేస్తున్నాయని హెచ్చరిస్తున్నారు.
ఫంగస్లు మనల్ని జాంబీలుగా మార్చకపోవచ్చు. కానీ అవి మరింత తీవ్రమైన సమస్యలను కలిగించవచ్చు.
ఇవి కూడా చదవండి:
- ముస్లిం ఫండ్ పేరుతో ప్రజల నుంచి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన అబ్దుల్ రజాక్
- మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాలు: 'బంబుల్, టిండర్ వంటి యాప్స్తో నేను మగాళ్ళను ఎందుకు ఆకర్షించాలి?'
- ఫిన్లాండ్: పరీక్షలు, ర్యాంకులు లేని అక్కడి చదువుల గురించి ఇండియాలో ఎందుకు చర్చ జరుగుతోంది?
- జహాన్ ఆరా: విలాసవంతమైన మసీదులు, సత్రాలు కట్టించిన అందాల మొఘల్ రాణి
- థైరాయిడ్ సమస్య: మందులు వాడుతున్నా తగ్గకపోతే ఏం చేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)















