ఇజ్రాయెల్-గాజా ఘర్షణ: 'ఒకటి రెండు రోజుల్లో కాల్పుల విరమణ' అంటున్న హమాస్, కఠినంగానే ఉన్న నెతన్యాహు

గాజాలో ఇజ్రాయెల్ ప్రయోగించిన ఒక పేలని మిసైల్ మీద కూర్చున్న అక్కచెల్లెళ్లు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, గాజాలో ఇజ్రాయెల్ ప్రయోగించిన ఒక పేలని మిసైల్ మీద కూర్చున్న అక్కచెల్లెళ్లు

ఇజ్రాయెల్-గాజా మిలిటెంట్ల మధ్య ఒకటి రెండు రోజుల్లో కాల్పుల విరమణ జరగవచ్చని పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ సీనియర్ నేత చెప్పారు.

అయితే, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మాత్రం ఇజ్రాయెల్ పౌరుల శాంతిభద్రతల పరిరక్షణ జరిగేవరకు తమ దాడులు కొనసాగుతాయని అంటున్నారు.

మరోవైపు, వరుసగా 11వ రోజూ దాడులు కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం గాజాలోని హమాస్ స్థావరాలపై ఇజ్రాయెల్ 100కు పైగా దాడులు చేసింది. బదులుగా పాలస్తీనా మిలిటెంట్లు కూడా ఇజ్రాయెల్ మీద రాకెట్ల వర్షం కురిపించారు.

ఇజ్రాయెల్-పాలస్తీనా మిలిటెంట్ల మధ్య తూర్పు జెరూసలెం గురించి కొన్ని వారాలుగా ఉద్రిక్తతలు చెలరేగాయి. అల్-అక్సా మసీదు కోసం యూదులు, అరబ్బుల మధ్య ఘర్షణ జరిగింది. రెండు వర్గాలూ దానిని తమ పవిత్ర స్థలంగా భావిస్తున్నాయి.

హమాస్ సీనియర్ నేత మూసా అబూ మర్జూక్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హమాస్ సీనియర్ నేత మూసా అబూ మర్జూక్ (2015లో చిత్రం)

హమాస్ నేత ఏం చెప్పారు?

హమాస్ రాజకీయ విభాగం నేత మూసా అబూ మార్జూక్ లెబనాన్‌లో అల్-మయాదీన్ టీవీతో మాట్లాడారు.

"రెండు పక్షాల మధ్య కాల్పుల విరమణ కోసం జరుగుతున్న ప్రయత్నాలు సఫలమవుతాయని నాకు అనిపిస్తోంది. ఒకటి రెండు రోజుల్లో కాల్పుల విరమణ జరగవచ్చు. అది పరస్పర అంగీకారంతోనే జరుగుతుంది" అని ఆయన అన్నారు.

రెండు పక్షాల మధ్య కాల్పుల విరమణకు అంతర్జాతీయ ఒత్తిడి తీవ్రమవుతున్న సమయంలో హమాస్ నేత ఈ ప్రకటన చేశారు.

"మధ్యవర్తుల జోక్యంతో కాల్పుల విరమణకు రెండు పక్షాలూ సూత్రప్రాయంగా అంగీకరించాయి. కానీ, ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి" అని ఈజిఫ్ట్‌కు చెందిన ఒక అధికారి వార్తా ఏజెన్సీ రాయిటర్స్‌తో అన్నారు.

హమాస్ రాకెట్‌ను ఢీకొడుతున్న ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ యాంటీ మిసైల్ సిస్టమ్‌ను చూస్తున్న సైనికాధికారి

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, హమాస్ రాకెట్‌ను ఢీకొడుతున్న ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ యాంటీ మిసైల్ సిస్టమ్‌

నెతన్యాహుతో మాట్లాడిన బైడెన్

"కాల్పుల విరమణకు దారులు వేసేలా ఘర్షణల తీవ్రత తగ్గుతుందని తాను ఆశిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు తెలియజేశారు" అని వైట్ హౌస్ ఒక ప్రకటన విడుదల చేసింది.

జో బైడెన్ అమెరికా కాలమానం ప్రకారం బుధవారం ఉదయం నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడారు.

ఇజ్రాయెల్-పాలస్తీనా మిలిటెంట్ల మధ్య ఘర్షణ మొదలైన తర్వాత ఇద్దరు నేతలూ మాట్లాడుకోవడం ఇది నాలుగోసారి.

కాల్పుల విరమణకు పరిష్కారం కనుగొనాలని జో బైడెన్ కోరుకుంటున్నారని వైట్ హౌస్ తన ప్రకటనలో చెప్పింది.

అయితే "ఇజ్రాయెల్ పౌరుల జీవితాలకు ప్రశాంతత, భద్రత లభించేవరకూ సైనిక చర్యలు కొనసాగించాలని నెతన్యాహు నిశ్చయించుకున్నారు" అని ఇజ్రాయెల్ మీడియా చెప్పింది.

"ఈసారి మా సైనిక చర్యలు హమాస్‌కు ఊహించని షాకులు ఇచ్చాయి. ఆ దెబ్బతో అది కొన్నేళ్ల వెనక్కు వెళ్లిపోయింది" అని నెతన్యాహు ఇంతకు ముందే అన్నారు.

బెంజమిన్ నెతన్యాహు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఈ ఘర్షణలపై ఒక ప్రకటన విడుదల చేయడాన్ని ఇజ్రాయెల్‌కు మిత్ర దేశమైన అమెరికా వరుసగా వ్యతిరేకిస్తూ వస్తోంది.

బుధవారం లెబనాన్ నుంచి కూడా ఇజ్రాయెల్ మీద నాలుగు రాకెట్లు ప్రయోగించారు. తర్వాత ఇజ్రాయెల్ కూడా లెబనాన్‌లోని చాలా ప్రాంతాల మీద దాడులు చేసింది.

అయితే ఈ దాడుల వల్ల ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతాయా అనేది ఇంకా స్పష్టం కాలేదు

10 రోజులుగా కొనసాగుతున్న ఘర్షణల్లో గాజాలో ఇప్పటివరకూ 227 మంది చనిపోయారు.

గాజాపై నియంత్రణ ఉన్న హమాస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం మృతుల్లో దాదాపు 100 మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)