ఆల్కహాల్ తాగితే ఈ ట్యాగ్‌లు పోలీసులకు చెప్పేస్తాయ్

ఆల్కహాల్

ఆల్కహాల్ తాగితే అధికారులను అప్రమత్తం చేసే సరికొత్త ట్యాగ్‌లు వచ్చేశాయ్. వీటిని బ్రిటన్‌లో పోలీసులు వాడటం కూడా మొదలుపెట్టారు.

''సొబ్రైటీ ట్యాగ్స్''గా పిలుస్తున్న ఈ ట్యాగ్స్.. కోర్టు ఆదేశాలను ధిక్కరించి ఆల్కహాల్ తాగేవారిని అధికారులకు పట్టిస్తున్నాయి.

ప్రతి 30 నిమిషాలకు ఒకసారి చెమటలోని ఆల్కహాల్ స్థాయిని పరీక్షించడం ద్వారా ఈ ట్యాగ్‌లు పనిచేస్తాయి. ఆల్కహాల్ జాడ కనిపిస్తే, వెంటనే ఇవి అధికారులకు సమాచారం అందిస్తాయి.

కొంతమంది ఆల్కహాల్ తీసుకున్న అనంతరం ఎక్కువగా నేరాలకు పాల్పడుతుంటారు. ఇలాంటి వారు ఆల్కహాల్ తీసుకోకూడదని బ్రిటన్ కోర్టులు సూచిస్తుంటాయి. ఒకవేళ మళ్లీ వారు ఆల్కహాల్ తీసుకుంటూ పట్టుబడితే, వారిపై మరిన్ని ఆంక్షలు విధిస్తారు.

వేల్స్‌లో గత అక్టోబరులో ఈ ట్యాగ్స్‌ను ప్రయోగాత్మకంగా వాడటం మొదలుపెట్టారు.

ఆల్కహాల్

ఫొటో సోర్స్, Getty Images

అప్పటి నుంచి వంద మందికిపైగా నేరస్థులకు ఈ ట్యాగ్‌లు వేశామని, వారిలో ఆల్కహాల్ స్థాయిలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని అధికారులు తెలిపారు.

తాజాగా ఈ ట్యాగ్‌లను ఇంగ్లండ్ వ్యాప్తంగా అమలులోకి తీసుకొచ్చారు.

అంటే ఇక్కడ ఆల్కహాల్ తాగిన అనంతరం నేరాలకు పాల్పడే అలవాటు ఉన్నవారిని గుర్తించి వారికి ఈ ట్యాగ్‌లు ధరించేలా చేస్తారు.

''ఆల్కహాల్ తీసుకున్న తర్వాత నేరాలకు పాల్పడే అలవాటు ఉన్నవారిని అడ్డుకోవడంలో ఈ ట్యాగ్‌లు చక్కగా పనిచేస్తాయి. అంతేకాదు నేరస్థులు ఈ వ్యసనానికి దూరంగా ఉంచేందుకూ ఇవి తోడ్పడతాయి''అని పోలీసింగ్, నేరాల శాఖా మంత్రి కిట్ మాల్ట్‌హౌస్ చెప్పారు.

కేవలం 18ఏళ్లకుపైబడిన, ఆల్కహాల్‌కు బానిసలైన నేరస్థులకు మాత్రమే ఈ ట్యాగ్‌లు వేస్తారు. శానిటైజర్లు, పెర్ఫ్యూమ్‌లు, ఆల్కహాల్‌ల మధ్య భేదాన్ని ఈ ట్యాగ్‌లు చక్కగా కనిపెట్టగలవని అధికారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)