కొబ్బరి కల్లు.. శ్రీలంక నుంచి ప్రపంచమంతా ప్రయాణిస్తున్న మత్తు పానీయం

ఫొటో సోర్స్, Amila Gamage
తాటికల్లు, ఈత కల్లు గురించి తెలిసేందే. మరి కొబ్బరి కల్లు గురించి ఎప్పుడైనా విన్నారా? కొబ్బరి చెట్టు నుంచి తీసే ఈ కల్లు శ్రీలంకలో చాలా ఫేమస్.
ఇప్పుడు ప్రపంచ మార్కెట్లోకి దీన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. దీనిపై బీబీసీ ప్రతినిధి అయేశా పెరీరా కొలంబో నుంచి అందిస్తున్న ప్రత్యేక కథనం.
లండన్లోని ప్రసిద్ధ రెస్టారెంట్లలో ఇప్పుడు ఈ కొబ్బరి కల్లును అందిస్తున్నారు. దివంగత ట్రావెల్ అండ్ ఫుడ్ రచయిత ఆంథోనీ బౌర్డెయిన్ దీని గురించి ప్రస్తావిస్తూ ''విస్కీని, రమ్తో కలిపితే వచ్చే స్ట్రాంగ్ ద్రావకం.. మత్తెక్కించే అద్భుతం ఈ కొబ్బరి కల్లు'' అని అభివర్ణించారు.
అయితే, స్థానికులు మాత్రం ఈ మత్తు పానీయాన్ని డార్క్ రమ్ అని పిలుస్తుంటారు. శ్రీలంకలోని దిగువ తరగతి ప్రజల దీన్ని ప్రీమియం అల్కహాల్గా భావిస్తారు. రాజధాని కొలంబోలోని ధనిక వర్గాలు ఈ కొబ్బరి కల్లును కాకుండా స్కాచ్, విస్కీ లేదా రమ్ను మాత్రమే తీసుకుంటాయి.

ఫొటో సోర్స్, Amila Gamage
శ్రీలంక ప్రభుత్వం కూడా ఆదాయం కోసం ఈ కల్లు తయారీపై ఎలాంటి ఆంక్షలు విధించడం లేదు. సమాజంపై ఈ మద్యం తయారీ పరిశ్రమ తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది.
మద్యం తయారీ కంపెనీలపై భారీగా పన్నులు ఉంటాయి. అలాగే, మద్యానికి సంబంధించిన ప్రకటనలు ఇవ్వకుండా నిషేధం కూడా ఉంది.
ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కొబ్బరి కల్లు నాణ్యతను పెంచి ఇంటా, బయట దాన్ని మార్కెట్ చేసే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి.
ప్రీమియం విభాగానికి చెందిన కొబ్బరికల్లు అమ్మకాలు శ్రీలంకతో పాటు ఇతర దేశాల్లో లాభసాటిగానే ఉంది. విదేశాల్లో చక్కటి మత్తు పానీయంగా, కాక్టైల్లో వినియోగించే ద్రావకంగా దీన్ని మార్కెట్ చేస్తున్నారు.
రాక్ల్యాండ్ డిస్టిలరీస్ మేనేజింగ్ డైరెక్టర్ అమల్ డి సిల్వా విజయరత్నే ఈ కల్లు తయారీ గురించి వివరించారు. కేవలం రెండు వస్తువులతోనే నాణ్యమైన కొబ్బరి కల్లును ఉత్పత్తి చేస్తారని ఆయన చెప్పారు.
''దీన్ని తయారు చేయడానికి కొబ్బరి చెట్టు నుంచి సేకరించిన ద్రవం, నీళ్లు మాత్రమే అవసరం అవుతాయి'' అని ఆయన తెలిపారు. దీని తయారీ తమ రక్తంలోనే ఉందని చెప్పారు.

ఫొటో సోర్స్, Amila Gamage
ఈ పానీయాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన ఘనత తన మామ జేబీఎం పెరెరాకు దక్కుతుందని ఆయన తెలిపారు. 1924లో బ్రిటన్ ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్టును తీసుకొని వాణిజ్యపరంగా ఆయన తొలిసారి కొబ్బరి కల్లును ఉత్పత్తి చేశారని చెప్పారు.
తన మామ దారిలోనే ఇందులో కొత్తగా ఆవిష్కరణలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు విజరత్నే తెలిపారు.
సిలోన్ అరాక్ పేరుతో ఒక కొత్త తరహా మద్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
''2002లో మొదటిసారి మేం ఇంగ్లాండ్కు మా ఉత్పత్తిని పంపించాం. నిజానికి ఇంగ్లాండ్లో మద్యాన్ని మార్కెట్ చేయడం చాలా కష్టమైన పని. ఇప్పుడు శ్రీలంకలో కంటే ఇంగ్లాండ్లోనే తమ సిలోన్ మద్యం ఎక్కువగా అమ్ముడుపోతుంది'' అని చెప్పారు.

ఫొటో సోర్స్, Amila Gamage
త్వరలో భారత్లో కూడా..
ఇప్పుడు వీరి బ్రాండ్కు సింగపూర్, జర్మనీ, జపాన్లో మార్కెట్ ఉంది.ఈ ఏడాది భారత్లో కూడా మార్కెట్ చేసేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నారు.
సిలోన్ సారాయిని సింగపూర్ బార్లలో కాక్టెయిల్లో ఉపయోగిస్తున్నారు.
దీన్ని తమ బార్లలో ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇదే బాగా అమ్ముడుపోతుందని బార్ ఓనర్ విజయ్ మురళీధర్ తెలిపారు.
శ్రీలంకలో ఎప్పటి నుంచి ఈ కల్లును తాగుతున్నారనేదానిపై సరైన సమాచారం లేదు. అయితే, ప్రపంచంలోని అతి పురాతన స్పిరిట్లలో ఇదీ ఒకటని భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Instagram/Walk_with_M
కొబ్బరి చెట్టు నుంచి దీన్ని తీసిన వెంటనే రుచి చూస్తే అది తియ్యగా, కాస్త ఉప్పగా ఉంటుంది. కానీ, అలా తీసిన గంటలోనే కిణ్వన ప్రక్రియ వేగంగా జరిగి అల్కహాల్ 6 శాతానికి పెరుగుతుంది.
తర్వాత దీన్ని విస్కీ, బ్రాందీ తరహాలో స్వేదన ప్రక్రియకు గురిచేస్తారు. కొబ్బరి కల్లు కోసం ఎన్నో తరాలుగా ఇదే పద్దతిని అనుసరిస్తున్నారు.
కల్లుగీత కార్మికులగా పిలిచే వారు రెండు రోజులకు ఒకసారి పొడవాటి కొబ్బరి చెట్లను ఎక్కి పువ్వులను తెరిచి కల్లు కోసం సిద్ధం చేస్తారు.
శ్రీలంకలోని నాలుగు అతిపెద్ద కొబ్బరి కల్లు ఉత్పత్తి సంస్థలు ఏటా 60 మిలియన్ లీటర్ల కల్లును ఉత్పత్తి చేస్తున్నాయి.
ప్రీమియం మద్యంలో 100 శాతం శుద్ధమైన కల్లు ఉంటుంది. అందుకే దీన్ని వాళ్లు ఎక్స్ట్రా స్పెషల్ అరాక్ అంటారు. సాధారణ మద్యంలో కేవలం 3 శాతం కల్లు మాత్రమే ఉంటుంది. అయినప్పటికీ ఆ దేశంలో 70 శాతం వాటా ఈ కల్లుదే ఉంది.
''ఇతర దేశాల్లోని పెద్దస్థాయి వ్యక్తులను కలిసినప్పుడు ఒక బాటిల్ కొబ్బరి కల్లును గిఫ్ట్గా తీసుకెళ్తామని శ్రీలంకలోని చాలా మంది సీఈవోలు నాకు చెప్పారు'' అని విజయరత్నే తెలిపారు.
ప్రపంచ మార్కెట్లో కొబ్బరి కల్లుకు గుర్తింపు రావడానికి ఇంకా చాలా సమయం పడుతుందని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- రాజ్నాథ్ సింగ్ బీజేపీకి కొత్త చిక్కుముడిలా మారారా: అభిప్రాయం
- యూట్యూబ్ ప్రాంక్: బిస్కెట్లలో టూత్పేస్టు.. 15 నెలలు జైలు, 15 లక్షలు జరిమానా
- బీబీసీ పరిశోధన: కామెరూన్లో ఈ మహిళను చంపిన సైనికులను ఎలా కనుగొన్నామంటే...
- నాసా: అంతరిక్ష కేంద్రంలో హాలిడే.. పర్యాటకులకు అనుమతి.. ఒక రాత్రికి అద్దె రూ. 24 లక్షలు
- ఆపరేషన్ బ్లూ స్టార్: స్వర్ణ మందిరంలోకి భారత యుద్ధ ట్యాంకులు ప్రవేశించగానే ఏం జరిగింది
- ఇమ్రాన్ ఖాన్ కొండచిలువ చర్మంతో చేసిన చెప్పులు వేసుకుంటారా
- ‘100 మందిని చంపేసి నదిలో పడేశారు’.. సూడాన్ నరమేధం
- ఈవిడ షాపింగ్ బిల్లు రూ.140 కోట్లు..
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








