న్యూజీలాండ్ ప్రభుత్వం 'తల్లుల' కోసం చేసిన చట్టంపై చర్చ ఎందుకు... భారత్లో పరిస్థితి ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సరోజ్ సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
"బిడ్డకు జన్మనిచ్చిన రోజు, నిజానికి తల్లికి కూడా పునర్జన్మే అవుతుంది.."
"కానీ, నా గర్భం నుంచి బయటికొచ్చిన బిడ్డ ఇప్పుడు ఈ లోకంలో లేడు. నా బిడ్డను నేను 40 వారాలు కడుపులో మోయలేకపోయాను. అయినా, నేను తల్లినే కదా..."
"20 వారాలే గర్భంతో ఉన్నంత మాత్రాన.. తల్లిని తల్లిగా గుర్తించరా"
తను పనిచేసే ప్రైవేటు కంపెనీ హెచ్ఆర్తో ఫోన్లో గొడవపడిన ప్రియ అవతలి వాళ్లు మాట్లాడకముందే కోపంగా కాల్ కట్ చేసింది.
ఆమె కళ్ల నుంచి కన్నీళ్లు ధారకడుతున్నాయి. పక్కనే ఉన్న భర్త రవి ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నాడు.
ఆమె భుజం మీద చేయి వేసి "కొన్ని రోజులు ఆఫీసుకు వెళ్లకు. నాకు, నీ ఆరోగ్యం కంటే.. నీ ఉద్యోగం ముఖ్యం కాదు" అన్నాడు.

ఫొటో సోర్స్, Thinkstock
భారత్లో ఆరు వారాల సెలవు
కానీ, ప్రియ ఫోన్ కట్ చేయగానే, ఆమె ఫోన్కు కంపెనీ హెచ్ఆర్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది.
అందులో "మీరు ఆరు వారాలు ఇంట్లో ఉండచ్చు. ఈ విషాద సమయంలో, కంపెనీ మీకు అండగా ఉంటుంది" అని ఉంది.
ప్రియకు అలాంటి సెలవులు ఉంటాయనే విషయమే తెలీదు. కంపెనీ హెచ్ఆర్ ఫోన్ చేసి తనను మళ్లీ జాబ్కు రావాలని చెబుతారేమో అనుకుంది.
కానీ, ప్రియ పక్కనే ఉన్న రవి ఇప్పటికీ బాధగానే ఉన్నాడు. ఆ సమయంలో తనకు ప్రియ పక్కనే ఉండాలని ఉంది. కానీ, భారత కార్మిక చట్టాల్లో భర్తకు అలాంటి సెలవు ఇచ్చే నిబంధనలు లేవు.
అయితే, రవి తన వార్షిక సెలవులు వాడుకుని అలా చేయచ్చు. తను, అదే చేశాడు.
ప్రియ గత ఐదు నెలలుగా గర్భంతో ఉంది. ఒక రాత్రి నిద్రపోతున్నప్పుడు హఠాత్తుగా మొత్తం పడకంతా తడిచినట్లు ఆమెకు అనిపించింది. ఆస్పత్రికి వెళ్లిన తర్వాత తనకు మిస్ కారేజ్ అయిందనే విషయం తెలిసింది.
తన బిడ్డను ఆమె చూడలేకపోయింది. "అమ్మాయా, అబ్బాయా..తన ముఖం నీలా ఉందా, నాలా ఉందా అని పదే పదే భర్తను అడుగుతూనే ఉంది.

ఫొటో సోర్స్, Wales News Service
ఇదంతా శనివారం జరిగింది. తర్వాత 48 గంటలపాటు ఇద్దరూ ఒకరినొకరు ఓదార్చుకున్నారు. ఏం మాట్లాడుకోలేదు. సోమవారం ఆమె ఆపీసుకు వెళ్లకపోవడంతో, మంగళవారం హెచ్ఆర్ నుంచి ఫోన్ వచ్చింది.
మిస్ కారేజ్ అవడం వల్ల ఇద్దరూ ఎంత బాధలో ఉన్నారంటే, దానిని వాళ్లు ఆఫీసులో గానీ, ఇంట్లోవాళ్లకు గానీ చెప్పుకోలేరు. దాని నుంచి కోలుకునే సమయం కూడా దొరకలేదు.
దిల్లీలో ఉంటున్న ప్రియ ఆ ఆరు వారాలూ ఒంటరిగా తనలో తాను కుమిలిపోతూ గడిపింది. ఆఫీసుకు వెళ్లిన రవి చిరునవ్వు వెనుక తన బాధనంతా దాచేస్తూ రోజూలాగే పని పూర్తి చేయడానికి ప్రయత్నించేవాడు.
రవి, ప్రియ ఇద్దరూ దిల్లీ కాకుండా, న్యూజీలాండ్లో ఉండుంటే, వారు కలిసి గడపడానికి మరికొన్ని రోజుల సెలవు దొరికుండేది.
న్యూజీలాండ్ ప్రభుత్వం బుధవారం ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. దేశంలో 'మిస్ కారేజ్', 'స్టిల్ బర్త్' లాంటివి జరిగినపుడు ఆ జంటకు మూడు రోజుల పెయిడ్ లీవ్ తీసుకోడానికి అనుమతి ఇచ్చింది. బహుశా, అలా చేసిన మొదటి దేశంగా నిలిచింది.

ఫొటో సోర్స్, Getty Images
భారత చట్టాలు ఏం చెబుతున్నాయి
భారత్లో గర్భంతో ఉన్నవారికి 'మిస్ కారేజ్' అయితే విడిగా 'మిస్ కారేజ్' లీవ్ నిబంధన ఉంది. కానీ ఆ మహిళ భాగస్వామికి మాత్రం అలాంటి సెలవులు ఏవీ ఉండవు.
అందుకే, రవి సెలవు తీసుకుని ప్రియక తోడుగా ఇంట్లో కొన్ని రోజులు గడపడం కుదరదు.
"ఆ 20 వారాల్లో నేను మాకు పుట్టబోయే బిడ్డ గురించి ఎన్నెన్నో ఆలోచించా. తనకు ఏ పేరు పెట్టాలి, తన మొదటి డ్రెస్ ఏది వేయాలి, ఎలా పెంచాలి, తన గది గోడల రంగు ఎలా ఉండాలో కూడా అనుకున్నాను.
అయితే, ప్రభుత్వాలు బిడ్డను తల్లికి జోడించి మాత్రమే ఎందుకు చూస్తాయో తెలీదు. బిడ్డపై తండ్రికి కూడా అంతే హక్కు ఉంటుంది కదా" అన్నాడు.

ఫొటో సోర్స్, Getty Images
మిస్ కారేజీ సెలవు లాంటి నిబంధనలు భారత కార్మిక చట్టాల్లో ఎన్నో ఏళ్ల నుంచీ ఉన్నాయని తెలీని ప్రియ లాంటి మహిళలు దేశంలో ఎంతోమంది ఉన్నారు.
భారత మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961 ప్రకారం.. మిస్ కారేజ్ తర్వాత మహిళలకు వేతనంతో కూడిన ఆరు వారాల సెలవు ఇవ్వడం తప్పనిసరి. ఆ మహిళ ఆరు వారాలపాటు పనికి రావడం గానీ, రావాలని కంపెనీ ఆమెను బలవంతం చేయడం కానీ చేయకూడదు.
ఈ సెలవు వాడుకోడానికి మహిళ డాక్టర్ సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుంది. ఈ చట్టానికి 2017లో సవరణ కూడా చేశారు. కానీ, మిస్ కారేజ్కు సంబంధించిన నిబంధనలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి.
ఈ చట్టం, భారత్లోని ఫ్యాక్టరీలు, గనులు, తోటలు, దుకాణాలతోపాటూ 10 మంది కంటే ఎక్కువ మంది మహిళలు పనిచేసే అన్ని సంస్థలకు వర్తిస్తుంది.
అయితే, వాస్తవం ఏంటంటే చాలా ప్రైవేట్ కంపెనీలు ఈ సెలవులు ఇవ్వవు. చాలాసార్లు మహిళలే స్వయంగా తమకు ఇలా జరిగిందని చెప్పుకోడానికి ఇష్టపడరు. అందుకే, కంపెనీకి ఏం చెప్పకుండా మౌనంగా కొన్ని రోజులు సిక్ లీవ్ పెట్టాక తిరిగి పనిలోకి వచ్చేస్తుంటారు.
కానీ, న్యూజీలాండ్లో దీనిపై ఆమోదించిన ఒక కొత్త చట్టం గురించి జనం సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఏయే కార్యాలయాల్లో ఇలాంటి నిబంధనలు వర్తిస్తున్నాయో చెబుతున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
న్యూజీలాండ్ చట్టం చారిత్రకమా
"మిస్ కారేజ్ అయినప్పుడు సిక్ లీవ్ పెట్టడానికి అది ఒక వ్యాధి కాదు. ఒక రకరంగా అది తీరని నష్టం. దాని నుంచి కోలుకునే అవకాశం ప్రతి ఒక్కరికీ దక్కాలి" అని న్యూజీలాండ్లో ఈ బిల్లును ప్రవేశపెట్టిన ఒక ఎంపీ అన్నారు.
అందుకే, న్యూజీలాండ్ ప్రభుత్వం మహిళకు మిస్ కారేజ్ అయినా, ఆమె భాగస్వామి కూడా సెలవు తీసుకునే నిబంధన ఏర్పాటు చేసింది.
ఒక గర్భవతికి మిస్ కారేజ్ అయిన తర్వాత, ఆమె పురుష భాగస్వామికి కూడా ఇలాంటి పెయిడ్ లీవ్ నిబంధన కల్పించిన బహుశా మొదటి దేశం న్యూజీలాండే.
ఈ నిబంధన 'స్టిల్ బర్త్' కేసులో కూడా వర్తిస్తుంది. అంతేకాదు, సరోగసీ ద్వారా పిల్లల్ని కోరుకున్నప్పుడు, మిస్ కారేజ్ అయితే, ఆ జంటకు కూడా ఈ సెలవు వర్తిస్తుంది అని చట్టంలో చెప్పారు.
మిస్-క్యారేజ్, స్టిల్ బర్త్ అంటే...
న్యూజీలాండ్లో గర్భంతో ఉన్నవారికి మిస్ కారేజ్ కావడం సాధారణ విషయమే అని ఆ దేశ గణాంకాలను బట్టి అంచనా వేయవచ్చు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
"ఇక్కడ ప్రతి నలుగురిలో ఒక మహిళ మిస్ కారేజ్ సమస్యను ఎదుర్కుంటోంది" అని ఆ బిల్లు ప్రవేశపెడుతున్న సమయంలో ఎంపీ జినీ అండర్సన్ చెప్పారు.
ప్రపంచ వ్యాప్తంగా కనీసం 30 శాతం ప్రెగ్నెన్సీల్లో మిస్ కారేజ్ అవుతుందని అమెరికన్ సొసైటీ ఫర్ రీప్రొడక్టివ్ హెల్త్ ఒక నివేదిక చెబుతోంది.
"మెడికల్ పరిభాషలో దీనిని 'స్పాంటేనియస్ అబార్షన్' లేదా 'ప్రెగ్నెన్సీ లాస్' అంటారు. మిస్ కారేజ్ అవడానికి రెండు పరిస్థితులు కారణం కావచ్చు" అని గైనకాలజిస్ట్ డాక్టర్ అనితా గుప్తా చెప్పారు.
"వీటిలో ఒకటి పిండం బాగానే ఉన్నప్పటికీ, ఇతర కారణాల వల్ల బ్లీడింగ్ కావడం. ఇంకొకటి గర్భంలో పిండం చనిపోవడం, అప్పుడు అబార్షన్ చేయడం తప్పనిసరి అవుతుంది" అన్నారు.
గర్భంలో పిండం చనిపోయినప్పుడు మిస్ కారేజ్ అవుతుంది. 20 వారాల గర్భం తర్వాత పిండం చనిపోతే దానిని మిస్ కారేజ్ అంటారు.
కొంతమంది మహిళల్లో గర్భం నిలవదు. వారికి ఇలా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా జరిగినప్పుడు సాధారణంగా బ్లీడింగ్, స్పాటింగ్(కొద్దికొద్దిగా రక్తస్రావం), కడుపు, నడుము నొప్పి, రక్తంతోపాటూ టిష్యూ బయటికి రావడం లాంటి లక్షణాలు కనిపిస్తాయని చెబుతారు.

ఫొటో సోర్స్, Getty Images
అయితే ప్రెగ్నెన్సీ సమయంలో బ్లీడింగ్ లేదా స్పాటింగ్ కనిపించినంత మాత్రాన మిస్ కారేజ్ అయ్యిందని చెప్పలేం. కానీ, అలా జరిగినప్పుడు కచ్చితంగా అప్రమత్తం కావాల్సి ఉంటుంది.
"మిస్ కారేజ్ తర్వాత సాధారణంగా మహిళ శరీరం కోలుకోడానికి నెల వరకూ పడుతుంది. అది వారికి ఎంత బ్లడ్ లాస్ జరిగింది అనేదానిపై ఆధారపడి ఉంటుంది, అందుకే భారత చట్టాల్లో ఆ మహిళకు ఆరు వారాల సెలవు ఇచ్చే నిబంధన ఉంది" అని డాక్టర్ అనిత చెప్పారు.
'స్టిల్ బర్త్' అంటే బిడ్డ పుట్టినపుడు ప్రాణాలతో లేకపోతే, ఆ శిశువు జన్మించినట్టే భావిస్తారు. దానిని డెలివరీ కేటగిరీలోనే ఉంచారు.
బిడ్డ ఆరోగ్యంగా పుట్టినపుడు తల్లి అతడికి పాలు పట్టాల్సి ఉంటుంది. అతడిని చూసుకోవాల్సి ఉంటుంది. అందుకే భారత్లో ఆరు నెలల ప్రసూతి సెలవు ఇచ్చే నిబంధన ఉంది.
'స్టిల్ బర్త్' విషయంలో సెలవు దినాలను కొందరు తగ్గించవచ్చని, దానికి సంబంధించి వేరు వేరు కంపెనీల్లో రకరకాల నిబంధనలు ఉన్నాయని డాక్టర్ అనిత చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
న్యూజీలాండ్లో మహిళా హక్కులు
మహిళల ప్రయోజనాల కోసం చట్టాలు చేయడంలో న్యూజీలాండ్ ఎప్పుడూ ముందుంటుంది.
గృహ హింసకు గురైన మహిళలకు అక్కడ 10 రోజుల వార్షిక సెలవు ఇచ్చే నిబంధనలు కూడా ఉన్నాయి. ఫిలిప్పీన్స్ తర్వాత న్యూజీలాండ్ అలాంటి సెలవులు ఇచ్చిన రెండో దేశంగా నలిచింది.
న్యూజీలాండ్లో 40 ఏళ్ల పాటు అబార్షన్ను నేరాల కేటగిరీలో ఉంచారు. దీనిని గత ఏడాదే తొలగించారు. ఇప్పుడు, ఒక 'హెల్త్ కండిషన్'గా భావించి, దానిపై నిర్ణయం తీసుకోడానికి అనుమతి ఇచ్చారు.
మహిళల కోసం ఇలాంటి ఎక్కువ చట్టాలు చేసిన క్రెడిట్ న్యూజీలాండ్ ప్రధాని జసిండా ఆర్డెన్కే దక్కుతుంది. 2016లో ప్రధానమంత్రిగా ఎన్నికైన జసిండా దేశానికి అత్యంత యువ ప్రధానిగా నిలిచారు.
ప్రధాని అయ్యాక 2018లో ఆమె ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చారు. ప్రపంచంలో అలా ప్రధాని అయ్యాక తల్లైన రెండో నేతగా నిలిచారు.
అదే ఏడాది ఆమె తన బిడ్డతో ఐక్యరాజ్యసమితి మహాసభకు కూడా వెళ్లారు. కరోనా మహమ్మారి సమయంలో కూడా జసిండా తీసుకున్న చర్యలను ప్రపంచమంతా ప్రశంసించింది.
ఇవి కూడా చదవండి:
- చాలా ఏళ్లుగా చిప్స్ మాత్రమే తింటున్నాడు.. చివరికి కంటి చూపు కోల్పోయాడు
- ‘మనిషి లాంటి’ చేప: ఇది కేన్సర్కి పరిష్కారం చూపుతుందా?
- కరోనావైరస్: రొయ్యల సాగుదారుల చిక్కులేంటి.. లాక్ డౌన్తో నష్టం ఎంత?
- అమెరికా అధ్యక్షుడు ఏం తింటారు? వాటి అర్థం ఏంటి?
- వేరుసెనగ పప్పు తింటే చనిపోతారా?
- ఉప్పు తిన్న సముద్రానికే మనం ముప్పు తెస్తున్నాం
- డాక్టర్లు బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ చేస్తుంటే... ఆ అమ్మాయి పియానో వాయించింది
- కరోనా వ్యాక్సీన్ భారతదేశంలో మొదట ఎవరికి ఇస్తారు... దీని కోసం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?
- ఆడపిల్లలు వయసు రాకముందే రజస్వల కావడానికి కారణాలేమిటి? సమస్యలేమిటి? పరిష్కారాలేమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)










