నల్గొండ: మహంకాళి విగ్రహం పాదాల వద్ద మనిషి తల... నరబలి ఇచ్చారన్న అనుమానాలు - ప్రెస్‌రివ్యూ

ఈ విగ్రహం పాదాల వద్దే మొండెం లేకుండా జహేందర్ నాయక్ తల ఉంది
ఫొటో క్యాప్షన్, ఈ విగ్రహం పాదాల వద్దే మొండెం లేకుండా జహేందర్ నాయక్ తల ఉంది

మతి స్థిమితం లేని ఓ వ్యక్తి తల నరికి మహంకాళి అమ్మవారి విగ్రహం పాదాల వద్ద ఉంచిన ఉదంతం నల్గొండ జిల్లాలో కలకలం సృషించిందని ఈనాడు ఓ కథనం ప్రచురించింది.

‘‘గుప్త నిధుల కోసం నరబలి ఇచ్చారా? మరేదైనా జరిగిందా? అనేది తేలాల్సి ఉంది. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం విరాట్‌నగర్ కాలనీ నాగార్జునసాగర్-హైదరాబాద్ జాతీయ రహదారి వెంట ఉంది. రహదారి పక్కనే మెట్టు మహంకాళి అమ్మవారి విగ్రహం ఉంది.

సోమవారం ఉదయం అమ్మ వారి పాదాల వద్ద మొండెం లేని తల ఉండడాన్ని ఆలయ పూజారి బ్రహ్మచారి గుర్తించారు. స్థానిక పెద్దలకు, పోలీసులకు సమాచారం అందించారు.

మృతుడిని గుర్తించే క్రమంలో తల ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. పలువురి సమాచారం ఆధారంగా మృతుడు జహేందర్ నాయక్ (30) అని, అతడిది సూర్యా పేట జిల్లా పాలకవీడు మండలం శూన్యపహాడ్ గ్రామమని ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చారు.

గుప్తనిధుల కోసం ఎవరైనా నరబలి ఇచ్చారా? అనే అనుమానాలను పోలీసులు వ్యక్తంచేస్తున్నారు. గతంలో ఇదే జిల్లాలోని శాలిగౌరారం, నాంపల్లి మండలం ముష్టిపల్లి, దేవరకొండ గుట్టల్లో గుప్త నిధుల కోసం నరబలి ఘటనలు జరిగిన నేపథ్యంలో పాత నేరస్థుల గురించి ఆరా తీస్తున్నారు.

‘మృతుడు జహేందర్ నాయక్‌కు మతిస్థిమితం లేదు. ఐదారేళ్లుగా అతడు ఇంటికి దూరంగా ఉంటున్నాడు. కొన్నాళ్లుగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం సమీపంలోని తుర్కయాంజాల్ వద్దనున్న ఓ ఆలయం వద్ద ఉంటూ.. చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచరిస్తుండేవాడు. అతడిని ఎవరు? ఎందుకు చంపారు? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. కేసు ఛేదించేందుకు ఎనిమిది బృందాలను నియమించాం ’ అని డీఎస్పీ ఆనంద్‌రెడ్డి వెల్లడించారు’’అని ఆ కథనంలో పేర్కొన్నారు.

రేప్

ఫొటో సోర్స్, Getty Images

కేరళలో భార్యల మార్పిడి రాకెట్‌.. వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులతో కార్యకలాపాలు

కట్టుకున్న భార్యను తాళి కట్టినవాడే ఇతరులకు తార్చే ‘భార్యల మార్పిడి’ దందా గుట్టు కేరళలో బట్టబయలైందని ఆంధ్రజ్యోతి ఓ కథనం ప్రచురించింది.

‘‘మీటప్‌ కేరళ’.. ‘కపుల్‌ మీట్‌ కేరళ’.. ‘కకోల్డ్‌ కేరళ’.. తదితర పేర్లతో వాట్సాప్‌, టెలిగ్రామ్‌, మెసెంజర్లలో పెద్ద సంఖ్యలో గ్రూపులు ఏర్పాటు చేసుకుని మరీ వారు కొనసాగిస్తున్న దారుణం ఒక మహిళ (26) ఫిర్యాదుతో బయటపడింది.

కొట్టాయం జిల్లా పథనాడ్‌కు చెందిన ఆ మహిళ నిస్సహాయ స్థితిలో గత శనివారం మధ్యాహ్నం (జనవరి 8న) పోలీసులను ఆశ్రయించింది. తన భర్తే (32) తనను పరాయి పురుషులతో శృంగారంలో, అసహజ లైంగిక చర్యల్లో పాల్గొనమంటున్నాడంటూ వాపోయింది.

భర్త సహకారంతో తనపై తొమ్మిది మంది అత్యాచారం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. తనపై అత్యాచారానికి పాల్పడిన తొమ్మిది మందిలో ఐదుగురు తమ భార్యలతో వచ్చారని.. మిగతా నలుగురూ భార్యలను తీసుకురాలేదని వెల్లడించింది.

తాను చెప్పినట్టు చేయకపోయినా, ఈ విషయం ఎవరికైనా చెప్పినా.. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నాడని చెప్పింది. రెండేళ్లుగా ఈ నరకాన్ని భరిస్తున్నానని తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులుఆమె చెప్పిన వివరాల ఆధారంగా.. దర్యాప్తునకు పలు బృందాలను ఏర్పాటు చేశారు.

సైబర్‌ సెల్‌ పోలీసుల నేతృత్వంలో దర్యాప్తు కొనసాగించి.. కేరళలోని వివిధ జిల్లాల్లో ఉంటున్న ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. బాధితురాలి భర్తనూ అదుపులోకి తీసుకున్నారు.

5000 జంటలు ఈ రాకెట్‌లో ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకివచ్చింది. కేరళలో ఉన్నత వర్గాలకు చెందిన పలువురు వ్యక్తులు, వీఐపీలు కూడా ఈ చీకటిదందాలో ఉన్నట్టు దర్యాప్తులో తేలింది’’అని ఆ కథనంలో పేర్కొన్నారు.

జగన్

ఫొటో సోర్స్, FACEBOOK/YSJAGANMOHANREDDY

ఏపీలో నైట్‌ కర్ఫ్యూ.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే..

ఆంధ్రప్రదేశ్‌లో నైట్‌ కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని సాక్షి ఓ కథనం ప్రచురించింది.

‘‘రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. త్వరలో వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు జారీ చేయనుంది.

50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడపాలని, మాస్క్‌ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

కోవిడ్‌ పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. కోవిడ్‌ విస్తరణ, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు.

దేశవ్యాప్తంగా వైరస్‌ విస్తరిస్తున్న విషయాన్ని అధికారులు వివరించారు. కోవిడ్‌ సోకిన వారికి దాదాపుగా స్వల్ప లక్షణాలు ఉంటున్నాయని అధికారులు తెలిపారు’’అని ఆ కథనంలో పేర్కొన్నారు.

సోనూ సూద్

ఫొటో సోర్స్, Facebook/Malavika

కాంగ్రెస్లోచేరిన సోనూసూద్ సోదరి

ప్రముఖ నటుడు సోనూసూద్ సోదరి మాళవిక సూద్ కాంగ్రెస్ పార్టీలో చేరారని వెలుగు దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.

‘‘రాజకీయ ప్రవేశంపై గత రెండు నెలలుగా వినిపిస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఆమె ప్రకటించారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో స్వస్థలమైన మోగా నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్నట్లు స్పష్టం చేశారు.

సోమవారం సోనూ నివాసానికి వెళ్లిన పంజాబ్ సీఎం చరణ్జీత్ చన్నీ, కాంగ్రెస్ పార్టీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆయనతో పాటు మాళవికతో భేటీ అయ్యారు. అనంతరం వారిద్దరి సమక్షంలో మాళవిక కాంగ్రెస్లో చేరారు.

సోదరి మాళవిక రాజకీయ ప్రవేశంపై గతేడాది నవంబర్లోనే సోనూసూద్ ప్రకటన చేశారు. కానీ ఏ పార్టీలో చేరుతున్నారన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు.

మాళవిక కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు అప్పట్లోనే వార్తలు వచ్చాయి. కొన్నాళ్ల క్రితం పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ సోనూతో భేటీ కావడం ఈ వార్తలకు బలాన్నిచ్చింది.

గతంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, శిరోమణి అకాళీదల్ అధినేత సుఖ్ బీర్ సింగ్ బాదల్ సైతం మాళవికను కలిసినా చివరకు కాంగ్రెస్ వైపే మొగ్గుచూపారు’’అని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)