విద్యార్థి బ్యాంక్ ఖాతాలో రూ. 900 కోట్లు జమ, ఇంటర్నెట్ కేంద్రాలకు పరుగు తీసిన జనం - ప్రెస్ రివ్యూ

2 వేల రూపాయల నోట్లు

ఫొటో సోర్స్, Getty Images

సాంకేతిక సమస్యల కారణంగా ఓ స్కూల్ విద్యార్థి బ్యాంకు ఖాతాలో రూ. 900 కోట్లు జమ అయినట్లు 'నమస్తే తెలంగాణ’ వార్తను ప్రచురించింది.

''బిహార్‌లోని కటిహార్‌ గ్రామానికి చెందిన గురుచరణ్‌ విశ్వాస్‌ స్కూల్‌ విద్యార్థి. యూనిఫాం, ఇతర ఖర్చుల కోసం ప్రభుత్వం నుంచి అతనికి స్కాలర్‌షిప్‌ రావాల్సి ఉంది.

అకౌంట్లో డబ్బులు పడ్డాయా.. లేదా.. చెక్‌ చేసుకోవడానికి ఇంటర్నెట్‌ సెంటర్‌కు వెళ్లాడు. అకౌంట్‌లో లాగిన్‌ అయ్యాడు. డబ్బును చూసి షాక్‌ అయ్యాడు.

ఖాతాలో స్కాలర్‌ షిప్‌ డబ్బు పడలేదు కానీ ఎక్కడి నుంచో రూ.900 కోట్లు వచ్చిపడ్డాయి. ఆరో తరగతి చదువుతున్న, అదే గ్రామానికి చెందిన ఆశిష్‌ పరిస్థితి కూడా అదే. అతని ఖాతాలో రూ.6.2 కోట్లు జమయ్యాయి.

ఇది తెలిసిన కటిహార్‌ గ్రామస్థులంతా తమ పాస్‌బుక్‌లు, ఏటీఎంలు తీసుకొని బ్యాంకులు, ఏటీఎంలు, ఇంటర్నెట్‌ సెంటర్లకు పరుగులు తీశారు.

తమకు కూడా డబ్బులు వచ్చాయేమోనని అదృష్టాన్ని పరీక్షించుకొన్నారు. ఈ ఇద్దరు విద్యార్థులకు ఉత్తర్‌ గ్రామీణ్‌ బ్యాంకులో ఖాతా ఉంది. సాంకేతిక సమస్యల వల్ల డబ్బు జమ అయినట్టు బ్రాంచ్‌ మేనేజర్‌ చెప్పారని'' నమస్తే తెలంగాణ పేర్కొంది.

ఓటింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల లెక్కింపు 19న

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ నిర్వహణ ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ శుక్రవారం కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, డీపీవోలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నట్లు 'సాక్షి' కథనం పేర్కొంది.

''ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజాశంకర్‌ తదితరులు పాల్గొంటారు.

రాష్ట్రవ్యాప్తంగా 7,220 ఎంపీటీసీ స్థానాలకు, 515 జెడ్పీటీసీ స్థానాలకు ఈ ఏడాది ఏప్రిల్‌ 8నే ఎన్నికలు జరిగినప్పటికీ న్యాయ వివాదాలతో కౌంటింగ్‌ ప్రక్రియ వాయిదా పడింది.

దాదాపు ఆరు నెలల అనంతరం గురువారం ఉదయం హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఎన్నికల కౌంటింగ్‌ నిర్వహించేందుకు అనుమతించడంతో 19న కౌంటింగ్‌ జరిపేందుకు ఎన్నికల కమిషనర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు 'సాక్షి' పేర్కొంది.

మద్యం దుకాణం

ఫొటో సోర్స్, Getty Images

మద్యం దుకాణాల్లో రిజర్వేషన్.. తెలంగాణ కేబినెట్ నిర్ణయం

మద్యం దుకాణాల రిజర్వేషన్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు 'వెలుగు' కథనం వెల్లడించింది.

''సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీ మేరకు మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్‌ ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయంచింది.

గురువారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

మద్యం దుకాణాల విషయంలో రిజర్వేషన్ల అములుకు కేబినెట్ లో ఆమోదించారు.

వచ్చే ఏడాది నుంచి మద్యం దుకాణాల్లో.. గౌడ కులస్థులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం కేటాయించాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని'' వెలుగు పేర్కొంది.

డ్రగ్స్ కేసు విచారణలో ఈడీ కార్యాలయానికి వచ్చిన పూరీ జగన్నాథ్

ఫొటో సోర్స్, ugc

ఫొటో క్యాప్షన్, డ్రగ్స్ కేసు విచారణలో ఈడీ కార్యాలయానికి వచ్చిన పూరీ జగన్నాథ్

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు.. మా వద్ద ఎలాంటి ఆధారాల్లేవ్‌: ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్ శాఖ

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసుకు సంబంధించి తమ ఆధీనంలో ఎలాంటి ఆధారాలు లేవని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌శాఖ హైకోర్టుకు తెలిపినట్లు 'ఆంధ్రజ్యోతి' వెల్లడించింది.

''ఈ మేరకు ఆ శాఖ డైరెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. డ్రగ్స్‌ సరఫరా కేసును కేంద్ర సంస్థలకు అప్పగించాలని, ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్‌ ఏకపక్షంగా దర్యాప్తును కొనసాగిస్తోందంటూ కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి 2017లో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ, సిట్‌, సీబీఐ, ఈడీ, నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్సీబీ), డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ) వంటి సంస్థలను ప్రతివాదులుగా చేర్చారు.

రాష్ట్ర ప్రభుత్వం తమ దర్యాప్తునకు సహకరించడం లేదని, ఎక్సైజ్‌శాఖ నమోదు చేసిన 12కేసుల వివరాలు తమకు సమర్పించేలా ఆదేశాలు జారీచేయాలంటూ ఇదే పిటిషన్‌లో ఈడీ అప్లికేషన్‌ దాఖలు చేసింది.

ఈడీ కోరిన వివరాలు తమ వద్ద లేవంటూ తాజాగా ఎక్సైజ్‌శాఖ బుధవారం హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది.

టాలీవుడ్‌ డ్రగ్స్‌ వ్యవహారానికి సంబంధించి 12కేసులు నమోదు చేసినట్లు ఆ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అన్ని కేసుల్లో దర్యాప్తు పూర్తై, ట్రయల్‌ కోర్టుల్లో చార్జిషీట్లను దాఖలు చేశామని తెలిపారు.

డిజిటల్‌ ఎవిడెన్స్‌లు, రికార్డెడ్‌ స్టేట్‌మెంట్లు, ఇతర ఆధారాలను ట్రయల్‌ కోర్టుల్లో సమర్పించామని ఎక్సైజ్ శాఖ వివరించినట్లు'' ఆంధ్రజ్యోతి పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)