సెప్టెంబర్ 1 నుంచి అమలవుతున్న కొత్త నిర్ణయాలు ఇవే, వీటి వల్ల మీ జేబుపై పడే భారమెంత?

భారత ఆర్థిక వ్యవస్థ

ఫొటో సోర్స్, Getty Images

దేశ వ్యాప్తంగా సెప్టెంబరు 1 నుంచి కొన్ని కొత్త నిర్ణయాలు అమలులోకి వస్తున్నాయి. బ్యాంకులతో మొదలుపెట్టి, వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వరకు సంబంధించిన ఈ మార్పులతో మీ జేబుపై కూడా భారం పడొచ్చు.

ఓ ప్రధాన బ్యాంకు బుధవారం నుంచి పొదుపు ఖాతాలపై వడ్డీ రేటును తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.

మరోవైపు కొన్ని బ్యాంకులు చెక్కుల క్లియరెన్స్‌పై కొత్త నిబంధనలు అమలులోకి తీసుకొస్తున్నాయి. కొన్ని బ్యాంకులు ఇప్పటికే ఈ మార్పులను అమలు చేస్తున్నాయి.

కొత్త నెల మొదలుకావడంతో, వంట గ్యాస్ (ఎల్‌పీజీ) ధరలు కూడా పెరుగుతాయని కొందరు నిపుణులు చెబుతున్నారు.

ఈ మార్పుల్లో చాలావరకు సెప్టెంబరు 1, అంటే బుధవారం నుంచి అమలులోకి రాబోతున్నాయి.

పీఎన్‌బీ

ఫొటో సోర్స్, Getty Images

పీఎన్‌బీ వడ్డీ కోత..

తమ సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటు బుధవారం నుంచీ మారబోతున్నట్లు దేశంలో రెండో అతిపెద్ద బ్యాంకు పీఎన్‌బీ స్పష్టంచేసింది.

సెప్టెంబరు 1 నుంచి పొదుపు ఖాతాలపై ఇచ్చే వడ్డీని 2.9 శాతానికి తగ్గిస్తున్నట్లు పీఎన్‌బీ తెలిపింది. ఇదివరకు ఈ వడ్డీ 3 శాతంగా ఉండేది.

ఈ వడ్డీ రేటు కొత్త ఖాతాలతోపాటు పాత ఖాతాలకూ వస్తుందని తమ వెబ్‌సైట్‌లో పీఎన్‌బీ స్పష్టంచేసింది.

చెక్కుల క్లియరెన్స్‌కు ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలను కూడా కొన్ని బ్యాంకులు అమలు చేయబోతున్నాయి.

సెప్టెంబరు నుంచి అన్ని బ్యాంకుల్లోనూ ఈ ఆన్‌లైన్ ఆధారిత ఎలక్ట్రానిక్ చెక్ క్లియరెన్స్ విధానాన్ని అమలు చేయాలని బ్యాంకులకు రిజర్వు బ్యాంకు సూచించింది. దీంతో చెక్కుల క్లియరెన్స్ ప్రక్రియ కాస్త వేగంగా పూర్తికానుంది.

టేక్ హోం శాలరీ

ఫొటో సోర్స్, Pti

ఈపీఎఫ్ ఖాతాదారులకు..

ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్) ఖాతాదారులకూ సెప్టెంబరు 1 చాలా ముఖ్యమైనది.

పీఎఫ్ ఖాతాలోని యూనివర్సల్ అకౌంట్ నంబరు(యూఏఎన్)‌తో ఆధార్ అనుసంధానానికి చివరి తేదీ కూడా సెప్టెంబరు 1.

ఇదివరకు ఈ గడువును జూన్ 1గా నిర్ణయించారు. అయితే, దీన్ని మూడు నెలలు పొడిగించారు.

ఆధార్‌తో అనుసంధానం జరగకపోతే, పీఎఫ్ ఖాతాలో ఉద్యోగ సంస్థ వాటాను జమ చేయడం కష్టం అవుతుంది. మరోవైపు ఉద్యోగులకు కూడా తమ ఖాతాలోని డబ్బులను తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశముంది.

జీఎస్‌టీ

ఫొటో సోర్స్, Getty Images

జీఎస్‌టీలోనూ..

సెప్టెంబరు 1 నుంచి తాము అమలు చేయబోయే కొత్త మార్పులను జీఎస్‌టీ నెట్‌వర్క్‌ కూడా స్పష్టంచేసింది.

ప్రతి నెలా పన్నుల చెల్లింపు వివరాలతో సమర్పించే జీఎస్‌టీఆర్-3బీ ఫామ్‌లను వరుసగా రెండు నెలలు దాఖలుచేయని వ్యాపారులను జీఎస్‌టీఆర్-1ను రిటర్నులను దాఖలు చేసుకోవడానికి అనుమతించబోమని జీఎస్‌టీ నెట్‌వర్క్‌ తెలిపింది.

జీఎస్‌టీఆర్-1ను దాఖలు చేయడంలో తాము తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనలు బుధవారం నుంచే అమలు చేయబోతున్నట్లు వెల్లడించింది.

ఎల్‌పీజీ

ఎల్‌పీజీ ధరలు..

వంట గ్యాస్ (ఎల్‌పీజీ) ధరలు కూడా పెరిగే అవకాశముందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ప్రతి నెల ఒకటో తేదీన ఎల్‌పీజీ ధరలను సమీక్షిస్తారు.

గత జూన్ సమీక్షలో ఎల్‌పీజీ ధరలను పెంచలేదు. అయితే, జులై, ఆగస్టుల్లో ఈ ధరలు పెరిగాయి. ఈ రెండు నెలల్లోనూ సిలిండర్‌పై రూ.25 చొప్పున పెంచారు.

గృహ అవసరాలతోపాటు వాణిజ్య సిలిండర్ ధరలను కూడా పెంచారు. ఈ ఎల్‌పీజీ ధరలు సామాన్యుల జేబుపై నేరుగా ప్రభావం చూపిస్తాయి.

14 కేజీల సబ్సిడీ యేతర సిలిండర్ ధర హైదరాబాద్‌లో రూ.912గా ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)