వసీం జాఫర్‌పై వస్తున్న మతతత్వ ఆరోపణలపై స్టార్ క్రికెటర్లు ఎందుకు పెదవి విప్పడం లేదు?

వసీం జాఫర్
ఫొటో క్యాప్షన్, వసీం జాఫర్
    • రచయిత, విజయ్ లోకపల్లి
    • హోదా, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్, బీబీసీ కోసం
మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్‌పై వచ్చిన మతతత్వ ఆరోపణల పట్ల క్రికెటర్లు నామమాత్రంగా స్పందించడం గురించి మనమెందుకు ఆశ్చర్యపోతున్నాం? అసలు వసీం జాఫర్ జట్టులో మతతత్వ ధోరణులను ప్రేరేపిస్తున్నారని ఎవరు ఆరోపించారు?

ఈ అంశంలో ఇప్పటివరకు ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ నుంచి పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు వెలువడ్డాయి. ఒక అధికారి మాత్రం.. విషయం మరేదైనా కావొచ్చు కానీ మతతత్వ ధోరణులకు సంబంధించినది కాదని స్పష్టం చేశారు.

వాస్తవానికి క్రికెట్ ప్రపంచంలో మతం ఎప్పుడూ ఒక చర్చనీయాంశం కాలేదు.

1967లో అప్పటి భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ తనతో పాటూ జట్టుకు ఒక సంస్కృతిని తీసుకొచ్చారు. అది ఆటగాళ్ల మధ్య బంధాలు బలపడడానికి దోహదపడింది.

"పటౌడీ మాకు భారతీయతను నేర్పించారు. మనమంతా ఒకటి అనే విషయాన్ని మా మెదళ్లోకి ఎక్కించారు" అని చెబుతూ భారత మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ పటౌడీ శకాన్ని గుర్తు చేసుకున్నారు.

అలాంటి క్రీడా రంగంలో ఒక ఆటగాడిపై మతతత్వ ఆరోపణలు రావడం, వాటిని ఖండిస్తూ అతడు తనని తాను సమర్థించుకోవాల్సి రావడం విచారకరం.

వసీం జాఫర్ జట్టు ఎంపిక విషయంలో మత ప్రాతిపదికను తీసుకొస్తున్నారని, శుక్రవారం డ్రెసింగ్ రూంలోకి మౌల్వీ (ముస్లిం మతాధికారి)ని పిలిచి ప్రార్థనలు చేయిస్తున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.

అయితే, ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి మహిం వర్మ వెంటనే ఈ ఆరోపణలను ఖండించారు. క్రికెట్‌కు సంబంధించి ఏవో సమస్యలు ఉన్నాయిగానీ మతతత్వ ధోరణులు మాత్రం కాదని స్పష్టం చేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తరాఖండ్ జట్టు కోచ్ పదవికి వసీం జాఫర్ రాజీనామా చేయడం ఆశ్చర్యమేమీ కాదు. 'ముష్తాక్ అలీ' టోర్నమెంట్‌లో ఈ జట్టు ఆటతీరు కూడా పేలవంగా కనబడింది.

రాహుల్ ద్రావిడ్, మహమ్మద్ కైఫ్
ఫొటో క్యాప్షన్, రాహుల్ ద్రావిడ్, మహమ్మద్ కైఫ్

క్రికెట్ ప్రపంచం మౌనం వహించింది

జాఫర్‌పై ఈ ఆరోపణలు వచ్చిన తరువాత క్రికెట్ ప్రపంచం నుంచి నామమాత్రపు మద్దతే లభించిందని చెప్పొచ్చు.

అనిల్ కుంబ్లేను భారత జట్టు కోచ్ పదవి నుంచి తొలగించినప్పుడు కూడా ఇదే మౌనం కనిపించింది. అప్పుడు కూడా క్రికెట్ స్టార్స్ అనేకమంది మౌనం వహించారు.

జాఫర్‌పై ఆరోపణలు వచ్చినప్పుడు మొట్టమొదటగా తన పక్కన నిల్చుని గొంతు విప్పినది కుంబ్లేనే. బహుశా కుంబ్లేకు జాఫర్ పడుతున్న బాధ బాగా అర్థమై ఉండొచ్చు. తాను ఒంటరైపోవడం, ఒకప్పుడు తనతో పాటూ డ్రెస్సింగ్ రూం పంచుకున్నవాళ్లు మౌనం వహించడం ఎంత నిరాశ కలిగిస్తుందో కుంబ్లేకు తెలియడమే అందుకు కారణం కావొచ్చు.

అందుకే, కుంబ్లే వెంటనే జాఫర్‌కు మద్దతిస్తూ.. "మీరు సరైన పని చేశారు. మిమ్మల్ని కోచ్‌గా కోల్పోయినవాళ్లే దురదృష్టవంతులు" అంటూ ట్వీట్ చేశారు.

ఇదే, ఒక ఆటగాడికి తన సీనియర్లనుంచీ లభించాల్సిన మద్దతు. క్రికెట్ దిగ్గజాలందరూ మౌనం వహించినవేళ అనిల్ కుంబ్లేలాంటి సీనియర్ క్రికెటర్లు జాఫర్‌కు మద్దతుగా నిలవడం అభినందించాల్సిన విషయం.

కుంబ్లేలాగానే మరికొంతమంది కూడా జాఫర్‌కు మద్దతు తెలిపారు.

విదర్భ క్రికెట్ అసోసియేషన్ జాఫర్‌కు మద్దతుగా నిలిచింది. అలాగే ముంబై జట్టులో తనతోపాటూ ఆడిన చంద్రకాంత్ పండిట్, అమోల్ మజుందార్, శిశిర్ హట్టంగడి, అవిష్కర్ సాల్వి, షెల్డన్ జాక్సన్, ఫైజ్ ఫజల్, మహ్మద్ కైఫ్, నయన్ దోషి, నిషిత్ శెట్టి కూడా జాఫర్ పక్షం వహించారు.

జింబాబ్వే మాజీ కెప్టెన్ ఆండీ ఫ్లవర్ జాఫర్‌కు ధైర్యాన్నిస్తూ సందేశాన్ని పంపారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ఈ మౌనానికి కారణం ఏంటి?

సోషల్ మీడియాలో ట్రోల్స్‌కు భయపడే పెద్ద పెద్ద క్రికెట్ తారలంతా మౌనం వహించారనిపిస్తోంది.

అయితే, జట్టు పాటించాల్సిన బయో-బబుల్ నిబంధనలను ఉల్లంఘిస్తూ జాఫర్, మౌల్వీని డ్రెస్సింగ్ రూంకు పిలవడంపై జట్టు సభ్యుడు ఇక్బాల్ అబ్దుల్లా మరోలా చెప్తున్నారు. ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ చెప్పని విషయాలను చెప్పి అబ్దుల్లా ఈ వివాదాన్ని మరో మలుపు తిప్పారు.

"శుక్రవారం పూట మౌల్వీ లేకుండా మేము ప్రార్థనలు చేయలేం. మధ్యాహ్నం 3.40 గంటలకు మా ప్రాక్టీస్ అయిపోయిన తరువాత మేము నమాజు చేశాం. ప్రార్థనలకోసం మౌల్వీని పిలవొచ్చా అని నేను ముందు వసీం భాయ్‌ని అడిగాను. టీం మేనేజర్ దగ్గర అనుమతి తీసుకోమని భాయ్ చెప్పారు. నేను మా మేనేజర్ నవనీత్ మిశ్రాను అడిగాను. ఆయన నాతో..'ఏం పర్లేదు ఇక్బాల్.. మతం, ప్రార్థనలు ముఖ్యం' అని మాకు అనుమతినిచ్చారు. ఆ తరువాతే మౌల్వీ వచ్చి ప్రార్థనలు చేశారు" అని అబ్దుల్లా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు చెప్పారు.

క్రీడా స్ఫూర్తి, మతతత్వానికి మించినదని అబ్దుల్లా మాటలు మరోసారి రుజువు చేశాయి.

అయితే, క్రీడలలో పక్షపాతం అనేది ఇతర రూపాల్లో ఉంటుందన్నది కూడా వాస్తవమే. కానీ, దానికి అంత ప్రాముఖ్యత లేదు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

క్రీడల్లో మతానికి స్థానం లేదు

1993 ముంబై అల్లర్లలో విద్వేషకారుల చేతికి చిక్కిన ఒక కుటుంబాన్ని సునీల్ గావస్కర్ ఎలా రక్షించారో గుర్తుందా?

ఈ సందర్భంగా హాకీ దిగ్గజం జాఫర్ ఇక్బాల్‌ను తప్పకుండా గుర్తు చేసుకోవాలి. ఏ పండుగకైనా జాఫర్ భాయ్ నుంచీ మొట్టమొదటి సందేశం వచ్చేది. ఆయనతో పాటూ భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్, వసీం జాఫర్, ఫైజ్ ఫజల్, ఓబేద్ కమల్, మహ్మద్ కైఫ్‌లు కూడా సందేశాలు పంపించేవారు.

ఇక్కడ మరొకమాట కూడా చెప్పాలి.. భగవద్గీత, ఋగ్వేదాలలో జాఫర్ భాయ్‌కు విశేష జ్ఞానం ఉంది. అలాగే బిషన్ సింగ్ బేడీకి కూడా వివిధ మతగ్రంధాల గురించి మంచి అవగాహన ఉంది.

వారణాసి నుంచి వచ్చిన హాకీ దిగ్గజం మొహమ్మద్ షాహిద్‌ను ఎలా మరచిపోగలం? క్రీడల్లో, వ్యక్తిత్వంలో కూడా ఆయన మేరు పర్వతమే. మైదానలో ఉన్నప్పుడు పాకిస్తాన్‌ను ఆయన బలమైన ప్రత్యర్థిగానే భావించారు. తన బాల్‌తో వారిని ముప్పుతిప్పలు పెట్టడం మనందరం చూశాం.

"క్రికెట్ ఆడుతున్నప్పుడు నా మత విశ్వాసాలను ఎప్పుడూ అందులోకి జొరబడనివ్వలేదు" అని కైఫ్ అనేవారు. అదే నిజం.

స్పోర్ట్స్ జర్నలిజంలో ఉంటూ ఎంతోమంది అద్భుతమైన ఆటగాళ్లకు కలిశాను. వాళ్లంతా అల్పమైన రాజకీయాలను, మతతత్వాన్ని దాటి పైకి ఎదిగినవారు.

రంజాన్ కాలంలో మేము మా ముస్లిం స్నేహితుల ఎదుట నీళ్లు కూడా తాగేవాళ్లం కాదు. మైదానంలో హిందు, ముస్లిం ఆటగాళ్లు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఆడడం చూశాం.

ఈరోజుల్లో సోషల్ మీడియాలో అన్నింటి గురించీ తొందరగా ఒక నిర్ణయానికొచ్చేస్తున్నారు. అన్నీ నిజాలు కాలేవు. అలాంటి పరిస్థితుల్లో సంఘంలో పెద్ద హోదాలో ఉన్నవాళ్లు జనానికి విషయాల పట్ల అవగాహన కలిగించడం ఎంతో ముఖ్యం.

బహిరంగంగా అభిప్రాయాలు వ్యక్తపరచడం అనేది ఒక వ్యక్తిగత ఛాయిస్, హక్కు. ఒకరికి మద్దతి ఇవ్వమని మరొకరిని బలవంత పెట్టలేం.

కానీ, ఆటలో భాగంగా ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడిపినవారు, ఒక జట్టుగా ముందుకు నడిచినవారు పరస్పరం మద్దతు ఇచ్చుకుంటే అది ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది.

దురదృష్టవశాత్తు, కీలక సమయంలో జాఫర్‌కు అలాంటి మద్దతు అందలేదు.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)