Ind Vs Eng రెండో టెస్ట్: 317 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం

రవిచంద్రన్ అశ్విన్

ఫొటో సోర్స్, SAEED KHAN

ఫొటో క్యాప్షన్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రవిచంద్రన్ అశ్విన్
మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

చెన్నైలో భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన రెండో టెస్టులో భారత్ 317 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

రెండో ఇన్నింగ్స్‌లో 482 పరుగుల భారీ లక్ష్యాన్ని అందుకునే ప్రయత్నంలో ఇంగ్లండ్ 54.2 ఓవర్లలో 164 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

భారత స్పిన్నర్లలో అక్షర్ పటేల్ 5 వికెట్లు పడగొట్టగా, అశ్విన్ 3, కులదీప్ యాదవ్ 2 వికెట్లు తీశారు.

ఇంగ్లండ్ జట్టులో చివరగా అవుటైన మొయిన్ అలీ చేసిన 43 పరుగులే అత్యధిక స్కోరు.

18 బంతుల్లో 43 పరుగులు చేసిన మొయిన్ ఐదు సిక్సర్లు, 3 ఫోర్లు కొట్టాడు.

అతడి తర్వాత కెప్టెన్ జో రూట్ 33 పరుగులు చేశాడు.

ఈ టెస్టులో మొత్తం 8 వికెట్లు తీయడంతోపాటూ, రెండో ఇన్నింగ్స్‌లో కీలకమైన 106 పరుగులు చేసిన రవిచంద్రన్ అశ్విన్‌ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

భారీ విజయ లక్ష్యం

భారత్ విజయం కోసం ఇంగ్లండ్‌కు 482 పరుగుల లక్ష్యం ఇచ్చింది.

భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులు చేసింది. ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్‌కు 195 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.

రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ అద్భుత సెంచరీ వల్ల భారత్ 286 పరుగులు చేయగలిగింది.

స్పిన్నర్లకు అనుకూలించిన చెన్నై పిచ్‌పై ఇంగ్లండ్‌ భారీ లక్ష్యాన్ని అందుకోలేక చతికిలబడింది.

ఇంగ్లండ్ బ్యాటింగ్

ఫొటో సోర్స్, STU FORSTER

సెకండ్ ఇన్నింగ్స్ ఇంగ్లండ్ పరిస్థితి

రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ వంద పరుగులకే కీలకమైన నాలుగు వికెట్లను కోల్పోయింది.

లారెన్స్ 26, బర్న్స్ 25 పరుగులకు అవుట్ అయ్యారు. లీచ్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరగా, సిబ్లీ మూడు పరుగులే చేయగలిగాడు.

బెన్ స్టోక్స్ కూడా 8 పరుగులకే అవుట్ అయ్యాడు.

116 పరుగుల దగ్గర బెన్ ఫోక్స్‌(2)ను మరో స్పిన్నర్ కులదీప్ యాదవ్ అవుట్ చేశాడు.

లంచ్ తర్వాత అదే స్కోరు దగ్గర ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్(33) వికెట్ కోల్పోయింది.

126 పరుగుల దగ్గర ఓలీ స్టోన్ డకౌట్ అయ్యాడు.

చివరి వికెట్‌గా మొయిన్ అలీ అవుట్ అయ్యాడు.

కులదీప్ యాదవ్ బౌలింగ్‌లో 43 పరుగులు చేసిన మొయిన్ అలీని రిషబ్ పంత్ స్టంపింగ్ చేశాడు.

దీంతో భారత్ రెండో టెస్టులో ఇంకా ఒక రోజు ఆట మిగిలుండగానే ఇంగ్లండ్ మీద ఘన విజయం అందుకుంది.

నాలుగు టెస్టుల సిరీస్‌లో చెరో టెస్ట్ మ్యాచ్ గెలిచిన రెండు జట్లూ 1-1తో సమంగా నిలిచాయి.

భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టెస్ట్ ఫిబ్రవరి 24-28 మధ్య అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ స్టేడియంలో జరగనుంది.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)