కరోనావైరస్ లాక్‌డౌన్: తెలంగాణలో మద్యం దొరక్క మందుబాబుల వింత ప్రవర్తన, ఎర్రగడ్డ ఆస్పత్రికి పెరిగిన రద్దీ

కల్లు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, దీప్తి బత్తిని
    • హోదా, బీబీసీ ప్రతినిధి

లాక్‌డౌన్ కారణంగా మద్యం దొరక్కపోవడంతో వింతగా ప్రవర్తిస్తున్న వారితో కొద్ది రోజులుగా హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ మానసిక వైద్యశాల కిటకిటలాడుతోంది. మానసిక అశాంతి, మూర్ఛ వంటి లక్షణాలతో వచ్చేవారి సంఖ్య పెరిగిందని ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు.

మార్చి 30 నుంచి ఇప్పటి వరకు 200కు పైగా మంది చికిత్స కోసం ఎర్రగడ్డ ఆస్పత్రికి వచ్చారని మానసిక వైద్యులు డాక్టర్ రవి కిషోర్ బీబీసీతో చెప్పారు. కొంతమందికి అదే రోజు చికిత్స అందించి పంపిస్తున్నారు. మరికొందరికి మాత్రం అత్యవసర వైద్య సేవలు అందించాల్సి వస్తోందని వైద్యులు చెబుతున్నారు.

సోమవారం నిజామాబాద్‌లో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే, ఇది మొదటి సంఘటన కాదని పోలీస్ అధికారులు తెలిపారు. గతవారం హైదరాబాద్‌లో కూడా ఒక వ్యక్తి మద్యం దొరకలేదని మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు.

కల్లు

ఫొటో సోర్స్, Getty Images

"సాధారణంగా రోజూ ఐదుగురు, ఆరుగురు వస్తుంటారు. మద్యం దుకాణాలు మూసేయడం వల్ల కొందరికి ఈ సమస్య వస్తుందని అనుకున్నాం. తీవ్రత ఇంతగా ఉంటుందని ఊహించలేదు. కేవలం హైదరాబాద్ నగరం నుంచే 200 మంది రావటం ఆశ్చర్యంగా ఉంది" అని రవి కిషోర్ అన్నారు.

ఈ పరిస్థితి రావటానికి గల కారణాలను వివరిస్తూ, "మార్చ్ 22 తరువాత మద్యం దుకాణాలన్నీ మూతపడ్డాయి. అంటే అప్పటిదాకా వారికి మందు అందుబాటులో ఉండేది. సాధారణంగా మందు దొరక్కపోతే మూడో రోజు నుంచి వారిలో వింత లక్షణాలు కనిపిస్తాయి. మానసిక అశాంతి, మూర్ఛ పోవటం లాంటి లక్షణాలు ఉంటాయి" అని డాక్టర్ వివరించారు. సోమవారం ఆస్పత్రికి వచ్చిన వారిలో 90 శాతం మంది తీవ్రమైన లక్షణాలతో వచ్చారని ఆయన తెలిపారు.

ఇలా తెలంగాణలోనే వ్యసనానికి ఎందుకు లోనవుతున్నారు?

అంటే... దీనికి కల్తీ కల్లు కారణం అని వైద్యులు అంటున్నారు.

"ఇక్కడికొచ్చిన వారిలో ఎక్కువ మంది కల్లుకు అలవాటు పడ్డామని చెప్పారు. కల్తీ కల్లు అంటే సహజంగా గీసిన కల్లులో క్లోరోఫామ్, డైజోఫామ్ వంటి పదార్థాలు కలుపుతారు. అది తాగడం ఆరోగ్యానికి హానికరం. అయినా అది తాగేందుకే అలవాటు పడ్డామని, సహజమైన కల్లు తాగలేమని వాళ్లే చెబుతున్నారు" అని ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.ఉమా శంకర్ వివరించారు.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కల్తీ కల్లు విక్రయంపై అబ్కారీ శాఖ అధికారులు గతంలో చర్యలు తీసుకున్నారు. మద్యానికి బానిస కావడం అంటే, మద్యానికి, మత్తు పదార్థాలకు బాగా అలవాటు పడటం. అలా మద్యం లేదా మత్తు పదార్థాలు తీసుకునే వారికి మత్తుతో పాటు మెదడుకూ అది ఆపుకోలేని అలవాటుగా మారుతుంది. అది తీసుకున్నపుడు శరీరంతో పాటు, మెదడు కూడా మత్తులో ఉంటుంది. “మద్యం మళ్లీమళ్లీ కావాలనుకోవడం వ్యసనం” అని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. మద్యం దొరకని సమయంలో మానసిక అశాంతికి గురై, వారు చేసే పనులు, వ్యవహారశైలిపై వారికి నిగ్రహం ఉండదు. ఈ వ్యసనాన్ని కౌన్సెలింగ్‌తో పాటు సరైన చికిత్స ఇవ్వటంతో దూరం చేస్తారు.

మద్యానికి బానిసలైన వారిని గుర్తించి, ఆ వ్యసనాన్ని మాన్పించేందుకు తెలంగాణలో 17, ఆంధ్రప్రదేశ్‌లో 13 డీ-అడిక్షన్ కేంద్రాలు ఉన్నాయి.

కల్లు

ఫొటో సోర్స్, Getty Images

ప్రస్తుతం ఎర్రగడ్డ ఆస్పత్రికి వచ్చిన వారికి సమస్య తీవ్రంగా ఉందని, అయినా వారికి చికిత్స అందిస్తున్నామని ఉమా శంకర్ చెప్పారు.

"గతంలో కూడా కల్తీ కల్లుపై ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పుడు ఇలాంటి పరిస్థితులే కనిపించాయి. అందుకే అలాంటి పరిస్థితి ఇప్పుడు కూడా వస్తుందని ఊహించి, అందుకు సిద్ధమయ్యాం. ఇక్కడికి వచ్చిన వారికి, వారి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇస్తున్నాం" అని డాక్టర్ ఉమా శంకర్ తెలిపారు.

తాటి కల్లు

ఫొటో సోర్స్, Getty Images

ఈ సమస్య ఒక్క తెలంగాణలోనే కాదు. కేరళలోనూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆ రాష్ట్రంలో ఇప్పటికే ఎనిమిది మంది మందు దొరక్క ప్రాణాలు తీసుకున్నారని సమాచారం. దాంతో, లిక్కర్ పాసులు ఇచ్చేందుకు మార్చి 30న కేరళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మద్యానికి బానిసలై, ఇప్పుడు మద్యం దొరక్క మానసిక అశాంతికి గురవుతున్న వారికి లిక్కర్ పాసులు ఇస్తారు. అయితే, అందుకోసం వారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి అక్కడ వైద్యులతో పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఆ వ్యక్తి మద్యం మానేయడం వల్ల మానసిక అనారోగ్యానికి గురవుతున్నారని ధ్రువీకరిస్తూ వైద్యులు రిపోర్టు ఇస్తే, దానిని బట్టి పాసులు ఇస్తారు.

కరోనావైరస్ నుంచి మిమ్మల్ని మీరు ఇలా రక్షించుకోండి

అయితే, కేరళ ప్రభుత్వ నిర్ణయాన్ని ఆ రాష్ట్ర వైద్యుల సంఘం తప్పుబట్టింది. మద్యం లేక మానసికంగా బాధ పడుతున్న వారందరూ డీ-అడిక్షన్ కేంద్రాలకు వెళ్లాలని కేరళ ఎక్సైజ్ శాఖ మంత్రి టీపీ రామకృష్ణ సూచించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)