రష్మిక, అలియా భట్, ప్రియాంకా చోప్రా: డీప్‌‌ ఫేక్‌కు మహిళలే ఎక్కువగా ఎందుకు బాధితులవుతున్నారు?

రష్మిక మందన్న

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రష్మిక డీప్ ఫేక్ వీడియో వైరల్ అయిన ఘటనపై సోషల్ మీడియాలో చర్చ జరిగింది.
    • రచయిత, నూర్ నంజీ& శృతి మీనన్
    • హోదా, బీబీసీ న్యూస్

రష్మికా మందన్న, ప్రియాంకా చోప్రా, అలియా భట్, కత్రినా కైఫ్.. ఈ యాక్టర్ల డీప్ ఫేక్ వీడియోలు ఈ మధ్య సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.

ఆ వీడియోల్లో ఉన్న వారి ముఖాలను మార్చి, నటీమణుల ముఖాలతో మార్ఫ్ చేసి డీప్ ఫేక్ వీడియోలను సృష్టించారు.

ప్రపంచ దేశాల్లో ఇలాంటివి చాలాకాలం నుంచి ఉన్నప్పటికీ భారత్‌లో ఈ డీప్ ఫేక్ వీడియోలు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి.

సెలబ్రెటీలు, ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని వీటిని సృష్టిస్తున్నారు.

దీనిపై బాధితులు ఏమంటున్నారు?

రష్మిక మందన్న

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రష్మిక మందన్న

మహిళా యాక్టర్లే ఎందుకు?

“హాలీవుడ్‌లో ఈ వీడియోలు దావనంలా వ్యాపించాయి” అని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులు ఆర్తి సమానీ బీబీసీతో చెప్పారు.

నటాలీ పోర్ట్‌మన్, ఎమ్మా వాట్సన్ వంటి వారు కూడా ఈ డీఫ్ ఫేక్ వీడియోల బాధితుల జాబితాలో ఉన్నారు.

ఇటీవలి కాలంలో టెక్నాలజీ డెవలప్ కావడంతో సులభంగా ఏఐ ద్వారా ఫేక్ ఆడియో, వీడియోలను సృష్టిస్తున్నారని చెప్పారు సమానీ.

"గడిచిన ఆరు నెలలు, ఏడాది కాలంగా ఏఐ టూల్స్‌లో చాలా మార్పులు వచ్చాయి." అని సమానీ అన్నారు.

"ప్రస్తుతం చాలా టూల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా తక్కువ ఖర్చుతోనూ, అసలు ఖర్చేలేకుండా కూడా రియలిస్టిక్ సింథటిక్ ఫోటోలను సృష్టించడం సాధ్యమవుతోంది” అని సమానీ అన్నారు.

“భారతదేశంలో కొన్ని ప్రత్యేకమైన అంశాలున్నాయి. ఇక్కడి యువత ఎక్కువగా సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. దీనితోపాటు బాలీవుడ్‌పై, సెలబ్రిటీ కల్చర్‌పై అందరికీ ఆసక్తి ఎక్కువ” అని ఆమె అన్నారు.

వీటిని దృష్టిలో పెట్టుకుని, యాక్టర్లను ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని డీప్ ఫేక్ వీడియోలు సృష్టిస్తున్నారు. ఇవి వేగంగా, విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నాయి. అదే సమస్య తీవ్రతను పెంచుతోంది” అన్నారు.

బాలీవుడ్ నటీనటులే ఎందుకు లక్ష్యంగా మారారన్న ప్రశ్నకు సమానీ బదులిస్తూ, “బాలీవుడ్ సెలబ్రెటీ కంటెంట్ ఆకట్టుకునేలా ఉంటుంది. యాడ్ రెవెన్యూ రూపంలో పెద్ద మొత్తంలో డబ్బును కురిపిస్తుంది. మరో విషయమేంటంటే, ఆ కంటెంట్ వీక్షించే వారికి తెలీకుండానే వారి డేటా కూడా చౌర్యానికి గురవుతుంది” అన్నారు.

తరచుగా, ఫేక్ ఫొటోలను పోర్నోగ్రఫిక్ వీడియోల కోసం వినియోగిస్తుంటారు. కానీ, డీప్ ఫేక్ వీడియోలు ఏమైనా చేయగలవు.

‘ఆందోళన కలిగించింది'

27 ఏడేళ్ల నటి రష్మికా మందన్న, ఓ ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో ఉన్న నల్లటి దుస్తులు ధరించిన యువతి ముఖానికి బదులుగా మార్ఫ్ చేసి, ఓ వీడియో సృష్టించారు.

ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆల్ట్ న్యూస్‌కు చెందిన ఫ్యాక్ట్ చెకింగ్ జర్నలిస్ట్ ఆ వీడియో డీప్ ఫేక్ వీడియోగా తేల్చారు.

ఈ ఘటనపై రష్మిక స్పందిస్తూ, “ఇది తీవ్ర ఆందోళన కలిగించే విషయం” అన్నారు.

డీప్ ఫేక్ వీడియోలను షేర్ చేయొద్దని కోరారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

ప్రియాంకా చోప్రా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రియాంకా చోప్రా

నటి ప్రియాంక చోప్రా కూడా ఈ డీప్ ఫేక్ వీడియో బాధితురాలిగా మారారు.

అందులో ప్రియాంకా చోప్రా ముఖాన్ని మార్ఫ్ చేయకుండా, ఆమె ఓ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు, ఇన్వెస్ట్‌మెంట్ ఐడియాలను చెప్తున్నట్లుగా ఆడియో క్లిప్‌ను సృష్టించి, ఆ వీడియోకు జోడించారు.

నటి అలియా భట్ కూడా దీని బారిన పడ్డారు. ఆ వీడియోలో అశ్లీల భంగిమల్లో కెమెరాకు ఫోజులిస్తున్నట్లుగా ఆమె ఫొటోను మార్ఫ్ చేశారు.

వీరు మాత్రమే కాదు, కత్రినాకైఫ్‌ను కూడా టార్గెట్ చేశారు. ఆమె విషయంతో, టైగర్ 3 చిత్రంలో టవల్‌తో ఉన్న దృశ్యాలను తీసుకుని, డీప్ ఫేక్ వీడియో సృష్టించారు.

కేవలం మహిళా యాక్టర్లే కాదు... పారిశ్రామికవేత్త రతన్ టాటా వీడియో కూడా డీప్ ఫేక్ వీడియో కూడా బయటకు వచ్చింది. అందులో రతన్ టాటా ఇన్వెస్ట్‌మెంట్ సలహా ఇస్తున్నట్లుగా ఉంది.

అయితే, ఈ ట్రెండ్ వల్ల మహిళలే ఎక్కువగా బాధితులుగా మారుతున్నారు.

సెన్సిటీ ఏఐ రీసెర్చ్ సంస్థ అంచనా ప్రకారం డీప్ ఫేక్ వీడియోలలో 90 నుంచి 95 శాతం అశ్లీలతను, మహిళలే లక్ష్యంగా చేసుకున్నవి.

అలియా భట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అలియా భట్ సైతం డీప్ ఫేక్ వీడియో బారిన పడ్డారు

“ఇది భయాందోళనను కలిగిస్తోంది” అన్నారు విప్రో సంస్థ గ్లోబల్ ప్రైవసీ ఆఫీసర్ ఇవానా బర్టొలెట్టీ.

“డీప్‌ ఫేక్ వీడియోలు ముఖ్యంగా.. మహిళలకు సమస్యాత్మకమైనవి. ఆ మీడియాతో పోర్న్, హింసాత్మకమైన ఫోటోలను సృష్టిస్తున్నారు. మనందరికీ తెలుసూ, దీనికి ఎంత మార్కెట్ ఉందో” అన్నారు.

“ఈ సమస్య ఎప్పటినుంచో ఉంది. ఇప్పుడు టూల్స్ అందుబాటులోకి రావడంతో పరిస్థితి మారిపోయింది” అని చెప్పారామె.

సమానీ కూడా దీనితో ఏకీభవిస్తూ, డీప్ ఫేక్ వలన మహిళల గౌరవానికి భంగం కలిగే పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు.

“తరచూ, అందం ప్రామాణికంగా తీసుకుని మహిళల శరీరాలను కించపరుస్తున్న ఘటనలు ఉన్నాయి. డీప్‌ఫేక్‌లు దీనిని మరింత ముందుకు తీసుకెళ్తాయి. వీటి వలన మహిళల గౌరవానికి భంగం కలగడంతోపాటు, నేరస్తులు దీనిని అనుకూలంగా మార్చుకునే ప్రమాదం ఉంది” అన్నారు.

చట్టపరంగా చర్యలు తీసుకోవడం సాధ్యమేనా?

ఇటీవలి కాలంలో డీప్ ఫేక్ వీడియోల వ్యాప్తి విస్తృతమైన నేపథ్యంలో అలాంటి కంటెంట్‌పై దృష్టి సారించాలని, ప్రభుత్వ, టెక్ కంపెనీలకు పెద్ద సంఖ్యలో విజ్ఞప్తులు వచ్చాయి.

నటి రష్మిక మందన్న వీడియో వైరల్ అయిన సందర్భంలో కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ డీప్ ఫేక్‌లపై స్పందించారు.

“ప్రమాదకరమైన, తప్పుడు సమాచారాన్ని పరిష్కరించడానికి సమగ్ర చర్యలు తీసుకోవాల్సి ఉంది. భారత ఐటీ నిబంధనలను అనుసరించి, సోషల్ మీడియా వేదికలు, యూజర్ తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేయడం లేదని నిర్థారించుకోవాల్సిన అవసరం ఉంది” అన్నారు.

ప్రభుత్వం భారత చట్టాలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

ఇవానా మాట్లాడుతూ, ఈ సమస్య భారత్‌తోపాటు ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా ఉందని, ప్రపంచ దేశాలు దీనిపై దృష్ట సారించాలని అన్నారు.

“కేవలం బాలీవుడ్ యాక్టర్లనే కాదు, రాజకీయ, వ్యాపార రంగాల్లో ఉన్న ప్రముఖులు, ఇతర రంగాల్లో ఉన్న ప్రముఖులు కూడా ఈ డీప్‌ ఫేక్‌ల బారిన పడుతున్నారు. అయితే ప్రపంచ దేశాలు ప్రజాస్వామ్య దేశాల్లో డీప్ ఫేక్‌ల ప్రభావంపై ఆందోళన మొదలైంది. అవి ఎలాంటి నష్టాన్ని కలిగిస్తాయో అని ఆందోళన చెందుతున్నాయి” అన్నారామె.

సోషల్ మీడియా వేదికలు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఉందని, ఆయా సంస్థలు ఇలాంటి డీప్ ఫేక్ వీడియోలను ముందుగానే గుర్తించి తొలగించే చర్యలు తీసుకోవాలని అన్నారు.

“ఈ సమస్యను పరిష్కరించడంలో పురుషుల సహకారం కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది” అన్నారు సమాని.

“ మగవాళ్ల నుంచి కూడా మద్దతు అవసరం. చాలా తక్కువ మందే ఈ డీప్ ఫేక్ వీడియోలపై స్పందిస్తున్నారు. బాధితులు సరైన రీతిలోనే ఆందోళన చేస్తున్నారు” అని చెప్పారు.

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)