ఐపీఎల్ 2023లో ధోనీ మహేంద్రజాలం కొనసాగుతోంది... 27 పరుగులతో దిల్లీ జట్టును ఓడించిన చెన్నై సూపర్ కింగ్స్

ధోనీ

ఫొటో సోర్స్, Getty Images

ఐపీల్ 2023 - 55వ మ్యాచ్ - చెన్నై చిదంబరం స్టేడియం

చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) vs దిల్లీ క్యాపిటల్స్ (డీసీ)

చెన్నై 27 పరుగులతో దిల్లీని ఓడించింది.

సీఎస్‌కే - 167/8 (20 ఓవర్లు), శివం దూబే - 25 పరుగులు, మిచెల్ మార్ష్ - 3/18

డీసీ - 140/8 (20 ఓవర్లు), రైలీ రుసో - 35, మథీష పతిరణ - 3/37

మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ - రవీంద్ర జడేజా (సీఎస్‌కే)

ఐపీఎల్ 2023లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జోరు కొనసాగుతోంది.

బుధవారం దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై జట్టు 27 పరుగుల తేడాతో విజయం సాధించింది.

దీంతో, చెన్నై ఖాతాలో 15 పాయింట్లు చేరాయి.

దిల్లీ క్యాపిటల్స్ 11 మ్యాచ్‌ల్లో ఏడు ఓడిపోయింది. ఈ జట్టుకు ప్లేఆఫ్ తలుపులు దాదాపు మూసుకుపోయినట్టే.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే 168 పరుగుల లక్ష్యాన్ని డీసీ ముందుంచింది.

కానీ, డీసీ జట్టు ఎనిమిది వికెట్లకు 140 పరుగులు మాత్రమే చేయగలిగింది.

స్లో పిచ్‌పై చెన్నై బౌలర్ల ముందు దిల్లీ బ్యాట్స్‌మెన్ నిస్సహాయంగా కనిపించారు.

రైలీ రుసో, ఇంపాక్ట్ ప్లేయరుగా పంపిన మనీష్ పాండే వికెట్‌పై నిలదొక్కుకున్నప్పటికీ, పరుగులు తీయడంలో ఇబ్బందిపడ్డారు. ఇద్దరి స్ట్రైక్ రేట్ 100 కంటే తక్కువే.

డీసీ జట్టులో రైలీ రుసో అత్యధికంగా 35 పరుగులు చేశాడు. చెన్నై తరఫున మథీష పతిరణ మూడు వికెట్లు, దీపక్ చాహర్ రెండు వికెట్లు తీశారు.

సీఎస్‌కే కెప్టెన్ ధోనీ మరోసారి తన ఇంద్రజాలం చూపించాడు. ధోనీ పూర్తిగా ఫిట్‌గా ఉన్నట్టు కనిపించలేదు. కానీ, జట్టుకు ఉపయోగకరమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం తొమ్మిది బంతుల్లో 20 పరుగులు చేశాడు.

చెన్నై సూపర్ కింగ్స్ vs దిల్లీ క్యాపిటల్స్

ఫొటో సోర్స్, Getty Images

చెన్నై ఇన్నింగ్స్

టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. చెన్నై జట్టు 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 167 పరుగులు చేసింది.

చెన్నై జట్టులో టాప్‌, మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ అందరూ శుభారంభం చేశారు కానీ, ఎక్కువసేపు పిచ్‌పై నిలబడలేకపోయారు. జట్టు వరుసగా వికెట్లు కోల్పోతూనే ఉంది.

నెమ్మదిగా ఉన్న పిచ్‌పై దిల్లీ బౌలర్లు సీఎస్‌కేను బాగానే కట్టడిచేశారు.

శివం దూబే 12 బంతుల్లో మూడు సిక్స్‌లతో 25 పరుగులు కొట్టాడు. చెన్నై జట్టులో ఇదే టాప్ స్కోర్.

రితురాజ్ గైక్వాడ్ 18 బంతుల్లో నాలుగు ఫోర్లతో 24 పరుగులు, అంబటి రాయుడు 17 బంతుల్లో 23 పరుగులు, అజింక్యా రహానే 20 బంతుల్లో 21 పరుగులు చేశారు.

చివరి ఓవర్లో బ్యాటింగ్‌కు దిగిన మహేంద్ర సింగ్ ధోనీ తొమ్మిది బంతుల్లో 20 పరుగులు చేశాడు. అందులోనే ఒక ఫోర్, రెండు సిక్స్‌లు బాదాడు.

డీసీ తరఫున మిచెల్ మార్ష్ మూడు వికెట్లు, అక్షర్ పటేల్ రెండు వికెట్లు తీశారు.

చెన్నై సూపర్ కింగ్స్ vs దిల్లీ క్యాపిటల్స్

ఫొటో సోర్స్, Getty Images

దిల్లీ బ్యాటింగ్

దిల్లీ జట్టు ఆరంభంలోనే తడబడింది. రెండో బంతికే డేవిడ్ వార్నర్ అవుటయ్యాడు. ఒక్క రన్ కూడా చేయలేకపోయాడు. చెన్నై బౌలర్ దీపక్ చాహర్‌ వేసిన బంతికి వార్నర్ వెనుదిరిగాడు.

రెండో ఓవర్‌లో ఫిల్ సాల్ట్ బ్యాట్ ఝళిపించాడు. తుషార్ దేశపాండే వేసిన బంతులను ఫోర్, సిక్స్ కొట్టాడు. ఈ ఓవర్‌లో మొత్తం 12 పరుగులు వచ్చాయి.

అక్కడితో, సాల్ట్ పని కూడా అయిపోయింది. మళ్లీ చాహర్‌కే ఈ వికెట్ దక్కింది. సాల్ట్ మొత్తం 11 బంతుల్లో 17 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

నాలుగో ఓవర్లో దిల్లీకి మూడో దెబ్బ తగిలింది. మనీష్ పాండే పిలుపుతో పరుగందుకున్న మిచెల్ మార్ష్ రనౌట్ అయ్యాడు. నాలుగు బంతుల్లో అయిదు పరుగులు చేశాడు.

మూడో వికెట్ పడే సమయానికి దిల్లీ స్కోరు 25 పరుగులు.

అయిదో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన రైలీ రుసో.. దీపక్ చాహర్ వేసిన మూడో ఓవర్‌లో ఓ ఫోర్, సిక్స్ బాదాడు. అదే ఓవర్‌లో మనీష్ పాండే కూడా ఫోర్ కొట్టాడు. ఈ ఓవర్‌లో 15 పరుగులు వచ్చాయి.

ఆరో ఓవర్లో మనీష్ పాండేను ఔట్ చేసే అవకాశం మహిష్ తీక్షణకు లభించింది. కానీ క్యాచ్ పట్టుకోలేకపోయాడు.

స్పిన్నర్లు బౌలింగ్‌కు దిగిన తరువాత డీసీ జట్టుకు పరుగులు రావడం మరింత కష్టమైంది.

అయినప్పటికీ, పాండే, రూసో నాలుగో వికెట్‌కు 59 పరుగులు జోడించారు. ఈ భాగస్వామ్యాన్ని మథిషా పతిరణ బ్రేక్ చేశాడు. 13వ ఓవర్లో మనీష్ పాండేను అవుట్ చేశాడు. పాండే 29 బంతుల్లో 27 పరుగులు చేశాడు.

తరువాత, రుసోను రవీంద్ర జడేజా ఔట్ చేశాడు. రూసో 37 బంతుల్లో 35 పరుగులు చేశాడు.

15వ ఓవర్‌లో అయిదో వికెట్‌ పడినప్పుడు దిల్లీ ఖాతాలో 89 పరుగులు మాత్రమే ఉన్నాయి.

తరువాత బ్యాటింగ్‌కు వచ్చిన అక్షర్ పటేల్ 12 బంతుల్లో 21 పరుగులు చేసి జట్టును ఆదుకునేందుకు ప్రయత్నించాడు. కానీ, 18వ ఓవర్లో పతిరణ బంతికి చిక్కాడు.

రిపల్ పటేల్ 19వ ఓవర్లో 10 పరుగులకే రనౌట్ అయ్యాడు.

డీసీ చివరి ఓవర్లో 43 పరుగులు చేయాల్సి ఉంది. పతిరణ వేసిన ఈ ఓవర్‌లో లలిత్ యాదవ్ మూడు ఫోర్లు బాదినా, అయిదో బంతికి బౌల్డ్ అయ్యాడు.

దిల్లీ జట్టు 140 పరుగులకే చతికిలపడింది.

రవీంద్ర జడేజా

ఫొటో సోర్స్, Getty Images

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్

చెన్నై జట్టు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

మొదటి ఇన్నింగ్స్‌లో, జట్టుకు అవసరమైన సమయంలో కీలకమైన పరుగులు అందించాడు. 131 స్ట్రైక్ రేటుతో 16 బంతుల్లో 21 పరుగులు చేశాడు.

తరువాత, చక్కటి బౌలింగ్‌తో పిచ్‌పై డీసీ జట్టును కట్టడి చేశాడు. నాలుగు ఓవర్లలో కేవలం 19 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)