లోక్‌సభ ఎన్నికలు: తొలి దశలో 102 స్థానాలకు పోలింగ్, బరిలో నిలిచిన ప్రముఖులు వీరే..

లోక్ సభ ఎన్నికలు 2024

ఫొటో సోర్స్, Getty Images

లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్‌ ప్రారంభమైంది. ఈ దశలో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది.

ఎనిమిది మంది కేంద్రమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, ఒక మాజీ గవర్నర్‌ పోటీలో ఉన్నారు.

తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, బిహార్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, రాజస్థాన్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్మూ కశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిలో పోలింగ్ జరుగుతోంది.

లోక్‌సభ ఎన్నికలు Lok Sabha elections 2024

ఫొటో సోర్స్, Getty Images

ఏ రాష్ట్రంలో ఎన్ని స్థానాలకు ఎన్నికలు?

రాజస్థాన్‌లో 12 పార్లమెంట్ నియోజకవర్గాలు- గంగానగర్, బికనీర్, చురు, జుంఝును, సికర్, జైపూర్ రూరల్, జైపూర్, అల్వార్, భరత్‌పూర్, కరౌలి-ధోల్‌పూర్, దౌసా, నాగౌర్.

ఉత్తర్ ప్రదేశ్‌లో ఎనిమిది - సహరాన్‌పూర్, కైరానా, ముజఫర్‌నగర్, బిజ్నోర్, నగీనా, మొరాదాబాద్, రాంపూర్, పిలిభిత్.

మధ్యప్రదేశ్‌లో ఆరు - సిధి, షాహదోల్, జబల్‌పూర్, మాండ్లా, బాలాఘాట్, చింద్వారా.

మహారాష్ట్రలో ఐదు - రామ్‌టెక్, నాగ్‌పూర్, భండారా-గోండియా, గడ్చిరోలి-చిమూర్, చంద్రపూర్.

అస్సాంలో ఐదు - కాజిరంగా, సోనిత్‌పూర్, లఖింపూర్, దిబ్రూగర్, జోర్హాట్.

బిహార్‌లోని నాలుగు - ఔరంగాబాద్, గయా, నవాడా, జముయి.

పశ్చిమ బెంగాల్ మూడు - కూచ్ బెహార్, అలీపుర్దువార్, జల్పైగురి.

త్రిపురలో ఒకటి - త్రిపుర వెస్ట్.

ఛత్తీస్‌గఢ్‌లో ఒకటి - బస్తర్.

జమ్మూ కశ్మీర్‌లో ఒకటి - ఉధంపూర్.

మణిపూర్‌లో రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇన్నర్ మణిపూర్ స్థానానికి ఏప్రిల్ 19న మొదటి దశలో ఓటింగ్ జరుగుతోంది.

ఔటర్ మణిపూర్ స్థానానికి రెండు దశల్లో ఓటింగ్ జరగనుంది. దీని పరిధిలోకి వచ్చే కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏప్రిల్ 19న జరుగుతోంది. మరికొన్నింటిలో ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది.

కాగా, తమిళనాడులోని అన్ని ఎంపీ స్థానాలకూ ఒకేసారి పోలింగ్ జరుగుతోంది.

లోక్‌సభ ఎన్నికలు Lok Sabha elections 2024

ఫొటో సోర్స్, Getty Images

ఆ రాష్ట్రంలోనే అత్యధికం..

తమిళనాడులో 39 లోక్‌సభ స్థానాలు ఉండగా, అన్ని స్థానాలకు ఏప్రిల్ 19న ఒకే దశలో పోలింగ్ జరుగుతోంది.

ఈ పార్లమెంట్ నియోజవర్గాలు- తిరువళ్లూరు, నార్త్ చెన్నై, సౌత్ చెన్నై, చెన్నై సెంట్రల్, శ్రీపెరంబుదూర్, కాంచీపురం, అరక్కోణం, వెల్లూరు, కృష్ణగిరి, ధర్మపురి, తిరువణ్ణామలై, అరణి, విలుపురం, కలకురుచ్చి, సేలం, నమక్కల్, ఈరోడ్, తిరుప్పూర్, నీలగిరి, కోయంబత్తూరు, పొల్లాచ్చి, దిండిగల్, కరూర్, తిరుచిరాపల్లి, పెరంబలూరు, కడలూరు, చిదంబరం, మైలాడుతురై, నాగపట్నం, తంజావూరు, శివగంగై, మదురై, తేని, విరుదునగర్, రామనాథపురం, తూత్తుకుడి, తెన్కాసి, తిరునల్వేలి, కన్యాకుమారి.

ఉత్తరాఖండ్‌లో 5 పార్లమెంట్ నియోజకవర్గాలున్నాయి. అన్ని స్థానాలకు తొలి దశలో పోలింగ్ జరుగుతోంది. ఈ స్థానాలు- తెహ్రీ గర్వాల్, గర్వాల్, అల్మోరా, నైనిటాల్-ఉధమ్ సింగ్ నగర్, హరిద్వార్.

అరుణాచల్ ప్రదేశ్‌లోని రెండు - అరుణాచల్ ఈస్ట్, అరుణాచల్ వెస్ట్.

అండమాన్ - అండమాన్ నికోబార్ దీవులు.

లక్షద్వీప్-ఒక పార్లమెంట్ నియోజకవర్గం- లక్షద్వీప్.

మేఘాలయలోని రెండు- షిల్లాంగ్, తురా.

మిజోరంలో ఒకటి- మిజోరం.

నాగాలాండ్ ఒకటి- నాగాలాండ్.

పుదుచ్చేరి ఒకటి-పుదుచ్చేరి.

సిక్కిం ఒకటి- సిక్కిం.

అన్నామలై Lok Sabha elections 2024

ఫొటో సోర్స్, K.ANNAMALAI/X

పోటీలో ప్రముఖులు..

ఇక తొలి దశలో నరేంద్ర మోదీ ప్రభుత్వంలోని ఎనిమిది మంది కీలక మంత్రులు పోటీలో ఉన్నారు. వీరితో పాటు ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు, ఒక మాజీ గవర్నర్ కూడా బరిలో ఉన్నారు.

అన్నామలై

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కోయంబత్తూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

అక్కడ డీఎంకే నేత గణపతి పి రాజ్‌కుమార్‌, ఏఐఏడీఎంకేకు చెందిన సింగై రామచంద్రన్‌ల లు పోటీలో ఉన్నారు.

2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి సీపీఐ(ఎం) అభ్యర్థి పీఆర్‌ నటరాజన్‌ విజయం సాధించారు. అన్నామలై మాజీ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి.

కార్తీ చిదంబరం

తమిళనాడులోని శివగంగై స్థానం నుంచి కార్తీ చిదంబరం పోటీ చేస్తున్నారు. ఆయన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం కుమారుడు. ఈ స్థానం నుంచి పి చిదంబరం ఏడుసార్లు ఎంపీగా గెలిచారు. 2019 ఎన్నికల్లో కార్తీ ఈ లోక్ సభ స్థానంలోనే విజయం సాధించారు. ఈసారి ఆయనకు పోటీగా బీజేపీ అభ్యర్థి టి దేవనాథన్ యాదవ్, ఏఐఏడీఎంకే అభ్యర్థి జేవియర్ దాస్‌లు బరిలో నిలిచారు.

తమిళిసై సౌందరరాజన్

తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసై సౌందరరాజన్, చెన్నై సౌత్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు.

ఇది తమిళనాడులోని రెండో అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గం. 20 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఇక్కడ డీఎంకేకు చెందిన తమిజాచి తంగపాండియన్‌పై తమిళిసై పోటీ చేస్తున్నారు.

2019 ఎన్నికల్లో లోక్‌సభ స్థానంలో తంగపాండియన్ విజయం సాధించారు. కాగా, ఏఐఏడీఎంకే డాక్టర్ జె. జయవర్ధన్‌కు ఇక్కడ టికెట్ ఇచ్చింది. డీఎంకే ఈ స్థానాన్ని ఎనిమిదిసార్లు గెలుచుకుంది.

ఏ రాజా

డీఎంకే అభ్యర్థి ఏ రాజా తమిళనాడులోని నీలగిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ-2 ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.

కేంద్ర ఫిషరీస్, వెటర్నరీ, డెయిరీ మంత్రిత్వ శాఖల సహాయ మంత్రి ఎల్ మురుగన్‌ అదే స్థానం నుంచి బరిలో ఉన్నారు.

లోక్‌సభ ఎన్నికలు Lok Sabha elections 2024

ఫొటో సోర్స్, Getty Images

కేంద్ర మంత్రులు

నితిన్ గడ్కరీ

కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మహారాష్ట్రలోని నాగ్‌పూర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ హ్యాట్రిక్ సాధించాలని గడ్కరీ ప్రయత్నిస్తున్నారు. 2014లో తొలిసారి ఈ సీటును గెలుచుకున్నారు.

కాంగ్రెస్ అక్కడ వికాస్ ఠాక్రేను రంగంలోకి దించింది. ఆయన నాగ్‌పూర్ వెస్ట్ ఎమ్మెల్యే.

కిరణ్ రిజిజు

కేంద్ర భూ విజ్ఞాన శాస్త్ర, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి కిరెన్ రిజిజు అరుణాచల్ వెస్ట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. రిజిజు 2004లో తొలిసారి ఈ స్థానం నుంచి గెలుపొందారు. 2019లో జరిగిన ఎన్నికల్లో అరుణాచల్ వెస్ట్ స్థానం నుంచి కూడా గెలుపొందారు.

మాజీ ముఖ్యమంత్రి, అరుణాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు నబమ్ తుకీ ఆయన ప్రత్యర్థిగా బరిలో నిలిచారు.

సర్బానంద సోనేవాల్

కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాలు, ఆయుష్ శాఖల మంత్రి సర్బానంద సోనేవాల్ అస్సాంలోని దిబ్రూగఢ్ లోక్‌సభ స్థానం నుంచి అభ్యర్థిగా ఉన్నారు.

సోనోవాల్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన అస్సాం మాజీ ముఖ్యమంత్రి కూడా.

జితేంద్ర సింగ్

ప్రధానమంత్రి కార్యాలయంలోని సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపూర్-కతువా-దోడా స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.

ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా చౌదరి లాల్ సింగ్‌ పోటీలో ఉన్నారు.

అర్జున్ రామ్ మేఘవాల్

కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ రాజస్థాన్‌లోని బికనీర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ మాజీ మంత్రి గోవింద్‌ రామ్‌ మేఘ్‌వాల్‌పై ఆయన పోటీ చేస్తున్నారు.

బిప్లబ్ కుమార్ దేబ్

త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్, బీజేపీ తరఫున పశ్చిమ త్రిపుర స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అక్కడ ఆయనకు పోటీగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఆశిష్ కుమార్ సాహా ఉన్నారు.

ఇమ్రాన్ మసూద్

ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్ స్థానం నుంచి కాంగ్రెస్ నేత ఇమ్రాన్ మసూద్ 'ఇండియా' కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగారు.

ఇక్కడ బీజేపీ ఎంపీ రాఘవ్ లఖన్‌పాల్ శర్మ పోటీ చేస్తున్నారు. బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన మాజిద్ అలీ నుంచి కూడా పోటీ ఉంది.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)