వక్ఫ్ చట్ట సవరణలను ముస్లింలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, వారి ఆందోళన ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మెరిల్ సెబాస్టియన్, నెయాజ్ ఫారూఖీ
- హోదా, బీబీసీ ప్రతినిధులు
దశాబ్ధాల నాటి వక్ఫ్ చట్టాన్ని సవరించేందుకు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై ముస్లింలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో దేశవ్యాప్తంగా ముస్లింలు దానంగా ఇచ్చిన కోట్లాది రూపాయల విలువైన భూములు, ఆస్తులు చట్ట ప్రకారం వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉండేవి.
ఈ ఆస్తుల్లో మసీదులు, మదర్సాలు, వసతి గృహాలు, వేల ఎకరాల భూములు, వీటన్నింటినీ కలిపి వక్ఫ్ అంటున్నారు. ఈ ఆస్తుల నిర్వహణను వక్ఫ్బోర్డులు చూస్తాయి.
ప్రస్తుతం అమల్లో ఉన్న వక్ఫ్ చట్టానికి 40 సవరణలను ప్రతిపాదించారు. వీటిని సంయుక్త పార్లమెంటరీ సంఘానికి పంపించారు. కమిటీ చేసిన సిఫార్సులను కూడా అందులో చేర్చిన తరువాత బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశ పెడతారని భావిస్తున్నారు.
అయితే తమ సిఫార్సులను సమర్పించేందుకు మరింత సమయాన్ని కోరాలని కమిటీ భావిస్తోంది.
ఈ ఆస్తుల నిర్వహణ చూస్తున్న మేనేజ్మెంట్ అవినీతికి పాల్పడకుండా అడ్డుకునేందుకు చట్టంలో మార్పులు తప్పని సరి అని నరేంద్ర మోదీ ప్రభుత్వం చెబుతోంది. ముస్లిం సమాజం కూడా సంస్కరణల కోసం డిమాండ్ చేస్తోందని అంటోంది.
కానీ ఈ మార్పులు రాజకీయ ప్రేరేపితమని ప్రతిపక్షాలు, అనేక ముస్లిం సంఘాలు ఆంటున్నాయి. మైనార్టీల హక్కులను బలహీనపరిచే ప్రయత్నమని ఆరోపిస్తున్నాయి.
ఈ బిల్లును మొదట ఆగస్టులో పార్లమెంట్లో ప్రవేశ పెట్టారు. తర్వాత దాన్ని సంయుక్త పార్లమెంటరీ సంఘానికి పంపించారు.


ఫొటో సోర్స్, Getty Images
వక్ఫ్ అంటే ఏమిటి?
ఇస్లాం సంప్రదాయంలో, ముస్లిం సమాజ ప్రయోజనం కోసం చేసే దానం లేదా విరాళాన్ని వక్ఫ్ అంటారు. వక్ఫ్ ఆస్తులన్నీ భగవంతుడికి చెందుతాయని భావించడం వల్ల వాటిని అమ్మడం లేదా ఇతర ప్రయోజనాలకు ఉపయోగించడం చేయకూడదు.
విస్తృత సంఖ్యలో ఉన్న వక్ఫ్ భూములను మసీదులు, మదర్సాలు, శ్మశాన వాటికలు, అనాథాశ్రమాల నిర్మాణం కోసం ఉపయోగించారు. ఇంకా అనేక భూములు అన్యాక్రాంతం అయ్యాయి.
భారతదేశంలో వక్ఫ్ సంప్రదాయం 12వ శతాబ్ధంలో మధ్య ఆసియా నుంచి వచ్చిన ముస్లిం పాలకులైన దిల్లీ సుల్తానుల పాలనతో మొదలైంది.
ఈ ఆస్తులన్నింటినీ 1995 వక్ఫ్ చట్టం ప్రకారం రాష్ట్ర స్థాయి వక్ఫ్ బోర్డులు నిర్వహించాలి. ఈ బోర్డులో ప్రభుత్వం నియమించే వ్యక్తులతో పాటు ముస్లిం ప్రజా ప్రతినిధులు, స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యులు, ఇస్లామిక్ స్కాలర్లు, వక్ఫ్ ప్రాపర్టీస్ మేనేజర్లు ఉంటారు.
దేశంలో వక్ఫ్ బోర్డులే అతిపెద్ద భూస్వాములని ప్రభుత్వం చెబుతోంది. దేశ వ్యాప్తంగా దాదాపు 8,72,351వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి. ఇవన్నీ 9లక్షల 40వేల ఎకరాల్లో ఉన్నాయి. వీటి విలువ 1.20 లక్షల కోట్లు

ఫొటో సోర్స్, Getty Images
సంస్కరణల అవసరం ఉందా?
వక్ఫ్ బోర్డులలో అవినీతి తీవ్రమైన అంశం అని ముస్లిం సంఘాలు అంగీకరిస్తున్నాయి. అనేకమంది వక్ఫ్ బోర్డు సభ్యులు నిబంధనలను ఉల్లంఘించి కబ్జాదారులతో రాజీ పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఆస్తుల్లో గణనీయమైన భాగాన్ని వ్యక్తులు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ సంస్థలు ఆక్రమించాయని విమర్శకులు అంటున్నారు.
భారత దేశంలో ముస్లింల సామాజిక స్థితిగతులను తెలుసుకునేందుకు 2006లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచార్ కమిటీ తన నివేదికలో వక్ఫ్ చట్టంలో సంస్కరణలు అవసరం అని సూచించింది. వక్ఫ్ బోర్డుల ఆధీనంలోని ఆస్తులతో పోల్చుకుంటే వాటి మీద బోర్డులకు అందుతున్న ఆదాయం చాలా తక్కువని కమిటీ అభిప్రాయపడింది.
వక్ఫ్ బోర్డుల ఆధీనంలో ఉన్న భూములను సక్రమంగా ఉపయోగించుకుంటే వాటి మీద ఏటా లక్షా 20వేల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేదని కమిటీ అంచనా వేసింది. కానీ కొన్ని అంచనాల మేరకు ప్రస్తుత ఆదాయం 2 వందల కోట్ల రూపాయలు మాత్రమే ఉంది.
“వక్ఫ్ భూములను రక్షించాల్సిన ప్రభుత్వమే వాటిని అన్యాక్రాంతం చెయ్యడం సాధారణంగా మారింది” అని సచార్ కమిటీ పేర్కొంది. “గుర్తు తెలియని వ్యక్తుల కబ్జాలో ఉంది” అని అధికారులే రికార్డుల్లో నమోదు చేసినట్లుగా ఉన్న వందల కొద్దీ సంఘటనలను తన నివేదికలో నమోదు చేసింది.
దాదాపు 58,889 వక్ఫ్ స్థలాలు ప్రస్తుతం అన్యాక్రాంతమైనట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. మరో 13వేల ఆస్తులు కోర్టు వివాదాల్లో చిక్కుకున్నాయి. 4.35 లక్షల ఆస్తుల గురించి సమాచారం లేదు.
సచార్ కమిటీ సూచనలను కూడా సవరణ బిల్లులో పరిగణనలోకి తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.
ఈ ఆస్తులను ముస్లింలలో ఉన్నత వర్గాలు నిర్వహిస్తున్నాయని, అందుకే వక్ఫ్ చట్టానికి సవరణలు అవసరమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తా పత్రికతో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
వివాదం ఎందుకు?
వక్ఫ్ చట్టానికి ప్రస్తుతం చేస్తున్న మార్పులపై అనేకమంది ముస్లింలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో తీవ్ర వివాదాస్పదమైన అంశం ఏంటంటే వక్ఫ్ ఆస్తుల యాజమాన్యం గురించిన నిబంధనలు. ఇది బోర్డుల ఆధీనంలోని చారిత్రక మసీదులు, దర్గాలు, శ్మశాన వాటికల మీద ప్రభావం చూపుతుందని ఆందోళన చెందుతున్నారు.
వక్ఫ్ ఆస్తులు కొన్ని తరాలుగా ముస్లింల స్వాధీనంలోనే ఉన్నాయి. వాటిని వారే ఉపయోగించుకుంటున్నారు. ఈ ఆస్తుల్లో చాలా వరకు కొన్ని దశాబ్ధాల క్రితం నాటివి కావడంతో వాటికి సంబంధించిన పత్రాలు అందుబాటులో లేవు. మరి కొన్నింటిని నోటి మాటగా దానం ఇచ్చారు. దీంతో చట్టపరమైన పత్రాలు అందుబాటులో లేవు.
పత్రాలు లేని ఆస్తులను వక్ఫ్ బై యూజర్( వినియోగించుకుంటున్న వ్యక్తి) కేటగిరీ కిందకు వస్తాయని 1954 వక్ఫ్ చట్టం గుర్తించింది. ప్రస్తుత సవరణ బిల్లులో ఈ నిబంధనను తొలగిస్తున్నారు. దీంతో ఈ ఆస్తులు ఏమవుతాయనేది అగమ్యగోచరంగా మారింది.
“అలాంటి ఆస్తుల యాజమాన్య హక్కులను తేల్చడం సంక్లిష్టమైన వ్యవహారం. ఎందుకంటే వాటి యాజమాన్య హక్కులు మొఘలుల కాలం నాటివి. అవి మొఘలుల నుంచి బ్రిటిషర్లకు వారి నుంచి నేటి తరం వరకు వచ్చాయి” అని షిక్వా-ఎ- హింద్: ది పొలిటికల్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ ముస్లిమ్స్ పుస్తక రచయిత ప్రొఫెసర్ ముజిబుర్ రెహమాన్ చెప్పారు.
“వ్యక్తిగత ఆస్తులు ఎలా వచ్చాయనే దానిని మీరు కొన్ని తరాల వరకు మాత్రమే వెనక్కి వెళ్లి చూడగలరు. అయితే ఒక సమూహానికి వచ్చిన ఆస్తుల గురించి అలా తెలుసుకోవడం చాలా కష్టం. కాలానుగుణంగా వాటి యాజమాన్యం మారుతూ వస్తోంది” అని ఆయన అన్నారు.
కొత్త బిల్లు ముస్లింల ఆందోళనను పట్టించుకోకపోవచ్చని, వక్ఫ్ ఆస్తుల యాజమాన్య హక్కులను ముస్లింలనుంచి లాగేసుకుంటారేమోనని కొందరు ఆందోళన చెందుతున్నారు.
ప్రతిపాదిత సవరణల్లో వక్ఫ్ బోర్డుల ఏర్పాటులో ముస్లిమేతరులను బోర్డులో సభ్యులుగా నియమించడం తప్పనిసరి అనే ప్రతిపాదన ఉండటమే వారి ఆందోళనలకు కారణం.
మతపరమైన సంస్థల బోర్డుల్లోకి అన్ని మతాలకు చెందిన వారిని సభ్యులుగా తీసుకోవడానికి కొంతమంది అంగీకరిస్తున్నారు. దీని వల్ల లౌకిక భావన మరింత బలపడుతుందని చెబుతున్నారు.
అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రతిపాదనలు మెజారిటీలకు అనుకూలంగా ఉన్నాయని ప్రొఫెసర్ రెహమాన్ అంటున్నారు. “ఇది ముస్లింల ఆస్తుల మీద ప్రభుత్వ నియంత్రణ పెంచుకోవడమే కాకుండా కాకుండా ముస్లింల జీవితాల మీద హిందూ సమాజం ఆధిపత్యం చెలాయించే ప్రయత్నంగా కనిపిస్తోంది” అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రతిపాదిత మార్పులు ఏమిటి?
వక్ఫ్ చట్ట సవరణ బిల్లులో ఇతర మార్పులతో పాటు వక్ఫ్ ఆస్తులను బోర్డు తప్పనిసరిగా జిల్లా కలెక్టర్ల వద్ద రిజిస్టర్ చేయించాలి. వక్ఫ్ చెబుతున్న ఆస్తి వక్ఫ్దేనా కాదా అనే విషయాన్ని కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిస్తారు.ఈ సవరణ వల్ల వక్ఫ్ బోర్డు అధికారాలు తగ్గిపోతాయని విమర్శకులు అంటున్నారు.
ముస్లింల నుంచి వారి భూములను లాక్కునేందుకే ఇలాంటి మార్పులు చేస్తున్నారని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపిస్తున్నారు.
వక్ఫ్ చట్టంలో మార్పులకు సంబంధించి మరో ప్రతిపాదన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్వే కమిషనర్ను నియమించాలి. ఆయన వక్ఫ్ ఆస్తులను గుర్తిస్తారు. అలాగే వాటి గురించి ఒక జాబితా సిద్ధం చేస్తారు. ఆ జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. దీనిపై ప్రభుత్వం తప్పనిసరిగా చట్టపరమైన నోటిఫికేషన్ ఇస్తుంది. జాబితాలో ఆస్తుల గురించి ఎవరూ ఏడాది పాటు సవాలు చేయకపోతే అది వక్ఫ్ బోర్డుకు చెందుతుంది.
అయితే కొన్ని మార్పుల వల్ల ప్రస్తుత వక్ఫ్ ఆస్తులను అవి వక్ఫ్ ఆస్తులే అని మరోసారి నిరూపించాల్సి ఉంటుంది.
“అనేకమంది వక్ఫ్ ఆస్తుల్ని ఆక్రమించుకున్నారు. చట్ట సవరణ వల్ల వాళ్లు ఆ ఆస్తి తమదే అని నిరూపించుకునేందుకు వారికి ఒక ఛాన్స్ లభిస్తుంది” అని ఒవైసీ ఇటీవల రిపోర్టర్లతో చెప్పారు.
ప్రభుత్వ నిర్ణయం వల్ల అనేక చారిత్రక దర్గాలు, మసీదులకు ముప్పు ఏర్పడుతుందని ముస్లిం సంఘాలు ఆందోళన వ్యకం చేస్తున్నాయి. సంస్కరణలు అవసరమే, అయితే అది ముస్లింల మనోభావాలు, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని జరగాలని చెబుతున్నారు.
“తప్పులను గుర్తించడం మంచిదే కావచ్చు. అయితే వాటిని సరిచేసే విధానం ఇది కాదు” అని ప్రొఫెసర్ రెహమాన్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)














