అందరూ ఆడారు అలవోకగా గెలిచారు

Team India - Rohit Sharma, Jasprit, Kuldeep

ఫొటో సోర్స్, Getty Images

టీ20 ప్రపంచకప్‌లో సూపర్-8 దశలో టీమిండియా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది.

సూపర్‌-8లో భాగంగా శనివారం రాత్రి బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 50 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీస్ దారిని మరింత మెరుగుపరుచుకుంది.

భారత ఆటగాళ్లు సమష్టిగా ఆడి ఈ మ్యాచ్‌ను గెలిపించారు. సూర్యకుమార్ యాదవ్ మినహా క్రీజ్‌లోకి వచ్చిన బ్యాటర్లంతా దూకుడుగా ఆడడంతో పాటు మంచి స్కోర్లు చేశారు.

అటు బౌలింగ్‌లోనూ అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా మినహా అందరూ వికెట్లు తీయడంతో పాటు బంగ్లాదేశ్‌ను కట్టడి చేశారు.

బీబీసీ తెలుగు న్యూస్ వాట్సాప్ చానల్
విరాట్ కొహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విరాట్ కొహ్లీ 28బంతుల్లో 1 ఫోర్, 1 సిక్సర్‌ సాయంతో 37 పరుగులు చేశారు.

నార్త్‌సౌండ్‌లోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకోవడంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది.

ఓపెనర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గత మ్యాచ్‌లకు భిన్నంగా స్కోరు బోర్డును పరుగులెత్తించారు.

రోహిత్ శర్మ 11 బంతుల్లో 3 ఫోర్లు ఒక సిక్సర్‌తో 23 పరుగులు, విరాట్ కోహ్లీ 28 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్‌ సాయంతో 37 పరుగులు చేశారు.

అయితే దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్న దశలో రోహిత్ శర్మ షకిబ్ హసన్ బౌలింగ్‌లో క్యాచ్ అవుటయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 3.4 ఓవర్లలో 39 పరుగులు.

తరువాత కోహ్లీకి జత కలిసిన కీపర్ రిషబ్ పంత్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు.

వీరిద్దరూ మరో 4 ఓవర్లు ఆడిన తరువాత విరాట్ 9వ ఓవర్ తొలి బంతికి తంజీమ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 71.

తరువాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ వచ్చీరాగానే ఓ సిక్సర్ బాదినా ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు.

మొదటిబంతికి సిక్సర్ బాదిన సూర్య కుమార్ యాదవ్ రెండో బంతికి తంజిమ్ బౌలింగ్‌లో లిటన్ దాస్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

హార్దిక్ పాండ్య

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హార్దిక్ పాండ్య

హార్దిక్ పాండ్య మెరుపులు

సూర్యకుమార్ అవుటయ్యే సమయానికి జట్టు స్కోరు 8.3 ఓవర్లలో 3 వికెట్లకు 77 పరుగులు.

అక్కడి నుంచి జట్టు స్కోరును రిషబ్ పంత్, శివమ్ దుబె 108 పరుగులకు చేర్చాక పంత్.. రిషద్ బౌలింగ్‌లో తంజిమ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

తరువాత వచ్చిన హార్దిక్ పాండ్య, శివమ్ దుబే సమన్వయంతో ఆడారు.

జట్టు స్కోరు 161 పరుగులకు చేరాక దుబే రిషద్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు.

పాండ్యా 27 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్సర్లతో 50 పరుగులు చేశాడు.

మరోవైపు ఈ మ్యాచ్‌లో హార్దిక్ అరుదైన ఘనతను సాధించాడు.

ఐసీసీ టీ 20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ తరపున అరుదైన డబుల్ సాధించిన తొలి ఆటగాడిగా హార్దిక్ పాండ్య నిలిచినట్టు ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీ కథనం తెలిపింది.

ఐసీసీ టీ20 ప్రపంచకప్ లో భారత్ తరపున 300 పరుగులు, 20కి పైగా వికెట్లు తీసిన ఆటగాడిగా పాండ్య రికార్డు సృష్టించాడు.

పాండ్య తన టీ 20 ప్రపంచ కప్ కెరియర్‌లో 21 మ్యాచ్‌లలో 13 ఇన్నింగ్స్‌లలో 27.45 సగటుతో 137.89 స్ట్రైక్ రేట్‌తో 302 పరుగులు చేశాడు.

అందులో రెండు అర్థసెంచరీలు కూడా ఉన్నాయి.

అత్యుత్తమ స్కోరు 63 పరుగులు కాగా, తాను ఆడిన 21 మ్యాచ్‌లలో 21 వికెట్లు కూడా తీశాడు.

బౌలింగ్‌లో అతని బెస్ట్ 27 పరుగులకు 3 వికెట్లు .

ఇక బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ మొత్తంగా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.

బంగ్లా బౌలర్లలో రిషద్, తంజిమ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

షకీబుల్ హసన్ ఒక వికెట్ పడగొట్టాడు.

బంగ్లాదేశ్ జట్టు ఫోటో
ఫొటో క్యాప్షన్, పంత్‌ను అవుట్ చేశాక బంగ్లా జట్టు సంబరం

బంగ్లాదేశ్ ఆరంభం బాగున్నా..

196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ను 146 పరుగులకే భారత బౌలర్లు కట్టడి చేశారు.

బంగ్లా ఓపెనర్లు కూడా బాగానే ఆడారు.

4.3 ఓవర్లకు 35 పరుగులు జత చేశాక లిటన్ దాస్‌ హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

లిటన్ దాస్ 10 బంతుల్లో 13 పరుగులు చేశాడు. అతని స్కోరులో 1 సిక్సర్, ఒక ఫోర్ ఉన్నాయి.

మరో ఓపెనర్‌ తంజిద్ హసన్, వన్ డౌన్ బ్యాటర్ నజ్ముల్ శాంటో జాగ్రత్తగా ఆడారు.

వీరిద్దరు స్కోరుబోర్డుపైకి మరో 31 పరుగులు జోడించాక తంజిద్ కులదీప్ యాదవ్‌కు వికెట్ల ముందు దొరికిపోయి ఎల్‌బీడబ్ల్యుగా వెనుదిరిగాడు. తంజిద్ 31 బంతుల్లో 29 పరుగులు చేశాడు. అతని స్కోరులో నాలుగు ఫోర్లు ఉన్నాయి.

ఇక ఆ తరువాత నజ్ముల్‌ (40)కు సహకారం కొరవడింది.

తౌహిద్ (6బంతులు 4 పరుగులు) , షకిబ్ (7బంతుల్లో 1 ఫోర్ 1 సిక్సర్‌తో 11 పరుగులు), మహ్మదుల్లా (15 బంతుల్లో 13 పరుగులు 1 ఫోర్) జేకర్ అలీ ( (4 బంతుల్లో ఒక పరుగు) తక్కువ స్కోరుకే అవుటయ్యారు.

రిషాద్ హొస్సేన్ ఒక్కడే 10 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లతో మెరుపులు మెరిపించినా అప్పటికే ఆలస్యమైంది.

మహేది హసన్, తంజిమ్ హసన్ కూడా స్వల్పస్కోర్లు (వరుసగా 5,1) అవుటవడంతో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 146 పరుగులే చేయగలిగింది.

భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ 4 ఓవర్లలో 19 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీయగా, జస్ప్రిత్ బుమ్రా 2 వికెట్లు, అర్షదీప్ సింగ్ 2 వికెట్లు, హార్దిక్ పాండ్య 1 వికెట్ తీశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)