గాయపడిన పాలస్తీనా పౌరుడిని జీపు ముందు భాగానికి కట్టేసి తీసుకెళ్లిన ఇజ్రాయెల్ సైనికులు

గాయపడిన వ్యక్తిని జీపుకు కట్టేసిన ఫోటో

ఫొటో సోర్స్, Reuters

కాల్పుల్లో గాయపడిన పాలస్తీనా పౌరుడిని ఇజ్రాయెల్ బలగాలు జీపు ముందుభాగంలో కట్టేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ అయింది.

ఆ ఘటనపై ఇజ్రాయెల్ మిలటరీ స్పందించింది. తమ దళాలు నిబంధనలు ఉల్లంఘించాయని పేర్కొంది.

ఆ ఘటనకు సంబంధించి వీడియో సామాజిక మాధ్యమాలలో షేర్ అయ్యాక ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) దానిని ధ్రువీకరించింది.

వెస్ట్ బ్యాంక్‌లోని జెనిన్ నగరంపై తమ సైన్యం జరిపిన దాడి సమయంలో జరిగిన ఎదురుకాల్పులలో ఆ అనుమానితుడు గాయపడినట్లు ఐడీఎఫ్ ఓ ప్రకటనలో తెలిపింది.

బాధితుడి కుటుంబీకులు దీనిపై మాట్లాడుతూ.. అంబులెన్స్ కావాలని తాము అడిగితే సైనికులు ఆయన్ను తమ జీపు బానెట్‌కు కట్టి డ్రైవ్ చేసుకుంటూ వెళ్లారని ఆరోపించారు.

కాగా బాధితుడిని చికిత్స నిమిత్తం రెడ్ క్రెసెంట్‌కు తరలించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
Israel Defense Forces

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్ సైనికులు

ఈ ఘటనపై విచారణ జరుపుతామని ఐడీఎఫ్ తెలిపింది.

గాయపడిన వ్యక్తి పేరు ముజామిద్ అజ్మీ అని, అతను స్థానికుడని ప్రత్యక్ష సాక్షులు రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీకి తెలిపారు.

‘‘ఈ రోజు ఉదయం (శనివారం) వడీ బుర్కిన్ ప్రాంతంలో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలలో భాగంగా అనుమానితులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ‘టెర్రరరిస్టులు’ ఐడీఎఫ్ ట్రూపులపై కాల్పులు జరిపారు. , ప్రతిగా ఐడీఎఫ్ బలగాలు కూడా కాల్పులు జరిపాయి’’ అని ఐడీఎఫ్ ప్రకటన తెలిపింది.

‘‘ఈ కాల్పులలో ఓ అనుమానితుడు గాయపడ్డాడు. అయితే నిబంధనలకు విరుద్ధంగా సైనిక దళం అనుమానితుడిని జీపు పై భాగానా కట్టింది’ అని ఐడీఎఫ్ పేర్కొంది.

‘‘ఆ ఘటనకు సంబంధించిన వీడియో ప్రకారం బలగాల ప్రవర్తన ఐడీఎఫ్ విలువలకు అనుగుణంగా లేదని దానిపై విచారణ జరిపి తదనుగుణంగా వ్యవహరిస్తామని’’ తెలిపింది.

ఇజ్రాయెల్-గాజా యుద్ధం

ఫొటో సోర్స్, Getty Images

అక్టోబర్ 7న దక్షిణ ఇజ్రాయెల్‌పై హమాస్ తీవ్ర దాడి తరువాత గాజాస్ట్రిప్‌లో యుద్ధం మొదలైనప్పటనుంచి వెస్ట్ బ్యాంక్‌లో హింస పెరిగింది.

తూర్పు జెరుసలెం సహా వెస్ట్‌బ్యాంక్‌లో ఘర్షణ సంబంధిత ఘటనల్లో కనీసం 480 మంది పాలస్తీనియన్లు, సాయుధ గ్రూపులకు చెందినవారు, సాధారణ పౌరులు చనిపోయినట్టు ఐక్యరాజ్యసమితి తెలిపింది.

వెస్ట్‌ బ్యాంక్‌లో ఆరుగురు భద్రతా సిబ్బంది సహా పదిమంది ఇజ్రాయెలీలు మరణించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)