హిజాబ్ ధరించలేదని మొరాలిటీ పోలీసుల ‘దాడి’.. కోమాలోకి వెళ్లిన అమ్మాయి

ఫొటో సోర్స్, IRNA
- రచయిత, డేవిడ్ గ్రిట్టెన్
- హోదా, బీబీసీ న్యూస్
హిజాబ్ ధరించలేదంటూ ఇరాన్ మొరాలిటీ పోలీసులు చేసిన దాడితో ఓ బాలిక కోమాలోకి వెళ్ళిందంటూ ఆందోళనకారులు ఓ ఫోటోను విడుదల చేశారు.
సోహాదా రైల్వే స్టేషన్లో ఆదివారం అర్మితా గెరావాంద్(16) అనే బాలిక టెహ్రాన్ మెట్రో రైలు ఎక్కాక కుప్పకూలిపోయింది.
అధికారులు మాత్రం ఆమె కళ్ళు తిరిగిపడిపోయిందంటూ అపస్మారక స్థితిలో ఉన్న బాలికను రైలు నుంచి కిందకు దించుతున్న సీసీటీవీ దృశ్యాలను విడుదల చేశారు.
ఈ బాలికపై మొరాలిటీ పోలీసులు తీవ్రమైన భౌతిక దాడి చేశారని మానవ హక్కుల బృందం హెంగావ్ ఆరోపించింది.
టెహ్రాన్లోని ఫాజర్ ఆస్పత్రిలో బాలికకు భారీ భద్రత నడుమ చికిత్స అందిస్తున్నారని, ఆమె కుటుంబసభ్యుల ఫోన్లన్నింటినీ జప్తు చేశారని ఈ బృందం పేర్కొంది.
ఈ ఘటన గురించి రిపోర్ట్ చేసేందుకు సోమవారం ఆస్పత్రికి వెళ్ళిన షార్క్ పత్రికకు చెందిన మహిళా రిపోర్టర్ను కొద్దిసేపు నిర్బంధించారు.
అర్మిత టెహ్రాన్లో నివసిస్తోంది. కానీ ఆమె పశ్చిమ ప్రావిన్స్ కెర్మాన్షాకు చెందిన బాలిక అని ఇరాన్లో కుర్దుల హక్కులపై పనిచేస్తున్న హెంగావ్ తెలిపింది.
‘‘సోహాదా స్టేషన్లో ఆ బాలిక హిజాబ్ నియమాన్ని పాటించడంలేదని గ్రహించిన మొరాలిటీ పోలీసులు ఆమెను చావబాదారు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ తర్వాత ఆస్పత్రికి తరలించారు’’ అని పేర్కొంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
డ్రెస్కోడ్ పాటించాలనే ఏజెంట్లతో గొడవ జరిగినట్టు ఇద్దరు ప్రముఖ హక్కుల కార్యకర్తలు వార్తాసంస్థ రాయిటర్స్కు చెప్పారు.
ఆ బాలిక హిజాబ్ ధరించకుండా ట్రైన్ ఎక్కిన తరువాత హిజాబ్ దళాలు ఆమెను తోసివేశాయని, ఆ బాలిక తల ఒక ఇనుప స్తంభానికి కొట్టుకుందని పేరు చెప్పడానికి ఇష్టపడని వారు చెప్పినట్టు ఆమ్స్టర్డామ్ కేంద్రంగా నడిచే జమానెహ్ రేడియో తెలిపింది.
మంగళవారం రాత్రి ఎక్స్ (ట్విట్టర్)లో హెంగావ్ పోస్టు చేసిన ఫోటో అర్మిత అపస్మారక స్థితిలో ఉన్నట్టు తెలిపింది.
ఈ చిత్రంలో బాలిక వీపుపై కొద్దిగా జుట్టు పడి ఉంది. ఆమె తలకు బ్యాండేజీ కట్టు ఉంది. శ్వాస తీసుకోవడానికి ఉపయోగించే రెండు ట్యూబ్లు ఆమెకు పెట్టి ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ ఫోటో నిజమేనా, కాదా అనేది బీబీసీ ఇంకా స్వతంత్రంగా నిర్ధరించుకోలేదు.
ఇరాన్ అధికార న్యూస్ ఏజెన్సీ ‘ఇర్నా’ ఉన్నతాధికారుల సమక్షంలో ఫాజర్ ఆస్పత్రిలో అర్మిత తల్లిదండ్రులను ఇంటర్వ్యూ చేసినట్టు తమకు సమాచారం అందిందని హెంగావ్ చెప్పింది.
సీసీటీవీ ఫుటేజ్ చూశాక ఆదివారం నాటి ఘటన ప్రమాదవశాత్తు జరిగినట్టుగా అర్మిత తల్లి అంగీకరించినట్టు ఇర్నా పేర్కొంది.
‘‘నా కూతురు బీపీ బాగా తగ్గిపోయినట్లు నాకనిపించింది. కానీ నేను ఈ విషయాన్ని కచ్చితంగా చెప్పలేను. రక్తపోటు తగ్గిపోయినట్టు అధికారులు చెప్పినట్టు ఉన్నారు’’ అని పూర్తిగా ఎడిట్ చేసిన వీడియోలో బాధితురాలి తల్లి మాట్లాడారు.
అర్మితకు ప్రయాణికులతోగానీ, మెట్రో ఎగ్జిక్యూటివ్లతోగానీ వాదోపవాదాలు, ఘర్షణ జరిగి ఉంటుందనే విషయాన్ని టెహ్రాన్ మెట్రో మేనేజింగ్ డైరక్టర్ మసూద్ దోరోస్తీ కూడా ఖండించారు.
‘‘మెట్రో ఏజెంట్లతో గొడవ జరిగినట్టు వస్తున్న వదంతులు నిజం కావు. సీసీటీవీ ఫుటేజ్ కూడా ఇదే చెబుతోంది’’ అని ఆయన ఇర్నాకు చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
సీసీటీవీలో అర్మిత తలపై ఏం కప్పుకోకుండానే ఇద్దరు బాలికలతో కలిసి నడిచి వెళుతున్నట్టుగా కనిపిస్తోంది.
కొన్ని క్షణాల తరువాత అర్మితను ట్రైన్ నుంచి బయటకు లాగేశారు.
ఫ్లాట్ఫామ్పైకి ఆమెను తీసుకురాక మునుపు ఆమె కాళ్ళు,చేతులు పట్టుకుని మోసుకు వస్తున్న దృశ్యాన్ని చాలా మంది ప్రయాణికులు చూశారు.
అధికారులు విడుదల చేసిన సీసీటీవీ ఫుటేజీ కేవలం ఫ్లాట్ఫామ్ను మాత్రమే చూపుతోందని ట్రైన్ లోపలి భాగాన్ని చూపడం లేదని ఇరాన్ సోషల్ మీడియా యూజర్లు అంటున్నారు.
ప్రవేశమార్గం నుంచి స్టేషన్ వరకు ఉన్న మార్గాన్ని కూడా సీసీటీవీ ఫుటేజ్లో విడుదల చేయలేదు. బహుశా ఇక్కడే హిజాబ్ ధరించారో లేదో చెక్ చేస్తుంటారు.
కిందటేడాది సెప్టెంబర్లో హిజాబ్ సరిగా ధరించనందుకు మోరల్ పోలీసుల కస్టడీలో 22 ఏళ్ళ కుర్దు యువతి మహసా అమినీ మృతి చెందిన ఘటన ఇంకా ఇరాన్లో ప్రకంపనాలు సృష్టిస్తూ ఉంది.
అమినీని అధికారులు బాగా కొట్టినట్టు ప్రత్యక్షసాక్షులు చెప్పగా, అధికారులు మాత్రం ఆమె ఆరోగ్య కారణాలతో చనిపోయినట్టు చెప్పారు.
ఓ డిటెన్షన్ కేంద్రంలో అమినీ కుప్పకూలిపోవడం, ఆమె ఆస్ప్రతిలో ఉన్న ఫోటో సీసీటీవీ వీడియోలో కనిపించడం ఇరాన్ ప్రజలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.
మూడు రోజుల పాటు కోమాలో ఉండి అమిని మృతి చెందాక దేశవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు చెలరేగాయి.
మాహసా అమినీ మృతి చెందిన ఏడాది తర్వాత ఈ నిరసనలు చల్లబడ్డాయి.
చాలా మంది అమ్మాయిలు డ్రెస్ కోడ్ను ధిక్కరిస్తూ తమ తలను కప్పుకోకుండానే బహిరంగ ప్రదేశాలలో తిరుగుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- సిక్కిం ఆకస్మిక వరదల్లో 22 మంది జవాన్లు సహా 102 మంది గల్లంతు, క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి?
- ఏషియన్ గేమ్స్: ఈ ఫోటోను చైనా ఎందుకు సెన్సార్ చేసింది?
- పారిస్పై నల్లుల దండయాత్ర, భయపడిపోతున్న జనం, ఎక్కడ చూసినా నల్లులే..
- వరల్డ్ కప్ 2023: ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు? లైవ్ ఎక్కడ వస్తుంది?
- శ్రీదేవి ఉప్పు తినకపోవడం వల్లే చనిపోయారా? బోనీ కపూర్ ఏమన్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)















