కేరళ‌లో ఫిల్మ్ ఫెస్టివల్‌కి ఈ ఇరాన్ మహిళా నిర్మాత జుట్టు కత్తిరించి పంపించారు ఎందుకు

ఫిల్మ్ ఫెస్టివల్‌కి జుట్టు కత్తిరించి పంపిన నిర్మాత

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఇమ్రాన్ ఖురేషి
    • హోదా, బీబీసీ హిందీ

కేరళలో జరిగిన అంతర్జాతీయ చిత్రోత్సవానికి తన జుట్టు కత్తిరించి పంపించిన ఇరాన్‌కు చెందిన మహిళా నిర్మాత మహనాజ్ మొహమ్మదీ వార్తల్లో నిలిచారు.

ఆమె ఈ కార్యక్రమానికి హాజరుకావాలనుకున్నా.. దేశం విడిచి వెళ్లకుండా ఆమెపై నిషేధం ఉండటంతో ఈ విధంగా తన నిరసన వ్యక్తం చేశారు.

కేరళలో జరిగిన అంతర్జాతీయ చిత్ర ఉత్సవం(ఐఎఫ్ఎఫ్‌కే)కి గత వారం మహనాజ్ మొహమ్మదీ రావాల్సి ఉంది.

ఈ ఉత్సవంలో ఆమె ‘స్పిరిట్ ఆఫ్ సినిమా’ అవార్డును అందుకోవాల్సి ఉంది. కానీ మహనాజ్ మొహమ్మదీపై ప్రయాణ నిషేధం కారణంగా, వీసా రెన్యువల్ కాకపోవడంతో ఆమె భారత్‌కు రాలేకపోయారు.

‘స్పిరిట్ ఆఫ్ సినిమా’ అవార్డును 2021లోనే ప్రవేశపెట్టారు.

ప్రతికూల పరిస్థితులున్నా మొక్కవోని ధైర్యంతో సినీ రంగంలో రాణిస్తున్నవారికి ఈ అవార్డును ఇస్తున్నారు.

ఈ నెల 9న తిరువనంతపురం నగరంలో జరిగిన ఈ వేడుకలో ఆమె తరఫున ఐఎఫ్ఎఫ్‌కే జ్యూరీ సభ్యులు, గ్రీక్ ఫిల్మ్ మేకర్ అథిన రాచెల్ సంగారి ఈ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డును అందుకున్న తర్వాత సంగారి, మొహమ్మదీ పంపిన జుట్టును ప్రేక్షకులకు చూపించారు.

ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. పెద్ద ఎత్తున ప్రేక్షకులు ఆమెకు మద్దతుగా నిలుస్తూ చప్పట్లు కొడుతూ మొహమ్మదీని అభినందించారు.

‘‘ప్రతి రోజూ, ప్రతి సందర్భంలో మేం ఎదుర్కొంటున్న సంఘటనలకు చిహ్నమే ఈ జుట్టు కత్తిరించుకోవడం’’ అని బీబీసీకి ఇచ్చిన ఈమెయిల్ ఇంటర్వ్యూలో మొహమ్మదీ తెలిపారు. చిత్ర ప్రదర్శనలో తనకు వచ్చిన స్పందనను చూసిన తర్వాత తాను కన్నీటిని ఆపులేకపోయానని చెప్పారు.

ఫిల్మ్ ఫెస్టివల్‌కి జుట్టు కత్తిరించి పంపిన నిర్మాత

ఫొటో సోర్స్, AV MUZAFAR

హిజాబ్‌కి వ్యతిరేకంగా ఎన్నో నెలలుగా పోరాటం..

ఎన్నో నెలలుగా ఇరాన్‌లో మహిళలు అత్యంత కఠినమైన హిజాబ్ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు.

ఈ చట్టాల ప్రకారం మహిళలందరూ కూడా తప్పనిసరిగా హిజాబ్ ధరించాలి.

తల, జుట్టు కనిపించకూడదు. శరీరం కనబడకుండా పొడవైన, వదులుగా ఉండే దుస్తులు ధరించాలి.

హిజాబ్ చట్టాలను ఉల్లంఘించిందనే ఆరోపణలతో తెహ్రాన్‌లోని మొరాలిటీ పోలీసులు కుర్దిష్ మహిళ మహసా అమీనీని సెప్టెంబర్‌లో అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల నిర్బంధంలో ఉన్న అమీనీ స్పృహ తప్పి పడిపోయి, ఆ తర్వాత కొద్ది సేపటికే కోమాలోకి వెళ్లారు.

మూడు రోజుల తర్వాత ఆస్పత్రిలో మరణించారు.

అమీనీ మరణం తర్వాత ఇరాన్ వ్యాప్తంగా హిజాబ్‌కి వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగాయి.

అప్పటి నుంచి, ఇరాన్ మహిళలు తమ హిజాబ్‌లను తగులబెడుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలు ఈ నిరసనలకు సంఘీభావంగా తమకు తాము జుట్టును కత్తిరించుకుంటూ వీడియోలను పోస్టు చేస్తున్నారు.

1979లో ఇస్లామిక్ రిపబ్లిక్ ఏర్పాటైనప్పటి నుంచి ఈ ఆందోళనలే ప్రభుత్వానికి అతిపెద్ద సవాలుగా ఉన్నాయి.

ఇప్పటి వరకు ప్రభుత్వ బలగాల చేతిలో వేలాది మంది చనిపోయారని హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు.

వివాదాలకు కొత్తమీ కాదు..

స్వతంత్రతో జీవించే హక్కు ఇరాన్ మహిళలకు కావాలని మొహమ్మదీ అన్నారు. ‘ఆందోళనకారులు ఏమీ కోల్పోరు. వారి జీవితం కోసం వారు పోరాడుతున్నారు. ఎందుకంటే, ఇరాన్ ప్రభుత్వం వారికంటూ ఎలాంటి ప్రత్యామ్నాయాన్ని విడిచిపెట్టలేదు’’ అని ఆమె అన్నారు.

తెహ్రాన్‌లో జన్మించిన మొహమ్మదీ గత రెండు దశాబ్దాలుగా ఇరాన్‌లో మహిళల హక్కుల కోసం తీవ్రంగా పోరాడుతున్న ధిక్కార స్వరం.

2003లో ఆమె తీసిన ఉమెన్ వితౌట్‌ షాడోస్ డాక్యుమెంటరీకి అంతర్జాతీయ చిత్ర ఉత్సవాల్లో ఎన్నో అవార్డులు దక్కాయి. ఈ డాక్యుమెంటరీలో నివాసం లేని, ఎలాంటి సంరక్షణ లేని మహిళల జీవితాలను మొహమ్మదీ చూపించారు.

2019లోని ఆమె ఫీచర్ ఫిల్మ్ సన్ మదర్, 44వ టొరంటో అంతర్జాతీయ చిత్ర ఉత్సవంలో ప్రదర్శించారు. 14వ రోమ్ చిత్ర ఉత్సవంలో స్పెషల్ జ్యూరీ అవార్డును ఈ చిత్రం అందుకుంది.

అలాగే ఈ 47 ఏళ్ల చిత్ర నిర్మాత వివాదాలకు కొత్తమీ కాదు.

2008లో ఆమె డాక్యుమెంటరీ ట్రావెల్‌లాగ్ విడుదలైన తర్వాత మొహమ్మదీపై ఇరాన్ ప్రభుత్వం ప్రయాణ నిషేధాన్ని విధించింది. ఎందుకు చాలా మంది ఇరాన్ ప్రజలు దేశం విడిచి వెళ్లిపోతున్నారని తెలుపుతూ ఈ చిత్రాన్ని డాక్యుమెంట్ రూపంలో రూపొందించారు మొహమ్మదీ. తెహ్రాన్, అంకారా మధ్యలో రైలులో ఈ చిత్రాన్ని షూట్ చేశారు.

దానికి కేవలం ఒక ఏడాది ముందు, ఇతర మహిళా హక్కుల కార్యకర్తలపై విచారణలకు వ్యతిరేకంగా జరిపిన ఆందోళనల్లో ఆమెను అరెస్ట్ చేశారు. ఇరాన్ అధ్యక్షుడిగా మొహమూద్ అహ్మదీనెజాద్ తిరిగి ఎంపిక కావడంతో ఆందోళనలు చెలరేగాయి. ఈ ఆందోళనల్లో 26 ఏళ్ల మహిళా నేదా అఘా సుల్తాన్ కాల్పులకు గురై చనిపోయారు. ఆమె సమాధిపై పుష్పాలు పెట్టి నివాళి అర్పించినందుకు గాను మొహమ్మదీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇరాన్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడినందుకు గాను 2014లో ఆమెకు ఐదేళ్ల పాటు జైలు శిక్ష విధించారు.

ఫిల్మ్ ఫెస్టివల్‌కి జుట్టు కత్తిరించి పంపిన నిర్మాత

ఫొటో సోర్స్, AV MUZAFAR

జీవితమంతా ఆంక్షల మధ్యే..

‘‘నా జీవితమంతా ఆంక్షల మధ్యలోనే వెళ్లదీశాను’’ అని మొహమ్మదీ అన్నారు.

ఈ పితృస్వామ్య విధానంలో ఇరాన్‌లోని మగవారు మాత్రమే లాభపడుతున్నారని ఆరోపించారు. జెండర్ కారణం చేత మహిళలకు ఇప్పటికీ బానిస బతుకేనని చెప్పారు.

ఇరాన్ మహిళల చాలా వివక్షతలకు హిజాబ్ చిహ్నంగా ఉందని, ఏడేళ్ల వయసులోనే స్కూల్‌కి వెళ్లేటప్పుడు బలవంతంగా తాము దీన్ని ధరించాల్సి వచ్చేదని అన్నారు. అప్పటి నుంచే తమ కలలను హిజాబ్ కమ్మేసిందని అన్నారు.

అయితే, హిజాబ్‌పై భారత్‌లో, ఇరాన్‌లో భిన్నమైన రీతిలో ఆందోళనలు చెలరేగాయి. ఈ ఏడాది ప్రారంభంలో పాఠశాలలకు, కాలేజీలకు ముస్లిం అమ్మాయిలు హిజాబ్ ధరించకుండా కర్నాటక రాష్ట్రం నిషేధం విధించింది. ఈ నిషేధం తర్వాత భారత్‌లో దీనికి అనుకూలంగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. కర్నాటక విధించిన ఈ నిషేధాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేశారు. కానీ, ఇరాన్‌లో మాత్రం హిజాబ్‌కు వ్యతిరేకంగా ఈ నిరసనలు చేస్తున్నారు.

భారత్‌లో జరుగుతున్న ఈ వివాదంపై మొహమ్మదీని అభిప్రాయం కోరగా ఆమె ఇలా స్పందించారు. ‘‘హిజాబ్‌కు మేము వ్యతిరేకం కాదు. మేము మహిళలం, హిజాబ్ ధరించాలా? వద్దా? అనేది నిర్ణయించుకునే హక్కు మాకుంది’’ అని మొహమ్మదీ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)