నీరు లీక్ అవుతుందని నైట్ షిఫ్ట్ కార్మికులు చెప్పినా మార్నింగ్ షిఫ్ట్లో వర్కర్స్ను పంపించారా? ‘ఎస్ఎల్బీసీ’ ప్రమాదంలో సమాధానం లేని ప్రశ్నలెన్నో

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బళ్ళ సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఎస్సెల్బీసీ టన్నెల్ ప్రమాదానికి సంబంధించి కారణాలు ఇంకా తెలియలేదు.
సంస్థ తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందా అన్న కోణంలో పలువురు నిపుణులు, ప్రతిపక్ష నాయకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
అయితే దీనిపై ప్రభుత్వం కానీ, ‘ఎస్ఎల్బీసీ’ని నిర్మిస్తున్న కంపెనీ కానీ స్పష్టమైన సమాధానం చెప్పలేదు.
భూమి గట్టిదనం పరీక్షలు చేశారా?
ఏదైనా ప్రాజెక్టులో సొరంగం నిర్మించేటప్పుడు ఆ ప్రదేశం ఎంత గట్టిగా ఉంది, నిర్మాణ సమయంలో పైనుంచి కూలిపోయే ప్రమాదం ఉందా అని రకరకాల పద్ధతుల్లో పరీక్షలు చేస్తారు.
అయితే ఎస్ఎల్బీసీ సొరంగ నిర్మాణం జరుగుతున్నప్రాంతం టైగర్ రిజర్వు కాబట్టి, సంప్రదాయ పద్ధతుల్లో మట్టి పరీక్షలు సాధ్యం కాదని నిపుణులు అన్నారు.
అయితే వేరే పద్ధతుల్లో ఆ పరీక్షలు నిర్వహించే వెసులుబాటు ఉందని పేరు చెప్పడానికి ఇష్టపడని నిపుణుడు ఒకరు తెలిపారు.
ఇక్కడ పనులు ఆగిపోయి, తిరిగి ప్రారంభించేప్పుడు ఆ పరీక్షలు నిర్వహించలేదని.. హడావుడిగా పనులు ప్రారంభించారని బీఆర్ఎస్ నాయకుడు హరీశ్ రావు ఆరోపించారు.
దాదాపు అదే అభిప్రాయం తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ల సంఘం నాయకులు శ్యాంప్రసాద్ రెడ్డి వ్యక్తం చేశారు.
''షీర్ జోన్ విషయంలో అంతర్జాతీయ స్థాయి నిపుణులతో పరీక్ష చేయించి, వారి సలహా ప్రకారం నడచుకున్నామని కంపెనీ అంటోంది. కానీ ఆ నిపుణులు చెప్పినట్టు చేశారా లేదా అన్నది అనుమానంగానే ఉంది. అసలు ఆ నిపుణులు రాతపూర్వకంగా ఇచ్చారా లేదా? ఇచ్చింది వీరు పాటించారా లేదా? అసలు వారు చెప్పిన సమస్య ఏంటి? అన్నది తెలియాలి'' అని బీబీసీతో అన్నారు శ్యాంప్రసాద్ రెడ్డి.

సేఫ్టీ ఆఫీసర్ ఉన్నారా – రోజూ పరీక్షలు చేస్తున్నారా?
గనుల తవ్వకాలు, సొరంగాల నిర్మాణంలో పనులు జరిగేప్పుడు బయటి వారు ఇచ్చే నివేదికలు, బయటి నిపుణుల సలహాలే కాకుండా, సొంతంగా కూడా కొందరు భూగర్భ శాస్త్రవేత్తలను నియమించుకుంటారు.
అలాగే సేఫ్టీ సిబ్బంది ఉంటారు.
అయితే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పనులు రెండోసారి ప్రారంభించినప్పుడు ఈ సేఫ్టీ సిబ్బంది లేరని కార్మికులు కొందరు బీబీసీ వద్ద ఆరోపించారు.
టన్నెల్లో నీరు లీక్ అవడం కొత్త కాదు. ఐదేళ్ల నుంచి ఈ సమస్య ఉంది. ఆ నీటిని తోడుతున్నారు. ఎక్కడైతే లీకేజీ ఎక్కువ ఉందో అక్కడ పకడ్బందీగా నీరు లీకేజీ ఆపేలా చేసిన ఏర్పాటు నిలవలేదు.
‘అక్కడ పెట్టిన కాంక్రీట్ గ్రౌటింగ్, పేర్చిన కాంక్రీట్ రిమ్ముల ఫ్రేమింగ్ ఊడి కిందపడిపోయాయి. సమస్య ఫలానా చోట ఉందని తెలిసీ దాన్ని సమగ్రంగా అరికట్టడంలో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది’ అని ఆరోపించారు.

ఫొటో సోర్స్, UGC
టీబీఎం కట్ చేయడానికి అంగీకరించని కంపెనీలు
టన్నెల్ బోరింగ్ మెషీన్ ధర రూ. వందల కోట్లలో ఉంటుంది.
అయితే సహాయ చర్యలకు అది అడ్డంకిగా ఉంది. దీంతో ఆ యంత్రాన్ని కట్ చేసి తొలగించాలన్న సహాయక బృందాల ప్రతిపాదనకు కంపెనీ తొలుత అంగీకరించలేదని సహాయక బృందాల సభ్యులు ఒకరు బీబీసీకి చెప్పారు.
దాని వల్ల సహాయక చర్యలు ఆలస్యమయ్యాయన్నది వారి ఆరోపణ.
ఘటన జరిగిన నాలుగు రోజుల తరువాతే మెషీన్ కట్ చేయడానికి సంస్థ అంగీకరించిందని రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న ఒకరు తెలిపారు.
అయితే ఈ ఆరోపణలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తిరస్కరించారు.

నిధుల కొరత లేకున్నా కార్మికులకు జీతాలు లేవు
బీబీసీ అక్కడి కార్మికులతో మాట్లాడినప్పుడు తమకు మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని వారు చెప్పారు.
ఒకరిద్దరు కాకుండా, దాదాపు భిన్న విభాగాలకు చెందిన అయిదుగురు కార్మికులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. (వారికి ఇబ్బంది రాకుండా పేర్లు ప్రచురించడం లేదు)
వీరంతా ఉత్తర భారతం నుంచి వచ్చి 15 నుంచి 20 వేల రూపాయల జీతాలకు పనిచేస్తున్న వారే.
కాస్త పైస్థాయిలో ఉన్న కొందరికి మాత్రం జీతం సమయానికి అందినట్టు తెలుస్తోంది.
''మూడు నెలల నుంచి జీతం రాలేదు. ఇంటికి డబ్బు పంపలేదు. ఈ ప్రమాదం జరిగిన తరువాత భయపడి కొందరు వెళ్ళిపోయారు. అయితే ఈ కంపెనీ వారు జీతం ఆలస్యం చేసినా, ఎగ్గొట్టకుండా ఇస్తారనే నమ్మకం అయితే ఉంది'' అని బీబీసీతో చెప్పారు ఒడిశాకు చెందిన ఒక కార్మికుడు.
ఝార్ఖండ్ కార్మికులు చాలా మంది సైట్ నుంచి వెళ్లిపోయారు.
ప్రభుత్వం ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం పెంచి నిధుల కొరత లేకుండా చూసినా, జీతాలు ఎందుకు ఇవ్వడం లేదన్న ప్రశ్నకు సమాధానం లేదు.
ఇది కాకుండా, ప్రమాదం ముందు రోజు రాత్రి షిఫ్ట్ కార్మికులు నీరు లీక్ అవుతుందని చెప్పినట్టుగా బీబీసీ వద్ద సమాచారం ఉంది.
కానీ కంపెనీ యాజమాన్యం తమ మాటను లెక్క చేయకుండా ఉదయం షిఫ్ట్ వారిని పంపినట్టు కార్మికులు ఆరోపించారు.
ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది.
ఈ ఆరోపణలపై బీబీసీ జేపీ గ్రూప్, రాబిన్స్ కంపెనీని సంప్రదించింది. వారి నుంచి స్పందన రావాల్సి ఉంది.
''ఈ మొత్తం ఘటనపై స్వతంత్ర థర్డ్ పార్టీ టెక్నికల్ ఆడిటింగ్ జరగాలి. అది కూాడా అంతర్జాతీయ నిపుణులతో జరగాలి. ప్రమాదానికి కారణాలు తెలియాలి'' అని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)














