ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదం: రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్, పరిస్థితి వివరించిన సీఎం

ఫొటో సోర్స్, Telangana CMO/X
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణలో జరిగిన ప్రమాద ఘటనలో, ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మంది వివరాలను అధికారులు ప్రకటించారు.
వీరిలో ప్రాజెక్ట్ ఇంజినీర్, సైట్ ఇంజినీర్తో మరో ఆరుగురు ఉన్నారు.
వీరిలో ఆరుగురు జయప్రకాశ్ అసోసియేట్స్ కంపెనీకి చెందిన వారు కాగా, ఇద్దరు రాబిన్స్ ఇండియా కంపెనీకి చెందిన వారు.
వీరంతా ఉత్తర్ ప్రదేశ్, ఝార్ఖండ్, జమ్ముకశ్మీర్, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన వారుగా నీటి పారుదల శాఖాధికారులు చెబుతున్నారు.
తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట గ్రామం వద్ద ఎస్ఎల్బీసీ సొరంగంలో ఈ ప్రమాదం జరిగింది.


ఫొటో సోర్స్, UGC
వారి వివరాలివీ..
1.మనోజ్ కుమార్, ప్రాజెక్ట్ ఇంజినీర్ (ఉన్నావ్, ఉత్తరప్రదేశ్), తండ్రి పేరు: అర్జున్ ప్రసాద్
2.శ్రీ నివాస్, సైట్ ఇంజినీర్(చందౌలి, ఉత్తరప్రదేశ్), తండ్రి పేరు: రామ్ క్రిత్
3.సందీప్ సాహు, కార్మికుడు (ఝార్ఖండ్), తండ్రిపేరు: జితు సాహు
4.జగ్తా జెస్, కార్మికుడు (ఝార్ఖండ్), తండ్రి పేరు: మఘే జెస్
5.సంతోష్ సాహు, కార్మికుడు (ఝార్ఖండ్), తండ్రి పేరు: కేశ్వర్ సాహు
6.అనూజ్ సాహు, కార్మికుడు (ఝార్ఖండ్), తండ్రి పేరు: రామ్ ప్రతాప్ సాహు
7.సన్నీ సింగ్, జనరల్ ఆపరేటర్ (జమ్మూ కశ్మీర్), తండ్రి పేరు: రామ్ సింగ్
8.గురుప్రీత్ సింగ్, ఎరక్టర్ ఆపరేటర్ (పంజాబ్), తండ్రి పేరు: విర్సా సింగ్

ఫొటో సోర్స్, UGC
చర్యలు తీసుకుంటున్నాం: మంత్రి
సొరంగంలో చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు.
ఇటీవల ఉత్తరాఖండ్లో జరిగిన సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను ఏవిధంగా బయటకు తీసుకొచ్చారనే దానిపై కూడా అధికారులు వివరాలు తెలుసుకుంటున్నారు.
ప్రమాదానికి ముందు భారీ శబ్దం వచ్చినట్లు కార్మికులు చెప్పారని మంత్రి తెలిపారు.

ఫొటో సోర్స్, UGC
ప్రమాదం ఎలా జరిగిందంటే..
దోమలపెంట వద్ద సొరంగం పనులు జరుగుతున్న ప్రదేశాన్ని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి పరిశీలించారు.
ప్రమాదం ఘటనపై సమీక్షించిన మంత్రి, ప్రమాదం ఎలా జరిగింది? ప్రమాదానికి గల కారణాలను వెల్లడించారు.
''శనివారం ఉదయం పనులు ప్రారంభం కాగానే ఒక వైపు నుంచి నీళ్లు టన్నెల్లోకి రావడం మొదలైంది.
నీళ్లు, మట్టి కలిసిపోయి బురదమయంగా మారినట్లు తెలుస్తోంది'' అని చెప్పారు.
ఘటనకు కొన్ని క్షణాల ముందు పెద్ద శబ్దం వచ్చినట్లు మిగతా కార్మికులు చెప్పారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో చెప్పారు.
''బోల్ట్స్ ఊడిపోవడంతో సిమెంట్ సెగ్మెంట్స్ కింద పడినట్లుగా తెలుస్తోంది. దీనివల్ల విద్యుత్ వైర్లు కూడా తెగిపోయి చీకటిగా మారింది'' అని మంత్రి తెలిపారు.
ఆచూకీ లేని ఎనిమిది మంది కోసం గాలింపు చర్యలు జరుగుతున్నట్లు మంత్రి ప్రకటించారు.
''ఇటీవల ఉత్తరాఖండ్ లో ఇలాంటి ఘటన జరిగినపుడు అక్కడ చిక్కుకున్న కార్మికులను బయటకు ఏ విధంగా తీసుకువచ్చారో కూడా తెలుసుకుంటున్నారు అధికారులు. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, నిపుణుల సహాయం తీసుకుంటాం'' అని మంత్రి మీడియాతో చెప్పారు.
రంగంలోకి సింగరేణి రెస్క్యూ టీం
సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సింగరేణి రెస్క్యూ టీం రంగంలోకి దిగింది.
ఈ మేరకు టన్నెల్ వద్దకు సింగరేణి రిస్క్యూ టీం చేరుకున్నట్లుగా అధికారులు చెప్పారు.
ప్రత్యేక మార్గం ద్వారా ఆక్సిజన్ సరఫరాతో టన్నెల్ లోనికి వెళ్లేందుకు సిద్ధమయ్యారని చెప్పారు.
అయితే, విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సహాయక చర్యలకు ఇబ్బందికరంగా ఉందని అమ్రాబాద్ సీఐ బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, UGC
ప్రమాద ఘటనపై ఆరా తీసిన ప్రధాని
''ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ చేసి ఆరా తీశారు. ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను ప్రధానికి ముఖ్యమంత్రి వివరించారు'' అని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ఎక్స్లో పోస్ట్ చేసింది.
సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపిస్తామని, పూర్తి సహకారం అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ప్రధాని హామీ ఇచ్చినట్లు సీఎంవో తెలిపింది.
ప్రమాద ఘటన, సహాయక చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు.
ప్రస్తుత పరిస్థితిని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు.
సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మందిని కాపాడేందుకు సహాయక చర్యల్లో మరింత వేగం పెంచాలని సీఎం సూచించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)














