శ్రీలంక: రూ.25,000 కోట్ల ఐఎంఎఫ్ బెయిలవుట్ ప్యాకేజీ కాపాడుతుందా

శ్రీలంక ఆర్థిక సంక్షోభం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అర్చనా శుక్లా, అన్నాబెల్లె లియాంగ్
    • హోదా, కొలంబో, సింగపూర్

ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకకు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) 3 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.25,000 కోట్లు బెయిలవుట్ ప్యాకేజీ ప్రకటించింది.

బిలియన్ డాలర్ల కొద్ది రుణాలను తిరిగి చెల్లించాల్సి ఉన్న ఆ దేశానికి ఈ ప్యాకేజీ అత్యంత అవసరం.

ప్రభుత్వ రంగ సంస్థలను పునర్‌వ్యవస్థీకరించడం, ప్రభుత్వ విమానయాన సంస్థను ప్రైవేటీకరించడం ద్వారా తమ ప్రభుత్వం నిధులను సేకరించనుందని శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ బీబీసీతో చెప్పారు.

మరోవైపు, శ్రీలంక ఇంకా ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కరోనా సంక్షోభం, ఇంధన ధరలు పెరగడం, పన్నుల కోత, 50 శాతానికి పైగా పెరిగిన ద్రవ్యోల్బణంతో శ్రీలంక ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది.

ఔషధాలు, ఇంధనం, ఇతర నిత్యావసర వస్తువుల కొరతతో ఆ దేశంలో జీవన వ్యయాలు రికార్డు స్థాయికి పెరిగాయి.

పెరుగుతోన్న ఈ ధరలను భరించలేని ప్రజలు 2022లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఈ నిరసనలు చోటు చేసుకున్నాయి.

విదేశీ రుణాలు తీర్చలేక తొలిసారి శ్రీలంక దివాలా తీసింది.

‘‘మేము భరించగలిగే స్థాయి కంటే అత్యధికంగా మనీని ఖర్చు చేయాల్సి ఉంటుంది. మీరు ఇష్టపడినా, లేకున్నా కఠినతరమైన చర్యలను తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంది.’’ అని ఫండింగ్ ప్రకటించడానికి ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో సబ్రీ అన్నారు.

రాజకీయంగా ప్రలోభానికి గురవుతోన్న యూనియన్లు తప్ప మిగిలిన ప్రజలందరూ తమ నిర్ణయాలను అర్థం చేసుకుంటున్నారని సబ్రీ చెప్పారు.

ప్రజలు తమ నిర్ణయాలతో సంతోషంగా లేరని తనకు తెలుసని, కానీ ప్రభుత్వం వద్ద మరో అవకాశం లేదని వారు అర్థం చేసుకున్నారని అన్నారు.

శ్రీలంక ఆర్థిక సంక్షోభం

ఫొటో సోర్స్, Reuters

ప్రొఫెషనల్స్‌పై 12.5 శాతం నుంచి 36 శాతానికి పైగా శ్రీలంక పన్నులను విధిస్తోంది.

ఇంధనం, ఆహార వస్తువుల కొనుగోళ్లపై చెల్లించే పన్నులను కూడా ఇది పెంచింది.

2019లో శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స చేపట్టిన భారీ పన్ను కోతకు ఈ నిర్ణయాలు పూర్తిగా విరుద్ధం.

గొటబాయ ప్రభుత్వం తీసుకున్న ఈ పన్నుల కోత నిర్ణయం వల్ల ఏడాదికి 1.4 బిలియన్ డాలర్లకు పైగా ఆదాయాన్ని శ్రీలంక గవర్నమెంట్ కోల్పోయింది.

తన ప్రభుత్వ బ్యాలెన్స్ షీటును కన్సాలిడేషన్ చేసేందుకు, స్థిరమైన ఆర్థికాభివృద్ధిని పొందేందుకు శ్రీలంక ఇంకా మరింత దూరం పయనించాల్సి ఉందని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ ఏజెన్సీ అనలిస్ట్ ఆండ్య్రూ వూద్ చెప్పారు.

‘‘2024లో వృద్ధిలోకి పయనించడానికి ముందు 2023లో కూడా ఎకానమీ పడిపోతుందని మేము భావిస్తున్నాం’’ అని చెప్పారు.

భారత్, చైనా వంటి అప్పు ఇచ్చిన దేశాల నుంచి శ్రీలంక ఆర్థిక భరోసాను పొందిందని ఈ నెల ప్రారంభంలో ఐఎంఎఫ్ తెలిపింది. ఇది ఈ దేశానికి బెయిలవుట్ ప్యాకేజీ అందించేందుకు మార్గం సుగుమం చేసింది.

శ్రీలంకకు అతిపెద్ద రుణదాత అయిన చైనా తాను ఇచ్చిన రుణాల్లో కొంత మొత్తాన్ని రైటాఫ్ చేయడాన్ని పరిశీలిస్తుందా? అనే విషయం చర్చించేందుకు ఇది సరైన సమయం కాదని సబ్రీ అన్నారు.

‘‘మేము చెల్లించాలని అనుకుంటున్నాం. కానీ, మా వద్ద ఈ రుణాలు చెల్లించేందుకు ప్రస్తుతం డబ్బులు లేవు. మేము ఈ రుణాలు చెల్లించే సామర్థ్యాన్ని పొందేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని చెప్పారు.

ఇది చాలా క్లిష్టమైన చర్చనీయాంశమని అన్నారు.

2022 చివరి నాటికల్లా భారత్, చైనాకు చెల్లించాల్సి ఉన్న బకాయిలను క్లియర్ చేయాలని శ్రీలంక ప్రభుత్వం తొలుత భావించింది.

శ్రీలంకకు భారత్ సుమారు ఒక బిలియన్ డాలర్లను అప్పుగా ఇవ్వగా, బీజింగ్ 7 బిలియన్ డాలర్లను అందించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)