కరోనావైరస్: 'ఆరోగ్య సంక్షోభం కాదు, రాజకీయ సంక్షోభం' - 'ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ హ్యూమన్‌కైండ్' రచయిత యువల్ నోవా హరారీ

ఫ్రాన్సులో మాస్కు ధరించిన ఒక మహిళ నవ్వు ఆకారం తలపించేలా ఆకును అడ్డుపెట్టుకున్న దృశ్యం

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ఈ మహమ్మారి మన మధ్య భౌతిక దూరం పెంచింది, మరి సామాజికంగా కూడా మన ప్రవర్తన మారుతుందా?

కోవిడ్-19ని అరికట్టడానికి ఇప్పుడు మనం తీసుకోబోయే నిర్ణయాలు ప్రపంచ భవిష్యత్‌ని తీర్చి దిద్దుతాయని చరిత్రకారుడు, 'సేపియన్స్ - ఏ బ్రీఫ్ హిస్టరీ అఫ్ హ్యూమన్‌కైండ్' రచయత యువల్ నోవా హరారీ అన్నారు.

ఈ మహమ్మారి తర్వాత ఎటువంటి సమాజం ఉద్భవిస్తుంది? దేశాల మధ్య ఐక్యత పెరుగుతుందా? లేదా అవి మరింత ఒంటరిగా మిగులుతాయా? నిఘా సాధనాలు ప్రజలను రక్షించడానికి వాడతారా లేదా వారిని మరింత అణగదొక్కేందుకు వాడతారా?

"ఈ విపత్తు మనల్ని కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు రాత్రికి రాత్రి తీసుకోవాల్సిన పరిస్థితిలోకి నెడుతోంది. కానీ, మన దగ్గర కొన్ని మార్గాలు ఉన్నాయని, హరారీ బీబీసీ న్యూస్ అవర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పారు.

యువల్ హరారీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యువల్ హరారీ రాసిన సేపియన్స్, హోమో డ్యూస్, 21వ శతాబ్ధికి 21 పాఠాలు వంటి నవలలు అత్యధిక పాఠకాదరణ పొందాయి

భారత్‌లో కరోనావైరస్ కేసులు

17656

మొత్తం కేసులు

2842

కోలుకున్నవారు

559

మరణాలు

ఆధారం: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

‌అప్‌డేట్ అయిన సమయం 11: 30 IST

కరోనావైరస్ నుంచి మిమ్మల్ని మీరు ఇలా రక్షించుకోండి

రాజకీయ విపత్తు

ఇప్పుడు ప్రపంచం ముందు ఈ విపత్తుని ఎదుర్కోవడానికి రెండే మార్గాలు ఉన్నాయి. అందరితో దూరంగా ఉండి ఈ విపత్తుని ఎదుర్కోవడం లేదా, అంతర్జాతీయ సహకారంతో, సుహృద్భావంతో ఎదుర్కోవడం అని హరారీ అన్నారు.

అయితే, దేశాల స్థాయిలో పూర్తిగా కేంద్రీకృత పర్యవేక్షణ చేయడమా లేదా పౌరులకు తగిన సామాజిక దృక్పధం కలిగించి వారిని బలవంతులను చేసి ఎదుర్కోవడమా అనేది ఆలోచించుకోగలగాలి.

కరోనావైరస్ విపత్తు, రాజకీయ, వైజ్ఞానిక ప్రశ్నలని లేవనెత్తిందని హరారీ అన్నారు.

వైజ్ఞానిక సవాళ్ళను ఎదుర్కోవడానికి తగిన ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, రాజకీయ సవాళ్ళను ఎదుర్కొనే విషయంపై పెద్దగా దృష్టి పెట్టలేదు.

ఈ మహమ్మారిని నియంత్రించి అదుపులో పెట్టడానికి కావల్సినవన్నీ మానవాళి దగ్గర ఉన్నాయి.

ఇదేమి మధ్య యుగం కాదు. ఇది చీకటి మృత్యువు కాదు. ప్రజలు దేని వలన చనిపోతున్నారో ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితిలో లేము.

మహమ్మారి ప్రబలిన వెంటనే సార్స్-సీఓవీ2 వైరస్ దీనికంతటికి కారణమని చైనీస్ శాస్త్రవేత్తలు కనిపెట్టగలిగారు. ఇలాంటి పరిశోధనలను మరెన్నో దేశాలు చేస్తున్నాయి.

కోవిడ్-19కి సరైన మందు లేనప్పటికీ ఆధునిక వైద్య పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ వైరస్‌కి వాక్సిన్ కనిపెట్టే పనిలో శాస్త్రవేత్తలు నిమగ్నమై ఉన్నారు.

అలాగే, చేతులు కడుక్కోవడం, సామాజిక దూరం పాటించడం ద్వారా ఈ వైరస్ రాకుండా ఎలా నిరోధించగలమో మనకి తెలుసు.

మనం దేని గురించి పోరాడుతున్నామో మనకి తెలుసు. మన దగ్గర దీనితో పోరాడటానికి కావాల్సినంత సాంకేతికత, ఆర్ధిక శక్తి ఉన్నాయి.

"అయితే వీటిని ఎలా ఉపయోగించుకుంటామనేదే ప్రశ్న. ఇది కచ్చితంగా రాజకీయ ప్రశ్న.’’

ఇటలీ డాక్టర్లు

ఫొటో సోర్స్, Getty Images

ప్రమాదకరమైన సాంకేతికత

అత్యవసర పరిస్థితుల్లో కొన్ని రోజుల పాటు చర్చించి తీసుకోవాల్సిన నిర్ణయాలను రాత్రికి రాత్రే తీసుకుంటున్నారని ఫైనాన్సియల్ టైమ్స్ పత్రికలో ప్రచురించిన వ్యాసంలో హరారీ హెచ్చరించారు.

నిఘా పరికరాలను అత్యంత వేగంగా తయారు చేసి, ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా, వాటిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయకుండా వాడుకలోకి తెస్తున్నారు.

ఇవి తప్పుడు చేతుల్లో పడితే, వీటిని ప్రభుత్వాలు ప్రజల సమాచారాన్ని సేకరించడానికి ఉపయోగించి , దేశాలను పూర్తి పర్యవేక్షక సామ్రాజ్యాలుగా తయారు చేయడానికి వాడుకోవచ్చు.

ఉదాహరణకి ఇజ్రాయెల్‌లో ప్రజల లొకేషన్ డేటా తెలుసుకోవడానికి కేవలం వైద్య రంగానికే కాకుండా సీక్రెట్ సర్వీస్‌కి కూడా అధికారాలను విపరీతంగా పెంచేసింది.

ఇదే విధానాన్ని దక్షిణ కొరియా అవలంబించింది. కాకపొతే అక్కడ కొంత పారదర్శకత ఉంది.

ప్రపంచంలోనే అత్యంత ఆధునిక నిఘా పరిజ్ఞానం కలిగిన చైనాలో ఎవరైనా నిర్బంధాన్ని ఉల్లంఘిస్తున్నారో లేదో తెలుసుకోవడానికి ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ వాడారు.

వీటిని తాత్కాలికంగా వాడితే సమర్ధించవచ్చు. కానీ, ఇదే విధానాలని శాశ్వతంగా వాడితే మాత్రం ముప్పు తప్పదు.

ఆరోగ్య రక్షణకి, ఆర్ధికంగా సమర్ధవంతమైన, కఠినమైన విధానాలు అవలంభిస్తున్న ప్రభుత్వాలని నేను సమర్ధిస్తాను.

కానీ, ఇది ముందు ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వాలు చేయాలి.

"సాధారణ పరిస్థితుల్లో 51 శాతం ప్రజల మద్దతుతో దేశాన్ని పాలించవచ్చు. కానీ, ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ప్రజలందరి క్షేమంపై దృష్టి పెట్టాలి.’’

చైనాలో ఒక సెక్యూరిటీ రోబో

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, ప్రస్తుతం నిఘా పరికరాలను చాలా వేగంగా అభివృద్ధి చేస్తూ, వాటిపై ఎలాంటి చర్చా జరపకుండానే వినియోగిస్తున్నారని హరారీ చెబుతున్నారు

ఒంటరితనం-సహకారం

ఇటీవల కాలంలో జాతీయవాదం, జనాకర్షణతో నడుస్తున్న ప్రభుత్వాలు సమాజాన్ని రెండు రకాల శత్రు శిబిరాలుగా చీల్చేసి, విదేశీయుల మీద విదేశాల మీద ద్వేషాన్ని రెచ్చగొట్టాయని హరారీ చెప్పారు.

అయితే, ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తలెత్తిన మహమ్మారి సామాజిక వర్గాల మధ్య గాని, దేశాల మధ్య గాని ఎటువంటి తారతమ్యం చూపించలేదు.

ఇలాంటి సమస్యలు తలెత్తినప్పుడు సహకారంతో ముందుకు నడవాలో లేదా అనైక్యతా మార్గాన్ని ఎన్నుకోవాలో నిర్ణయించుకోవాల్సిన బాధ్యత దేశాలపై ఉంది.

కొన్ని దేశాలు ప్రైవేట్ మెడికల్ సంస్థల నుంచి కావల్సిన వైద్య పరికరాలు, మందులు సమకూర్చుకుంటూ ఒంటరిగా పోరాడుతున్నాయి.

ఇతర దేశాల నుంచి తక్కువ ధరలకు మాస్క్‌లు, వెంటిలేటర్లు, రసాయనాలు కొనుగోలు చేస్తున్న అమెరికా విమర్శలకి గురైంది.

ధనిక దేశాల ప్రయోగశాలల్లో తయావుతున్న వాక్సిన్లు తగినంత సంఖ్యలో అభివృద్ధి చెందుతున్న దేశాలకి , లేదా పేద దేశాలకి చేరవేమో అనే భయం కూడా ఉంది.

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో చైనాలో శాస్త్రవేత్తలు పొద్దున్న నేర్చుకున్న పాఠంతో సాయంత్రం టెహ్రాన్‌లో ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడవచ్చని హరారీ అన్నారు.

శాస్త్రీయ పరిజ్ఞానాన్ని దేశాల మధ్య పంచుకోవడం ద్వారా, మానవ, ఇతర వనరులని మహమ్మారి ప్రబలిన దేశాలలో సక్రమంగా వినియోగించడం ద్వారా ప్రపంచ దేశాల మధ్య సహకారాన్ని పటిష్టం చేసుకోవచ్చని హరారి అన్నారు.

మనిషి అందరికీ దూరంగా ఉంటూ ఇలాంటి మహమ్మారుల నుంచి తనని తాను రక్షించుకున్న సంఘటనలు తెలుసుకోవాలంటే రాతి యుగంలోకి వెళ్లాల్సి ఉంటుంది.

మధ్య యుగంలో కూడా 14వ శతాబ్దంలో చీకటి మృత్యువులా మహమ్మారులు ప్రబలాయి. మధ్య యుగంలోకి తిరిగి వెళ్లడం ద్వారా మనల్ని మనం కాపాడుకోలేము.

ఇరాన్ పాకిస్తానీయుల్ని తీసుకెళ్తున్న బస్సు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, చాలా దేశాలు తమ సరిహద్దుల్ని మూసేశాయి. విదేశాల నుంచి వచ్చేవారిని నిర్బంధంలో ఉంచుతున్నాయి

ఇది మన సామాజిక ప్రవర్తనని మారుస్తుందా?

మనం తీసుకునే నిర్ణయాలకు ఫలితాలు ఎలా ఉన్నా, మనిషి సంఘ జీవి అనేది కాదనలేని విషయమని హరారీ అన్నారు.

ఈ వైరస్ మానవ స్వభావాన్ని శోధిస్తోంది. సాటి మనిషి పట్ల దయ, రోగాల బారిన పడుతున్న వారి గురించి ఆలోచించేటట్లు చేస్తోంది.

ఈ వైరస్ మనిషికి సోకి వ్యాపించడానికి ప్రయత్నం చేస్తోంది. ఇది సామాజిక దూరాన్ని పాటిస్తూ మెదడుతో ఆలోచించే సమయం. హృదయంతో స్పందించే సమయం కాదు.

"కానీ, ఇది మనకి చాలా కష్టమైన పని. ఈ విపత్తు ముగిసేసరికి ప్రజలు సామాజిక బంధాల అవసరాన్ని మరింత గుర్తిస్తారు. ఇది మానవ స్వభావాన్ని అయితే సమూలంగా మార్చేయదు.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్
పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)