డోనల్డ్ ట్రంప్‌: 'అభిశంసన విచారణకు హాజరుకండి లేదంటే ఫిర్యాదులు చేయడం ఆపండి'

ట్రంప్

ఫొటో సోర్స్, Reuters

డిసెంబరు 4న జరగబోయే తొలి అభిశంసన విచారణకు హాజరు కావాలంటూ అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌ను అక్కడి చట్టసభ కాంగ్రెస్ కోరింది.

ట్రంప్ ఈ విచారణకు రావాలని, లేదంటే ఈ ప్రక్రియపై ఫిర్యాదులు మానుకోవాలని సభ జ్యుడిషియరీ కమిటీ డెమొక్రటిక్ చైర్మన్ జెరాల్డ్ నాడ్లర్ అన్నారు.

ఆయన హాజరైతే సాక్షులను ప్రశ్నలడిగే అవకాశం ఉంటుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలన్‌స్కీతో ట్రంప్ జులైలో మాట్లాడిన కాల్స్ కేంద్రం సాగుతున్న ఈ అభిశంసన విచారణ తదుపరి దశకు చేరడానికి అది సూచన.

వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థిత్వం కోసం ప్రయత్నిస్తున్న జో బిడెన్, ఆయన కుమారుడిపై ఉన్న అవినీతి ఆరోపణలపై దర్యాప్తు జరపాలని ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడిని ట్రంప్ కోరారన్నది ఆరోపణ.

ట్రంప్

బిడెన్‌పై దర్యాప్తు కోరుతూ, లేని పక్షంలో ఉక్రెయిన్‌కు అమెరికా సైనిక సహాయాన్ని నిలిపివేస్తామంటూ ట్రంప్ బెదిరించారా లేదన్న అన్న అంశంపై దర్యాప్తు జరుగుతోంది.

అయితే, ట్రంప్ తాను ఏ తప్పూ చేయలేదంటూ ఈ విచారణను కక్ష సాధింపు చర్యగా ఆయన అభివర్ణించారు.

కొన్నివారాల పాటు రహస్య పద్ధతిలో సాగిన సాక్షుల విచారణ అనంతరం హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీ రెండు వారాల పాటు చేపట్టిన బహిరంగ విచారణలనూ ముగించింది.

విచారణ చేపట్టిన నిఘా, పర్యవేక్షణ, విదేశీ వ్యవహారాల కమిటీలు ఇప్పుడు నివేదిక రూపొందించే పనిలో ఉన్నాయని, డిసెంబరు 3న నివేదిక వస్తుందని నిఘా కమిటీ డెమొక్రటిక్ చైర్మన్ ఆడమ్ చిఫ్ చెప్పారు.

నాడ్లర్

ఫొటో సోర్స్, Reuters

జెరాల్డ్ నాడ్లర్ చెప్పిందేమిటి?

వచ్చే నెలలో విచారణకు రావాలంటూ తాను ట్రంప్‌కు లేఖ రాశానని నాడ్లర్ ఒక ప్రకటనలో వెల్లడించారు.

''ఆయన ముందు రెండు మార్గాలున్నాయి.. విచారణకు హాజరై తాను చెప్పాలనుకున్నది చెప్పడం ఒకటైతే రెండోది ఈ ప్రక్రియపై మాట్లాడకుండా ఉండడం'' అని నాడ్లర్ అన్నారు.

''ఆయన నేరుగా హాజరు కావడం కానీ, లేదంటే గతంలో కొందరు అధ్యక్షుల మాదిరిగా తన తరఫు న్యాయవాదులను పంపించడం కానీ చేస్తారని ఆశిస్తున్నాను'' అన్నారాయన.

విచారణకు హాజరయ్యేదీ లేనిదీ డిసెంబర్ 1 సాయంత్రం 6 గంటల్లోపు చెప్పాలని, ఒకవేళ న్యాయవాదిని పంపించాలని నిర్ణయిస్తే ఆ న్యాయవాది ఎవరో తెలపాలని కోరారు.

అభిశంసన

అభిశంసన విచారణలో తదుపరి పర్వం

జ్యుడిషియరీ కమిటీ ముసాయిదా రూపకల్పన తయారీలో నిమగ్నమవుతుంది. డెమొక్రాట్ల ఆధిపత్యం ఉన్న సభలో తొలుత ఓటింగ్ జరిగిన తరువాత రిపబ్లికన్లు నడిపించే సెనేట్‌లో విచారణ జరుగుతుంది.

మూడింట రెండొంతుల మెజారిటీతో ట్రంప్ దోషిగా తేలితే అమెరికా చరిత్రలోనే అభిశంసన వల్ల పదవిని కోల్పోయిన తొలి అధ్యక్షుడవుతారు ట్రంప్.

కాగా, ఈ విచారణను రెండు వారాలకు పరిమితం చేయాలని వైట్‌హౌస్, రిపబ్లికన్లు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)