దావూద్ ఇబ్రహీం మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ను అరెస్ట్ చేసిన ఈడీ

మహారాష్ట్ర మహా వికాస్ అఘాడీ ప్రభుత్వ క్యాబినెట్ మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది.
బుధవారం (ఫిబ్రవరి 23) ఉదయం 5:30 నుంచి 6:30 వరకు నవాబ్ మాలిక్కు సంబంధించిన భవనాల్లో ఈడీ దాడులు జరిగాయి. తర్వాత 8 గంటలకు ముంబయిలోని ఆయన నివాసంలో నవాబ్ మాలిక్ను ఈడీ అరెస్ట్ చేసింది.
అనంతరం విచారణ కోసం ముంబయిలోని ఈడీ కార్యాలయానికి ఆయనను తీసుకెళ్లారు. 8 గంటల సుదీర్ఘ విచారణ అనంతరం ఆయన్ను వైద్య పరీక్షల కోసం పంపించారు. మార్చి 3 వరకు ఆయన ఈడీ కస్టడీలో ఉంటారు.

ఫొటో సోర్స్, ugc
దావూద్ ఇబ్రహీంతో ముడిపడిన కేసులో అరెస్ట్
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో నవాబ్ మాలిక్ను ఈడీ అరెస్ట్ చేసినట్లు ఏఎన్ఐ పేర్కొంది.
దావూద్ ఇబ్రహీం ఆస్తులపై ఈడీ, ఇతర దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి.
విచారణ కోసం ఈడీ ముందుగానే ఆయనకు నోటీసులు జారీ చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
దావూద్కు సంబంధించిన కేసులోనే ఆయనను విచారిస్తున్నారా అనే దానిపై మాత్రం స్పష్టత లేదు. దీని గురించి ఈడీ కూడా ఎలాంటి స్పష్టతనివ్వలేదు.
అయితే, నవాబ్ మాలిక్పై ఉన్న కేసు ఇదొక్కటే కాగా, బీజేపీ నేతలు కూడా దీని గురించే ప్రస్తావిస్తున్నారు.

ఫొటో సోర్స్, DEV_FADNAVIS
మోదీ, బీజేపీపై నవాబ్ మాలిక్ విమర్శలు
గత కొన్ని రోజులుగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, బీజేపీపై నవాబ్ మాలిక్ నేరుగా విమర్శలు చేస్తున్నారు.
కొన్ని రోజుల క్రితం, ఆర్యన్ఖాన్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ముంబయి డివిజనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడేను నవాబ్ లక్ష్యంగా చేసుకున్నారు. బీజేపీ ఆదేశాల ప్రకారం సమీర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
నవాబ్ మాలిక్ చేసిన ఆరోపణలకు ప్రతిస్పందనగా ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్... దావూద్ ఇబ్రహీంతో నవాబ్ మాలిక్కు సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు.
గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నవాబ్ మాలిక్పై తన సోదరుడి ద్వారా దావూద్ ఇబ్రహీం సహచరులకు చెందిన ఆస్తులను కొనుగోలు చేశారని ఆరోపణలు ఉన్నాయి.
2021 నవంబర్లో దేవేంద్ర ఫడ్నవీస్, నవాబ్ మాలిక్ మధ్య విరోధం చాలా తీవ్రస్థాయికి చేరింది.

ఫొటో సోర్స్, NAWAB MALIK / FACEBOOK
ఫడ్నవీస్ ఏమన్నారు?
ముంబై పేలుళ్లలో నిందితులుగా ఉన్న సర్దార్ షావలీ ఖాన్, సలీమ్ పటేల్ నుంచి నవాబ్ మాలిక్ భూమిని కొనుగోలు చేశారని దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు.
కోట్లాది రూపాయల విలువైన భూమిని నవాబ్ మాలిక్ కేవలం రూ. 30 లక్షలకే కొన్నారని చెప్పారు.
''1993 బాంబు పేలుళ్లలో దోషిగా తేలిన సర్దార్ షావలీ ఖాన్కు చెందిన ఒక కంపెనీ ద్వారా ఎల్బీఎస్ రోడ్లోని భూమిని నవాబ్ మాలిక్ కొనుగోలు చేశారు'' అని ఆ సమయంలో దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు.
''ఎల్బీఎస్ రోడ్లోని లక్షా 23 వేల చదరపు అడుగుల భూమిని 'సాలిడస్' అనే కంపెనీ పేరు మీద రిజిస్టర్ చేశారు. గోవాకు చెందిన మరియం బాయి అనే ప్లంబర్ తరఫున సలీమ్ పటేల్కు 'పవర్ ఆఫ్ అటార్నీ' ఇచ్చారు. షావలీ ఖాన్ నుంచి అతనికి ఈ స్థలం లభించింది. దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ డ్రైవర్ సలీమ్ పటేల్. సాలిడస్ అనే కంపెనీకి సలీమ్ ఆ స్థలాన్ని విక్రయించారు'' అని ఫడ్నవీస్ తెలిపారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ఆ కంపెనీ నవాబ్ మాలిక్ కుటుంబానికి చెందినది. మంత్రి అయ్యాక ఆయన సాలిడస్ కంపెనీ నుంచి బయటకొచ్చారు. దీంతో ఫర్హాన్ మాలిక్ ఆ కంపెనీ బాధ్యతలు తీసుకున్నారు.

ఫొటో సోర్స్, NCP
నవాబ్ మాలిక్ సమాధానం ఏమిటి?
ఆ సమయంలో నవాబ్ మాలిక్ ఈ ఆరోపణలను ఖండించారు.
''బాంబు పేలుళ్లలో నిందితులుగా ఉన్న ఎవరి దగ్గర నేను స్థలాన్ని కొనుగోలు చేయలేదు. చట్టప్రకారమే నేను భూమిని కొనుగోలు చేశాను. మేం కౌలుదారులం. యాజమాన్యం కోసం డబ్బులు చెల్లించాం. సలీమ్ పటేల్ గూండా అనే సంగతి నాకు తెలియదు. హసీనా పార్కర్ కూడా తెలియదు'' అని అన్నారు.
''ఫడ్నవీస్ను ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోమనండి. విచారణకు మేం సిద్ధం. విచారణకు నవాబ్ మాలిక్ భయపడతాడని వారు అనుకుంటున్నారు. కానీ నేను దేనికీ వెరవను'' అని ఆయన అన్నారు.
అంతకుముందు, డ్రగ్ డీలర్లతో దేవేంద్ర ఫడ్నవీస్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని నవాబ్ మాలిక్ ఆరోపణలు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
'నవాబ్ మాలిక్పై పన్నిన కుట్ర'
నవాబ్ మాలిక్ అరెస్ట్ జరిగినప్పటి నుంచి రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ అంశంపై అధికార పక్షం, ప్రతిపక్షం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.
నవాబ్ మాలిక్ అరెస్ట్ జరిగిన తర్వాత ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ దీనిపై స్పందించారు.
నవాబ్ మాలిక్పై జరిగిన కుట్రగా ఈ కేసును ఆయన పేర్కొన్నారు.
ఉదయం మీడియాతో మాట్లాడుతూ... ''నవాబ్ మాలిక్ ఏదైనా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. నవాబ్పై ఏం కేసు నమోదు చేశారో నాకు తెలియదు. ఏదైనా జరిగితే, వారు దావూద్ మనుషులు అని చెప్పడం రివాజుగా మారింది. ఇందులో కొత్తగా ఏమీ లేదు. నేను మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నాపై ఇలాగే ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వం గురించి బహిరంగంగా మాట్లాడతారు కాబట్టే ఆయనను లక్ష్యంగా చేసుకున్నారు'' అని శరద్ పవార్ అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
ఇవి కూడా చదవండి:
- డీఫిబ్రిలేషన్ ఇచ్చి ఉంటే మంత్రి గౌతమ్ రెడ్డి ప్రాణాలు కాపాడగలిగేవారా?
- కర్ణాటక: బజరంగ్ దళ్ కార్యకర్త హత్య కేసు.. పోలీసులు ఏం చెబుతున్నారు?
- బంగారం గని సమీపంలో పేలుడు, 60 మంది మృతి
- వృద్ధిమాన్ సాహాకు రిటైర్ కావాలని కోచ్ ద్రవిడ్ సలహా, ఇద్దరి మధ్యా ఏం జరిగింది?
- ఉద్యోగాలు: ఊపందుకుంటున్న యాంటీ-వర్క్ ఉద్యమం.. దీని లక్ష్యాలేమిటి, ప్రభావాలేమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)












