తెలంగాణ: కరెంటు కనెక్షన్ లేకున్నా లక్షల్లో బిల్లులు - ప్రెస్ రివ్యూ

బల్బు

ఫొటో సోర్స్, Getty Images

మహబూబాబాద్ జిల్లాలో రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు విద్యుత్ కనెక్షన్లు లేకున్నా.. లక్షల రూపాయల బిల్లు ఇచ్చినట్లు 'వెలుగు' కథనంలో పేర్కొంది.

''కనెక్షన్లు లేకుండా లక్షల బిల్లును చూసి ఆస్పత్రి సిబ్బంది అవాక్కయ్యారు.

జిల్లాలోని మర్రిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 12 ఏళ్లుగా కరెంట్ మీటర్ లేదు. సిబ్బంది ప్రశ్నించడంతో ఇటీవలే మీటర్ బిగించారు.

ఆ తర్వాత రెండున్నర లక్షల బిల్లును చేతులో పెట్టారు విద్యుత్ అధికారులు.

కామారం ఆసుపత్రిలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. కామారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొన్నిరోజులుగా టార్చిలైట్ వెలుతురులో వైద్యం చేస్తున్నారు హాస్పిటల్ సిబ్బంది.

ఇటీవల రెండు మీటర్లు బిగించిన విద్యుత్ అధికారులు రెండున్నర లక్షల రూపాయల బిల్లు వేశారు.

కరెంట్ బిల్లులు కలెక్ట్ చేయడంలో చూపిన ఆసక్తి, విద్యుత్ సరఫరా చేయడంలో లేదని వైద్యసిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు'' వెలుగు కథనంలో రాసుకొచ్చింది.

బ్యాంకు ఉద్యోగాలకు ఎప్పటికీ క్రేజ్ తగ్గదు

ఫొటో సోర్స్, Getty Images

తెలుగులోనూ ప్రభుత్వ రంగ బ్యాంకుల క్లర్క్‌ పరీక్షలు

ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్‌లలో నిర్వహిస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల క్లరికల్‌ రిక్రూట్‌మెంట్‌లను, ఆ రెండు భాషలతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసినట్లు 'సాక్షి' పేర్కొంది.

''దేశంలోని పన్నెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇప్పటికే ప్రకటించిన ఖాళీల కోసం చేపట్టే క్లరికల్‌ రిక్రూట్‌మెంట్‌లలో ప్రిలిమ్స్, మెయిన్‌ పరీక్షలు రెండింటినీ ఇంగ్లీష్, హిందీతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని సూచించింది.

క్లరికల్‌ కేడర్‌ కోసం పరీక్షలు ప్రాంతీయ భాషలలో నిర్వహించే విషయాన్ని పరిశీలించేందుకు ఆర్థిక శాఖ ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సు ఆధారంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.

దీంతో కమిటీ సిఫార్సులు అందుబాటులోకి వచ్చే వరకు ఐబీపీఎస్‌ ప్రారంభించిన పరీక్ష ప్రక్రియను నిలివేయాలని నిర్ణయించినట్లు'' సాక్షి వెల్లడించింది.

ఆర్‌టీసీ

ఫొటో సోర్స్, FACEBOOK/JANGAONDEPT

దసరాకు 4 వేల ప్రత్యేక బస్సులు

దసరా సెలవులు, బతుకమ్మ పండుగ నేపథ్యంలో నాలుగువేలకు పైగా ప్రత్యేక బస్సులను నడిపేందుకు టీఎస్‌ఆర్టీసీ సమాయత్తమైనట్లు 'నమస్తే తెలంగాణ' కథనంలో పేర్కొంది.

''హైదరాబాద్‌ నుంచి రాష్ట్రంలోని అన్నిప్రాంతాలతోపాటు, ఇతర రాష్ర్టాలకు అక్టోబర్‌ 8 నుంచి 14 వరకు ఈ స్పెషల్‌ సర్వీసులు తిరుగుతాయని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు 'నమస్తే తెలంగాణ'కు చెప్పారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కలిపి 3,085 బస్సులు, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ర్టాల్లోని ముఖ్య పట్టణాలకు మరో 950 స్పెషల్‌ సర్వీసులను నడపనున్నారు.

దూరపు ప్రయాణ బస్సు ల్లో మాత్రమే రిజర్వేషన్‌ టికెట్లకు అదనపు చార్జీలు, ఇతర సర్వీసుల్లో సాధారణ చార్జీలు వసూలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలిసింది.

పండుగ రోజుల్లో రద్దీకి అనుగుణంగా సాధారణ బస్సుల్లో సీట్లు నిండిన తర్వాత స్పెషల్‌ బస్సుల రిజర్వేషన్లు ఓపెన్‌ చేయనున్నట్టు ఒక ఉన్నతాధికారి తెలిపారు.

హైదరాబాద్‌లోని దిల్‌సుక్‌నగర్‌, సెంట్రల్‌ యూనివర్సిటీ డిపోల నుంచి రాష్ట్రంలోని పలు పట్టణాలకు మెట్రో లగ్జరీ ఏసీ బస్సులను శుక్రవారం నుంచి నడపాలని హైదరాబాద్‌ నగర ప్రాంతీయ అధికారులు నిర్ణయించారు.

ఎంజీబీఎస్‌ నుంచి హన్మకొండకు రూ.300, ఎంజీబీఎస్‌-మహబూబ్‌నగర్‌ రూ.200, ఎంజీబీఎస్‌-ఖమ్మం రూ.370, ఎంజీబీఎస్‌-మంచిర్యాలకు రూ.490 చొప్పున చార్జీలు వసూలు చేయనున్నట్టు పేర్కొన్నారు.

సలహాలు, సూచనలను 99592 26160 నంబర్‌కు వాట్సప్‌ ద్వారా పంపించాలని సూచించినట్లు'' నమస్తే తెలంగాణ తెలిపింది.

తీన్మార్ మల్లన్న( ఫైల్ ఫొటో)

ఫొటో సోర్స్, fb/Teenmaar Mallanna Fans

బీజేపీలోకి తీన్మార్‌ మల్లన్న!

జర్నలిస్టు తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌కుమార్‌ బీజేపీలో చేరనున్నారని ఆయన టీం ప్రకటించినట్లు 'ఆంధ్రజ్యోతి' పేర్కొంది.

''ప్రధాని మోదీ సిద్ధాంతాలకు ఆకర్షితులైన మల్లన్న.. బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారని టీమ్ వెల్లడించింది.

కాగా.. రిమాండ్‌లో ఉన్న తన భర్తను విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలను మల్లన్న సతీమణి మమత మెయిల్‌ ద్వారా కోరినట్లు'' ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)