టోక్యో ఒలింపిక్స్: పతకం చేజారినా, హృదయాలను గెల్చుకున్న భారత మహిళా హాకీ జట్టు

ఫొటో సోర్స్, ANNE-CHRISTINE POUJOULAT/AFP VIA GETTY IMAGES
- రచయిత, మనోజ్ చతుర్వేది
- హోదా, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్
భారత మహిళా హాకీ జట్టు టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించలేకపోయింది. కానీ, అది గ్రేట్ బ్రిటన్ లాంటి బలమైన జట్టును ఎంత ధైర్యంగా ఎదుర్కొందో ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
భారత్ ఈ మ్యాచ్లో 3-4 తేడాతో ఓడిపోయింది. కానీ, భారత మహిళా జట్టును బట్టి చూస్తే ఈ ప్రదర్శన ప్రశంసనీయం.
క్వార్టర్ ఫైనల్లో అయినా చోటు దక్కుతుందా అని ఏ జట్టుపై సందేహాలు వ్యక్తం చేశారో, అదే భారత మహిళా జట్టు, ఆస్ట్రేలియా లాంటి దిగ్గజ జట్టును ఓడించి సెమీఫైనల్లో స్థానం పొందడమే కాదు, చివరి వరకూ తన పోరాటం కొనసాగించింది.
ఈ ఒలింపిక్స్లో అద్భుత ప్రదర్శన కనపరిచిన భారత జట్టు బిగ్ లీగ్ జట్లలో ఒకటిగా తన పేరును చేర్చడంలో విజయం సాధించింది. కొత్త ర్యాంకుల్లో భారత మహిళా జట్టుకు ఆరో స్థానం దక్కవచ్చు.

ఫొటో సోర్స్, CLIVE MASON/GETTY IMAGES
చివరి క్వార్టర్లో పట్టు సడలంతో చేజారిన మ్యాచ్
మూడో క్వార్టర్లో బ్రిటన్ గోల్స్ సమం చేసిన తర్వాత, భారత్ చివరి 15 నిమిషాలు విజయం కోసం అన్నీ ఒడ్డాల్సిన అవసరం ఉంది. కానీ, ప్రత్యర్థి టీమ్ మొదటి నుంచీ ఒత్తిడి పెట్టడం వల్ల బహుశా ఆ వ్యూహం పనిచేయలేదు.
భారత జట్టు ఆ క్వార్టర్లో చాలా సమయం పాటు డిఫెన్సులోనే బిజీగా ఉండిపోయింది. మరోవైపు బ్రిటన్ గ్రేస్ బాల్స్డన్ నాలుగో గోల్ వేశాక, భారత జట్టుపై ఒత్తిడి కనిపించింది. వాళ్లు బంతిని సరిగా క్లియర్ చేయలేకపోయారు. అటాకింగ్ సమయంలో బంతిపై నియంత్రణ సాధించడంలో కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి.

ఫొటో సోర్స్, ALEXANDER HASSENSTEIN/GETTY IMAGES
భారత్ బౌన్స్ బ్యాక్
మొదటి 24 నిమిషాల ఆటలో బ్రిటన్ 2-0 ఆధిక్యంలో ఉంది. గ్రేట్ బ్రిటన్ వరుసగా అటాకింగ్గా ఆడుతుండడంతో ఈ మ్యాచ్ కూడా గ్రూప్ మ్యాచ్లాగే అవుతుందా అనిపంచింది. కానీ, రెండో క్వార్టర్ చివరి ఆరు నిమిషాల్లో భారత జట్టు భిన్నమైన ఆటతీరును ప్రదర్శించింది.
భారత జట్టు ఆ ఆటతీరు చూస్తుంటే క్వార్టర్ ఫైనల్లో అది ఆస్ట్రేలియాపై సాధించిన విజయం యాదృచ్చికం కాదనే అనిపించింది.
భారత్ ఆ సమయంలో దూకుడుగా ఆడి తమపై ఉన్న ఒత్తిడిని పటాపంచలు చేయడంతోపాటూ, డ్రాగ్ ఫ్లికర్ గుర్జీత్ కౌర్ పెనాల్టీ కార్నర్తో రెండు గోల్స్ సమం చేశారు. తర్వాత వందనా కటారియా అద్భుతమైన గోల్ చేసి మ్యాచ్లో మొదటిసారి భారత్కు ఆధిక్యాన్ని అందించి జట్టు సత్తా చూపించారు.

ఫొటో సోర్స్, CLIVE MASON/GETTY IMAGES
ఒత్తిడిలో కూలిన బ్రిటన్ డిఫెన్స్
మొదటి 24 నిమిషాల ఆటలో గ్రేట్ బ్రిటన్కు సరైన పరీక్ష ఎదురవలేదు. కానీ, భారత్ రెండో క్వార్టర్ చివరి ఆరేడు నిమిషాల్లో బలమైన అటాకింగ్కు దిగినపుడు ఆ జట్టు డిఫెన్స్లో బలహీనత స్పష్టంగా కనిపించింది.
బ్రిటన్ డిఫెండర్ బంతి క్లియర్ చేయడంలో పొరపాట్లు చేస్తూ కనిపించారు. అటు భారత అటాకింగ్ ఆటగాళ్లు మొదటి నుంచీ నేరుగా గోల్ వేయడానికి బదులు పెనాల్టీ కార్నర్ సాధించే వ్యూహంతోనే ఆడారు. వారి ఆ వ్యూహం పనిచేస్తుందని నిరూపితమైంది.
ఆ వ్యూహంతో లభించిన పెనాల్టీ కార్నర్ను గోల్గా మార్చిన భారత్ స్టోర్ 2-2 సమం చేసింది. ఆ టెంపోను కొనసాగించింది. అటాకింగ్లో కనీసం ముగ్గురు ఆటగాళ్లకు బంతి చేరిన తర్వాత వందనా కటారియాకు బంతి దొరికింది. దాంతో, ఆమె దానిని విజయవతంగా గోల్ పోస్టులోకి పంపారు. ఆధిక్యం అందించిన ఆ గోల్ భారత జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టిపు చేసింది.

ఫొటో సోర్స్, CLIVE MASON/GETTY IMAGES
కొంపముంచిన భారత్ డిఫెన్స్
బ్రిటన్ మూడో క్వార్టర్లో స్కోరును సమం చేసే ఉద్దేశంతో అటాకింగ్ వైఖరి అవలంబించాలనుకుంది. అయితే వారి దారిలో సవితా పునియా అడ్డుగోడగా నిలిచారు. అప్పటికీ, అటాకింగ్ వైఖరి వదలకపోవడం వల్ల గ్రేట్ బ్రిటన్కు ప్రయోజనం లభించింది.
బహుశా, ఆ సమయంలో భారత్ తన ఆధిక్యాన్ని కాపాడుకోడానికి డిఫెన్సులో పడ్డట్టు కనిపించింది. కానీ వారి ఆలోచన తప్పని నిరూపితమైంది. గ్రేట్ బ్రిటన్ క్వార్టర్ మొదట్లోనే గోల్ వేసి స్కోరును 3-3తో చేసింది.
బ్రిటన్ మూడో గోల్ హౌలీ పియనె వేశారు. ఆ సమయంలో భారత్ ఆటగాళ్లు బంతిని పాస్ చేయడానికి బదులు అవసరానికి మించి తమ దగ్గర ఉంచుకునే వ్యూహంతో ఆడారు. చాలాసార్లు బ్రిటన్ ఆటగాళ్లు వాళ్ల దగ్గర్నుంచి బంతి కూడా లాగేసుకున్నారు.
బ్రిటన్ అటాకింగ్ ప్రభావం భారత గోల్ పోస్టు మీద కూడా పడింది. కానీ గోల్ కీపర్ సవితా పునియా బంతిని అద్భుతంగా అడ్డుకోవడంతో కనీసం ఆరు గోల్స్ పడకుండా చేయగలిగారు.

ఫొటో సోర్స్, ALEXANDER HASSENSTEIN/GETTY IMAGES
అవకాశం చేజార్చుకున్న భారత్
మూడో క్వార్టర్ చివరి నిమిషంలో భారత్ రైట్ ఫ్లాంక్ నుంచి దాడి చేసి గోల్ పోస్టులోకి బంతి వేసింది.
అదే సమయంలో బ్రిటన్ క్రీడాకారిణి వల్ల ఫౌల్ జరగడంతో పెనాల్టీ కార్నర్ కోసం రెఫరల్ కోరింది. జట్టుకు పెనాల్టీ కార్నర్ కూడా లభించింది. కానీ ఆ సమయంలో టీమ్ స్పెషలిస్ట్ డ్రాగ్ ఫ్లికర్ గుజ్రీత్ కౌర్ మైదానంలో లేరు. దాంతో దీప్ గ్రేస్ ఎక్కా నేరుగా షాట్ కొట్టడానికి బదులు వేరియేషన్ చూపించారు. కానీ ముందు చేరుకున్న క్రీడాకారిణి బంతిని డిఫ్లెక్ట్ చేయలేకపోయారు. అలా భారత్ ఆధిక్యం పొందే అవకాశాన్ని చేజార్చుకున్నారు.
భారత్ తప్పుడు అప్రోచ్
భారత జట్టు చివరి క్వార్టర్ ప్రారంభంలో డిఫెన్సివ్ వైఖరి అవలంబించడం కష్టాలు తెచ్చిపెట్టింది. దానివల్ల బ్రిటన్ ఆధిక్యం సాధించడానికి, అటాకింగ్ వైఖరి అవంబిండానికి సాయం లభించింది.
మూడు పెనాల్టీ కార్నర్లు అడ్డుకున్నాప్పటికీ, నాలుగో దానిని గోల్గా మలిచిన గ్రేస్ బాల్స్డన్ తమ జట్టుకు 4-3 ఆధిక్యం సంపాదించి పెట్టారు.
వెనుకబడిన భారత్ ఆటతీరు, తర్వాత మళ్లీ వేగం అందుకోవడం కనిపించింది. స్కోరు సమం చేయడానికి భారత్ తన శక్తినంతా ధారపోసింది. దాంతో కొన్ని అవకాశాలు కూడా లభించాయి. కానీ, బ్రిటన్ ఆధిక్యం సాధించిన తర్వాత ఆత్మవిశ్వాసంతో ఆడుతున్నట్టు కనిపించింది. ఆ వైఖరే జట్టును పోడియంపైకి చేరుకునేలా చేసింది.

ఫొటో సోర్స్, CLIVE MASON/GETTY IMAGES
మొదటి నుంచీ భారత్పై ఒత్తిడి
గ్రూప్ పోటీల్లో 1-4తో ఓడడం వల్ల భారత జట్టు మొదటి నుంచీ అప్రమత్తంగా ఆడుతున్నట్టు అనిపించింది. అది ఆట వేగం పుంజుకోకుండా కూడా చూసింది.
ఆ ప్రయత్నంలో భారత్ ఆరేడు నిమిషాలపాటు విజయం కూడా సాధించింది. కానీ ఆ తర్వాత బ్రిటన్ అటాకింగ్ మొదలుపెట్టింది. చాలాసార్లు అది గోల్ వేయడానికి దగ్గరగా వచ్చింది. కానీ భారత డిఫెన్స్, గోల్ ముందు గోడలా నిలిచిన సవితా పునియా బంతిని లోపలకు రాకుండా అడ్డుకోగలిగారు.
భారత్ ఈ ఒత్తిడి నుంచి బయటపడ్డానికి కాస్త దూకుడు వైఖరి అవలంబించాల్సింది. అలా చేయడం వల్ల అది బ్రిటన్ను కాస్త డిఫెన్సులోకి నెట్టి, వారి దాడులకు కళ్లెం వేసుండవచ్చు. అదృష్టవశాత్తూ భారత్ ఆ క్వార్టర్లో వారిని గోల్ చేయకుండా అడ్డుకోగలిగింది.

ఫొటో సోర్స్, CLIVE MASON/GETTY IMAGES
దూకుడు ఆటతీరుతో బ్రిటన్కు లాభం
గ్రేట్ బ్రిటన్ రెండో క్వార్టర్లో కూడా దూకుడు వైఖరి చూపింది. దాంతో ఆ జట్టుకు ప్రయోజనం కూడా లభించింది. మొదటి నిమిషంలోనే బ్రిటన్ రైట్ ఫ్లాంక్ నుంచి అటాక్ చేసి భారత డిఫెన్స్ పొరపాటుతో ఆధిక్యం అందుకోవడంలో విజయం సాధించింది. ఆ గోల్ను ఇలేనా సియాన్ చేశారు.
భారత్ బంతిని సర్కిల్ నుంచి వీలైనంత త్వరగా క్లియర్ చేసి ఒత్తిడి నుంచి బయటపడాల్సిన అవసరం కనిపించింది. కానీ, ఆటగాళ్లు చాలాసార్లు బంతిని క్లియర్ చేయడంలో ఆలస్యం చేస్తూ తమపైనే ఒత్తిడి పెంచుకుంటూ పోయారు. దాంతో బ్రిటన్కు చాలాసార్లు బంతి లాగేసుకుని అటాక్ చేసే అవకాశం లభించింది.

ఫొటో సోర్స్, ANNE-CHRISTINE POUJOULAT/AFP VIA GETTY IMAGES
భారత జట్టు గేర్ మార్చడం పనికొచ్చింది
రెండు గోల్స్తో వెనకబడిన తర్వాత భారత్ అటాకింగ్ ప్రారంభించింది. దానివల్ల ప్రయోజం కూడా దక్కింది. భారత్ అటాకింగ్ ఆటతీరు వల్ల బ్రిటన్ డిఫెన్స్ బీటలువారడం కనిపించింది.
భారత్ రెండో క్వార్టర్ చివరి ఆరు నిమిషాల్లో రెండు పెనాల్టీ కార్నర్స్ లభించాయి. రెండింటినీ గుజ్రీత్ కౌర్ గోల్గా మలిచి భారత్ను 2-2 ఆధిక్యం దగ్గరికి తీసుకొచ్చారు. ఆ ఆధిక్యంతో ఉత్సాహం పొందిన భారత జట్టులో ఒక్కసారిగా మెరుగైన ప్రదర్శన చూపింది. ఆటలో మొదటిసారి ఆధిక్యం సాధించడంలో విజయవంతమైంది.
ఇవి కూడా చదవండి:
- అందం కోసం సెక్స్ ఒప్పందాలు: ‘నాకు కాస్మోటిక్ సర్జరీ చేయిస్తే నా శరీరం ఆరు నెలలు నీదే’
- కోవిడ్-19ను మనం నోరోవైరస్లా ఎందుకు చూడాలి? అసలు నోరోవైరస్ అంటే ఏమిటి
- పెగాసస్ స్పైవేర్: ఇప్పటికీ సమాధానాలు దొరకని కీలక ప్రశ్నలు
- ఒకప్పటి భారతదేశానికి ఇప్పటి ఇండియాకు తేడా ఇదే
- తెలంగాణ: ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారు?
- ప్రమాదం అని తెలిసినా చైనాలో ప్లాస్టిక్ సర్జరీల సంఖ్య ఎందుకు పెరుగుతోంది
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








