అత్యవసర స్థితిలో ప్లాట్‌ఫాం టికెట్‌తోనే రైలు ఎక్కేయచ్చు: ప్రెస్ రివ్యూ

ఇండియన్ రైల్వే

ఫొటో సోర్స్, Getty Images

ప్లాట్‌ఫాం టికెట్‌తోనే రైలు ఎక్కడానికి అనుమతిస్తూ ఇండియన్ రైల్వే కొత్త అవకాశం కల్పించిందని ఆంధ్రజ్యోతి వార్త ప్రుచురించింది.

ప్లాట్‌ఫామ్‌ టికెట్‌తోనే ఇక రైల్లో ప్రయాణించడానికి ప్యాసింజర్లకు భారతీయ రైల్వే అవకాశం కల్పించింది.

గమ్యస్థానానికి ఎంత టికెట్ ధర ఎంతో అది మాత్రం ప్రయాణంలో చెల్లించాల్సి ఉంటుంది.

కొత్తగా జారీచేసిన నిబంధనల మేరకు... ప్లాట్‌ఫామ్‌ టికెట్‌ తీసుకున్న ప్రయాణికులు నేరుగా ట్రావెలింగ్‌ టికెట్‌ ఎగ్జామినర్‌ (టీటీఈ) దగ్గరకు వెళ్లి తమకు ఎక్కడికి టికెట్‌ కావాలో చెప్పాల్సి ఉంటుంది.

దాని ప్రకారం టీటీఈ టికెట్‌ జారీ చేస్తారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణం చేయాల్సిన వారికి ఇది ఉపయోగపడనుంది.

రిజర్వేషన్ సీట్ దొరక్కపోయినా, రైల్లో ప్రయాణించడానికి అనుమతిస్తారు. కానీ టికెట్ ధరకు అదనంగా రూ.250 పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.

ఏపీ సీఎం జగన్

ఏపీలో 20 తర్వాత కర్ఫ్యూ సడలింపు

ఏపీలో కోవిడ్ కేసులు సున్నాకు చేరుతాయని ఎప్పుడూ అనుకోవద్దని సీఎం జగన్ హెచ్చరించినట్లు ఈనాడు ఒక వార్త ప్రచురించింది.

రాష్ట్రంలో జూన్‌ 20 తర్వాత కర్ఫ్యూలో కొన్ని సడలింపులు ఉంటాయని సీఎం జగన్‌ వెల్లడించారు. సడలింపులు ఇస్తూనే కర్ఫ్యూ కొనసాగించాల్సి ఉంటుందని తెలిపారు.

కొవిడ్‌ కేసులు సున్నా స్థాయికి చేరతాయని ఎప్పటికీ భావించొద్దని, జాగ్రత్తలు తీసుకుంటూనే వైరస్‌ను ఎదుర్కోవాలన్న విషయాన్ని మర్చిపోవద్దని పేర్కొన్నారు.

కొవిడ్‌ ప్రొటోకాల్‌ను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. స్పందన కార్యక్రమంపై బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లతో సమీక్షించారని ఈనాడు రాసింది.

'కరోనా మూడో దశ వస్తుందో.. లేదో మనకు తెలియదు. అది వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. మూడో దశలో పిల్లలు ఎక్కువ ప్రభావితమవుతారని చెబుతున్నారు.

వీటిని దృష్టిలో ఉంచుకుని చక్కటి ప్రణాళికతో సిద్ధంగా ఉండాలి. జిల్లా స్థాయిలో వచ్చే 2 నెలలకు తగినట్లు కార్యాచరణ సిద్ధం చేసి అమలు చేయాలి' అని సూచించారని ఈనాడు వివరించింది.

అజారుద్దీన్

ఫొటో సోర్స్, TWITTER/MOHAMMED AZHARUDDIN

హెచ్‌సీఏ అధ్యక్షుడుగా అజహరుద్దీన్‌పై వేటు

మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్‌ను హెచ్‌సీఏ అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తున్నట్లు హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ ప్రకటించిందని సాక్షి దినపత్రిక వార్తా కథనం ప్రచురించింది.

నిబంధనలకు విరుద్ధంగా, ఉద్దేశపూర్వకంగా హెచ్‌సీఏ ప్రయోజనాలు దెబ్బ తీసే విధంగా వ్యవహరిస్తున్నారంటూ స్వయంగా అధ్యక్షుడిపైనే హెచ్‌సీఏ చర్య తీసుకుంది.

అసోసియేషన్‌ అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్‌ మొహమ్మద్‌ అజహరుద్దీన్‌ను ఆ పదవినుంచి తప్పిస్తున్నట్లు హెచ్‌సీఏ అపెక్స్‌ కౌన్సిల్‌ ప్రకటించింది.

ఆయన హెచ్‌సీఏ సభ్యత్వం కూడా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. అజహర్‌పై పలు ఆరోపణలు చేస్తూ ఈ నెల 10న ఆయనకు షోకాజ్‌ నోటీసు జారీ చేయగా... అజహర్‌ స్పందించకపోవడంతో ఈ చర్య తీసుకున్నట్లు అపెక్స్‌ కౌన్సిల్‌ స్పష్టం చేసింది.

యూఏఈలో జరిగిన అనధికారిక టి10 టోర్నీలో ఒక జట్టుకు మెంటార్‌గా వ్యవహరించడం, తన రిటైర్మెంట్‌ తేదీపై తప్పుడు సమాచారం ఇవ్వడం, హెచ్‌సీఏ ఖాతాలను స్థంభింపజేయడం, అంబుడ్స్‌మన్‌‌ నియామకం, ఆటగాళ్ల ఎంపికలో జోక్యం చేసుకోవడం, హెచ్‌సీఏ సమావేశాలకు హాజరు కాకపోవడం తదితర అంశాలపై ఆరోపణలు చేసిన అపెక్స్‌ కౌన్సిల్‌...ఇకపై అసోసియేషన్‌ కార్యకలాపాల్లో అజహర్‌ పాల్గొనరాదని నిషేధం విధించినట్లు సాక్షి వివరించింది.

రెండు డోసుల వ్యవధి సరైనదే

ఫొటో సోర్స్, EPA

రెండు డోసుల మధ్య వ్యవధి పెంపు సరైనదే

కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య వ్యవధి పెంపు సరైన నిర్ణయమేనని కేంద్రం చెప్పినట్లు నమస్తే తెలంగాణ వార్తా కథనం ప్రచురించింది.

కరోనా వ్యాక్సిన్‌ కొవిషీల్డ్‌ రెండు డోసుల మధ్య వ్యవధి పెంపు శాస్త్రీయ ఆధారాలకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయమని, ఇది పూర్తిగా పారదర్శకమైనదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు.

ఈ వ్యాక్సిన్‌ రెండు డోసుల మధ్య వ్యవధిని 6-8 వారాల నుంచి 12-16 వారాలకు ఇటీవల కేంద్రం పెంచిన విషయం తెలిసిందే.

ఈ నిర్ణయం అశాస్త్రీయమని, వ్యాక్సిన్‌ కొరత నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నదని ప్రతిపక్షాలతోపాటు ఇతరులు విమర్శలు గుప్పిస్తున్నారని పత్రిక రాసింది.

ఈ నేపథ్యంలో హర్షవర్ధన్‌ ట్విట్టర్‌ వేదికగా బుధవారం స్పష్టతనిచ్చారు. 'ఇలాంటి కీలక విషయాలను విశ్లేషించి తగిన నిర్ణయం తీసుకునే ప్రత్యేక వ్యవస్థ మనకు ఉంది. శాస్త్రీయ ఆధారాల ప్రకారమే రెండు డోసుల మధ్య వ్యవధిని పెంచాం. ఈ నిర్ణయం పారదర్శకతతో కూడుతున్నది. ఏకగ్రీవంగా తీసుకున్నది. ఇలాంటి విషయాన్ని కొందరు రాజకీయం చేయడం దురదృష్టకరం' అని ట్వీట్‌ చేశారు.

రెండు డోసుల మధ్య వ్యవధిని 12 వారాలకు పెంచడం వల్ల టీకా మరింత సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు ఇటీవల బ్రిటన్‌లో ఓ పరిశోధనలో తేలిందని పేర్కొంటూ నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యూనైజేషన్‌ (ఎన్‌టీఏజీఐ) చీఫ్‌ ఎన్‌కే అరోరా విడుదల చేసిన ఓ పత్రాన్ని కూడా హర్షవర్ధన్‌ జత చేశారని పత్రిక చెప్పింది.

మరోవైపు ఎన్‌టీఏజీఐ సభ్యులు మాత్రం కేంద్రం వాదనతో విభేదిస్తున్నారు. రెండు డోసుల మధ్య వ్యవధిని 8-12 వారాలకు పెంచాలని మాత్రమే తాము సూచించామని చెప్పారు. 12-16 వారాల వ్యవధిపై తాము చర్చించలేదని వారు తెలిపారని నమస్తే తెలంగాణ వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)