ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ రద్దు చేసిన హైకోర్టు

వైఎస్ జగన్

ఫొటో సోర్స్, facebook/AndhraPradeshCM

ఆంధ్రప్రదేశ్‌లో ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దు చేసింది.

ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.

ఈ వ్యవహారంలో రాష్ట్ర ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరు సరికాదని హైకోర్టు తెలిపింది.

ఒకవేళ ఎన్నికలు నిర్వహిస్తే.. అవి కోవిడ్-19 టీకా కార్యక్రమానికి ఆటంకం కలిగిస్తాయని అభిప్రాయపడింది.

రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని రాష్ట్ర ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా వ్యవహరించలేదని, తనంతటతానుగా నిర్ణయం తీసుకుందని వివరించింది.

రాష్ట్ర ఎన్నికల సంఘం వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం

ఫిబ్రవరి 5 నుంచి నాలుగు దశల్లో ఎన్నికలను నిర్వహిస్తామని ఈనెల 8వ తేదీ శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ షెడ్యూల్ విడుదల చేశారు. ఫిబ్రవరి 5,9,13,17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రకటించారు.

అయితే, కరోనావైరస్ వ్యాప్తి నడుమ ఆ సమయంలో ఎన్నికలు నిర్వహించడం వీలుకాదని ఆయనకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ లేఖ రాశారు.

‘‘కోవిడ్-19 కేసులు పెరగడంతో కేంద్ర ప్రభుత్వం నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఎన్‌డీఎంఏ)ను విధించింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను మేం అనుసరిస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ కష్టం’’అని ఆదిత్యనాథ్ తెలిపారు.

కాగా, టీకా కార్యక్రమం ప్రారంభం కానున్నందున ఈ ఎన్నికల నిర్వహణలో తాము పాల్గొనలేమని పలు ఉద్యోగ సంఘాల నాయకులు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)