రైతుల సమస్యల పరిష్కారానికి కమిటీ వేస్తాం: సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

భారత ప్రభుత్వం, రైతుల మధ్య చర్చలు ఎలాంటి ఫలితం ఇవ్వకపోవడంతో సమస్యల పరిష్కారానికి రైతు సంఘాల ప్రతినిధులు, ప్రభుత్వం, ఈ సమస్యలతో సంబంధమున్న మరికొందరితో కమిటీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సుప్రీంకోర్టు బుధవారం తెలిపింది.

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఆందోళనలపై దాఖలైన పిటిషన్లను బుధవారం విచారించారు.

ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే, న్యాయమూర్తులు ఏఎస్ బొప్పన్న, వి.రవిసుబ్రమణియన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. వివాద పరిష్కారానికి కమిటీ వేయాలనుకుంటున్నట్లు కేంద్రం తరఫున విచారణకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు తెలిపింది.

‘‘త్వరలో ఇది జాతీయ సమస్యగా పరిణమించే సూచనలున్నాయి. ప్రభుత్వం వల్ల వివాద పరిష్కారం కావడం లేదు’’ అని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.

రైతుల నిరసన

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రైతుల నిరసన

కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతులను వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేయించాలంటూ దాఖలైన వినతులపై కేంద్రం, హరియాణా, ఉత్తర్ ప్రదేశ్, దిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.

తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్‌ను ఉద్దేశించి ధర్మాసనం ‘‘ప్రభుత్వ సంప్రదింపులు ఫలితమివ్వడం లేదు. మళ్లీ విఫలమవుతాయి’’ అని వ్యాఖ్యానించింది.

ఆందోళనలో పాల్గొంటున్న రైతు సంఘాలను ఈ కేసులో పార్టీలుగా ఇంప్లీడ్ చేయడానికీ సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.రైతుల సమస్యలపై అన్ని పిటిషన్లను ఒకేసారి విచారిస్తామని ధర్మాసనం చెప్పింది.

రైతుల నిరసన

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రైతుల నిరసన

కాగా కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. ‘‘రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోదు’’ అని న్యాయస్థానానికి తెలిపారు.

పిటిషనర్లలో ఒకరైన న్యాయవిద్యార్థి రిషబ్ శర్మ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది ఓం ప్రకాశ్ ప్రిహార్ మాట్లాడుతూ షాహిన్ బాఘ్ తీర్పును దృష్టిలో పెట్టుకుని సరిహద్దులు తెరవాలని కోరారు.

షాహిన్ బాగ్ నిరసనలప్పుడు 3 నుంచి 4 లక్షల మంది నిరసనకారులు ఉన్నారని.. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే ఉందని ఓం ప్రకాశ్ అన్నారు.

సమస్య పరిష్కారానికి ఈ కేసులో రైతుల మాటా వినాల్సిన అవసరం ఉందని ధర్మాసనం పేర్కొంది.

రహదారి దిగ్బంధాల వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని.. అక్కడ నిరసనకారులు పోగవడం వల్ల కోవిడ్ కేసులూ పెరిగే ఆస్కారముందని రిషబ్ శర్మ తన పిటిషన్లో పేర్కొన్నారు.

కోవిడ్‌ను దృష్టిలో పెట్టుకుని దిల్లీ సరిహద్దులను తెరవాలని, నిరసనకారులను కేటాయించిన ప్రదేశానికి తరలించి అక్కడ సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు వాడేలా అధికారులకు మార్గదర్శకాలు ఇవ్వాలని ఆయన తన పిటిషన్‌లో కోరారు.

బురారీలోని నిరంకారీ మైదాన్‌లో నవంబరు 27న శాంతియుత ప్రదర్శన నిర్వహించుకునేందుకు దిల్లీ పోలీసులు తొలుత అనుమతులిచ్చారని, అయితే వారు అదేసమయంలో దిల్లీ సరిహద్దులను మూసివేశారని పిటిషనర్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)