విరాట్ కోహ్లీ: క్రికెట్ మళ్లీ మొదలైతే ఏం చేయొచ్చు.. ఏం చేయకూడదు

కోహ్లీ

ఫొటో సోర్స్, MICHAEL BRADLEY/AFP VIA GETTY IMAGES

కరోనావైరస్ సంక్షోభం ప్రపంచాన్ని పట్టి పీడీస్తున్న ఈ సమయంలో ఒకవేళ మళ్లీ క్రికెట్ మొదలైతే, ఎలా ఉంటుందో తెలియదని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నారు.

సహచర క్రికెటర్, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో సోషల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన లైవ్‌లో ముచ్చటించారు.

ఈ సందర్భంగా క్రికెట్‌కు సంబంధించి ఆయన వివిధ అంశాలపై స్పందించారు.

‘‘రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో తెలియదు. ఆడుతున్నప్పుడు సహచర ఆటగాళ్లతో చేతులు కలపలేం. అలా చేసే సందర్భం వచ్చినప్పుడు వెనక్కితగ్గాల్సి వస్తుంది. ఈ విషయం ఆలోచిస్తేనే విచిత్రంగా అనిపిస్తోంది’’ అని కోహ్లీ అన్నారు.

‘‘వినడానికి వింతగా అనిపించవచ్చు. కానీ, ఇలాగే జరుగుతుంది. కరోనావైరస్‌కు వ్యాక్సిన్ లేదా చికిత్స కనిపెట్టేవరకైనా ఈ పరిస్థితి తప్పదు’’ అని అభిప్రాయపడ్డారు.

కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో చోటు చేసుకునే మార్పులను స్వీకరించడంలో ఇబ్బందులేమీ ఉండవని కోహ్లీ అన్నారు.

‘‘మనందరికీ ఇదంతా విచిత్రంగానైతే అనిపిస్తుంది. కానీ, జీవితంలో దీన్ని భాగం చేసుకోవడం కష్టమేమీ కాదు’’

కోహ్లీ

ఫొటో సోర్స్, JEWEL SAMAD/AFP VIA GETTY IMAGES

ఐసీసీ మార్గదర్శకాలు

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) క్రికెట్‌ను తిరిగి మొదలుపెట్టే విషయమై మే 22న కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది.

ప్రభుత్వ నిబంధనలను, సురక్షిత చర్యలను తప్పక పాటించేలా చూసేందుకు ఒక ఛీఫ్ మెడికల్ ఆఫీసర్ లేదా బయో సేఫ్టీ ఆఫీసర్‌ను నియమించుకునే అంశాన్ని పరిశీలించాలని అందులో సూచించింది.

మ్యాచ్‌లకు 14 రోజుల ముందు నుంచే క్రికెటర్లను ప్రత్యేకమైన శిక్షణ శిబిరాల్లో ఉంచాలని, ఉష్ణోగ్రతను పరిశీలించాలని, కోవిడ్-19 పరీక్షలు చేయాలని, క్రికెటర్ల సామగ్రిని శానిటైజ్ చేయాలని, భౌతిక దూరం పాటించేలా చూడాలని సూచించింది.

మైదానంలో క్రికెటర్లతోపాటు అంపైర్లు కూడా సురక్షిత నియమాలను పాటించాల్సి ఉంటుందని అంటున్నారు. అంటే, ముందులా క్రీడాకారులు తమ టోపీలు, కళ్లద్దాలు, రుమాళ్ల లాంటివి అంపైర్లకు అప్పగించడం కుదరదు. బంతిని పట్టుకునే సమయంలో అంపైర్లు గ్లవ్స్ ధరించాల్సి ఉంటుంది.

షమీ

ఫొటో సోర్స్, Getty Images

క్రికెటర్లు బంతిపై ఉమ్మకూడదు. బంతిని తాకిన తర్వాత కళ్లు, ముక్కు, ముఖం తాకకూడదు.

క్రీడాకారులు ప్రయాణం చేసే సమయాల్లో చార్టెడ్ విమానాల్లో, సీట్ల మధ్యలో సురక్షిత దూరం పాటించేలా ఏర్పాట్లు చేయాలని ఐసీసీ సూచించింది.

గత మార్చి నుంచి ఒక్క అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ కూడా జరగలేదు.

ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య సురక్షిత వాతావరణంలో జులై‌లో మూడు టెస్టు మ్యాచ్‌లు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)