దిశ కేసు నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం చేయండి.. తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించండి - హైకోర్టు ఆదేశం

- రచయిత, దీప్తి బత్తిని
- హోదా, బీబీసీ ప్రతినిధి
హైదరాబాద్ శివార్లలో వెటర్నరీ డాక్టర్ దిశపై అత్యాచారం హత్య కేసులో నలుగురు నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.
ఈనెల 23వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఈ ప్రక్రియను ముగించాలని తెలిపింది. ఈ కార్యక్రమం మొత్తాన్ని వీడియోలో చిత్రీకరించాలని కూడా ఆదేశించింది.
మెడికల్ బోర్డ్ ఆఫ్ ఇండియా బృందం చేత మళ్లీ పోస్టుమార్టం జరిపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచిస్తూ.. ఈ ప్రక్రియలో సేకరించే ఆధారాలను షీల్డు కవర్లో భద్రపరచి, తమకు అందజేయాలని తెలిపింది.
అదేవిధంగా.. ఎన్కౌంటర్కు సంబంధించిన బుల్లెట్లు, గన్లు, ఫోరెన్సిక్ ఆధారాలు, పోస్టుమార్టం నివేదిక.. వీటన్నింటినీ భద్రపర్చాలని ఆదేశించింది.
రీ పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత మృతదేహాలను పోలీసుల సమక్షంలో నిందితుల కుటుంబ సభ్యులకు అప్పగించాలని తెలిపింది.
‘50 శాతం కుళ్లిపోయిన మృతదేహాలు’
నిందితుల మృతదేహాల 50 శాతం కుళ్లిపోయాయని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్ తెలంగాణ హైకోర్టులో చెప్పారు.
డిసెంబర్ 6వ తేదీన సైబరాబాద్ పోలీసుల 'ఎన్కౌంటర్'లో చనిపోయిన ఈ నలుగురు నిందితుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించే అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతోంది.
ఈ విచారణకు హాజరైన గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రావణ్.. మృతదేహాలను 2 డిగ్రీల సెల్సీయస్ ఫ్రీజర్లో ఉంచామని తెలిపారు. అయితే, అవి ఇప్పుడు 50 శాతం కుళ్లిపోయాయని, మరో వారం, పది రోజుల్లో పూర్తిగా కుళ్లిపోతాయని వివరించారు.దేశంలోని ఇతర ఆసుపత్రుల్లో మృతదేహాలను భద్రపరిచేందుకు అవకాశం ఉందా అని హైకోర్టు ప్రశ్నించగా.. ఆ విషయం తనకు తెలియదని డాక్టర్ శ్రావణ్ సమాధానం చెప్పారు.
నిందితుల మృతదేహాలను డిసెంబర్ 9వ తేదీన గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చారని ఆయన గుర్తు చేశారు.
కాగా, నిందితుల మృతదేహాలకు ఇప్పటికే ఫోరెన్సిక్ నిపుణుల బృందంతో పోస్టుమార్టం నిర్వహించామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.
ఈ ఫోరెన్సిక్ నిపుణుల బృందంలో గాంధీ మెడికల్ కాలేజీ హెచ్ఓడీ ఠాగూర్ కృపాల్ సింగ్, అసోసియేటెడ్ ప్రొఫెసర్ లావణ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్ మహేందర్ ఉన్నారని తెలంగాణ అడ్వొకేట్ జనరల్ వెల్లడించారు.
పోస్టుమార్టం రిపోర్ట్ ఉందా అని ఏజీని హైకోర్టు అడగ్గా.. ప్రస్తుతం లేదని ఏజీ సమాధానం ఇచ్చారు.
‘రీ పోస్టుమార్టం చేసి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించాలి’
రీ పోస్టుమార్టం పూర్తి చేసి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించాలని ఈ కేసులో అమికస్ క్యూరీగా వ్యవహరిస్తున్న న్యాయవాది ప్రకాష్ రెడ్డి హైకోర్టును కోరారు.
అయితే, రీ పోస్టుమార్టం చేయాలని పిటిషనర్లు తమ పిటిషన్లో ఎక్కడా కొరలేదని తెలంగాణ అడ్వొకేట్ జనరల్ చెప్పారు.
పిటిషనర్లు సుప్రీంకోర్టుకు రాసిన లేఖలో రీ పోస్టుమార్టం కోరారని ప్రకాష్ రెడ్డి కోర్టుకు తెలిపారు. ఇండిపెండెంట్ టీంతో రీ పోస్టుమార్టం నిర్వహించవచ్చునని వెల్లడించారు.
వీలయినంత తొందరగా మృతదేహాల నుంచి ఆధారాలను సేకరించవచ్చునని, ఇప్పటికే మృతదేహాలు 50 శాతం డీ కంపోజ్ అయ్యాయి కాబట్టి తొందరగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు.
ఈ కేసుపై విచారణ ఇంకా కొనసాగుతోంది.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది
గతంలో ఏం జరిగిందంటే..
పోలీసుల కథనం ప్రకారం.. నవంబర్ 27వ తేదీ రాత్రి శంషాబాద్ వద్ద దిశ (పోలీసులు పెట్టిన పేరు)ను లారీ డ్రైవర్, క్లీనర్లుగా పనిచేస్తున్న నలుగురు యువకులు కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసి, హత్య చేశారు. షాద్ నగర్ సమీపంలోని చటాన్పల్లి గ్రామ శివారు రోడ్డు వంతెన దగ్గర 28వ తేదీ తెల్లవారుజామున పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఆమె మృతదేహం కనిపించింది.
డిసెంబర్ 6వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ శివారులోని చటాన్ పల్లి బ్రిడ్జి వద్ద 'ఎన్కౌంటర్'లో చనిపోయినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ చెప్పారు. సీన్ రీ-కన్స్ట్రక్షన్లో భాగంగా నిందితులు దిశను దహనం చేసిన స్థలంలోకి తీసుకెళ్లగా, వారు తప్పించుకొని పోలీసులపై దాడి చేశారని, ఈ క్రమంలోనే కాల్పులు జరిపినట్లు ఆయన తెలిపారు.
ఈ 'ఎన్కౌంటర్'పై పలు మహిళా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు అదే రోజు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేశాయి. కస్టడీలో ఉన్న నిందితులు పోలీసుల చేతుల్లో మరణించడంపై ప్రశ్నలు లేవనెత్తాయి. ఫోరెన్సిక్ నిపుణుల చేత పోస్టుమార్టం నిర్వహించాలని, ఈ ప్రక్రియను వీడియో తీయాలని విజ్ఞప్తి చేశాయి.
దీనికి హైకోర్టు స్పందిస్తూ.. వీడియో చిత్రీకరణతో పోస్టు మార్టం నిర్వహించాలని, ఆ వీడియోను హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కు అందించాలని ఆదేశించింది. తదనంతర విచారణలో భాగంగా.. నిందితుల మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించి, భద్రపర్చాలని ఆదేశించింది.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
ఇవి కూడా చదవండి:
- అత్యాచారం, హత్యకు గురైన వెటర్నరీ డాక్టర్ పేరును 'దిశ'గా మార్చిన పోలీసులు
- దిశ అత్యాచారం, హత్య కేసు విచారణకు ప్రత్యేక కోర్టు
- ‘దిశ’ అత్యాచారం: "నాకు చాలా బాధేసింది.. ఆ బాధితురాలు కూడా సాటి ఆడదే" - ఓ నిందితుడి భార్య ఆవేదన
- హైదరాబాద్ ఎన్కౌంటర్పై విచారణకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం
- హైదరాబాద్ ‘ఎన్కౌంటర్’: సీన్ రీ-కన్స్ట్రక్షన్ అంటే ఏంటి? ఎందుకు చేస్తారు? ఎలా చేస్తారు?
- షాద్ నగర్ అత్యాచారం-హత్య: ‘ప్లీజ్ పాపా, కొంచెం సేపు మాట్లాడు, దెయ్యంలా వెంటపడిండు... నాకు భయం అయితాంది’
- హైదరాబాద్ ఎన్కౌంటర్: ‘పోలీసుల కథనం చిన్నపిల్లలు కూడా నమ్మేలా లేదు’
- సెక్షన్ 144: బ్రిటిషర్ల కాలం నాటి ఈ సెక్షన్ దుర్వినియోగం అవుతోందా?
- పెరట్లో పెంచుకునే కూరగాయలు, పండ్ల మొక్కలతో వాతావరణ మార్పులపై పోరాటం
- వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం
- ‘హమ్మయ్య.. తమ్ముడిని కౌగిలించుకోగలిగా’.. హైడ్రాలిక్ చేతిని అమర్చుకున్నాక అయిదేళ్ల బాలుడి ఆనందం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








