తెలంగాణ: శంషాబాద్ సమీపంలో మరో మహిళ దహనం

మహిళ దహనం

షాద్‌నగర్ సమీపంలో వెటర్నరీ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటన జరిగి 48 గంటలు కూడా గడవక ముందే హైదరాబాద్‌లో మరో దారుణం చోటుచేసుకుంది.

శంషాబాద్ సమీపంలోని సిద్ధులగుట్ట దగ్గర కాలిపోయిన దశలో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది.

"శంషాబాద్ డీసీపీ కార్యాలయానికి 4 కిలోమీటర్ల దూరంలో, ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో కాలిపోయిన దశలో సుమారు 30 సంవత్సరాల వయసున్న గుర్తు తెలియని మహిళ మృతదేహం దొరికింది. అయితే ఇది హత్య లేక ఆత్మహత్య అనేది ఇంకా ధ్రువీకరించలేదు. అయితే, పక్కనే అగ్గిపెట్టె దొరికింది, కాబట్టి ఆత్మహత్య కావచ్చు" అని భావిస్తున్నామని శంషాబాద్ ఏసీపీ అశోక్ కుమార్ వెల్లడించారు.

ఘటనా స్థలంలో పోలీసులు

దాదాపు 80శాతం కాలిన గాయాలతో ఉన్న మృతదేహాన్ని 108 అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు.

అయితే, దీనికి సంబంధించి ఎలాంటి మిస్సింగ్ కేసూ నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.

ప్రస్తుతం పోలీసులు, క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తోంది.

సమీపంలో ఓ సినిమా షూటింగ్ జరుగుతుండగా, అది చూసి వస్తున్న కొందరు యువకులు మంటలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. గుడిలో ఉన్న అయ్యప్ప భక్తుల పంచెలను తీసి ఆ యువకులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. ఈలోగా పోలీసులు అక్కడకు చేరుకున్నారు.

"రాత్రి 8.30 గంటల సమయంలో ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్ధుల గుట్టలోని ఆలయం పక్కన ఓ గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... మహిళ శరీరం దహనమవుతుండగా చూసి, వాళ్లు ఆర్పేందుకు ప్రయత్నించారు. ముందుగా వాళ్లు పురుషుడి శరీరం అని భావించినా, తర్వాత దుస్తులను బట్టి మహిళ అని తెలిసింది. ఇది ఆత్మహత్య లేక హత్య అనేది ఇంకా స్పష్టం కాలేదు. కొన్ని ఆధారాలు దొరికాయి. వాటి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నాం. ఈ మార్గంలో అన్ని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నాం. దీనిపై ఎలాంటి మిస్సింగ్ కేసూ నమోదు కాలేదు. సమీప పోలీస్ స్టేషన్లను కూడా అప్రమత్తం చేశాం" అని శంషాబాద్ డీసీపీ ఎన్ ప్రకాశ్ రెడ్డి తెలిపారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)