"ఒకప్పుడు ఈ వీధిలో ప్రజలు నడిచేవారు.. ఇప్పుడు పడవలు నడుస్తున్నాయి"

నర్మదా డ్యాం నీట మునిగిన గ్రామం

ఇళ్లు, దుకాణాలు, చేలూ, పొలాలూ సర్వం జలమయం అయ్యాయి.

గ్రామంలోని బస్టాండ్‌లో ఇప్పుడు 20 అడుగుల మేర నీళ్లున్నాయి.

మధ్యప్రదేశ్‌లోని నిసర్పూర్ గ్రామంలో ప్రస్తుతం ఎటు చూసినా నీళ్లు తప్ప మరేమీ కనిపించడం లేదు.

పై ఫొటోలో ఉన్నది నిసర్పూర్ గ్రామంలోని ప్రధాన వీధి. ఒకప్పుడు ఈ వీధిలో జనాలు నడిచేవారు. ఇప్పుడు పడవలు నడుస్తున్నాయి. గ్రామం చెరువులా మారింది.

"ఇటువైపు బడ్వానీకి వెళ్లే పాత రోడ్డు ఉంది. బస్సులు ఇక్కడే ఆగేవి. అంటే ఇది గ్రామంలోని బస్టాండ్ అన్నమాట. ఇక్కడ ఇప్పుడు 20 అడుగుల లోతు నీళ్లున్నాయి" అని సంజయ్ చౌదరి చెప్పారు.

నర్మదా డ్యాం నీట మునిగిన గ్రామం

గుజరాత్‌లోని కేవడియాలో ఉన్న సర్దార్ సరోవర్ డ్యాంలో నీటి మట్టం 134 మీటర్లకు చేరుకుంది. దీంతో మధ్యప్రదేశ్‌లోని 194 గ్రామాలు మునిగిపోతున్నాయని, దాదాపు 30 వేల కుటుంబాలు నిరాశ్రయులవుతున్నాయని మానవ హక్కుల కార్యకర్త మేధా పాట్కర్ అంటున్నారు.

బీబీసీ ప్రతినిధి తేజస్ వైద్య ముంపు గ్రామాల్లో పర్యటించారు. స్థానికులతో మాట్లాడారు.

కుంతా పాటీదార్‌కు చెందిన నాలుగు తరాలు ఈ ఇంట్లోనే పుట్టి పెరిగాయి. వాళ్ల సగం సామాన్లు ఇప్పటికీ ఈ ఇంట్లోనే ఉన్నాయి.

నర్మదా డ్యాం నీట మునిగిన గ్రామం

"ఇది మా ఇల్లు. రెండస్తుల ఇల్లు. ఇప్పుడిది మునిగిపోయింది. ఇందులో మా సామాన్లున్నాయి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఇక్కణ్నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని మేం కోరుకోలేదు" అని కుంతా పాటీదార్ చెప్పారు.

గ్రామం ముంపు ప్రాంతంలో ఉండటంతో కుంతా పాటీదార్ కుటుంబానికి నష్టపరిహారం, భూమి లభించాయి. కానీ అన్నీ సగం సగమే అందాయని వాళ్ల కుమారుడు అంటున్నారు.

"మునిగిపోయిన భూమికి బదులు 15 లక్షల రూపాయలిచ్చారు. నిజానికి మాకు 60 లక్షలు రావాలి. మునిగిపోయిన భూమి మూడెకరాలకన్నా ఎక్కువే. అయినా 15 లక్షలతోనే సరిపెట్టారు" అని కుంతా పాటీదార్ కుమారుడు సచిన్ పాటీదార్ బీబీసీతో అన్నారు.

నర్మదా డ్యాం నీట మునిగిన గ్రామం

ద్వీపంలా మారిపోయిన మరో గ్రామం పేరు రాజ్‌గఢ్ కుక్రా గ్రామంలోకి నీరు ప్రవేశించడంతో ఇద్దరు చనిపోయారు.

నావ నడుపుతూ జీవించే సంతోష్ వాస్కలే పడవపై వెళ్తుండగా, కరెంటు తీగలు తగలడంతో చనిపోయాడు. ఇప్పుడు ఐదుగురు పిల్లలను ఎలా పెంచి పోషించాలన్నది ఆయన భార్య ముందున్న సమస్య.

"నా కుటుంబానికి దిక్కు లేకుండా పోయింది. బడ్వానీ ఇక్కడికి చాలా దూరం. పిల్లలు అనారోగ్యం పాలైతే వాళ్లను ఎవరు ఆసుపత్రికి తీసుకెళ్తారు? ఎవరు సాయం చేస్తారు" అని మృతుడు సంతోష్ భార్య సునీతా వాస్కలే బాధపడుతూ ప్రశ్నించింది.

సర్దార్ సరోవర్ నీటిమట్టాన్ని 130 మీటర్లకు పరిమితం చేయాలి. ఇప్పటికీ పునరావాసం అందని వారికి వెంటనే సహాయం చేయాలి. ఈ డిమాండ్లతో మేధా పాట్కర్ నిరాహార దీక్షకు దిగారు.

డ్యాం గేట్లను తెరవాలని డిమాండ్ చేస్తూ బడ్వానీ జిల్లాలోని బర్దా గ్రామంలో నిరాహారదీక్ష చేపట్టిన మేధా 9వ రోజున తన దీక్షను విరమించారు.

పునరావాసానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌ నాథ్ లిఖితపూర్వక హామీ ఇచ్చాక ఆమె దీక్ష విరమించారు. డ్యాం గేట్లను తెరిపించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నింస్తుందని కూడా ఆయన హామీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)