ఓటేస్తే ఉచితంగా రెస్టారెంట్ ఫుడ్, బీర్, ట్యాక్సీ రైడ్, కాఫీ.. బెంగళూరు వాసులకు ఎన్నికల ఆఫర్లు

బెంగళూరులో ఓటర్లకు ఆఫర్లు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మెరిల్ సెబాస్టియన్
    • హోదా, బీబీసీ న్యూస్

బెంగళూరులోని అనేక సంస్థలు సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసే ప్రజలకు ఉచిత భోజనం నుంచి టాక్సీ రైడ్‌ల వరకు చాలా రకాల ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి.

ఎన్నికల్లో తక్కువ ఓటింగ్ శాతం కారణంగా బెంగళూరు తరచుగా వార్తల్లో నిలుస్తుంటుంది.

కాబట్టి హోటళ్లు, టాక్సీ సర్వీసులు, ఇతర సంస్థలు ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ ఓటర్లకు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.

వీటిలో ఉచితంగా బీర్, డిస్కౌంట్ క్యాబ్ రైడ్‌లు, ఉచిత ఆరోగ్య పరీక్షలు కూడా ఉన్నాయి.

ఓటు వేసినట్లు రుజువుగా చేతికి సిరాను చూపిస్తే భోజనం ఫ్రీ అంటూ.. కొన్ని రెస్టరెంట్లు ప్రకటించాయి.

బెంగళూరులో ఓటర్లకు ఆఫర్లు

ఫొటో సోర్స్, Getty Images

హైకోర్టు ఆమోదం

ఏప్రిల్ 26న బెంగళూరులో రెండో విడత పోలింగ్ జరగనుంది.

ఎన్నికల మార్గదర్శకాలను ఉల్లంఘించనంత వరకు హోటళ్ల అసోసియేషన్ ఆహారాన్ని ఉచితంగా లేదా తగ్గింపు ధరలకు ఇవ్వడానికి కర్ణాటక హైకోర్టు బుధవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

"వివిధ హోటళ్ళు, రెస్టారెంట్లు ఓటర్లకు ఇష్టమైనవి అందజేస్తాయి" అని హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు పీసీ రావు బెంగళూరు మిర్రర్ వార్తాపత్రికతో అన్నారు.

"ఇక్కడ కొన్ని ఉచితంగా కాఫీ, దోసెలు, పండ్ల రసాన్ని అందిస్తాయి, కొన్ని అవుట్‌లెట్‌లు ఆహారంపై తగ్గింపులను ఇస్తాయి లేదా ఆఫర్‌లు ఇస్తాయి" అని ఆయన చెప్పారు.

2019 సార్వత్రిక ఎన్నికలలో బెంగళూరు సౌత్‌లో కర్ణాటకలోనే అత్యల్ప ఓటింగ్ (53.7 శాతం) నమోదైన నియోజకవర్గంగా నిలిచింది.

బెంగుళూరు సెంట్రల్ (54.3 శాతం), బెంగళూరు నార్త్ (54.7 శాతం)లలో కూడా పోలింగ్ తక్కువగా నమోదైంది. రాష్ట్రంలో మొత్తం 68 శాతం పోలింగ్ నమోదైంది.

బెంగళూరు వాసులను చాలా కంపెనీలు ఓటు వేయాలంటూ గత వారం నుంచి ప్రోత్సహిస్తున్నాయి, ఈ నేపథ్యంలో బుధవారం కోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, ఓటేసే వారికి ఆఫర్‌లను ప్రకటిస్తున్నాయి.

అమ్యూజ్‌మెంట్ పార్క్ వండర్‌లా ఓటర్లకు తగ్గింపు ధరలకు టిక్కెట్లు ఇస్తోంది. నగరంలోని డెక్ ఆఫ్ బ్రూస్ అనే పబ్ ఓటు వేసిన మొదటి 50 మంది కస్టమర్లకు ఉచిత బీర్‌ను అందిస్తోంది.

రైడ్‌షేరింగ్ యాప్ అయిన బ్లూ-స్మార్ట్ పోలింగ్ స్టేషన్‌ల నుంచి 30 కి.మీ (18 మైళ్లు)లోపు ప్రయాణీకులకు 50 శాతం తగ్గింపును అందిస్తోంది.

అయితే టాక్సీ సేవలు అందించే రాపిడో వికలాంగులు, వృద్ధ ఓటర్లకు ఉచిత రైడ్‌లను అందిస్తోంది.

లోక్‌సభ ఎన్నికలు

ఫొటో సోర్స్, Getty Images

ఏ దశలో ఎన్ని సీట్లకు ఎన్నికలు?

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు 7 దశల్లో జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏప్రిల్ 19న మొదటి దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. జూన్ 1న చివరి దశ పోలింగ్ నిర్వహిస్తారు. ఫలితాలు జూన్ 04న విడుదలవుతాయి.

మొదటి దశ ఓటింగ్ 2024 ఏప్రిల్ 19న నిర్వహించారు, ఇందులో 21 రాష్ట్రాల్లోని 102 స్థానాలకు ఓటింగ్ జరిగింది.

రెండో దశ ఓటింగ్ 2024 ఏప్రిల్ 26న నిర్వహించనున్నారు, ఇందులో 13 రాష్ట్రాల్లోని 89 స్థానాలకు ఓటింగ్ ఉంటుంది.

మూడో దశ ఓటింగ్ 2024 మే7న నిర్వహించనున్నారు, ఇందులో 12 రాష్ట్రాల్లోని 94 స్థానాలకు ఓటింగ్ జరుగుతుంది.

నాలుగో దశ ఓటింగ్ 2024 మే 13న నిర్వహించనున్నారు, ఇందులో 10 రాష్ట్రాల్లోని 96 స్థానాలకు ఓటింగ్ జరుగుతుంది.

ఐదో దశ ఓటింగ్ 2024 మే 20న నిర్వహించనున్నారు, ఇందులో 8 రాష్ట్రాల్లోని 49 స్థానాల్లో ఓటింగ్ జరుగుతుంది.

ఆరో దశ ఓటింగ్ 2024 మే 25న నిర్వహించనున్నారు, ఇందులో 7 రాష్ట్రాల్లోని 57 స్థానాల్లో ఓటింగ్ జరగనుంది.

ఏడో దశ ఓటింగ్ జూన్ 1, 2024న నిర్వహించనున్నారు, ఇందులో 8 రాష్ట్రాల్లోని 57 స్థానాల్లో ఓటింగ్ జరుగుతుంది.

జూన్ 4 న ఓట్ల లెక్కింపు జరుగుతుంది, ఈ ప్రక్రియ జూన్ 6 లోపు పూర్తవుతుంది.

ఆంధ్రప్రదేశ్‌లోని అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలతోపాటు, తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు నాలుగో దశలో అంటే మే 13న ఒకేసారి పోలింగ్ జరగనుంది.

ఏపీ, తెలంగాణ, కేరళ, తమిళనాడు, పంజాబ్, గుజరాత్, దిల్లీ, హరియాణా స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి.

రాజస్థాన్, మణిపూర్, కర్ణాటక, త్రిపురలో రెండు దశల్లో, అస్సాం, ఛత్తీస్‌గఢ్‌లో మూడు దశల్లో, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో నాలుగు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.

జమ్మూ కశ్మీర్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఐదు దశల్లో, ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతాయి.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)