ఆరోగ్య హక్కు చట్టం: అందరికీ ఉచిత వైద్యాన్ని అందించే ఈ చట్టాన్ని ప్రైవేట్ వైద్యులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, దిగవల్లి పవన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆరోగ్య హక్కు చట్టం, ప్రస్తుతం రాజస్థాన్ను కుదిపేస్తోంది.
ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలని చెబుతోన్న ఆరోగ్య హక్కు చట్టాన్ని ప్రైవేట్ వైద్యులు, ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు ఆపగలవా?
ఆరోగ్య హక్కు బిల్లులో ఏముంది?
రాజస్థాన్లోని ప్రతి ఒక్కరికి ఆరోగ్య హక్కులను కల్పిస్తుంది ఈ బిల్లు. ఉచిత వైద్య సేవలను పౌరుల హక్కుగా అందిస్తుంది. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి - ప్రభుత్వ ప్రైవేట్ ఆరోగ్య కేంద్రాల్లోనూ, ఆసుపత్రుల్లోనూ వైద్య సేవలు ఉచితం.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలతో పాటు మందులు, డయాగ్నోస్టిక్ సేవలు, వైద్య పరీక్షలు ఉచితం.
ఇక ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ– ్రజలకు ఎమర్జెన్సీ వైద్య సేవలు ఉచితం.
అంటే ముందుగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. పోలీసుల క్లియరెన్సులు అవసరం లేదు. వైద్యానికయ్యే ఖర్చులు, వైద్య పరీక్షల ఖర్చులూ ఏమీ ఉండవు.
ఆసుపత్రులకు వెళ్లేందుకు వచ్చేందుకు కూడా ఉచితంగానే ట్రాన్స్పోర్ట్ సేవలు అందించాలి.
ఇలాంటి ఉచిత వైద్య సేవలను ప్రజల హక్కుగా మారుస్తూ ఆరోగ్య హక్కు బిల్లుని మార్చి 21న రాజస్థాన్ అసెంబ్లీ ఆమోదించింది.

ఫొటో సోర్స్, PETER DAZELEY/GETTYIMAGES
బిల్లు ఆమోదానికి ముందు ఏం జరిగింది?
గతేడాది సెప్టెంబరులో ఆరోగ్య హక్కుచట్టానికి సంబంధించిన బిల్లుని రాజస్థాన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీనిపైన అభ్యంతరాలు రావడంతో బిల్లుని సెలక్ట్ కమిటీకి పంపించారు. తర్వాత కొన్ని సవరణలు జరిగాయి.
చివరగా 2023 మార్చి 21న రాజస్థాన్ అసెంబ్లీ బిల్లుని ఆమోదించింది. అయితే ఈ బిల్లుకి వ్యతిరేకంగా ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు, ప్రైవేట్ వైద్యులు తీవ్రస్థాయిలో ఆందోళన చేస్తున్నారు.
ఆరోగ్య హక్కు చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. వీళ్లకు దేశవ్యాప్తంగా వైద్యులు మద్దతు తెలుపుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆరోగ్య హక్కు చట్టంపై ఆందోళన ఎందుకు?
ఇండియన్ మెడికల్ ఆసోసియేషన్, దాని అనుబంధ సంఘాలు, సంస్థలు అన్నీ కూడా ఈ బిల్లుకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నాయి.
ఐఎంఏ పిలుపు మేరకు మార్చి 27న రాజస్థాన్ అంతటా ప్రైవేటు వైద్యులు బ్లాక్ డే పాటించారు. వైద్య సేవలను నిలిపివేస్తూ ప్రైవేట్ వైద్యులంతా బిల్లుకి వ్యతిరేకంగా ఆందోళన చేశారు.
‘‘ఇదొక క్రూరమైన చట్టం. ఈ బిల్లుని మేము సమర్థించలేం. ప్రభుత్వం మొండి వైఖరిని వీడాలి. మా డిమాండ్లను పట్టించుకోవాలి. ఈ బిల్లులో ఎమర్జెన్సీ సేవలంటే ఏంటో వివరించలేదు. రీయింబర్స్మెంట్ మాత్రమే కాదు ఇంకా అనేక సమస్యలను ప్రస్తావించలేదు’’ అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ శరద్ కుమార్ అగర్వాల్ అన్నారు.
వైద్యుల నిరసనలతో రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. లక్షల మంది ప్రజలు వైద్యం అందక ఇబ్బందులు పడ్డారు.
‘’వైద్య సేవలకు అంతరాయం కలిగించాలనేది మా ఉద్దేశం కాదు. రోడ్లమీదకొచ్చి ఆందోళనలు చేయడం మాకు ఇష్టం లేదు. కానీ వైద్య సేవలు అందిస్తున్న వైద్యులను బతకనివ్వాలి కదా. మా మనుగడే కష్టమైతే ఇంక సేవలు ఎలా అందిస్తాం? ప్రజలను ఇబ్బంది పెట్టే ఆలోచన మాకు లేదు. అలానే ప్రభుత్వం వెనక్కు తగ్గకపోతే మరో యాక్షన్ ప్లాన్తో ముందుకొస్తాం’’ అని డాక్టర్ శరద్ కుమార్ అగర్వాల్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
మెరుగైన వైద్యం అందించే బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పించుకుంటుందా?
ప్రజలకు మెరుగైన ఉచిత వైద్య సేవలు అందించే బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పించుకుంటోందని..ఆ భారాన్ని తమపైన పెట్టే ప్రయత్నం చేస్తోందని, ప్రైవేట్ వైద్యులు విమర్శిస్తున్నారు.
ప్రజలకు ఆరోగ్యాన్ని హక్కుగా అందించడం మంచిదే కానీ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలను, ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగు పర్చకుండా, ఉచిత వైద్య సేవల భారాన్ని తమపైన వేయడాన్ని వ్యతిరేకిస్తునట్టు ప్రైవేట్ వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
అయితే ఈ బిల్లు విషయంలో ప్రభుత్వం వెనక్కు తగ్గదని రాజస్థాన్ ఆరోగ్య శాఖ మంత్రి ప్రసాది లాల్ మీనా స్పష్టం చేశారు.
‘’ఈ బిల్లులోని అనేక అంశాలు వాస్తవంగా అమలు చేయడం సాధ్యం కాదు. ప్రభుత్వం వెనక్కు తగ్గని పరిస్థితుల్లో ప్రైవేట్ వైద్యులు రాజస్థాన్ నుంచి వలస వెళ్లే పరిస్థితి ఎదురవుతుంది’’ అని డాక్టర్ శరద్ కుమార్ అగర్వాల్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
లాభాలు తగ్గిపోతాయనే ప్రైవేట్ వైద్యులు ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్నారా?
కార్పొరేట్ ఆసుపత్రుల లాభాలు తగ్గిపోతాయనే భయంతోనే ప్రైవేట్ వైద్యులు, ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు ఇటువంటి చట్టాలను, పథకాలనూ వ్యతిరేకిస్తారని ఆరోగ్య కార్యకర్త, జన స్వాస్థ్య అభియాన్కు చెందిన అమూల్య నిధి విమర్శించారు.
‘‘గడిచిన పది పదిహేనేళ్ల నుంచి గమనిస్తే ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రైవేట్ వైద్యుల లాభాలు గణనీయంగా పెరుగుతూనే ఉన్నాయి.
హెల్త్ కేర్ని హెల్త్ కేర్ బిజినెస్గా మార్చేశారు కాబట్టి ఇలాంటి నిర్ణయాలు ఎప్పుడు తీసుకున్నా వాటిని వీళ్లంతా వ్యతిరేకిస్తూనే ఉంటారు’’ అని అమూల్య నిధి వ్యాఖ్యానించారు. జన స్వాస్థ్య అభియాన్ (JSA) నేషనల్ కో-కన్వీనర్గా అమూల్య పని చేస్తున్నారు.

ఫొటో సోర్స్, facebook/CMO Rajasthan
ప్రస్తుత బిల్లు బలహీనంగా ఉందా?
‘‘ప్రైవేట్ ఆసుపత్రుల వైద్య సేవల విషయంలో ధరల నియంత్రణ (cost regulation) కూడా ఈ బిల్లు పరిధిలోకి తేవాలి.
ప్రస్తుతం ఈ బిల్లు చాలా బలహీనంగా ఉంది. దీనిని ప్రభావవంతమైన బిల్లుగా మార్చాల్సిన అవసరముంది.
దాని కోసం నేషనల్ అలయన్స్ ఫర్ పీపుల్స్ మూవ్మెంట్ తరపున ఇప్పటికే మేము కొన్ని సవరణలను సూచించాం’’ అని అమూల్య నిధి అన్నారు.
ఆరోగ్య హక్కు బిల్లులో రీఎంబర్సుమెంటుపై క్లారిటీ లేదా?
ఈ బిల్లులో ప్రైవేటు ఆసుపత్రులు అందించాల్సిన ఉచిత వైద్య సేవలకు డబ్బు చెల్లించే రీఎంబర్స్మెంట్ విషయంలో క్లారిటీ లేదు. ఆ డబ్బు ఎవరు ఎప్పుడు ఎలా చెల్లిస్తారనే అంశాలను బిల్లులో ప్రస్తావించలేదు.
దీనికి అవసరమైన బడ్జెట్ ప్రస్తావన కూడా జరగలేదు. దీనిపైనా ప్రైవేట్ వైద్యులు ఆందోళన చేస్తున్నారు. ఈ చట్టాన్ని కొన్ని ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసి చూడాలంటూ కొందరు డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు.
‘‘ప్రైవేట్ వైద్యులు అందించే ఉచిత సేవలకు ఎవరు ఎక్కడ ఎలా రీయింబర్స్మెంటు చేస్తారో బిల్లులో స్పష్టత లేదు’’ అని డాక్టర్ శరద్ కుమార్ అగర్వాల్ చెప్పారు.
అయితే, ప్రస్తుతం చిరంజీవి యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి ఆరోగ్య పథకాల కింద ఉచిత వైద్య సేవలకు గాను ప్రభుత్వాలు వైద్యులకు డబ్బు చెల్లింపులు చేస్తున్నాయని, కాబట్టి రీయింబర్స్మెంట్ అనేది సమస్య కాదని అమూల్య నిధి అభిప్రాయపడ్డారు.
ఫిర్యాదుల పరిష్కారం
ఉచిత వైద్య సేవలను అమలు చేసే ప్రక్రియను మానిటర్ చేసేందుకు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిల్లో అధికారులను నియమించాలి. ఎవరైనా ఉచితంగా వైద్యం చేయడానికి నిరాకరిస్తే, ఫిర్యాదు చేయవచ్చు. ఆ ఫిర్యాదులని సదరు జిల్లా అధికారి నెల రోజుల్లోగా పరిష్కరించాలి. ఎలాంటి చర్యలు తీసుకున్నారో నెల రోజుల్లోపు వెల్లడించాలి. అలా చేయకపోతే ఆ ఫిర్యాదు రాష్ట్ర స్థాయి అధికారికి చేరుతుంది.
అయితే ఈ ప్రక్రియ వలన ప్రైవేట్ వైద్యులపై ఒత్తిడి పెరుగుతుందని, భయపడే పరిస్థితుల్లో వాళ్లు పని చేయాల్సి వస్తుందని దీనిని వ్యతిరేకిస్తున్నారు. వైద్యులపైన రాజకీయ నాయకుల ఒత్తిడి తీవ్రంగా ఉంటుందని ప్రైవేట్ వైద్యులు ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు నమోదైన ఫిర్యాదులను ఎవరు పరిశీలిస్తారు? వాటిని చూసేందుకు ఎవరెవరికి అనుమతి ఉంటుందనేదానిపైనా స్పష్టత లేదు. ఇది వ్యక్తిగత గోప్యత హక్కును ఉల్లంఘించడమేనని మరి కొందరు అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వైద్య సిబ్బంది కొరత
ప్రజలకు ఉచితంగా వైద్యం అందాలంటే అందుకు సరిపడా మానవ వనరులు అవసరం. హెల్త్ వర్కర్లను రాష్ట్ర వ్యాప్తంగా నియమించాలి. మెరుగైన మౌలిక వసతులు కల్పించాలి. ఈ ప్రక్రియను వ్యవస్థీకృతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉంటుందని ఈ బిల్లు చెబుతోంది.
అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న హెల్త్ కేర్ వర్కర్ల కొరత, ఆరోగ్య మౌలిక సదుపాయాల లోటుతో వైద్య సేవలను ఉచితంగా అందించడం సాధ్యమవుతుందా అని కొందరు ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్రంలో పది వేల మంది ప్రజలకు ఎంత మంది వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారు?
ఐక్యరాజ్య సమితిలో 2016, జనవరి 1న 17 SDGs (సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్)ను నిర్ధేశించుకుని వాటిని 2030 నాటికి సాధించాలనే లక్ష్యాన్ని ప్రపంచ దేశాల నాయకులు అంగీకరించారు.
ఈ 17 SDGల్లో ఒకటి యూనివర్సల్ హెల్త్. దీనిని 2030 నాటికి చేరుకోవాలంటే ప్రతి పది వేల మంది ప్రజలకు 44.5 మంది హెల్త్ కేర్ వర్కర్లు అందుబాటులో ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చెబుతోంది.
ఈ విషయంలో ఇండియాలో జాతీయ సగటు పది వేల మంది ప్రజలకు అందుబాటులో ఉన్న వైద్య సిబ్బంది 20.1గా ఉంది. రాజస్థాన్లో ప్రస్తుతం ఆ సగటు పది వేల మంది ప్రజలకు 14.4 ఉంది.
ఇప్పటికే రాష్ట్రంలో వైద్యులు, సర్జన్లు, ఇతర అనేక వైద్య సిబ్బంది లోటు నడుస్తోంది. కాబట్టి ఈ బిల్లుని ప్రభావవంతంగా అమలు చేయాలంటే మానవ వనరుల్లో ఉన్న లోటుపాట్లపైన, ఇతర అనేక సమస్యలపైనా ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంది.
ఆర్టికల్ 21లోని రైట్ టు లైఫ్ ఏం చెబుతోంది?
రాజ్యంగంలోని ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అంటే అందరికీ బతికే హక్కుని కల్పిస్తోంది. ఆరోగ్య హక్కు కూడా దీని పరిధిలోకి వస్తుందని 1996లో సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది.
ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలను అందించే బాధ్యత ప్రభుత్వాలదేనని ఆ తీర్పులో స్పష్టం చేసింది.
బతికే హక్కు ఉండటమంటే కేవలం ఊపిరి పీల్చుకుంటూ బతకడమనే కాదు. గౌరవంగా జీవించే హక్కు, జీవనోపాధిని కలిగి ఉండే హక్కు, ఆరోగ్య హక్కు ఇలా అన్నిటికీ దీని పరిధిని విస్తరించారు.
అయితే ఇప్పటికే విద్యా హక్కు చట్టం, ఆహార భద్రత చట్టం అమల్లో ఉన్నాయి. కానీ ఏ రాష్ట్రం కూడా ఆరోగ్య హక్కు చట్టాన్ని ప్రవేశపెట్టలేదు. ఆ ప్రయత్నం మొదటిసారిగా రాజస్థాన్ ప్రభుత్వం చేసింది.
అయితే ఇది రానున్న ఎన్నికల కోసం హడావిడిగా ఆమోదించిన బిల్లు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ప్రభుత్వం తొందరపాటుతనంతో బిల్లుని చాలా బలహీనంగా మార్చారని కొందరు ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఐపీఎల్ 2023: టోర్నీని రసవత్తరంగా మార్చబోతున్న 'ఇంపాక్ట్ ప్లేయర్' రూల్ ఏంటి?
- సెమాగ్లుటైడ్: బరువు తగ్గించే ఈ ఇంజెక్షన్కు అంత డిమాండ్ ఎందుకు?
- తెలంగాణ: ఆదివాసీలు పరిశ్రమలు పెట్టేందుకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందడం ఎలా?
- ‘‘ఆయన నాలుగేళ్లుగా నీళ్లు పోసుకోలేదు... అడవిలోనే ఒంటరి జీవితం... అటవీ ఏనుగులున్నా భయపడలేదు’’
- 'జీన్ ఎడిటెడ్ ఫుడ్' అంటే ఏంటి? అది తినడం ఆరోగ్యానికి మంచిదేనా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)















