Covid jab: మురిగిపోయిన కరోనా వ్యాక్సీన్లు.. 10 కోట్ల డోసుల టీకాలను పారేసిన సీరమ్ సంస్థ

ఫొటో సోర్స్, Getty Images
కోవిడ్-19 వ్యాక్సిన్ల కాలపరిమితి ముగిసిపోవడంతో 10 కోట్ల డోసుల టీకాలను పారేయాల్సి వచ్చిందని భారతీయ టీకా తయారీ సంస్థ 'సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ)' తెలిపింది.
డిమాండ్ తగ్గిపోవడంతో గతేడాది డిసెంబర్లోనే కోవిషీల్డ్ ఉత్పత్తిని నిలిపేసినట్లు సంస్థ సీఈవో ఆదార్ పూనావాలా గురువారం చెప్పారు.
ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారు ఎస్ఐఐ. భారత్లో ప్రజలకు ఇచ్చిన టీకాల్లో 90 శాతానికిపైగా కోవిషీల్డ్ టీకాలే.
భారత్లో 200 కోట్ల డోసులకు పైగా కోవిడ్-19 టీకాలను అందించారు. జనాభాలో 70 శాతం మంది కనీసం రెండు డోసుల టీకాలను తీసుకున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది.
2022 జనవరిలో హెల్త్కేర్, ఫ్రంట్లైన్ వర్కర్లకు, 60 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోసులను ఇవ్వడం ప్రారంభించారు. ఆ తర్వాత వయోజనులందరికీ దీన్ని విస్తరించారు.
భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జూలై నెల నుంచి 75 రోజుల పాటు పెద్దలందరికీ ఉచితంగా బూస్టర్ డోసులను అందించారు.

ఇప్పటివరకు భారత్లో 29.8 కోట్ల బూస్టర్ డోసులు వేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.
''ప్రజలంతా కోవిడ్తో విసిగిపోయినట్లు కనిపిస్తున్నారు. నిజం చెప్పాలంటే నేను కూడా విసిగిపోయాను. ఇప్పుడు బూస్టర్ డోసులకు డిమాండ్ లేదు'' అని విలేఖరులతో పూనావాలా అన్నారు.
ఎస్ఐఐ వద్ద దాదాపు 10 కోట్ల డోసుల కోవిషీల్డ్ టీకా నిల్వలు ఉన్నాయని పూనావాలా తెలిపారు. అయితే, కోవిషీల్డ్ షెల్ఫ్ లైఫ్ తొమ్మిది నెలలే కావడంతో ఈ ఏడాది సెప్టెంబర్తో కాలపరిమితి ముగిసిపోయి, ఆ మేరకు టీకాలు నిరుపయోగంగా మారిపోయాయని చెప్పారు.
''ప్రతీ ఏడాది 'ఫ్లూ' టీకా తీసుకునేటప్పుడు ఇకనుంచి ప్రజలు కోవిడ్ టీకా కూడా తీసుకుంటారేమో. కానీ, పాశ్చాత్య దేశాల తరహాలో భారత్లో ప్రతీ ఏడాది ఫ్లూ టీకా తీసుకునే సంస్కృతి లేదు'' అని ఆయన అన్నారు.
బూస్టర్ డోస్గా కోవావాక్స్ వినియోగానికి సంబంధించిన ట్రయల్స్ను ఎస్ఐఐ పూర్తి చేసినట్లు వెల్లడించారు. వచ్చే రెండు వారాల్లోపు ఈ టీకాకు ఆమోదం దక్కుతుందని కంపెనీ భావిస్తోంది.
ఒమిక్రాన్ బూస్టర్ కోసం అమెరికా బయోటెక్ కంపెనీ నోవావాక్స్తో కలిసి పనిచేస్తున్నట్లు పూనావాలా తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- లంపీ స్కిన్ వ్యాధి సోకిన పశువుల పాలు తాగొచ్చా? ఈ వైరస్ మనుషులకూ సోకుతోందా? దేశంలో ఎందుకిన్ని వదంతులు?
- పాకిస్తాన్లో క్రికెట్ను భారత్ వ్యాపార సంస్థలే నడిపిస్తున్నాయా? బీసీసీఐ నిధులు ఇవ్వకపోతే పాక్ క్రికెట్ బోర్డు కూలిపోతుందా?
- దీపావళి టపాసులు అమ్మితే మూడేళ్లు జైలుశిక్ష, టపాసులు కాల్చితే 6 నెలలు జైలు శిక్ష
- ఇండోనేషియా: 99 మంది పిల్లలు చనిపోవడంతో దగ్గు మందు సహా అన్ని రకాల సిరప్లపై నిషేధం
- లిజ్ ట్రస్: ప్రధాని అయిన 45 రోజులకే ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది, బ్రిటన్ తాజా రాజకీయాలపై తెలుసుకోవాల్సిన 8 పాయింట్లు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)











